ట్రంప్‌ హామీ.. డీల్‌ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్‌ తప్పదా?? | Middle East Crisis: US Iran Deal Sealed Or Another Twist Ahead | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హామీ.. డీల్‌ కుదిరిందా? లేదంటే మరో ట్విస్ట్‌ తప్పదా??

Jun 12 2026 6:51 AM | Updated on Jun 12 2026 9:55 AM

Middle East Crisis: US Iran Deal Sealed Or Another Twist Ahead

మూడునెలలుగా యుద్ధ జ్వాలల్లో చిక్కుకున్న పశ్చిమాసియా ఒక్కసారిగా ఆశల వైపు చూస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన ఘర్షణకు ముగింపు దగ్గరపడిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అయితే అదే సమయంలో ఇరాన్‌ నుంచి వచ్చిన స్పందన కొత్త సందేహాలకు తావిచ్చింది. నిజంగానే శాంతి ఒప్పందం కుదిరిందా? లేదంటే ఇంకా చివరి అడ్డంకులు మిగిలే ఉన్నాయా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం ముగింపు దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ వారాంతంలోనే రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. "ఇరాన్‌తో యుద్ధానికి అద్భుతమైన పరిష్కారం దొరికింది. కొన్ని పత్రాలపై తుది సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి" అని చెప్పారు.

ఒప్పందంపై సంతకాలు యూరప్‌లో జరగవచ్చని, అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాల్గొనే అవకాశం ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని కూడా ఆయన ప్రకటించారు.

అయితే ట్రంప్‌ ప్రకటనకు భిన్నంగా ఇరాన్‌ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ మాట్లాడుతూ.. చర్చల ముసాయిదాలో చాలా భాగం పూర్తయిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పంద ప్రతిపాదన ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాధికార సంస్థల పరిశీలనలో ఉందన్నారు. అమెరికా చర్చల మధ్యలో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తోందని ఆరోపించిన ఆయన.. ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ తన "రెడ్‌లైన్స్‌"ను దాటదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యల మర్మం ఏంటన్నదానిపై కుతూహలం నెలకొంది.

ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలక అంశం ఇరాన్‌ అణ్వాయుధ కార్యక్రమమే. ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోదని, కొనుగోలు చేయబోదని అంగీకరించిందని ట్రంప్‌ ప్రకటించారు. ఇదే మొత్తం చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్‌ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని గతంలాగే పునరుద్ఘాటిస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్‌ బలగాలు ఇరాన్‌పై సంయుక్త దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారంనుంచి ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఇరాన్‌, లెబనాన్‌లో భారీ నష్టం సంభవించింది. చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ.. పరస్పర దాడులు కొనసాగించాయి. 

అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఘటన తర్వాత హర్ముజ్‌ ప్రాంతంలో అమెరికా కొత్త దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్‌ కూడా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.

ఇదిలా ఉండగా, ఒప్పందానికి ఇరాన్‌ అత్యున్నత నాయకత్వం కూడా అంగీకరించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆమోదం తెలిపారని తనకు సమాచారం ఉందన్నారు. అలాగే ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌ సహా పశ్చిమాసియాలోని పలు దేశాలు ఈ ఒప్పందానికి మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కార్యాలయం మాత్రం ఈ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్‌ అణు సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఒప్పందం ఉండాలని ట్రంప్‌కు నెతన్యాహూ సూచించినట్లు వెల్లడించింది.

మొత్తంగా చూస్తే.. ట్రంప్‌ "డీల్‌ దాదాపు ఖరారైంది" అంటుండగా, ఇరాన్‌ "ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు" అంటోంది. నిజంగానే ఈ వారాంతంలో శాంతి ఒప్పందం కుదిరి యుద్ధానికి తెరపడుతుందా? లేదంటే చివరి క్షణంలో మరోసారి ఉద్రిక్తతలు రాజుకుంటాయా? అని ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement