విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలపై దృష్టి
రుతుపవనాల విస్తరణపైనా ఫోకస్
రూపాయి కదలికలు కూడా కీలకమే..
ఈ వారం మార్కెట్పై నిపుణుల అంచనా
మొహర్రం సెలవుతో ట్రేడింగ్ నాలుగు రోజులే
పశ్చిమాసియాలో శాంతి పవనాలు... క్రూడ్ మంటలు చల్లారడంతో స్టాక్ మార్కెట్లలో మళ్లీ కాస్త జోష్ కనిపిస్తోంది. అయితే, అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో పురోగతితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రూపాయి కదలికలు, రుతుపవనాల విస్తరణపైనా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. మరోపక్క, మొహర్రం సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది.
పశ్చిమాసియాలో ఒకపక్క ఉద్రిక్తతలు కుదుటపడుతున్న తరుణంలో తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మళ్లీ అనిశ్చితికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్లోని అమెరికా–ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లో ఆదివారం తొలి విడత శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనికి హాజరు కాగా, ఇరాన్ ప్రతినిధుల బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వం వహించారు.
ఈ కీలక చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందనేది ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఈ వారం ఇన్వెస్టర్ల ఫోకస్ అంతా యూఎస్–ఇరాన్ శాంతి చర్చలపైనే ఉంటుంది. మరోపక్క క్రూడ్ ఆయిల్ ధరల కదలికలను కూడా నిశితంగా గమనిస్తారు. చమురు ధరల సెగ తగ్గడం రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు గనుక తలెత్తితే క్రూడ్ మంటతో మార్కెట్లతో పాటు ఎకానమీకి కూడా షాక్ తగులుతుంది’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు.
వరుణుడు కరుణిస్తాడా...
ఎల్నినో ఎఫెక్ట్తో ఈ ఏడాది వర్షాలకు గండి పడుతుందన్న అంచనాలు బలడుతున్నాయి. జూన్ నెల దాదాపు చివరికి చేరుకుంటున్నప్పటికీ ఇంకా రుతుపవనాలు విస్తరించకపోవడం.. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటిదాకా 41 శాతం లోటు వర్షపాతం ఉండన్న వాతావరణ శాఖ (ఐఎండీ) గణంకాలతో మార్కెట్ల ఫోకస్ వరుణుడి వైపు మళ్లింది. వర్షాలు సరిగ్గా పడకపోతే గ్రామీణ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. స్టాక్ మార్కెట్లకు ఇది చాలా ప్రతికూలాంశంగా మారుతుందనేది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రుతుపవనాల విస్తరణపై ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరిస్తారని వారు
అంటున్నారు.
గతవారమిలా...
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగడం, క్రూడ్ చల్లారడం, రూపాయి కోలుకోవడంతో గతవారం దేశీ మార్కెట్లు భారీగా బౌన్స్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,274 పాయింట్లు (1.65%) పుంజుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 390 పాయింట్లు (1.65%) ఎగబాకి 24,000 పాయింట్ల పైన స్థిరపడింది.
సాంకేతికంగా చూస్తే...
గతవారం బుల్లిష్ ధోరణి ఈ వారం కూడా కొనసాగితే.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీకి 24,080–24,120 పాయింట్ల వద్ద తొలి నిరోధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24,200 పాయింట్ల పైన నిలదొక్కుకుంటే.. తదుపరి 24,400 వరకూ ఎగబాకే అవకాశం ఉంటుంది. ఇక సూచీ గనుక వెనకడుగు వేస్తే.. 23,900 వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. దాన్ని కోల్పోతే 23,800 వద్ద రెండో మద్దతు దొరుకుతుంది. దీని దిగువున 23,700 స్థాయిని మళ్లీ పరీక్షించే అవకాశం ఉంటుంది.
రూపాయిపై ఫోకస్..
పశ్చిమాసియా యుద్ధం.. క్రూడ్ సెగతో బక్కచిక్కిన రూపాయి.. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యలతో గత రెండు వారాల్లో భారీగా కోలుకుంది. మే నెలాఖర్లో డాలరుతో రూపాయి మారకం విలువ 96.96 ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. చమురు ధరలు శాంతించడం (బ్రెంట్ క్రూడ్ 80 డాలర్ల దిగువకు చేరింది) డాలర్ల ప్రవాహానికి చేపట్టిన చర్యల ప్రభావంతో తాజాగా 94.20 స్థాయికి పుంజుకుంది.
అయితే, అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ఆధారంగా క్రూడ్ ధరల్లో చోటు చేసుకునే హెచ్చుతగ్గులు రానున్న రోజుల్లో రూపాయి విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘మార్కెట్లు క్రమంగా రెండు ప్రధాన అడ్డంకులను అధిగమిస్తున్నాయి. టారిఫ్ అనిశ్చితితో పాటు పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు సద్దుమణిగేలా కనబడుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న స్థిరీకరణ తర్వాత ఈ సానుకూలతలు మార్కెట్ రికవరీకి దన్నుగా నిలుస్తాయి. అయితే, వాటి ఫలితాలపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


