భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆగస్టు 3న ప్రారంభించిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) సమావేశం నేటితో ముగిసింది. ఈ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ద్రవ్యోల్బణ ముప్పులు పూర్తిస్థాయిలో తగ్గకపోవడం, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతుండటంతో ప్రాథమిక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో కీలకమైన రెపో రేటు 5.25 శాతం వద్దే స్థిరంగా కొనసాగనుంది. వరుసగా నాలుగోసారి కూడా ఆర్బీఐ ఈ స్థిర వైఖరిని పాటించింది.
ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే..
FY27 ఆర్థిక సంవత్సరానికి ప్రధాన ద్రవ్యోల్బణం 4.3%గా ఉంటుందని అంచనా వేశారు.
త్రైమాసికాల వారీగా అంచనాలు..
Q2: 4.7%
Q3: 5.9%
Q4: 5.5%
ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు
దక్షిణాది రుతుపవనాల్లో అసమానతల వల్ల వ్యవసాయ రంగానికి ఎల్ నినో ప్రధాన ముప్పుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. జులై నుంచి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఇంధన ధరలలో అస్థిరత నమోదైంది.
జీడీపీ వృద్ధి, ఆర్థిక పురోగతి
FY27 వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.7%గా ఉండవచ్చని అంచనా వేశారు (ఇది మునుపటి అంచనా కంటే 10 bps ఎక్కువ). Q1లో ఉత్పాదక రంగం, ప్రైవేట్ వినియోగం బలంగా ఉండటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా వృద్ధి చెందిందన్నారు.
యథాతథ స్థితికి దారితీసిన ప్రధాన కారణాలు
రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం నియంత్రణ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం మధ్యకాలిక లక్ష్యం కంటే కొంత పైస్థాయిలోనే కొనసాగుతోంది. ఆహార పదార్థాల ధరల్లో ఒడుదొడుకులు ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచే ప్రమాదం ఉందనే భావన వ్యక్తమైంది.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, పంటల సాగు సరళిపై ఆర్బీఐ దృష్టి సారించింది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడడం ద్రవ్యోల్బణ నియంత్రణకు ముఖ్యం.
అమెరికా సహా ప్రధాన గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలు, బాండ్ ఈల్డ్లు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ ధోరణులు పరిగణనలోకి తీసుకున్నారు.
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025లో చేపట్టిన వడ్డీ రేట్ల కోత ప్రభావం ఆర్థిక వ్యవస్థలోకి ప్రతిబింబిస్తున్న వేళ తొందరపడి రేట్లను మరింత తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం మళ్లీ పెచ్చురిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.


