breaking news
Satya Stories
-
రామ్చరణ్ కండల సీక్రెట్ అతడే
టాలీవుడ్లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్ను స్క్రీన్పై చూపించడానికి స్టార్స్ పోటీపడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్గా బయటకు వచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్ని ఈ రేంజ్లో క్లిక్ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?ఆయనే ముంబయికి చెందిన రాకేష్ ఉడియార్. ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్గా బాలీవుడ్కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు. అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది, ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.‘‘నాకు ఎప్పుడూ ఫిట్నెస్పై ఆసక్తి ఉండేది దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్లో స్వీపర్గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్నెస్ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ రాకేష్ ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను అర్బాజ్ ఖాన్(సల్మాన్ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్ నాకు ఫోన్ చేసి, బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచీ రాకేష్ సల్మాన్కు పర్సనల్ ట్రైనర్గా కొనసాగుతున్నాడు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్కు ఫోన్ చేసి తన ట్రైనర్గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.రామ్చరణ్తో పరిచయం అలా...‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్ సల్మాన్ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్తో ఫిట్గా కనపడాలని చరణ్ అనుకున్నాడు’’ అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్తో రాకేష్ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్ వివరిస్తున్నాడు.రామ్చరణ్ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్ కపూర్, డైసీ షా పుల్కిత్ సామ్రాట్తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ప్రణాళిక ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్ సినిమా కోసం, ఆమిర్ఖాన్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్ చరణ్ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్ సల్మాన్, రామ్ చరణ్ లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. ‘సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా, జిమ్కు వెళ్లడం మానడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్ చెప్పాడు. -
డేటింగ్ క్యాపిటల్ అదే.. దేశంలో ఏ నగరమో తెలుసా?
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో శరవేగంగా డేటింగ్ సంస్కృతి విస్తరిస్తోంది. అవివాహితుల నుంచి మొదలుకుని వేర్వేరు కారణాల వల్ల ఒంటరిగా మిగిలిన వారి సంఖ్య భారీగా పెరుగుతుండడం వారు కూడా తోడు కోసం తహతహలాడుతుండడంతో ఈ కల్చర్ ఇప్పటికే స్థిరపడడంతో పాటు రకరకాలుగా రూపాంతరం చెందుతోంది, ముఖ్యంగా ఆన్లైన్ సేవల విజృంభణ ఈ సంస్కృతికి ఆజ్యం పోస్తోంది. దేశవ్యాప్తంగా చూస్తే డేటింగ్ కల్చర్లో ఢిల్లీ, ముంబయి, బెంగుళూర్, పూణె, హైదరాబాద్,చెన్నై... వంటి నగరాలు దూసుకుపోతున్నాయి అయితే డేటింగ్ ఇష్టులు అత్యధిక సంఖ్యలోఉన్న నగరం బెంగుళూరు అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ సిలికాన్ సిటీ వాసులు ఈ కల్చర్కి భారీ స్థాయిలో ఇష్టపడుతుండడంతో ఆర్గనైజర్లు వినూత్న తరహా డేటింగ్స్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఆన్లైన్ డేటింగ్ స్థానంలో వినూత్నమైన వ్యక్తిగత అనుభవాలు వస్తున్నాయి. డేటింగ్ను మరింత సరదాగా మార్చడానికి వ్యక్తుల కళ్లకు గంతలు కట్టడం నుంచి రహస్య సంకేతాల వరకు అనేక కొత్త ఆలోచనలను డేటింగ్ సంస్థల నిర్వాహకులు అమలు చేస్తున్నారు. బెంగుళూర్కి చెందిన స్మాల్ వరల్డ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు సౌరవ్ ఆర్య మాట్లాడుతూ, కరోనా సమయంలో డిజిటల్ డేటింగ్ బాగా ఊపందుకుందని అయితే, ఇప్పుడు వ్యక్తిగత సంబంధాల కోసం ప్రజలు ఆరాటపడుతున్నారని చెప్పారు. జూమ్ మీటింగ్స్పై విరక్తి పెరగడంతో, ఇప్పుడు నిజ జీవిత డేటింగ్ ఈవెంట్లకు డిమాండ్ ఏర్పడిందనీ ఇవి భవిష్యత్తు కాబోయే భాగస్వాముల కోసం మాత్రమే కాకుండా, సుదీర్ఘ ఒంటరితనానికి ఒక సామాజిక విరుగుడుగా కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన చెబుతున్నారు.ఆయన కంపెనీ ఇప్పటివరకు 40 ఈవెంట్లను నిర్వహించింది, ప్రతి ఈవెంట్లో 30 మంది పాల్గొంటున్నారు.ఇక స్పీడ్ డేటింగ్ అనేది మరొక సామాజిక కార్యకలాపం, దీనిలో రొమాంటిక్ సంబంధాల కోసం చూస్తున్న వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవడానికి వరుసగా చిన్న చిన్న సంభాషణలు జరుపుతారు. స్పీడ్ డేటింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్ ఫోల్డ్లవ్ సహ–వ్యవస్థాపకుడు ఒకరు మాట్లాడుతూ, సేహేయ్ అనే మరో డేటింగ్ పద్ధతి కూడా నగరానికి ఇప్పుడిప్పుడే పరిచయం అవుతోంది అని అయన చెప్పారు. ‘‘కానీ ప్రజలు ఈ ఆలోచనకు అలవాటు పడుతున్నారు ,’’ అని ఆయన అన్నారు.బెంగళూరులో ఒక మీమ్ ఆధారిత డేటింగ్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. స్మూజ్ అని పేర్కొనే ఈ యాప్ను విద్యా మాధవన్ అభినవ్ అనురాగ్ లు అమెరికాలో ప్రారంభించారు. ‘‘ఇతర యాప్లలో మీరు వ్యక్తులపై స్వైప్ చేసినట్లు కాకుండా, స్మూజ్లో మీరు మీమ్స్పై స్వైప్ చేస్తారు. మీరు స్వైప్ చేసే మీమ్స్ మీ ఇష్టాయిష్టాలను బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడతాయి, ఆపై మేము మీకు తగిన భాగస్వాములను అందిస్తాం’’ అని విద్య వివరించారు. డేటింగ్ యాప్లకు అనుకూలంగా లేని సంప్రదాయవాదులు కూడా స్మూజ్ను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారికి ఈ కాన్సెప్ట్ సరదాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ మీమ్స్ను ఇష్టపడతారు కదా’’ అని ఆమె అన్నారు.తొలుత అమెరికాలో లాంచ్ అయిన ఈ యాప్ కు ఆన్ లైన్ లో ప్రాచుర్యం పొందడంతో, భారతదేశంలో కూడా దీనిని ప్రారంభించమని అనేక అభ్యర్థనలు వచ్చాయని ఆమె చెప్పారు. అయితే ‘‘అభ్యర్థనలలో ఎక్కువ భాగం బెంగళూరు నుంచే వచ్చాయి. డెమో యాప్ను ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే, ఒక్క బెంగళూరు నుంచే 5,000 కంటే ఎక్కువ డౌన్ లోడ్లు రావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా, భారతీయ భాషలలోని ఇతర డేటింగ్ యాప్లు కూడా బెంగళూరులో ప్రజాదరణ పొందుతున్నాయి. ఉదాహరణకు, నీనే అనేది కన్నడిగుల కోసం మాత్రమే నిర్వహిస్తున్న ఒక డేటింగ్ యాప్. నేను నా కమ్యూనిటీకి చెందిన వారితో మాట్లాడగలుగుతున్నాను కన్నడ సినిమాల గురించి చర్చలు కూడా జరుపుతున్నాను, ఇది ఇంతకు ముందు సాధ్యమయ్యేది కాదు. టిండర్ బంబుల్ వంటి ఇతర యాప్లన్నీ చాలా సాధారణంగా మారిపోయాయి, ప్రతిచోటా ఒకే రకమైన వ్యక్తులు ఉంటున్నారు, కాబట్టి సంభాషణ చాలా చప్పగా తయారైంది,’’ అని 2017 నుంచి డేటింగ్ యాప్లను ఉపయోగిస్తున్న 33 ఏళ్ల వనిత చెబుతోంది. ఏతావాతా... పెళ్లి నుంచి ప్రేమ వరకూ అలాగే జీవిత కాల సంబంధం నుంచి స్వల్పకాలిక శారీరక మానసిక అవసరాల వరకూ తీర్చుకోవడానికి అందుబాటులోకి వచ్చిన ఈ డేటింగ్ సంస్కృతి భారతీయ నగరాల్లో మరిన్ని కొత్త పోకడలు తీసుకురానుండడం తధ్యంగా కనిపిస్తోంది.(చదవండి: పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..) -
పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..
ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.రీహైడ్రేట్, టాక్సిక్స్ బయటకు...పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు అలవాటున్నవాళ్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్, అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. ఉదర వ్యవస్థను ఫ్లష్ చేసి హైడ్రేటెడ్గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్గా మారుస్తాయి.సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్–రిచ్ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్ తాజా పండ్లు సహాయపడతాయి.బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను వంటలో చేర్చాలి. పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.కాయధాన్యాలు, పప్పు, కాటేజ్ చీజ్ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్ ఫుడ్స్ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.గింజలు, విత్తనాలు తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి పద్ధతిని అనుసరించాలి. తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం శరీరపు పండుగ ఓవర్లోడ్ను ప్రాసెస్ చేయడానికి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్ చేస్తుంది.పండుగ తర్వాత అలసటతో వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది, మరింత శక్తినిచ్చేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఉబ్బరాన్ని కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్ వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే. నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.కొన్ని ఆయుర్వేద చిట్కాలు...డిటాక్స్ వాటర్: ఒక టీస్పూన్ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్ను తొలగించడానికి సహాయపడతాయి.భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.త్రిఫల పౌడర్: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్ త్రిఫల పౌడర్ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.ఒక టీస్పూన్ పసుపు చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్ లాట్టే (గోల్డెన్ మిల్క్)ఉపశమనం కలిగించేవి శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.(చదవండి: పొంగల్వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!) -
టాక్సిక్ టాక్స్: ట్రైలర్తో వైరల్ అయిన లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్దాస్.యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం. ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్దాస్ వైవిధ్యభరిత లైన్స్కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి. -
టాప్ హీరో ఛీ కొట్టిన స్టోరీ కీ జై కొట్టిన బన్నీ... ఏమిటా ధైర్యం?
ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో ప్లాప్ డైరెక్టర్కు ఛాన్స్ ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు. అందుకే ఇప్పుడు బన్నీ, లోకేష్ కనగరాజ్ ల కాంబో సంచలనం గా మారింది.టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమాల ఫ్యాన్స్ మొత్తాన్ని షేక్ చేస్తోంది ఈ కాంబో. భారీ విజయాలను అందించిన పుష్ప 2: ది రూల్ తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ టాలీవుడ్ స్టార్ను దాటిపోయాడు పాన్-ఇండియా సూపర్ స్టార్ రేస్ లో సగర్వంగా నిలబడ్డాడు. మరోవైపు కూలీ వంటి భారీ చిత్రం ద్వారా బోలెడంత అప్రతిష్ట మూట గట్టుకున్నాడు లోకేష్. పెద్ద హీరోల్ని డీల్ చేయలేకపోయాడనే తీవ్ర విమర్శలను ఎదుర్కున్నాడు రజనీ-కమల్ కాంబో సినిమా తో పాటు మరికొన్ని భారీ చిత్రాల ఆఫర్లు పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితి లో ఫుల్ ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం వెనుక కారణం ఏమిటి అనేది సినీ పండితుల అంచనాలకు అందడం లేదు. వినవస్తున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో లో రూపొందనున్నచిత్రం ఓ సూపర్ హీరో సినిమా కావచ్చు. దీనిపై అనేక అంచనాలు అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రానప్పటికీ జోరుగా ఊహగానాలు సాగుతున్నాయ్. ఇది భారతీయ సినిమాలో సూపర్ హీరో కథలను మరో గమ్యం వైపు నడిపే అవకాశం ఉందని అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఒక కల్చరల్ చరిత్రనూ సృష్టించడం ఖాయమని లోకేష్ టాలెంట్ పట్ల నమ్మకం వున్నవారు అంటున్నారు.అయితే ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన స్టోరీ సూర్య హీరో గా లోకేష్ సారద్యం లో తెరకెక్కనున్న సూపర్ హీరో చిత్రం ఇరుంబుకై మాయవి తరహా అనీ, ఈ సినిమా ఆలోచన మొదట బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో చర్చిస్తే ఆయన తిరస్కరించాడని దీనిని బన్నీ ఓకే చేయడం విచిత్రం గా ఉందని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.పుష్ప సిరీస్ తో అనూహ్యమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అయన భవిష్యత్ కు చాలా కీలకం గా మారనుంది అనేది నిస్సoదేహం. తన తదుపరి చిత్రానికి టాప్ డైరెక్టర్ అట్లీ ని ఎంచుకుని పర్ఫెక్ట్ ఛాయిస్ గా ప్రశంసలు అందుకున్న ఐకాన్ స్టార్ ఆ తర్వాత లోకేష్ ను ఎంచుకోవడం ఖరారైతే అది పెద్ద సాహసం గానే చెప్పాలి. -
వరల్డ్ ఫేమస్ టాప్-10 వింటర్ ఫెస్టివల్స్ ఇవే
మనకు పండుగల సీజన్ ఇది. అలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లోనూ పండుగల సీజనే. చల్లని వాతావరణం వణకిస్తుంది...అలాగే ఎన్నో విందు వినోదాలనూ తెస్తుంది. కాలాలన్నింటిలో అత్యధికులు ఇష్టపడేది శీతాకాలమే. కురిసే మంచు తడిసే నేల కురిపించే అందాల నడుమ పందిరి వేసే సందళ్ల ఎన్నో.. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శీతాకాల పండుగలు బాగా ప్రాచుర్యం పొందాయి.పలు దేశాలు చల్లని వాతావరణంలో కళ, సంస్కృతి, సంప్రదాయంతో మమేకమైన వినోద భరిత కార్యకలాపాలను ఆస్వాదించడానికి ప్రజలను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన శీతాకాల పండుగలను నిర్వహిస్తాయి. ఈ పండుగలు సంగీతం, లైట్లు, అలంకరణలు, ఆహారం ఉత్తేజకరమైన సంప్రదాయాలతో ఆకట్టుకుంటాయి. మంచు శిల్పాల నుంచి రంగురంగుల కవాతుల వరకు, ప్రతి పండుగలో సందర్శకులను ఆకర్షించే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రపంచంలోని టాప్–10 అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాల పండుగలు...👉చైనాలో జరిగే హార్బిన్ అంతర్జాతీయ మంచు శిల్ప ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజున ప్రారంభమై ఫిబ్రవరి మధ్య వరకూ కొనసాగుతుంది.👉జపాన్లో సప్పోరో మంచు ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది ఈ పండుగ.👉కెనడా లోని క్యూబెక్ సిటీలో నిర్వహించే క్యూబెక్ వింటర్ కార్నివాల్ కూడా అత్యధిక సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సందడే సందడి..👉11వ శతాబ్ధపు చారిత్రక మూలాలు ఉన్న ఇటలీ లోని ది వెనిస్ కార్నివాల్ కళ్లు తిరిగే కలర్ పుల్ సందడిని మోసుకొస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉అమెరికాలో నిర్వహించే సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ తనదైన శైలితో సందర్శకుల్ని ఆహ్వానిస్తుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఈ ఫెస్టివల్ జరుగుతుంది👉దాదాపు 50ఏళ్ల క్రితం ప్రారంభమైంది కెనడా రాజధాని ప్రాంతం లో జరిగే వింటర్లూడ్ ఫెస్టివల్. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉నెదర్లాండ్స్లో నిర్వహించే ఆమ్స్టర్ డామ్ లైట్ ఫెస్టివల్ను లెగసీ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. చిత్రకళతో పాటు బోట్ టూర్స్ తదితర విశేషాలకు వేదికైన ఈ పండుగ గత ఏడాది నవంబర్లో ప్రారంభమైంది.. జనవరి 18వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉స్కాట్లాండ్లో ఏకంగా 3 నెలల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతుంది అప్ హెల్లీ యా ఫైర్ ఫెస్టివల్.. జనవరి 9న ప్రారంభమై మార్చి 20వ తేదీ వరకూ జరుగుతుంది.👉సెవన్ వండర్స్ ఆఫ్ ద వింటర్గా పేరొందింది దక్షిణ కొరియా లోని హ్వాచియోన్లో నిర్వహించే సాంచియోనియో ఐస్ ఫెస్టివల్. ఇది జనవరి 10న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది.👉స్కాట్లాండ్ లో జరిగే హోగ్మనే ఉత్సవం...కొత్త సంవత్సరానికి స్వాగత వేడుక. ఇది కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన వింటర్ ఫెస్టివల్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. -
చిరంజీవి హుక్ స్టెప్, బాలీవుడ్లోనూ టాప్!
ఇప్పుడు తెలుగు ప్రేక్షక సమూహం హుషారుగా హుక్ స్టెప్పులేస్తోంది. మెగా నృత్యాల హోరును అనుసరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్గారు గా తమని పలకరించేందుకు హుక్ స్టెప్పులు వేసుకుంటూ వస్తుండడంతో తెలుగు నాట హుక్ స్టెప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మరి ఇంతకీ ఈ హుక్ స్టెప్ ఏమిటి? దీనికి మన దేశంలో పాప్యులారిటీ ఎలా పెరిగింది?‘హుక్ స్టెప్ గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ నృత్యం.. సులభంగా కనిపించాలి. అందరూ నేర్చుకునేలా ప్రేరేపించాలి ‘ అని బాలీవుడ్లో తౌబా తౌబా అనే పాటకు నృత్యంతో వైరల్ అయి సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ చెబుతున్నాడు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నర్తించిన బ్యాడ్ న్యూజ్లోని తౌబా తౌబా పాట స్టెప్స్ ‘ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించారని ఆయన గుర్తు చేస్తారు. ఆ పాట హిట్తో‘ హుక్ స్టెప్ను కొరియోగ్రాఫ్ చేయడం ఇప్పుడు తన నృత్య ప్రక్రియలో ఒక భాగమైందని ఆయన చెప్పాడు.పెరిగిన కొరియోగ్రాఫర్ ప్రాధాన్యత...‘హుక్ స్టెప్ కు పెరుగుతున్న ప్రజాదరణ కొరియోగ్రాఫర్లను మరింత పాప్యులర్ చేసింది. హుక్ స్టెప్ గొప్పతనం ఏమిటంటే దాని చుట్టూ అల్లుకునే సందడిలో స్టార్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తారని అది తమకు చాలా ఉపయుక్తమైన అంశమని కొరియోగ్రాఫర్లు అంటున్నారు. నృత్యం అత్యంత ప్రజాదరణ పొందాడానికి దోహదపడేది సౌలభ్యం మాత్రమే ‘ప్రతి వ్యక్తి పుట్టుకతోనే డ్యాన్సర్ కాదు. మైఖేల్ జాక్సన్ లేదా ప్రభుదేవా లాగా అందరూ నృత్యం చేయలేరు. అవి ప్రజలు చూసి బాగున్నాయంటారు. కానీ అవి సులభమైనవైతే అవి మరింత హిట్ కావడం తధ్యం ఎందుకంటే వాటిని అనుసరించడం సులభం అని వారు భావిస్తారు అలాంటివే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి‘‘ నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు, ప్రభుదేవా లాంటి డ్యాన్స్లు అందివ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా మారాయని బోస్కో చెప్పాడు. ‘నువ్వు ఎందుకు అంత కష్టతరమైన పని చేయమని చెబుతున్నావు? దానికన్నా సులభమైన స్టెప్పులు ఎందుకు చేయించకూడదు‘ అని చాలా మంది తనతో అన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.హుక్...హిస్టరీ...దీని గురించి బాలీవుడ్ మరో కొరియోగ్రాఫర్ ముదస్సర్ ఖాన్ మాట్లాడుతూ, హుక్ స్టెప్పు ప్రజాదరణ ‘సల్మాన్ ఖాన్, గోవింద మాధురీ దీక్షిత్ వంటి నటులతో ప్రారంభమైందన్నాడు. వారికి వారికంటూ స్వంత ప్రత్యేకమైన నృత్య శైలులు ఉన్నాయి‘ అని చెప్పారు. వారి నృత్యాలు పాప్యులర్ అవడానికి కారణం గుర్తించిన దగ్గర నుంచీ తాను తన కొరియోగ్రఫీ వర్క్లో హుక్ స్టెప్పును కూడా చేర్చుకున్నానని ఖాన్ చెప్పాడు.‘నేను సల్మాన్ ఖాన్కు మొదటిసారి కొరియోగ్రఫీ సీక్వెన్స్ చూపించడానికి వెళ్ళినప్పుడు, ఆయన కష్టమైన నృత్యాలను ఇష్టపడతాడని అనుకున్నాను. కానీ ఆయనకు హుక్ స్టెప్పు అన్నింటికంటే నచ్చింది.‘ అంటూ గుర్తు చేసుకున్నారాయన. ఒక సన్నివేశాన్ని కొరియోగ్రఫీ చేయడంతో పాటు వైరల్గా మార్చడం కూడా ఇప్పుడు తమ పనిలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందని ఖాన్ అన్నారు. హుక్ స్టెప్ను రూపొందించడానికి ఏదైనా ఫార్ములా ఉందా అని అడిగితే.... ‘‘ తల గోకడం నుంచీ షూలేసులు కట్టుకోవడం దాకా బెల్ట్ బిగించడం నుంచి కర్టెన్లు సరిచేయడం దాకా...ప్రజలు తమ దైనందిన జీవితంలో చేసే రొటీన్ పనులనే సంగీతంతో కూడిన నృత్యంగా మార్చగలిగితే అదే హుక్ స్టెప్’’ అన్నారాయన. ‘‘సంగీతం కూడా హుక్ స్టెప్ కు థీటుగా ఆకర్షణీయంగా ఉండాలి. సంగీతం యావరేజ్గా ఉంటే, ఎంత మంచి హుక్ స్టెప్ వేసినా, అది ఆకర్షణీయంగా మారదు. సంగీతం కొరియోగ్రఫీతో కలిసిపోవడం వల్లనే హుక్ స్టెప్ ప్రజాదరణ పొందుతుంది అని అభిప్రాయపడ్డారు.హుక్ స్టెప్లు దశాబ్దాల క్రితమే ప్రాచుర్యం పొందినప్పటికీ, ఇప్పుడు వాటి శైలి, అవసరం చాలా మారిపోయిందని కొరియోగ్రాఫర్ పునీత్ జె పాఠక్ చెప్పారు. ‘‘గతంలో పెద్దా చిన్నా తేడా లేకుండా వేడుకలలో నృత్యం చేయగలిగే లాంటి హుక్ స్టెప్ను తయారు చేయండి’ అని అడిగేవారు అయితే ఇప్పుడు ఇన్ స్ట్రాగామ్లో, రీల్స్లో ఉంచే హుక్ స్టెప్ను తయారు చేసి దానిని వైరల్ చేయడం ముఖ్యంగా మారిందని అన్నారాయన. గతంలో ఇది ప్రేక్షకుల ఇళ్లకు చేరుకోవడం గురించిన ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు వారి ఫోన్లను చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది అంటూ పేర్కొన్నారు.అయితే రీల్స్ ఆధారిత హుక్ స్టెప్స్ డ్యాన్స్ సీక్వెన్స్ల వైరల్లో ఉన్న సమస్య వైరల్ అనేది స్వల్ప కాలానికే పరిమితం కావడం అని పాథక్ అన్నారు. ‘గతంలో ’తౌబా తౌబా’ వైరల్ అయింది. దానికి వారం క్రితం ఇంకేదో వైరలైంది. అయితే స్టెప్స్ వైరల్ అవుతున్నాయి కానీ ఐకానిక్గా ఉండడం లేదు‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.‘హుక్ స్టెప్ సవాళ్లలో పాల్గొనడానికి ఇష్టపడతాను అవి సరదాగా ఉంటాయి, అవి నా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి నాకు సహాయపడతాయి నా డ్యాన్స్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాయి. ‘అంతేకాకుండా, అవి నాకు ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, తాజా సోషల్ మీడియా సందడిలో నన్ను భాగంగా మారుస్తాయి’’ అని కంటెంట్ క్రియేటర్ వృషికా మెహతా చెప్పింది. ఒక ఇన్ ఫ్లుయెన్సర్గా, తాను ఈ హుక్ స్టెప్లను ప్రదర్శించడం ద్వారా సినిమాలను ప్రమోట్ చేస్తాననీ వాటిని నా ప్రేక్షకులతో పంచుకుని వారిని కూడా పాల్గొనమని ప్రోత్సహిస్తానని ఆమె వివరించింది.ఇటీవలి కాలంలో కొన్ని హుక్ హిట్స్...ఈ మధ్య కాలంలో వైరల్ అయిన హుక్ స్టెప్స్లో జాదు‘ (జ్యుయల్ థీఫ్) పాటలో జైదీప్ అహ్లావత్ చేసిన నృత్యం, అలాగే ‘తౌబా తౌబా‘ (బాడ్ న్యూజ్): విక్కీ కౌశల్ మూవ్ మెంట్స్ , ‘జనాబ్–ఎ–ఆలీ‘ (వార్ 2) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్తో హృతిక్ రోషన్ వేసిన స్టెప్పులు అత్యంత ప్రజాదరణ పొందాయి. అలాగే ‘పెహ్లా తు దుజా తు‘ ( సన్ ఆఫ్ సర్దార్ 2) పాటలో అజయ్ దేవగన్ స్టైల్ వైరల్ కాగా,‘ఝూమ్ షరాబీ‘ (దే దే ప్యార్ దే 2)లో కూడా అజయ్ దేవగన్ మళ్లీ గ్లాస్తో వైరల్ స్టెప్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో ‘హుక్ స్టెప్‘ (మన శంకర వరప్రసాద్ గారు): చిరంజీవి స్టెప్స్ తోడయ్యాయి. -
ఇండియాలో ఇటలీగా పేరొందిన హిల్ స్టేషన్..! ఎక్కడంటే..
రోమ్లో ఉంటే రోమన్లాగా ఉండాలి అని విన్నాం కానీ మనం ఉన్న చోటునే రోమ్లాగా తీర్చిదిద్దుకోవాలి అనే మాట విన్నామా? చుట్టూ కొండల నడుమ, మధ్యలో సరస్సు దాని చుట్టూ ఇళ్లు, రాతి రహదారులు... అచ్చం ఇటలీని పోలినట్టు తీర్చిదిద్దబడిన ఆ సిటీని చూస్తే కళ్లు అప్పగించాల్సిందే. భారతదేశంలోనే ఏ హిల్ స్టేషన్కూ లేని ప్రత్యేకతలెన్నో ఉన్న ఆ పర్వత పట్టణం పేరు లావాసా.పూణే సమీపంలో కొలువుదీరిన లావాసాను ’ఇటలీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. దాని పాస్టెల్–రంగు భవనాల, సరస్సు సమీపంలో విహారయాత్రలు ఇరుకైన వీధుల నడుమ నడవగలిగే బౌలేవార్డ్లు సందర్శకులకు యూరోపియన్ అనుభూతిని అందిస్తాయి ఇదే ఇతర భారతీయ హిల్ స్టేషన్ల నుంచి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.అన్నింటికంటే విశేషం ఏమిటంటే... క్రమక్రమంగా విస్తరించిన ఊటీ లేదా సిమ్లా వంటి సాంప్రదాయ హిల్ స్టేషన్ ల మాదిరిగా కాకుండా, ఈ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించడం,భారతీయ కొండ వాతావరణంలో యూరోపియన్ అనుభూతిని పునఃసృష్టించడం, ప్రణాళికాబద్ధమైన కృషితో ప్రపంచ ఆకర్షణను మిళితం చేయడం అనే లక్ష్యాలతో ఇది రూపొందింది. పర్యాటకం, నివాస జీవితం విశ్రాంతి మూడింటిని కలగలిపి ఓ సుందరమైన ప్రదేశంలో మిళితం చేసి లావాసాను పునాదుల స్థాయి నుంచే నిర్మించారు. ఈ సిటీ లే అవుట్, డిజైన్ ఇటలీలోని తీరప్రాంత పట్టణం అయిన పోర్టోఫినో నుంచి ప్రేరణ పొందింది, ఇది పాదచారులకు అనుకూలమైన వీధులు, టెర్రకోట పైకప్పులు రాళ్లతో చేసిన దారులతో ఉంటుంది. భవనాలు పీచ్, ఆలివ్ వంటి తేలికపాటి పాస్టెల్లతో పెయింట్ చేశారు, తోరణాలు టెర్రస్లు యూరోపియన్ ఆకర్షణను అందిస్తాయి. ఫోటోగ్రాఫర్లు, ప్రయాణికులు, వారాంతపు సందర్శకులను ఆకర్షించే విశ్రాంతి, సెలవుదినం లాంటి వాతావరణాన్ని సృష్టించడానికి రూపకర్తలు బహిరంగ ప్రదేశాలు, నడవగలిగే వీధులు సరస్సు వీక్షణలపై దృష్టి సారించారు. దాస్వే సరస్సు చుట్టూ ఉన్న విహార ప్రదేశం. కేఫ్లు, బోటిక్లు బహిరంగ సీటింగ్ ప్రాంతాలతో ఇటాలియన్ ఓడరేవు పట్టణాల తరహాలో రిలాక్సడ్ వాటర్ ఫ్రంట్ జీవితాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని ఇస్తుంది. సూర్యాస్తమయ సమయంలో ఈ విహార ప్రదేశంలో నడవడం లేదా సైక్లింగ్ చేయడం వల్ల చాలా మంది సందర్శకులు యూరోపియన్ హాలిడే పట్టణంలో ఉన్నట్లు స్పష్టమైన అనుభూతిని పొందుతారు. పర్యావరణపరంగా సున్నితమైన పశ్చిమ కనుమలలో ఉండటం వల్ల, లావాసా రూపకల్పన సమయంలో పర్యావరణ అడ్డంకులు ఎదుర్కుంది. నీటి వినియోగం, కొండ–వాలు స్థిరత్వం అటవీ సంరక్షణపై దృష్టి సారించి, హరిత చట్టాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని సమీక్షించే క్రమంలో అధికారులు పలు దఫాలు నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. తరువాత షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. అది పర్యావరణ ప్రమాదాలను తగ్గించుకుంటూ పట్టణం అభివృద్ధి చెందడానికి వీలు కల్పించింది. వారాంతపు విహారయాత్రకు లావాసా సరైన ప్రదేశం. ముఖ్యంగా వర్షాకాలం పూర్తయిన తర్వాత పచ్చని కొండలు స్పష్టమైన సరస్సు కళ్లు విప్పార్చుకునేలా చేస్తాయి. అనువైన నెలలు.లావాసా ప్రత్యేకతలుభారతదేశంలోని మొట్టమొదటి ప్రణాళికతో కూడిన కొండ నగరంఈ పట్టణంలో బోటింగ్ విశ్రాంతి కార్యకలాపాల కోసం రూపొందించిన మానవ నిర్మిత సరస్సు ఉంది.వీధులకు కోమో జెనీవా వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సరస్సులు కొండల పేర్లు ఉంటాయి.మిగిలిన హిల్ స్టేషన్స్కు భిన్నంగా ఈ సిటీలో సాంస్కృతిక ఉత్సవాలు సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి.సాహస కార్యకలాపాలలో ఉన్నవారి కోసం కొండలపై ట్రెక్కింగ్, విహార ప్రదేశాలలో సైక్లింగ్ సరస్సులో జల క్రీడలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఇండియన్ ఇటలీకి చేరుకోవాలంటే పూణే లేదా ముంబై మీదుగా వెళ్లవలసి ఉంటుంది. పూణే నుంచి దూరం దాదాపు 60కి.మీ కాగా, ప్రయాణ సమయం 2 గంటల వరకూ పడుతుంది ముంబై నుంచి 190 కి.మీ దూరంలో ఉంది, ప్రయాణ సమయం దాదాపు 5 గంటలు పడుతుంది.(చదవండి: నటుడు ఆర్నాల్డ్ 'క్రాష్ డైట్'..!బరువు తగ్గడానికి కాదు..) -
పెళ్లాడితే కారు, బంగళా, రూ.10 లక్షలపైగా జీతం
కోట్లు ఉంటే చాలు కొండ మీది కోతిని కూడా కిందకు దిగొస్తుంది అని సంపన్నులతో పాటు చాలా మంది నమ్మకం. అయితే కోతి అయినా వస్తుందేమో గానీ, ఆత్మవిశ్వాసం ఉన్న అందమైన అమ్మాయి మాత్రం రాదని ఓ యువతి నిరూపించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆస్తి, భూమి ఐదు అంకెల నెలవారీ భత్యంతో పాటు మరెన్నో అద్భుతమైన విలాసాలను ఆశ చూపించినప్పటికీ... ఆమె ఒప్పుకోలేదు.ఆమె పేరు అమీ నూర్ టినీ( Amy Nur Tinie). ఈ 29 ఏళ్ల మలేషియా నటి మాజీ అందాల రాణి కూడా. ఆమె ఇటీవల మలేషియా కంటెంట్ క్రియేటర్ సఫ్వాన్ నజ్రీ పాడ్కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ప్రతిపాదన తమ దేశానికే చెందిన ఓ పెద్ద వివిఐపి నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. మలేషియాలో సాధారణంగా చాలా ఉన్నత సామాజిక ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులను వివిఐపీలుగా అభివర్ణిస్తారు.కార్పొరేట్ ఈవెంట్లను నిర్వహిస్తున్నప్పుడు తాను తరచుగా అలాంటి వివిఐపిలను కలుస్తుండడం జరుగుతుందని, ఆ సమయంలో వారిలో చాలామంది తన ఫోన్ నంబర్ అడగడం సర్వసాధారణం అని తెలిపింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా ఆహ్వానిస్తారని అమీ వివరించింది. అదే విధంగా ఒక వ్యక్తి తనను కలిశాడని, నేరుగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రపోజల్ను అంగీకరిస్తే ఆమెకు ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల (40,000 చదరపు మీటర్లు) భూమి, 50,000 రింగిట్స్ (సుమారు రూ.11 లక్షలు) నెలవారీ భత్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది.ప్రస్తుతం మలేషియాలో ఈ పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నవారు గతంలో ఇదే నటి ఇచ్చిన మరో ఇంటర్వ్యూను వెలుగులోకి తెచ్చారు. అందులో మరింత వివరంగా ఆమె తాను అందుకున్న ప్రతిపాదనకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. దాని ప్రకారం... ఈ ప్రతిపాదన 2019లో జరిగిందని, ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆఫర్ అందుకుందని తేలింది. ఆసమయంలో ఆమె అందాల పోటీలలో చురుకుగా పోటీ పడుతోందని వెల్లడైంది. ఆ వ్యక్తి ని డాతుక్ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. అందాల పోటీలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడానికి కార్పొరేట్ స్పాన్సర్షిప్ల అవసరం ఏర్పడడంతో...ఆ విషయంలో దాతుక్ తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడని అయితే అతని ఆఫర్ను తాను వెంటనే తిరస్కరించినట్టు చెప్పింది. సదరు వ్యక్తికి దాదాపు తన తండ్రి వయస్సు ఉంటుందని అంతే కాకుండా అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఆయ్యాయని కూడా వివరించింది. అయితే తన తల్లి తనను అమ్మేయాలని అనుకోలేదని ఆమె చెప్పింది. ఇంకా అవివాహిత గానే ఉన్న అమీ...పాడ్కాస్ట్లో, తన జీవిత భాగస్వామిగా కాబోయేవాడు బాధ్యతాయుతంగా ఆర్థికంగా స్థిరపడి ఉంటే చాలని మరీ విపరీతమైన సంపద అవసరం లేదని చెప్పారు. ఆ ఆఫర్ ని అంగీకరించి ఉంటే తన జీవితం మరింత సుఖంగా ఉండి ఉండేదని ఆమె అంగీకరించింది, కానీ అది తాను కోరుకున్న జీవన మార్గం కాదని చెప్పింది. -
విషసర్పం సౌందర్యానికి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్
అరుదైన భారతదేశపు అత్యంత విషపూరిత సర్పం ఓ కెమెరాకు చిక్కింది. అయితే అది భయాందోళనలను కలగించడానికి బదులుగా వన్యప్రాణుల పట్ల ఆసక్తిని, ఆరాధనను పెంచేలా ఉండడం విశేషం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాస్వాన్ రాత్రి గస్తీ సమయంలో అత్యంత విషపూరితమైన బ్యాండేడ్ క్రైట్ (కట్లపాము)(Banded krait)ను చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేశారు. ఇది భారత దేశంలో అరుదుగా కనిపించే వన్యప్రాణుల వైవిధ్యభరిత వీక్షణ అవకాశాన్ని నెటిజన్స్కు అందించి, స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ గా మారింది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కాస్వాన్ రాత్రి గస్తీ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఆయనకు ఈ పొడవైన విషసర్పం ఎదురైంది. ఫుటేజ్లో పాము ఎక్కడా దూకుడును ప్రదర్శించలేదు. ఆ చీకటిలో బ్యాండేడ్ క్రైట్ ప్రశాంతంగా కదులుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దాని ముదురు పసుపు నలుపు చారలు స్పష్టంగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. కాస్వాన్ తన పోస్ట్లో స్పష్టమైన రూపాన్ని చారలను విలక్షణంగా వర్ణించారు. ఈ కట్లపాము భారతదేశంలోని అత్యంత విషపూరితమైన పాములలో (poisonous snake) ఒకటి అయినప్పటికీ, ఇది చూడడానికి కూడా అంతే అందమైన అద్భుతమైన రూపం కలిగి ఉండడాన్ని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. బురద నీటిలో ఎదురీదుతూ అది కదులుతున్నప్పుడు పాకుతున్న దాని వంటి మీది చారలు స్పష్టంగా కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న గడ్డి పాము గుర్తులను మరింత హైలైట్ చేసింది. ఈ వీడియో చూసేవారిని కన్నార్పనీయకుండా చేస్తోంది. నెటిజన్ల స్పందన...ఈ వీడియోను చూసిన తర్వాత దానిపై వచ్చిన రకరకాల స్పందనలు వన్యప్రాణుల పట్ల ఆసక్తికి అద్దం పట్టాయి. చాలా మంది వీక్షకులు పాము రంగు ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. వారు దీనిని అపోస్మాటిజం (తమను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి, వాటికి హెచ్చరిక సంకేతాలను అందించడం కోసం ప్రకాశవంతమైన రంగులు ఉండడం) తాలూకు క్లాసిక్ కేస్గా వివరించారు. ఈ మనుగడ వ్యూహం ప్రమాదాన్ని స్పష్టంగా సూచిస్తాయి. ఆన్లైన్లో వీక్షణకు వీలుగా స్పష్టత చాలా బాగుందని వినియోగదారులు ప్రశంసించారు. మరొక వీక్షకుడు (Viewer) ఆ చారల గుర్తులను రోడ్ డివైడర్లతో పోల్చారు. మొత్తంగా విజువల్స్ను అద్భుతమైనవిగా వర్ణించారు.Those beautiful bands. Banded krait is highly venomous snake found in India. Found this randomly during night patrolling. How nature provided them so distinct bands !! pic.twitter.com/it2s1vf8yY— Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 28, 2025అటవీ అధికారుల విధి నిర్వహణపై అవగాహనవీడియో భారీ సంఖ్యలో ప్రశంసలతో పాటు అనేక అంశాలపై చర్చను రేకెత్తించింది. సౌందర్యంతో పాటు అంతకు మించి ఈ క్లిప్ అటవీ అధికారుల కఠినమైన విధులను హైలైట్ చేసింది. ప్రమాదకరమైన వన్యప్రాణుల మధ్య నిర్వహించే రాత్రి గస్తీని వీరు ఎంత సవాలుతో కూడిన పరిస్థితులలో నిర్వహిస్తారనేది కూడా వెల్లడించింది. ఈ వీడియో రాత్రిపూట జీవవైవిధ్యాన్ని (Bio Diversity) గుర్తు చేస్తుంది. వన్యప్రాణులు మానవ ప్రదేశాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా ఇది చూపించింది. -
ఫుట్బాల్ ఆడిన ఏనుగులు... ఆకట్టుకున్న అందాల పోటీ...
ఏనుగు ప్రశాంతంగా ఉన్నంత సేపే.. వాటికి గానీ కోపం వచ్చిందంటే మనల్ని ఫుట్ బాల్ ఆడేస్తాయి... అంటూ మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇప్పుడు కోపం రాకుండానే ఏనుగులు ఫుట్బాల్ ఆడేశాయి. అయితే అది మనుషులతో కాదు... మనుషులు ఆడే నిజమైన ఫుట్బాల్ కావడం విశేషం. పర్యాటక రంగానికి ఊపు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం తనదైన ప్రత్యేక ఫెస్టివల్స్ను నిర్వహించడం పరిపాటి. ఆయా ఫెస్టివల్స్ పాప్యులర్ అయితే దశాబ్ధాల పాటు అవి సదరు దేశాలకు టూరిస్ట్లను రప్పించగలగుతాయి.ప్రస్తుతం మన పొరుగు దేశమైన నేపాల్ కూడా అదే పనిచేస్తోంది. తమదైన ఒక ప్రత్యేక ఫెస్టివల్ను పునరుద్ధరించింది. హిమాలయ దేశమైన నేపాల్లోని సౌరహా పర్యాటక పట్టణంలో గత శుక్రవారం జరిగిన వార్షిక ఏనుగుల ఉత్సవంలో ఎలిఫెంట్ ఫుట్బాల్ను నిర్వహించారు. ఈ ఫుట్బాల్ ను కూడా అచ్చంగా ఫుట్బాల్ నియమాలతోనే ఆడతారు, ఆటగాళ్లు ఏనుగులపై స్వారీ చేస్తుండగా, ఏనుగులు గోల్ చేయడానికి ప్రత్యర్థి జట్టు వలలోకి బంతిని తన్నడానికి ఫుట్బాల్ క్రీడాకారుల్లాగే తమ వంతు ప్రయత్నిస్తాయి. ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏనుగులు చిత్వాన్ లోని ప్రధాన పర్యాటక కేంద్రమైన సౌరహా లో చిత్వాన్ నేషనల్ పార్క్ గేట్ నుంచి ఉత్సవ వేదిక వరకు ఏనుగులు వీధుల గుండా కవాతు చేశాయి, అక్కడ అవి పెనాల్టీ షూటౌట్ పోటీలో పాల్గొని అందరినీ ఆకర్షించాయి.జంతు హక్కుల కార్యకర్తల అభ్యంతరాల కారణంగా ఆగిపోయిన నేపధ్యంలో... చాలా సంవత్సరాల విరామం తర్వాత ఈ ఏనుగుల పర్యాటక ఉత్సవం 19వ ఎడిషన్ ను నిర్వహించారు. ఈ సంవత్సరమే తొలిసారిగా పెనాల్టీ షూటౌట్ పోటీని ప్రవేశపెట్టారు. ఇది పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి ఏనుగుల సంరక్షణను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.‘చిత్వాన్ ఏనుగుల ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఇది మాకు దీనికి హాజరు కావడానికి వచ్చే ప్రజలకు కూడా ఒక కానుక. ఈ ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే ఈ ఏనుగుల ఫుట్బాల్ను ప్రారంభించాం, మూడు రోజుల పాటు ఉత్సవం ఉంటుంది‘ అని సౌరహాకు చెందిన ఏనుగుల సంరక్షకుడు శాంతే మహతో తెలిపారు. సౌరహాలోని బాగ్మారా బఫర్ జోన్ కమ్యూనిటీ ఫారెస్ట్లో జరుగుతున్న ఈ ఉత్సవం గత సోమవారంతో ముగిసింది. సౌరహాకు దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలను పెంచడమే ప్రాథమిక లక్ష్యంగా సాగిన ఈ ఉత్సవాల పొడవునా అనేక రకాల సాంస్కృతిక క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించారు.మొదటి రోజు, చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రవేశ ద్వారం నుంచి ఊరేగింపు ఆ తర్వాత ఏనుగుల పెనాల్టీ షూటౌట్ పోటీ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే రెండవ రోజు, ఈ ఉత్సవంలో సాంప్రదాయ సంగీతంతో కూడిన ఏనుగుల అందాల పోటీలు, ఏనుగుల ఆరోగ్య శిబిరం, సంభాషణ కార్యక్రమాలు, పడవ పందాలు, అదనపు క్రీడా పోటీలు జానపద పాటలు, నృత్యాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజున ఏనుగుల పూజ, ఏనుగులతో విందు, పోటీల ఫలితాల ప్రకటన, బహుమతులు థృవ పత్రాల పంపిణీ, అధికారిక ముగింపు వేడుక నిర్వహించారు. -
ఓటీటీలో ఈ ఏడాది టాప్ పెర్ఫార్మెన్స్ ఈ బ్యూటీలదే
వెండితెరకు పోటీగా మారింది ఓటీటీ. ఈ క్రమంలోనే తారలు అక్కడ కూడా తమ సత్తా చాటుతున్నారు. సిల్వర్ స్క్రీన్కు భిన్నంగా ఓటీటీ వేదికలపై ప్రదర్శితమవుతున్న చిత్రాల్లో మహిళల అభినయ సామర్ధ్యం మరింతగా కనిపిస్తోంది. అదే క్రమంలో ఈ ఏడాది ఓటీటీ చిత్రాల్లో పలువురు తారల నటన వీక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తారలు ఎవరెవరంటే?సాన్యా మల్హోత్రా..పితృస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శించిన మిస్ట్రెస్ చిత్రంలో, సాన్యా మల్హోత్రా నటన ఆకట్టుకుంటుంది. సంతోషాల వధువు నుంచి ఒక ఇంటికి బానిసగా మారే క్రమంలో సన్యా నటన ప్రశంసలు అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 నిర్మించిన చిత్రం ఇది.యామి గౌతమ్...ఉత్కంఠభరితమైన రొమాంటిక్ కామెడీ ధూమ్ ధామ్. ఇందులో నటి యామి గౌతమ్ నవ వధువుగా నటించింది, ఆమె వివాహం జరిగిన æ రాత్రిని అంచనాను తలక్రిందులుగా చేసి, నెర్వస్గా ఉండే తప భర్తతో నగరం అంతటా పిచ్చిగా తిరిగే థూమ్ థామ్ను నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.మియా మేల్జర్...స్టోలెన్ చిత్రంలో తన బిడ్డ కిడ్నాప్ కు గురైన పరిస్థితిలో ఒక నిస్సహాయ స్త్రీ పాత్రను మియా మేల్జర్ పోషించింది. తాను ఎదుర్కొంటున్న పరిస్థితి హింసాత్మకంగా మారినప్పుడు అదే నిస్సహాయ మహిళ తెగువను చూపుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.నీనా గుప్తా..ఆచారీ బా చిత్రంలో గుజరాతీ వితంతువుగా సీనియర్ నటీమణి నీనా గుప్తా నటన మన్ననలు అందుకుంది. జియో హాట్స్టార్లో ఈ సినిమా చూడవచ్చు. సుగంధ ద్రవ్యాల పట్ల మక్కువ, వివాహ జీవితంలో అసంతృప్తి ఉన్న గృహిణిగా షీబా చద్దా... ఫ్యామిలీ డ్రామా కౌశల్జీ వర్సెస్ కౌశల్ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరుస్తుంది. ఈ చిత్రం జియో హాట్స్టార్లో ఉంది.సబా ఆజాద్పీరియాడిక్ డ్రామా సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ లో సబా సంప్రదాయవాద సమాజంలో తన గొంతును వినిపించడానికి పోరాడిన స్త్రీ స్ఫూర్తిగా కనిపిస్తుంది. , దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియో అందిస్తోంది.ఫరీదా జలాల్పదునైన, నిర్ణయాత్మక పాత్రలో ఫరీదా ఆకట్టుకుంటుంది. మాతృమూర్తిగా ఆమె కుటుంబం ఆమెను ఆరాధిస్తుంది భయపడుతుంది కూడా. ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ సినిమాను జియో హాట్స్టార్లో చూడొచ్చు.రాధికా ఆప్టేసాలీ మొహబ్బత్ అనే డార్క్ క్రై మ్ థ్రిల్లర్లో రాధిక ఆప్టే నటన ప్రశంసలు అందుకుంది. ఆమె ఒక విధేయురాలైన భార్యగా మాత్రమే కాదు అడ్డంకులు ఎదురైనప్పుడు అంతే కఠినంగా... అన్ని సందర్భాల్లోనూ పూర్తిగా అమాయకంగా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.దీప్తి నావల్రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్లో నటి దీప్తి నావల్ తనకున్న ’మంచి మహిళ అనే ఇమేజ్కు వ్యతిరేకంగా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని చూడవచ్చు.హుమా ఖురేషి...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ అందిస్తున్న ’ఢిల్లీ క్రై మ్ సీజన్ 3’లో క్రూరమైన మానవ అక్రమ రవాణాదారు మీనా (బడీ దీదీ) పాత్రలో హుమా ఖురేషి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. షెఫాలీ షా, రసికా దుగల్ తదితరులు కూడా నటనకు మార్కులు పడినప్పటికీ, ఖురేషి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి, ప్రశంసలు పొందింది. -
తమన్నా చిందులు గోవాలో...సన్నీలియోన్ సయ్యాట హైదరాబాద్లో...
గుడ్బై 2025 అంటూ వీడ్కోలు పలకడం, వెల్క్మ్ 2026 అంటూ స్వాగతం చెప్పడం.. కోసం ప్రపంచం సకల సన్నాహాలతో సిద్ధమైంది. న్యూ ఇయర్ వేడుకలలో టాక్ ఆఫ్ ద ఈవెంట్స్గా నిలిచే ముఖ్యమైన అంశం సెలబ్రిటీల ప్రదర్శన. అదే క్రమంలో భారతీయ సినీ సెలబ్రిటీలు పలువురు రానున్న నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇస్తున్నారు. అందులో ఇప్పటివరకూ నిర్ణయమైన వాటిలో చెప్పుకోదగ్గ ఈవెంట్ గోవాలో జరుగుతోంది. మన మిల్క్ బ్యూటీ, తాజా ఐటమ్ నంబర్ల క్వీన్గా పేరొందిన తమన్నా అందులో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం తమన్నా గోవాలోని బీచ్ ఫ్రంట్ హోటల్కు చేరుకుంది. అదే విధంగా బాలీవుడ్ నటి, రొమాంటిక్ చిత్రాల బ్యూటీ సన్నీ లియోన్ తెలంగాణ రాజధాని నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటోంది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల సైతం ఆమెకు జత కలవనున్నాడు. అదే విధంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ గోవా, లక్నో... ఇతర ప్రధాన నగరాల్లో జరిగే కార్యక్రమాలలో సినిమా ప్రముఖులు పాల్గొంటున్నారు.–గోవాలో బాలీవుడ్ నైట్ క్లబ్గా పేర్కొనే లాస్ ఒలాస్లో నటి తమన్నా, మరో నటి సోనమ్ బజ్వాలతో పాటు మ్యుజిషియన్ మిళింద్ గాబాలు పాల్గొంటున్నారు.–ప్రముఖ నేపధ్యగాయని సునీత కూడా హైదరాబాద్లో నిర్వహిస్తున్న న్యూ ఇయర్ వేడుకల్లో గళం కలుపుతున్నారు.–ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్... విజయవాడలో జరుగుతున్న ఈవెంట్లో సందడి చేయనున్నాడు.–ఢిల్లీలో ది లీలా యాంబియెన్స్ కన్వెన్షన్ హోటల్ జరిగే ‘డాజిల్ ఫ్రమ్ ది –ఈస్ట్‘ కార్యక్రమంలో పంజాబీ గాయకుడు, నటుడు జాస్సీ గిల్ – బబ్బల్ రాయ్ జంట ప్రత్యక్ష ప్రదర్శనలను అందిస్తుంది.–హిందీ గాయని సప్నా చౌదరి – రేణుకా పన్వర్ లు ఢిల్లీలోని షాహ్దారాలో జరిగే ‘ఎపిక్ నైట్ అవుట్‘ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తోంది.–ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ హైదరబాద్కి వస్తున్నాడు. నగరంలో జరుగుతున్న ఓ నూతన సంవత్సర వేడుకకు హాజరవుతున్నాడు.–బాలీవుడ్ గాయని, నటి సునంద శర్మ: ఢిల్లీలోని లే మెరిడియన్ గుర్గావ్లో నిర్వహిస్తున్న విలాసవంతమైన నూతన సంవత్సర వేడుకలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనుంది.––న్యూజిలాండ్కు చెందిన బాలీవుడ్ గాయని షిర్లీ సెటియా ‘బిగ్ బ్యాంగ్ బెంగళూరు‘ కార్యక్రమంలో ఆటపాటలతో అలరించనుంది.–మాజీ బాలీవుడ్ నటి ర్యాప్ గాయని ఉదితా గోస్వామి బెంగళూరులోని స్టార్ హోటల్ హై అల్ట్రా లాంజ్లో జరిగే న్యూ ఇయర్ పార్టీలో పాల్గొంటోంది. -
ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ ఇవే..
కొత్త సంవత్సర సంబరాలకు ప్రపంచం సిద్ధమవుతోంది. 2026 నూతన ఏడాదిని స్వాగతిస్తూ ఘనంగా వేడుకలు చేసుకునేందుకు జనమంతా రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే టాప్ 10 న్యూ ఇయర్ పార్టీస్ గురించి తెలుసుకుందాం. 1. నెంబర్ వన్ రియో...ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్–ఎయిర్ నూతన సంవత్సర వేడుకగా కోపకబానా బీచ్ వేడుకలతో రియో బీచ్ నంబర్ 1 స్థానాన్ని పొందింది. బ్రెజిల్ దేశపు ఈ ప్రపంచ ప్రసిద్ధ బీచ్కు ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు పోటెత్తుతారు. అద్భుతమైన రీతిలో 12–15 నిమిషాల బాణసంచా ప్రదర్శన, ప్రత్యక్ష కచేరీలు, సాంబా ప్రదర్శనలు రియోలో అర్ధరాత్రిని కూడా కాంతులీనేలా చేస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి సముద్ర తీర ఆచారాలు ఇక్కడి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలలో ఒకటి ఏడు అలలపై దూకే ఆధ్యాత్మిక చర్య, ప్రతి ఒక్కటి రాబోయే సంవత్సరం కోసం ఒక కోరికను సూచిస్తుంది. ఆధ్యాత్మికత, ఆధునికతలను మిళితం చేస్తూ, రియో వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది.2. ట‘పాస్’లతో... సిడ్నీ..ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమైన సిడ్నీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బాణసంచా ప్రదర్శనను వీక్షించడానికి 1.6 మిలియన్లకు పైగా సందర్శకులు హార్బర్ వద్ద బారులు తీరుతారు. నగరంలోని డబుల్ బాణసంచా ప్రదర్శనలు – కుటుంబాల కోసం రాత్రి 9 గంటల ప్రారంభ ప్రదర్శన గ్రాండ్ మిడ్నైట్ బాణసంచా ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశిస్తాయి. హార్బర్ క్రూయిజ్ల నుంచి లూనా పార్క్లోని థీమ్–పార్క్ పార్టీల వరకు, సిడ్నీ ప్రపంచ స్థాయి నూతన సంవత్సర వేడుకను అందిస్తుంది.3. వెల్డన్.. లండన్..లండన్ నూతన సంవత్సర వేడుక సమయానికి లండన్ (London) నుంచి బాణసంచా మెరుపుల్ని చూడటానికి థేమ్స్ నది వెంబడి 100,000 మందికి పైగా పోగవుతారు. అర్ధరాత్రి దాటి, వేడుక నది క్రూయిజ్లు, రూఫ్టాప్ పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనకారులను కలిగి ఉన్న ఐకానిక్ లండన్ న్యూ ఇయర్ డే పరేడ్తో కొనసాగుతుంది.4. హాయ్.. దుబాయ్..ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక నూతన సంవత్సర వేడుకలలో ఒకటిగా దుబాయ్ (Dubai) నాల్గవ స్థానంలో నిలిచింది. సింక్రొనైజ్ చేయబడిన పైరోటెక్నిక్లు, లేజర్ ప్రొజెక్షన్లు డ్రోన్ ప్రదర్శనలకు బుర్జ్ ఖలీఫా ఒక పెద్ద వేదికగా మారుతుంది. ఆకర్షణీయమైన రూఫ్టాప్ పార్టీల నుంచి లగ్జరీ హోటళ్లలో గ్రాండ్ డైనింగ్ అనుభవాల వరకు, దుబాయ్ అత్యాధునిక వినోదాన్ని సాంస్కృతిక సౌరభాలతో మిళితం చేస్తుంది నూతన సంవత్సరానికి విలాసవంతమైన ప్రారంభాన్ని కోరుకునే పర్యాటకులకు ఇది మొదటి ఎంపికగా మారింది.5. ప్యార్ హుషార్.. పారిస్యూరప్లోని అత్యంత సొగసైన నూతన సంవత్సర గమ్యస్థానాలలో ఒకటిగా ఫ్రాన్స్లోని పారిస్ (Paris) ప్రకాశిస్తూనే ఉంది. లైటింగ్ డిస్ప్లేలు, అద్భుతమైన విందులు నదీతీర ఉత్సవాల్లో పాల్గొనడానికి దాదాపు పది లక్షల మంది సందర్శకులు చాంప్స్–ఎలిసీస్, ఐఫిల్ టవర్ సీన్ చుట్టూ గుమిగూడతారు. ఫ్రెంచ్ సంప్రదాయమైన రెవిల్లాన్ విందులు – షాంపైన్ పొంగులు, క్లాసిక్ ఫ్రెంచ్ విందులు ఇక్కడి వేడుకకు గొప్ప వైభవాన్ని జోడిస్తాయి.6. న్యూయార్క్.. ఓ బెంచ్ మార్క్..ఈ జాబితాలో అమెరికా నగరం న్యూయార్క్ (New York) ఆరవ స్థానంలో ఉన్నప్పటికీ టైమ్స్ స్క్వేర్ బాల్ డ్రాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టీవీక్షణ పొందిన నూతన సంవత్సర కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కచేరీలు, ఐకానిక్ వాటర్ఫోర్డ్ క్రిస్టల్ బాల్ అవరోహణ కోసం పది లక్షలకు పైగా సందర్శకులు స్క్వేర్ను చుట్టుముడతారు. సెంట్రల్ పార్క్ న్యూయార్క్ హార్బర్ అంతటా బాణసంచా వేడుకలు సందడి చేస్తాయి, రూఫ్టాప్ పార్టీల నుండి జాజ్ క్లబ్ల వరకు ప్రతీ ఒక్కరి అభిరుచినీ సంతృప్తి పరిచే ఈవెంట్స్ ఉంటాయి.7. ‘బాత్’ బెస్ట్.. బుడాపెస్ట్..హంగేరీ దేశంలోని ప్రధాన నగరమైన బుడాపెస్ట్లో తనకే ప్రత్యేకమైన థర్మల్ బాత్ పార్టీలు ఓ హైలెట్. అలాగే ప్రకాశవంతమైన డానుబే నది క్రూయిజ్లు వీధి ఉత్సవాలతో నూతన సంవత్సరపు రోజున ఈ నగరం చరిత్ర, నైట్ లైఫ్, వెల్నెస్ను మిళితం చేస్తుంది. బార్ల నుంచి స్పా రేవ్ల వరకు, బుడాపెస్ట్ ఒక ప్రత్యేకమైన ఉత్సాహభరితమైన వేడుకను అందిస్తుంది, ఇది పర్యాటకులు తన దగ్గరకు ప్రతి సంవత్సరం తిరిగి వచ్చేలా చేస్తుంది.8. కల్చరల్ మార్గ్.. ఎడిన్ బర్గ్..ఎడిన్బర్గ్లోని హాగ్మనే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలలో ఒకటి, మండే టార్చ్లైట్ ఊరేగింపు, సీలిడ్ నృత్యం, సాంప్రదాయ స్కాటిష్ సంగీతం ఎడిన్బర్గ్ కోటపై అద్భుతమైన బాణసంచా ప్రదర్శనలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. సంస్కృతి, శతాబ్దాల నాటి సంప్రదాయాలతో జరిగే ఈ మూడు రోజుల పండుగ మొత్తం నగరాన్ని సందడిగా మారుస్తుంది. ఇక్కడ వారసత్వం, సమాజం పండుగ స్ఫూర్తి ప్రధానంగా కలబోసి ఉంటాయి.9. భళా.. బాలిఇండోనేసియాలోని బాలి ఉష్ణమండల సౌందర్యం విద్యుదీకరణ శక్తిని మేళవిస్తూ నూతన సంవత్సర వేడుకను (New Year Celebration) అందిస్తుంది. బీచ్ పార్టీలు, నియాన్–లైట్ క్లబ్లు, ఆధ్యాత్మిక ఆలయ ఆచారాలు తాటి చెట్ల నీడన బాణసంచా కాల్చడం వంటివి ఆకట్టుకుంటాయి. ఉలువాటులోని కొండ అంచున ఉన్న క్లబ్లో నృత్యం చేస్తున్నా లేదా ప్రశాంతమైన వేడుకలో పాల్గొంటున్నా, బాలి మరపురాని రాత్రి జీవితం ప్రపంచవ్యాప్త ఎంపికగా నిలిచింది.10. రొమాంటిక్గా ఉన్నా.. వియన్నా..ఆస్ట్రియా దేశంలోని వియన్నా(Vienna) రొమాంటిక్ పర్యాటకులకు చిరునామాగా నిలుస్తుంది. అక్కడ ప్రసిద్ధ నూతన సంవత్సర వేడుకలో నగరాన్ని శాస్త్రీయ కచేరీలు, పండుగ మార్కెట్లు, ఉల్లాసమైన డ్యాన్స్ ఫ్లోర్స్, గ్రాండ్ బాల్రూమ్ పార్టీలతో ఈ నగరం జోష్ నింపుతుంది. యూరోపియన్ సంస్కృతి, రొమాన్స్, గ్లామర్ కోరుకునే పర్యాటకుల ఎంపిక ఇది.చదవండి: 2025లో ఎక్కువ మంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే -
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారరే గుడ్ అంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ మనకు మాత్రమే ప్రత్యేకం కాదు. విశ్వవ్యాప్తంగా కూడా సినిమా రూపకర్తలంతా దయ్యాలకు, భయాలకు జై కొడుతున్నారు. మొత్తంగా హాలీవుడ్ హారర్ చిత్రాలతో హాహా కారాలు చేయిస్తోంది.ఈ ఏడాది ఉత్తర అమెరికా టిక్కెట్ల అమ్మకాలలో 17% హర్రర్ చిత్రాలే దక్కించుకున్నాయి ఇది దశాబ్దం క్రితం 4% గా మాత్రమే ఉండడం గమనార్హం. అదేవిధంగా, రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న వాటిలో హర్రర్ చిత్రాల సంఖ్య 21% గా ఉంది. అంటే దాని అర్ధం రానున్న ఏడాది కూడా థియేటర్లలో మరిన్ని హర్రర్ సినిమాలను ప్రేక్షకులు చూడబోతున్నారుకళ్లకు భయం... కనకవర్షంఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ దగ్గర 100 మిలియన్లకు పైగా సంపాదించిన వాటిలో ఒకటి ‘‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్లైన్స్’’కాగా, మరొకటి ‘‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’’ ర్యాన్ కూగ్లర్ పీరియాడికల్ వాంపైర్ చిత్రం ‘‘సిన్నర్స్’’ కూడా 2025లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది, గిల్లెర్మో డెల్ టోరో తీసిన 120 మిలియన్ డాలర్ల ‘ ఫ్రాంకెన్స్టైన్‘, ఆస్ట్రేలియన్ దర్శకురాలు ఆలిస్ మైయో మాకే కొత్త చిత్రం ‘‘ది సర్పెంట్స్ స్కిన్’’.. కూడా హారర్ చిత్రాలే. ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 494 మిలియన్ల డాలర్లు అందుకుందని అంచనా. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన భారీ హిట్ సిన్నర్స్ 367మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది.కధలెన్నో..కాన్సెప్ట్ ఒక్కటే...ప్రేమలో ఉన్న ఇద్దరు యువతుల గురించి వారి ప్రేమకు అడ్డుగా ఉండే శాపగ్రస్తమైన టాటూ గురించిన కథ ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’ టోబీ పోజర్, జాన్ ఆడమ్స్ వారి కుమార్తెలు జేల్డా ల రూపకల్పనలో.. క్యాన్సర్తో బాధపడుతున్న టీనేజ్ అమ్మాయి, తన అనారోగ్యాన్ని నయం చేయాలనే ఆశతో ఒక నెక్రోమాన్సర్ను సందర్శించడం తదనంతర పరిణామాలతో ‘‘మదర్ ఆఫ్ ఫ్లైస్’’, రూపొందింది. ఈ సంవత్సరంలో, వచ్చిన ఉత్తమ హారర్ చిత్రంగా ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే డానియెల్ డెడ్వైలర్ రూపొందించిన నెమ్మదిగా సాగే హారర్–డ్రామా 40 ఏకర్స్... నల్లజాతి ప్రజల నిర్దిష్ట చారిత్రక గాయాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. విచిత్రమైన మలుపులకు పేరొందిన జపనీస్ దర్శకుడు యుటా షిమోట్సు అందించిన బెస్ట్ విషెస్ టూ ఆల్... కూడా హారర్ హిట్స్ జాబితాలో చేరింది. అరుదుగా సినిమాలు తీసే సీన్ బైర్న్ ‘‘డేంజరస్ యానిమల్స్’’మరో సక్సెస్. ఈ సంవత్సరపు ఉత్తమ హారర్ నటనలలో ఒకటిగా కుక్క నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘‘గుడ్ బాయ్’’ ఒక సాధారణ దెయ్యాల ఇంటి కథాంశానికి సరికొత్త రూపం. ‘‘‘సిన్నర్స్‘ తో, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన చిత్రం ఓ వాంపైర్ కథాంశం. దర్శకుడు ఎమిలీ బ్లిచ్ఫెల్ట్æ అందించిన ‘‘ది అగ్లీ స్టెప్సిస్టర్‘ కూడా సౌందర్య చికిత్సల నేపధ్యంలో నడిచే హారర్ చిత్రం. అలాగే వెపన్స్ కూడా. అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో పాటు, ది ఉమెన్ ఇన్ ది యార్డ్ డెత్ ఆఫ్ ఎ యునికార్న్ వంటి ప్రత్యేకమైన స్వతంత్ర చిత్రాల వరకు విడుదలయ్యాయి, ప్రత్యేకమైన కాన్సెప్ట్ ది మంకీ ఆకట్టుకుంది. బ్లాక్ ఫోన్ 2: బ్రింగ్ హర్ బ్యాక్ వంటివీ ఇదే కోవలోకి వస్తాయి. -
క్రిస్మస్ పండుగ ఆరునెలల పాటు నిర్వహించే దేశం ఏది? ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు, చాలా దేశాల్లో ఆ రోజున సెలవుదినoగా పరిగణిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క రోజో నాలుగైదు రోజులో కాదు... నెలల తరబడి క్రిస్మస్ వేడుకలు జరిగే దేశం ఒకటి ఉంది. ఆ దేశం ఫిలిప్పీన్స్, అక్కడ క్రిస్మస్ అంటే ఒక సెలవుదినం కంటే కూడా చాలా ఎక్కువ. దాదాపు సగం సంవత్సరం పాటు విస్తరించింది. తద్వారా ఫిలిప్పీన్స్ సుదీర్ఘ పండుగ అసాధారణమైన వేడుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.స్థానికంగా కపాస్కుహాన్ అని పిలువబడే పండుగ సీజన్ సెప్టెంబర్ ప్రారంభంలోనే రేడియో పెరోల్స్లో క్రిస్మస్ సంగీతం ప్లే చేయడంతో ప్రారంభమవుతుంది అప్పటి నుంచే అక్కడ ఇళ్లను ప్రకాశవంతమైన రంగుల నక్షత్ర ఆకారపు లాంతర్లతో అలంకరిస్తారు. ‘బెర్ నెలలు‘ (సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు)గా పేర్కొనే ఇవి సెలవుదినం వరకూ కొనసాగుతాయి. నిదానంగా ప్రారంభమై డిసెంబర్ నాటికి, మతపరమైన సేవలు, కుటుంబ సమావేశాలు అర్ధరాత్రి విందులు జరిగినప్పుడు ఉత్సవాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.అయితే ఈ వేడుకలు క్రిస్మస్ రోజున అంటే డిసెంబరు 25న కూడా ముగియకపోవడం గమనార్హం. నూతన సంవత్సరం తర్వాత కూడా, తరచుగా జనవరి మూడవ ఆదివారం శాంటో నినో విందులతో వేడుకలు కొనసాగుతాయి. ఇంకా, కొంతమంది కాథలిక్కులకు, ఈ సీజన్ ఫిబ్రవరి 2, కాండెలేరియా విందు వరకు కొనసాగుతుంది, చివరకు ఆ సమయంలో అలంకరణలు తొలగించడం మొదలవుతుంది.ఫిలిప్పీనో క్రిస్మస్ మూలాలు శతాబ్దాల క్రితం ఉన్నాయి. 16వ శతాబ్దంలో క్రై స్తవ మతం రాకముందు, స్థానిక కమ్యూనిటీలు మొక్కలు నాటడం, అలాగే వ్యవసాయ పంటలతో ముడిపడి ఉన్న ఆచారాలను నిర్వహించేవారు, విందులు, సంగీతం, ఆత్మలు, దేవతలకు అర్పణలు వీటిలో భాగంగా ఉండేవి. స్పానిష్ వలసరాజ్యం ఈ పద్ధతులను క్రమంగా ఆవాహన చేసుకుంటూ కాథలిక్ సంప్రదాయాలను తీసుకువచ్చింది విశ్వాసం పండుగ ల ప్రత్యేకమైన మిశ్రమాన్ని సృస్టించింది. రికార్డుల ప్రకారం, ఫిలిప్పీన్స్ లో మొట్టమొదటి క్రిస్మస్ వేడుక డిసెంబర్ 1565లో సెబులోని ఫోర్ట్ శాన్ పెడ్రోలో జరిగింది, కాలక్రమేణా, ఊరేగింపులు వంటి కాథలిక్ ఆచారాలు స్థానిక ఆచారాలతో విలీనం అయ్యాయి, ఇది నేటికీ పాటిస్తున్న సంప్రదాయాలకు దారితీసింది.అలాగే, శాశ్వతమైన ఫిలిప్పీన్స్ వేడుకలలో సింబాంగ్ గబీ ఒకటి, ఇది డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరిగే తొమ్మిది తెల్లవారుజామున ప్రార్థనల శ్రేణి. మొదట 1668లో నమోదు చేయబడిన ఈ ఆచారాన్ని మిషనరీలు ప్రవేశపెట్టారు. 18వ శతాబ్దం నాటికి, సేవలు తెల్లవారుజామునకు మారాయి, ఇది రైతులు పొలాల్లో పని చేయడానికి ముందు హాజరు కావడానికి వీలు కల్పించింది. దీనిని మిసా డి గాల్లో (‘కోడి ప్రార్థన‘) అని పిలుస్తారు. ప్రార్థన తర్వాత, ఆరాధకులు బిబింకా (బియ్యం కేక్) పుటో బంబాంగ్ (ఊదా రంగులో ఉడికించిన బియ్యం) వంటి రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తారు. తొమ్మిది ప్రార్థనలను పూర్తి చేయడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లేదా శుభాకాంక్షలు లభిస్తాయని నమ్మకం. -
కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?
ఏటా పెరుగుతున్న భారతీయుల పర్యాటకాసక్తి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది కూడా మనోళ్లు టూర్ ఇష్టులుగానే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని అలీఎక్స్ప్రెస్ అనే సంస్థ తాజా ట్రావెల్ ట్రెండ్స్ 2026 నివేదిక వెల్లడించింది. మన వాళ్లు వచ్చే ఏడాది ఏ యే ప్రాంతాలను చూడాలని ఆశిస్తున్నారు? అనేది విశ్లేషించేందుకు అలీ ఎక్స్ప్రెస్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పదివేల ట్రావెల్ డేటా పాయింట్లను విశ్లేషించిన ఫలితంగా రూపొందిన ఈ నివేదిక రాబోయే సంవత్సరానికి భారతీయ ప్రయాణికుల ప్రాధాన్య జాబితాలో ఉన్న టాప్ టూరిస్ట్ ప్లేసెస్ను ఆవిష్కరించింది. 2026లో భారతీయులు సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న టాప్ 10 గమ్యస్థానాలు ఇక్కడ ఉన్నాయి. జోర్హాట్భారతదేశంలోని అస్సాం రాష్ట్రం ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆసక్తిని బాగా చూరగొంటోంది. అస్సాం హృదయం లాంటి ప్రదేశం జోర్హాట్, విస్తారమైన టీ ఎస్టేట్లు, గొప్ప వారసత్వం, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులికి సమీపంలో టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం చరిత్ర, పచ్చని ప్రకృతి సౌందర్యం, ఉత్సాహభరితమైన అస్సామీ సంప్రదాయాల ప్రశాంతమైన మిశ్రమానికి నెలవుగా ఉంటుంది.జాఫ్నాపామిరాతో కప్పబడిన తీరాలు, పురాతన దేవాలయాలతో, జాఫ్నా శ్రీలంక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తుంది. వచ్చే ఏడాది భారతీయ ప్రయాణికులు (Indian Tourists) ఈ ప్రాంతం చూడాలని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, తమిళ సంస్కృతి వంటకాలతో ఇది భారతీయుల మది దోచుకుంటోంది. ముఖ్యంగా కొత్తగా వృద్ధి చెందిన విమానాల సంఖ్య గతంలో కంటే అక్కడకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.మస్కట్కఠినమైన పర్వతాలు అరేబియా సముద్రం మధ్య ఉన్న మస్కట్, అరేబియా వారసత్వంతో ఆధునిక సంప్రదాయాల సొగసైన మిశ్రమంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. గొప్ప గొప్ప మసీదులు చారిత్రాత్మక కోటల నుంచి ఉత్సాహభరితమైన సౌక్లు సముద్రతీర విహార ప్రదేశాల వరకు, ఈ రాజధాని నగరం తక్కువ విలాసవంతమైన శాశ్వత ఆకర్షణను అందిస్తుంది.క్వీన్స్టౌన్న్యూజిలాండ్ దేశంలోని క్వీన్స్టౌన్ కూడా భారతీయుల ఎంపిక జాబితాలో చోటు సంపాదించింది. వాకటిపు సరస్సు ఒడ్డున ఉన్న ఇది సాహసోపేతమైన ప్రకృతి ప్రేమికులకు అంతిమ ఆట స్థలం. ది రిమార్కబుల్స్ పర్వత శ్రేణితో చుట్టుముట్టబడిన ఇది థ్రిల్, ప్రశాంతతను సజావుగా మిళితం చేస్తుంది. ఐకానిక్ అనుభవాలలో బంగీ జంపింగ్, సుందరమైన ట్రైల్స్, వైన్ తయారీ కేంద్రాలు విశ్రాంతి స్పా రిట్రీట్లు దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.చియాంగ్ రాయ్థాయిలాండ్ లోని చియాంగ్ రాయ్ ఆధ్యాత్మికత కళాత్మకతను కలిసే ప్రదేశం. వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, ప్రశాంతమైన టీ తోటలు, రోలింగ్ హిల్స్ వంటి ఐకానిక్ ల్యాండ్మార్క్లతో, వైవిధ్యభరిత సంస్కృతుల మధ్య కూడా ప్రశాంతతను కోరుకునే వారికి ఇది స్వర్గధామంగా నిలుస్తోంది.వారణాసిమన దేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి (Varanasi) ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అత్యధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. గంగా నది ఒడ్డున మంత్రముగ్ధులను చేసే సాయంత్రం హారతిని వీక్షించడం, సూర్యోదయంలో పవిత్ర స్నానం చేయడం, పురాతనమైన పురాణాలను, ఇతిహాసాల వేదికగా.. పురాతన దేవాలయాలు ఈ నగరాన్ని ఏటా భారతీయ పర్యాటకులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానంగా ఉంటోంది.మనీలాఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా అనేది వైరుధ్యాల నగరం, అక్కడ వలసరాజ్యాల యుగపు గోడలు నియాన్–లైట్ల వెలుగుల్లో దర్శనమిస్తాయి. ఉల్లాసమైన వీధులు, ఇంట్రామురోస్ వంటి చారిత్రాత్మక జిల్లాలు, సందడిగా ఉండే ఆహార మార్కెట్లు ఉత్సాహభరితమైన రాత్రి జీవితం దీనిని సాంస్కృతిక శక్తి కేంద్రం ఇది. ఫిలిప్పీన్స్కు చెందిన సుందరమైన ద్వీప సౌందర్యాలను ఆస్వాదించేందుకు సరైన ప్రదేశం. టిబిలిసిజార్జియాలోని టిబిలిసి పాత కాలం నాటి ఆకర్షణ, ఆధునిక సామర్ధ్యం రెండింటితో నిండి ఉంది. రాళ్లతో కప్పబడిన వీధులు శతాబ్దాల నాటి చర్చిలు, థర్మల్ బాత్లు సమకాలీన ఆధునిక కేఫ్లకు ఇది నిలయం. సృజనాత్మక శక్తి హృదయపూర్వక ఆతిథ్యంతో, జార్జియన్ రాజధాని వైవిధ్యాన్ని కోరుకునే భారతీయ ప్రయాణికుల జాబితాలో ముందుంది.హోచిమిన్వియత్నాంలోని హోచిమిన్ నగరం దాని ఆకాశహర్మ్యాలు, వలసరాజ్యాల ల్యాండ్మార్క్లు, వీధి ఆహార దుకాణాలు, ఇలా సజీవంగా ఉన్న మార్కెట్లతో అబ్బురపరుస్తుంది. పచ్చని మెకాంగ్ డెల్టా దక్షిణ వియత్నాం వారసత్వ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన లాంచ్ప్యాడ్ ఇది. చాలా మంది భారతీయులు ఈ ఏడాది భారీ సంఖ్యలో వియత్నాంకు ప్రయాణించారు మరింత మంది వచ్చే ఏడాది సందర్శించాలని చిస్తున్నారు,పోర్ట్ లూయిస్మారిషస్లోని మణి సముద్రాలు పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న పోర్ట్ లూయిస్ ఉష్ణమండల ఆకర్షణను కాస్మోపాలిటన్ శైలితో మిళితం చేస్తుంది. కళకళలాడే మార్కెట్లు, వలసరాజ్యాల నిర్మాణం భిన్న వైరుధ్యాలు కలిగిన ఫుడ్ కల్చర్ ఉల్లాసమైన ప్రశాంతమైన గమ్యస్థానంగా దీనిని మారుస్తున్నాయి సూర్య ప్రశాంతతను కోరుకునే వారికి అనువైనది. నివేదిక శోధనలలో 93% పెరుగుదలను చూపించింది. దీనిని అనేక మంది భారతీయుల ప్రయాణ బకెట్ జాబితాలలో ఉంచింది.చదవండి: భాయిజాన్ సల్మాన్ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! 60లో కూడా కండలు తిరిగిన బాడీ సొంతం కావాలంటే... -
ఆ అందాల నటి వయసు 92 ...ఆరోగ్య రహస్యం ఇదే...
చాలా మందికి కదలడం కూడా కష్టంగా ఉండే వయస్సులో ఆ నటి నృత్యం చేస్తున్నారు. చురుకైన కదలికలు, వన్నె తరగని ముఖ వర్ఛస్సుతో ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఆమె ప్రముఖ సీనియర్ నటి–నర్తకి వైజయంతిమాల బాలి. ప్రస్తుతం 92 ఏళ్ల ఈ ఐకానిక్ సంగం స్టార్ ఇప్పటికీ తరగని తేజస్సుతో కళాత్మక శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ట్వింకిల్ టోస్ అని ప్రేమగా పిలువబడే ఆమె, ఒక ప్రదర్శనకారిణి, గురువు, పండితురాలు సాంస్కృతిక సంరక్షకురాలిగా బహుళ పాత్రలను సజావుగా సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రేక్షకులను తన ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేశారు, భావోద్వేగ లోతు శాస్త్రీయ వైభవంతో నిండిన ప్రదర్శన సమర్పించారు.నాట్యమే...ఆరోగ్యంఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా , తన శారీరక బలాన్ని మానసిక స్పష్టతను నిలబెట్టిన సూత్రాల గురించి వైజయంతిమాల మీడియాతో పంచుకున్నారు. నిర్మాణాత్మక జీవనం, బుద్ధిపూర్వక ఆహారం వీటన్నింటితో పాటు భరతనాట్యం పట్ల అచంచలమైన నిబద్ధత తదనుగుణ శారీరక శ్రమల సమ్మేళనమే తన దీర్ఘాయువు రహస్యం అంటారామె. తన జీవితంలో భరతనాట్యం కేంద్ర శక్తిగా మిగిలిపోయిందని వైజయంతిమాల వివరించారు. ప్రస్తుతం ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోవచ్చు, కానీ ఎంపిక చేసిన యువ విద్యార్థుల బృందానికి శిక్షణ ఇవ్వడం ద్వారా తన జ్ఞానాన్ని పంచుతూనే ఉన్నారు. తన రోజులో మిగిలిన గంటలు పరిశోధనలో పెట్టుబడి పెడతారు, ఇది ఆమె దశాబ్దాలుగా అనుసరించిన కళారూపంతో మేధోపరంగా నిమగ్నమై ఉండటానికి వీలు కల్పిస్తుంది.మితాహారం...యోగా ధ్యానం...ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె దినచర్య గురించి మరింత విపులంగా వెల్లడయింది. ఆ ఛానల్ ప్రకారం, వైజయంతిమాల తన ఉదయాలను క్రమం తప్పని నడకలతో ప్రారంభిస్తుంది, ఈ అలవాటు శరీరాన్ని అప్రమత్తంగా శక్తివంతం చేస్తుందని ఆమె నమ్ముతుంది. ఆమె ఆరోగ్య దినచర్యలో స్థిరమైన యోగాభ్యాసం ధ్యానం కూడా భాగమై ఉంటాయి, ఆహారం కూడా ఆమె చురుకైన జీవనశైలిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె సాంప్రదాయ శాఖాహార దక్షిణ భారత భోజన శైలికి కట్టుబడి ఉంటారు. ఆమె ఉదయం పూట తరచుగా దోస, ఊతప్పం లేదా ఉప్మా వంటి సుపరిచితమైన అల్పాహారాలను తీసుకుంటారు, అదే విధంగా తాజా పండ్ల రసంతో పాటు. పోషకాలతో నిండిన తేలికపాటి భోజనం చేస్తారు. భోజనంలో సాధారణంగా బియ్యంతో రసం లేదా పప్పు చావల్ వడ్డిస్తారు. సాయంత్రం వేళలో ఆమె పండ్ల రసం లేదా కొద్దిగా పొడి పండ్ల వంటి తేలికపాటి రిఫ్రెష్మెంట్లను ఇష్టపడతారు. రాత్రి పూట ఆహారం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తన డిన్నర్ కూరగాయలతో రోటీ లేదా పప్పు చావల్ లలో ముగుస్తుంది. నమ్మిన వృత్తి పట్ల నిబద్ధత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి నిత్యనూతనంగా ఉంచే అభిరుచులు కలగలిపిన మనిషి వయసుతో సంబంధం లేని ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు అనే దానికి వైజయంతిమాల బాలి జీవితం ఓ నిదర్శనం. -
అవసరమా ‘అఖండ’ కావరం?
‘ఎవర్ని చూసుకునిరా ఆ పొగరు.. అని అడుగుతుంటారు. కానీ నన్ను చూసుకునే నాకు ఆ పొగరు’’ అన్నారు ఇటీవల సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ తాండవం బాక్సాఫీస్ వద్ద తానాశించినట్టుగా తాండవమాడకపోవడం అనే నిజం నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నారో తెలీదు కానీ... ఆయన గుర్తించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారుసినీ పండితులు. వాళ్లు చెబుతున్న ప్రకారం...బాలకృష్ణ ఏమీ స్వయంకృషితోనో, ఏ వారసత్వం లేకుండానో ఎదిగిన నటుడు కాదు. ఇప్పటికీ ఆయన ప్రతీ చోటా స్మరించే తండ్రి పేరు... ఎవరి పుణ్యాన తాను హీరోగా నిలబడగలిగాడో చెప్పకనే చెబుతుంది. మరి బాలకృష్ణకు ఎందుకు ఉండాలి పొగరు? తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్...వీళ్లెవరికీ లేని ప్రత్యేకత ఆయనలో ఏముందని తనను తాను చూసుకోవాలి? తల పొగరు ఉండాలి? తండ్రి వారసత్వంతో పాటు తెలుగు నాట ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం, అలాగే తమ కులమే అన్ని రంగాల్లో ముందుండాలనే కులోన్మాదం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి. అవే ఆయన తన నటనా ప్రతిభకు మించిన స్థాయిని ఆయనకు కట్టబెట్టాయనేది బహిరంగ రహస్యం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నోరు జారినా ఎంతమందిని తూలనాడినా ఆయనపై అదే స్థాయిలో ఎవరూ తిరగబడకపోవడానికి ఆయన నటనా ప్రతిభో లేక తిరుగులేని స్టార్డమ్మో కారణం కాదనీ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గ బలమేననేది తలపండిన ఆ విళ్లేషకుల మాట.దాదాపుగా కొన్ని దశాబ్ధాల పాటు అటు నటనలో గానీ, ఇటు అభిమానధనంలో గానీ చిరంజీవి మెగా స్థాయి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బాలకృష్ణ... ఇటీవల తన వయసు 60 దాటాక కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు దక్కించుకోగలిగారు. దానికి ఆయన సంతోషించవచ్చు... ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. అంతే గానీ ఈ స్వల్పకాలపు విజయాలకే తనకెవరూ సాటిలేరన్నట్టు మిడిసిపాటు తగదు. అది ఇతరుల కన్నా ఆయనకే ఎక్కువ చేటు చేస్తుందని ఆయన గ్రహించాలి. తనను తాను గొప్పగా చెప్పుకుని చెప్పుకునే స్వోత్కర్షల్లో ప్రమాదం ఏమిటంటే.. నిజంగానే తాను గొప్ప అనే భ్రమల్లోకి వెళ్లిపోవడం అదే ఆయన అఖండ తాండవానికి చావు దెబ్బ కొట్టింది.సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాప్ హీరోలు అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అదే సమయంలో విడుదలైన అఖండ(Akhanda 2) సినిమా గురించి బాలకృష్ణ మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం... ‘‘నా సినిమాలకు రేట్లు పెంచనవరం లేదు. పెంచకపోయినా నష్టం రాదు’’ అంటూ చెప్పారాయన. అయితే అదే బాలకృష్ణ రెండవ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి తనను తాను బాక్సాఫీస్ కింగ్ లాగో, పాన్ ఇండియా హీరోగానో భ్రమించారనీ. అవసరానికి తన స్థాయికి మించి నిర్మాతల చేత భారీ పెట్టుబడులు పెట్టించారనేది సినీ పండితుల వ్యాఖ్య. దాంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే జనం ఎగబడి చూస్తారని అనవసర అపోహలు ఏర్పరచుకున్నారంటున్నారు. అయితే సీనియర్ తెలుగు హీరోల్లో అంతో ఇంతో నాగార్జునని తప్ప మరెవరినీ ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోరు అనే నిజం బాలకృష్ణకి తప్ప అందరికీ తెలుసు. ఆ నిజం ఆయనకు కనపడనీయకుండా తల పొగరు కళ్లు మూసేసింది. ఆ ఫలితమే ఉత్తరాదిలో అఖండ తాండవం తాలూకు ఘోర పరాజయం. ఇకనైనా బాలకృష్ణ తన భజనపరుల, కులోన్మాదులను కాక వాస్తవ డిమాండ్ను స్థాయిని గుర్తించి మసలుకుంటే... గతంలో నిర్మాతలకు అందుబాటులో హీరోగా ఆయనకు ఉన్న ఇమేజ్ అయినా కాపడుకుంటారని సినీ మార్కెట్ నిపుణులు అంటున్నారు.. -
కధానాయిక...కదిలేనా ఇక?
కొంతకాలం క్రితం వరకు తెలుగు సినిమాలో మహిళా ప్రధాన చిత్రాలకు తగినంత ఆదరణ ఉండేది. అందుకు తగ్గట్టే వారూ వీరని తేడా లేకుండా విజయశాంతి నుంచి అనుష్క వరకు, చాలా మంది కథానాయికలు తమ మహిళా ప్రధాన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్లను సాధించారు. ఓ వైపు గ్లామర్ చిత్రాలు చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలోనూ రమ్యకృష్ణ లాంటి వారు సత్తా చాటారు. అయితే ఉత్తరాది నుంచి దిగుమతయ్యే గ్లామర్ డోస్ పెరగడం మొదలైన దగ్గర నుంచి కధానాయిక ప్రాధాన్యమున్న సినిమాల జోరు తగ్గడం కూడా మొదలైంది. అదే క్రమంలో కధానాయిక ప్రాధాన్య చిత్రాలు తీయడమే అరుదైపోగా అరకొర గా వచ్చినవి కూడా జనాదరణ పొందలేక పోయాయి. మొన్నటి సమంత శాకుంతలం నుంచి నిన్నటి అనుష్క ఘాటి దాకా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలబడ్డాయి. దీంతో హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలను తీసి మెప్పించే సత్తా టాలీవుడ్ కోల్పోయిందా? లేక చూసే ఆసక్తిని ప్రేక్షకులు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తాయి.ఈ నేపధ్యంలో ఇటీవల విడుదలైన మహిళా ప్రధాన చిత్రాలైన ’8 వసంతాలు’ ’పరదా’ ది గర్ల్ ఫ్రెండ్ బాక్సాఫీస్ ట్రెండ్లను బట్టి చూస్తే, సమస్య ప్రేక్షకుల దగ్గర లేదని సినిమా రూపకర్తల దగ్గరే ఉందని తేలిపోయింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ’8 వసంతాలు’ చిత్రం జూన్ 20న ’కుబేరా’ చిత్రంతో పాటు విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినప్పటికీ, ఈ చిత్రం విడుదలకి ముందు ప్రేక్షకులలో హైప్ని రేకెత్తించడంలో విఫలమైంది. ఫలితంగా, ఇది బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఆ మరుసటి రోజునే అనుపమ పరమేశ్వరన్ నటించిన ’పరదా’ చిత్రం విడుదలైంది. సినిమా కంటెంట్ సంగతి పక్కన పెడితే, మొదటి రోజు వసూళ్లను బట్టి చూస్తే, ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియనే తెలీదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ’గర్ల్ఫ్రెండ్’ ఒక్కటే మరోసారి కధానాయిక ప్రాధాన్యమున్న చిత్రాల విజయాలకు ఊపిరి పోసింది. అంటే జనాన్ని థియేటర్లకు రప్పించడంలో ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్ కూడా ఉపకరించిందని ఒప్పుకోవాలి. ఏదేమైనా ఒక మహిళా ప్రధాన చిత్రం మంచి కాన్సెప్ట్తో తగిన సత్తా కలిగిన నటితో వస్తే, ప్రజలు వాటిని ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది. మరోవైపు ధియేటర్లకు వెళ్లకున్నా, ఓటీటీ వేదికలపై ’8 వసంతాలు’ ’పరదా’ చిత్రాలు చూసిన వారిలో అత్యధికులు ప్రశంసలు కురిపించారు.కాబట్టి మహిళా ప్రధాన చిత్రాల పట్ల ఆదరణ, ఆసక్తి పూర్తిగా లేదని మనం చెప్పలేం. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో, ప్రేక్షకులు సినిమాల్లో నటీనటులు ఎవరనేది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు, కాకపోతే వారు థియేటర్లకు వెళ్ళడానికి మాత్రం కొన్ని షరతులు కలిగి ఉన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అగ్రహీరోలు, పెద్ద బ్యానర్లు, లేదా భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలను మాత్రమే థియేటర్ కోసం ఎంచుకుంటున్నారు. లేదంటే నటీనటులు ఎవరైనప్పటికీ, తక్కువ బడ్జెట్తో నిర్మించినప్పటికీ పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రాలను చూడటానికి మాత్రం థియేటర్లకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేక్షకులను థియేటర్లకు రప్పించేది ఏదో మహిళా ప్రధాన చిత్రాల్లో లోపిస్తోందనేది నిర్వివాదం. అదేంటో సమీక్షించుకుని సరిచేసుకోగలిగితే మరోసారి మహిళా చిత్రాల విజయ పరంపర మొదలు కావచ్చు. -
వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?
చాలామంది కాఫీ తాగడం అనేదాన్ని ఒక అనారోగ్యకరమైన అలవాటుగానే భావిస్తారు. అయితే కాఫీ సేవనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల్లో ఎక్కువ భాగం పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల వల్లనే లభిస్తాయని, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని రిజిస్టర్డ్ డైటీషియన్, ఫుడ్ ట్రైనర్స్ వ్యవస్థాపకురాలు లారెన్ స్లేటస్ అంటున్నారు.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవని, హిస్పానిక్ ఫుడ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు సిల్వియా క్లింగర్ సైతం చెబుతున్నారు. శరీరంలోని అనేక విభిన్న అవయవాలకు మద్దతు ఇస్తుంది. కాఫీ అందించే ప్రధాన ప్రయోజనాలు.. ఓ ఆంగ్ల మీడియా వేదికగా వీరు చెబుతున్న ప్రకారం...–కాఫీ (Coffee) స్వల్పకాలిక ఏకాగ్రతకు సహాయపడటం తో పాటు దీర్ఘకాలంలో ఇది న్యూరోప్రొటెక్టివ్గా కూడా ఉంటుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి సహా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు,డిప్రెషన్, పార్కిన్సన్స్ అల్జీమర్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. – కాఫీ తీసుకోవడం గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల కారణంతో మరణించే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.– కాలేయ వ్యాధి, ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటివి నివారిస్తుంది. అలాగే కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.–కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కాఫీ మితంగా.. ప్రయోజనాలు అమితంగా...ఈ ప్రయోజనాలు లభించాలంటే మితమైన కాఫీ తీసుకోవడం అవసరం. అంటే షుమారుగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. అయితే ఈ పరిమాణం అనేది వ్యక్తుల్ని బట్టి వారి శారీరక స్థాయిలను బట్టి మారవచ్చు.– ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి మూడు లేదా నాలుగు కప్పులు లేదా దాదాపు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ వరకూ ఓకే. దీని వల్ల హాని కంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఎక్కువ.– చాలా మంది విశ్వసించినట్టుగా కాఫీ డీహైడ్రేట్ చేయదు. కెఫీన్ తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉండి ఎక్కువగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. అయితే కాఫీలోని నీటి శాతం ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.–‘చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు తీపి పదార్థాలు లాగా కాకుండా కాఫీ, దానికదే సహజమైనది, కల్తీ లేనిది, అందువల్లే పలు ప్రయోజనాలను కలిగి ఉంది. అదనపు కొవ్వు, కేలరీలు చక్కెరను జోడించడం కాఫీని అధిక కేలరీల పానీయంగా మారుస్తాయి. తద్వారా బరువు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.ఓట్ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్ లేని పాలు అయితే ఓకే. దాల్చిన చెక్క, వనిల్లా లేదా బాదం సారం, తియ్యని కోకో పౌడర్, స్టెవియా, మాంక్ఫ్రూట్ తక్కువ మొత్తంలో తేనె లేదా మాపుల్ సిరప్ వంటి సహజ పదార్ధాలను మేళవించవచ్చు. తక్కువ ఆమ్లత్వం, తియ్యని రుచిని కలిగి ఉండే కోల్డ్ బ్రూ కాఫీని ప్రయత్నించవచ్చు. బ్లాక్ కాఫీని తాగడం దుర్లభంగా భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.కాఫీ తాగడానికి సరైన సమయం..?నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఉదయం పూట కాఫీ తాగడం ఉత్తమం. ‘కాఫీకి ఎక్కువ అర్ధ–జీవితకాలం ఉంటుంది, అంటే‘ఇది చాలా మంది అనుకున్నదానికంటే ఎక్కువ కాలం మన శరీర వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కాఫీని నిలిపివేయాలి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సమయం సహజ కార్టిసాల్ కదలికలకు అంతరాయం కలిగించకుండా శక్తిని పెంచడానికి అనువైనది.చదవండి: కమిట్మెంట్ అంటే అది!వ్యాయామం (Exercise) చేసే ముందు కూడా కాఫీ తాగొచ్చు. ఎందుకంటే ఇది పనితీరు ఓర్పును మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది కడుపులోని పొరలకు ఇబ్బంది కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఈ సమస్యలను నివారించడానికి కాఫీ తాగే ముందు గుడ్లు, అవకాడో టోస్ట్, తృణధాన్యాలు వంటి అల్పాహారం తినాలి. అలాగే భోజనానికి ముందు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరం ఇనుమును గ్రహించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది.(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం) -
సల్మాన్ ఒక్క ఎపిసోడ్కు అందుకునేది.. నాగ్కు మొత్తం సీజన్కు అందుతుంది..
నాటకీయ నామినేషన్ల నుంచి ఊహించని ఎలిమినేషన్ల వరకు, బిగ్ బాస్ అనే రియాల్టీ షో వీక్షకుల్లో ఎల్లప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఆదరణను కాపాడుకుంటూ వస్తోంది. ఈ షో విజయానికి దాని కాన్సెప్ట్తో పాటు దాని హోస్ట్లు కూడా ప్రధాన కారణమే అనేది నిస్సందేహం. ఆధిపత్యం చెలాయించే ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ కావచ్చు, సహజసిద్ధమైన కూల్ అట్రాక్షన్తో నాగార్జున కావచ్చు, పెద్దరికపు ఆప్యాయత కనబరిచే మోహన్లాల్ కావచ్చు...దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షోకు తమదైన ప్రత్యేకతను తీసుకువచ్చారనేది వాస్తవం. అయితే ఆ పెద్ద ఇల్లును అంత బాధ్యతగా నిర్వహిస్తున్న, ఈ సెలబ్రిటీ హోస్ట్ లు తాజా సీజన్లో అందుకున్న పారితోషికం వివరాలు చూద్దామా?సహజంగానే అత్యంత భారీ స్థాయిలో వీక్షకులు ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హిందీ వెర్షన్ హోస్ట్గా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరిలోనూ ముందున్నారు. సుమారు 15 వారాంతాల్లో హోస్ట్గా ఆయన వ్యవహరిస్తారు. మొత్తం 13 సీజన్ల పైగా ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సల్మాన్ ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేశారని వార్తలు వచ్చినప్పటికీ సల్మాన్ దాన్ని కొట్టిపారేశారు. అందుతున్న నివేదికల ప్రకారం, సల్మాన్ ప్రారంభంలో వారానికి సుమారు రూ. 12 కోట్లు పారితోషికం తీసుకున్నారు, ఆ తర్వాత దానిని ఎపిసోడ్కు రూ. 25 కోట్లకు పెంచారు. తాజా సీజన్ బిగ్ బాస్ 16 కోసం ప్రతి ఎపిసోడ్కు రూ. 43 కోట్లకు చేరినట్లు సమాచారం. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తమిళ బిగ్బాస్ రియాలిటీ టీవీ షో 7వ సీజన్కు తీసుకున్న పారితోషికం రూ. 130 కోట్లు అని సమాచారం. అయితే, గత రెండు సీజన్లకు హోస్ట్గా విజయ్ సేతుపతి కొనసాగుతున్నారు. తను కూడా సుమారుగా రూ. 50 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.హిందీ వెర్షన్ విజయం తర్వాత, బిగ్ బాస్ కన్నడ వెర్షన్ 2013లో ప్రారంభమైంది. కన్నడ షో మొత్తం 11 సీజన్లకు కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ సంజీవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గత 2015లో కలర్స్ ఛానెల్తో అతను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఐదేళ్లకు గాను ప్రారంభంలో రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అభిమానులు అతని పారితోషికాన్ని సల్మాన్తో పోల్చడం ప్రారంభించారు. ఇటీవలి సీజన్కు అతని పారితోషికం బాగా పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.దక్షిణాన కేరళలో, మోహన్లాల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ... దాని నాటకీయ ఎలిమినేషన్లు షాకింగ్ ట్విస్ట్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దీని విజయంలో మోహన్లాల్ హోస్టింగ్ నైపుణ్యం ప్రధాన ఆకర్షణగా ఉంది, ఈ మలయాళ వెర్షన్ 2018లో ప్రారంభమై వేగంగా ప్రజాదరణ పొందింది. సీనియర్ నటుడు మోహన్లాల్ మొదటి సీజన్కు రూ. 12 కోట్లు, ఆయన తాజా సీజన్కు సుమారు రూ. 24 కోట్లు అందుకున్నారని అంచనా.తెలుగు వారి అభిమాన హీరో అక్కినేని నాగార్జున వరుసగా బిగ్బాస్ ఆరవ సీజన్కు హోస్ట్గా వ్యవహరించారు. నివేదికల ప్రకారం, ఆయన తొలిదశలోప్రతి ఎపిసోడ్కు రూ. 12 లక్షలు చొప్పున మొత్తం సీజన్కు రూ. 12 కోట్లను అందుకున్నారు.అయితే తాజా సీజన్కు ముందు ఆయనకు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే, తాజా సీజన్ కోసం ఆయన తన ఫీజును అమాంతం 30 కోట్ల రూపాయలకు పెంచినట్లు సమాచారం. ఫరెవర్ కూల్గా, అదే సమయంలో ఖచ్చితత్వంతో వ్యవహరిస్తూ హౌస్లోని వారిని సమన్వయం చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనూ నాగ్ విజయవంతం అవడంతో... ఈ షో పాప్యులారిటీకి ఆయన కీలకంగా మారారు. -
అక్కడ క్రిస్మస్ రోజున..దెయ్యాన్ని కాల్చడం, భోగి మంటలు..
మనలో చాలా మందికి క్రిస్మస్ పండుగ వేడుక అనగానే క్రిస్మస్ చెట్టు లేదా శాంతా క్లాజ్ మాత్రమే కావచ్చు కానీ పలు దేశాల్లో ప్రజలకు మాత్రం ఇంకా చాలా చాలా గుర్తొస్తాయి. కొందరికి దెయ్యం దహనం గుర్తొస్తే మరికొందరికి వీధుల్లో భోగి తరహాలో వేసే మంటలు గుర్తోస్తాయి. ఈ అంతర్జాతీయ పండుగను ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా జరుపుకుంటారు. అలాంటి ఆసక్తికరమైన విశేషాల సమాహారం ఇది..ఐస్లాండ్లో క్రిస్మస్ జానపద కథలు సంప్రదాయాలతో నిండి ఉంటుంది. ఇక్కడి శాంతా క్లజ్ లాగానే అనిపించే దుష్ట సోదరుల సమూహం అయిన యూల్ లాడ్స్ చిన్నారులను అలరిస్తారు. మొత్తం 13 రోజుల పాటు ప్రతి చిన్నారికి రాత్రి వేళల్లో చిన్న చిన్న బహుమతులు అందిస్తారు అది కూడా కిటికీల దగ్గర ఉంచిన బూట్లలో వాటిని పెట్టి వెళ్లిపోతారు. వారి రాక పండుగ సీజన్ అంతటా ఉత్సాహాన్ని సృష్టిస్తుంది.జపాన్లో క్రిస్మస్ ఉల్లాసంగా చాలా ఆధునికంగా ఉంటుంది. నగరాలన్నీ విద్యుత్ కాంతులతో మెరుస్తాయి క్రిస్మస్ ఈవ్ను ఒక రొమాంటిక్ అకేషన్గా భావిస్తారు. దాంతో జంటల సందడి కనిపిస్తుంది. అలాగేక్రిస్మస్ విందులో భాగంగా కెఎఫ్సిని ఆస్వాదించడం అనేది 1970లలో ప్రారంభమైంది. ఈ పండుగ సందర్భంగా కెఎఫ్సి బకెట్ల కోసం కుటుంబాలు ముందస్తుగా భారీ ఆర్డర్లు ఇస్తాయి. అలాగే క్రీమ్ స్ట్రాబెర్రీలతో అలంకరించిన క్లాసిక్ క్రిస్మస్ కేక్ను కూడా వీరు ఆస్వాదిస్తారు.ఇండోనేషియా దేశం ప్రధానంగా ముస్లిం దేశం అయినప్పటికీ, అక్కడి క్రై స్తవ సమాజాలు ఈ పండుగను గొప్పగా వైభవంతో జరుపుకుంటాయి. ఆ దేశంలోని ఉత్తర సుమత్రాలో, బటాక్ జాతీయులు ఈ పండుగ సందర్భంగా మార్బిండా అనే సంప్రదాయాన్ని పాటిస్తారు దీనిలో భాగంగా జంతు బలి కూడా ఉంటుంది. బంధుత్వాన్ని గౌరవించడానికి విందును పంచుకుంటారు. అలాగే ప్రపంచ పర్యాటక కేంద్రమైన బాలిలో, పెంజోర్ బాంబూ పోల్స్తో వీధుల్ని అలంకరిస్తారు. కుటుంబాలు ఇంట్లో తయారుచేసిన వంటకాలను బహుమతిగా పంచుకునే న్గేజోట్ అనే సంప్రదాయాన్ని ఆచరిస్తారు.గ్వాటెమాలాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా లా క్వెమా డెల్ డయాబ్లో పేరిట దెయ్యాన్ని దహనం చేయడం అనే విచిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది. డిసెంబర్ 7న, కుటుంబాలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, దుష్టశక్తులను తరిమికొట్టడానికి అదృష్టాన్ని స్వాగతించడానికి పాత చెత్తతో పాటు దెయ్యం ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మను కాల్చివేస్తారు. వీధులు భోగి మంటల తరహాలో మంటలు, సంగీతం సమావేశాలతో వీధులన్నీ కళకళలాడతాయి. ఈ సీజన్ అర్ధరాత్రి వేడుకల్లో బాణసంచా కుటుంబ విందులతో కొనసాగుతుంది,గ్రీస్ పండుగ పడవ సంప్రదాయం గ్రీస్లో కరవాకి అని పిలిచే రంగురంగుల చెక్క పడవలు గ్రీస్ సముద్ర వారసత్వాన్ని ప్రతిబింబించే పండుగ చిహ్నాలుగా వెలిగిపోతాయి. క్రిస్మస్ సందర్భంగా, పిల్లలు ఇంటి నుంచి ఇంటికి వెళ్లి కలంద అనే సాంప్రదాయ కరోల్లను పాడుతూ, త్రిభుజాలు లేదా డ్రమ్స్ వాయిస్తారు. ఇళ్ళు మెలోమకరోనా (సాంప్రదాయ గ్రీకు క్రిస్మస్ కుక్కీలు) వంటి తేనె బిస్కెట్ల సువాసనతో నిండిపోతాయి, కుటుంబాలు క్రిస్టోప్సోమో (క్రీస్తు రొట్టె)ను ప్రతీకాత్మక విందు గా కాలుస్తాయి(చదవండి: WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్లో హాట్టాపిక్గా అశ్వగంధ..! ఇన్ని లాభాలా..?) -
ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?
వణికించే చలిలో వెచ్చగా మారడానికి చాలా మంది తేనీటి మీదే ఆధారపడతారు. మిగిలిన కాలాల్లో రోజుకి ఒకటి రెండు సార్లు మించి తాగే అలవాటు లేనివాళ్లు కూడా వింటర్లో టీ హంటర్స్గా మారిపోతారు. ఎక్కువ సార్లు టీ లేదా కాఫీ తాగడం ప్రారంభిస్తారు.కానీ ఈ శీతాకాలపు అలవాటు మన శరీరంపై, దాని పనితీరుపై ఊహించని దుష్ప్రభావాలను చూపుతుందని రాయ్పూర్లోని ఎయిమ్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజురీ సర్జన్ డాక్టర్ దుష్యంత్ చౌహాన్ అంటున్నారు. ఆయన ఇటీవల రాసిన ఓ ఇన్స్ట్రాగామ్ పోస్ట్లో ఈ సీజన్లో ఎడాపెడా టీ తాగేయడం ఎంతగా ఆరోగ్యపరమైన అనర్ధాలు తెస్తుందో వివరించారు మితంగా తీసుకోవడం ఎందుకు ముఖ్యమో కూడా తెలియజేశారు.వేడి పానీయాలు ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న మనం ఊహించని సంబంధాన్ని డాక్టర్ చౌహాన్ హైలైట్ చేశారు. చల్లని వాతావరణంతో కలిపినప్పుడు అధిక కెఫిన్ కీళ్ల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయన వివరిస్తున్నారు. ‘‘టీ వేడిగా ఉంటుంది, కానీ అది మీ ఎముకలను ‘చల్లబరుస్తుంది’. అని చెబితే అది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం అంటున్నారాయన. శీతాకాలంలో చాలా మంది టీ లేదా కాఫీ తీసుకునే డోస్ పెంచడంతో, మోకాళ్ల లోపల మృదులాస్థి మరింత దుర్బలంగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఆయన చెబుతున్న ప్రకారం...‘‘ మోకాళ్ల లోపల మృదులాస్థి రెండు ఎముకల మధ్య ఉండే పొర, ఎండిపోవచ్చు. ఇది కీళ్లలో సున్నితత్వాన్ని మొద్దుబారుస్తుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దినప్పుడు ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది శీతాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. అయితే ఈ డీ హైడ్రేషన్ గుర్తించబడదు. చల్లని వాతావరణం నుంచి టీ, కాఫీలు తక్షణ ఓదార్పునిచ్చినప్పటికీ, శరీరానికి సరళత కీళ్ల పనితీరుకు అవసరమైన ద్రవాలను అవి భర్తీ చేయలేవు మనం త్రాగేవి మన ఎముకలు కీళ్లను ప్రభావితం చేస్తాయని చాలా మంది గ్రహించరు .అయితే టీని ఆస్వాదించవచ్చు, కానీ దానితో పాటు తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. ‘‘హైడ్రేట్గా ఉండటం వల్ల డీహైడ్రేషన్ను నివారించవచ్చు, ఇది శీతాకాలంలో సర్వసాధారణం ఆరోగ్యకరమైన కీళ్లను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది". వేడి పానీయాలను ఆస్వాదిస్తున్నప్పుడు తగినంత నీరు తీసుకోవడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన మేలు చేస్తాయి.ఆర్థోపెడిక్ ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ పి సి జగదీష్ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు, ‘‘మృదులాస్థి అధిక శాతం నీటితో తయారవుతుంది దాని స్థితిస్థాపకత, షాక్ శోషణ సామర్థ్యం మృదులాస్థి ఉపరితలాన్ని నిర్వహించడానికి తగినంత హైడ్రేషన్పై ఆధారపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్కి గురైనప్పుడు, మృదులాస్థి దాని అంతర్గత నీటి శాతాన్ని కోల్పోతుంది, ఇది కీళ్లను కుషన్ చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కదలిక సమయంలో ఇబ్బందులను పెంచుతుంది. అయితే కెఫీన్ స్వయంగా నేరుగా కీళ్లను దెబ్బతీయదని, అది తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని తద్వారా తక్కువగా నీటిని తీసుకునే అలవాటున్న వ్యక్తులలో ద్రవ నష్టాన్ని బాగా పెంచడానికి దోహదం చేస్తుందని ఆయన చెబుతున్నారు.. శీతాకాలంలో, నీటి తీసుకోవడం తగ్గిస్తూ దానిని నీటిని టీ లేదా కాఫీతో భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నారు, అక్కడే నిజమైన ప్రమాదం దాగి ఉంది.రోజుకు పలు కప్పుల చాయ్ లేదా కాఫీ తాగే వ్యక్తులకు, శరీర బరువు కార్యాచరణ స్థాయిని బట్టి, మొత్తం రోజువారీ ద్రవం తీసుకోవడం 2 నుంచి 2.5 లీటర్ల వరకు ఉండాలనేది సాధారణ సలహా అని డాక్టర్ జగదీష్ చెప్పారు. ‘తగినంత హైడ్రేషన్ను నిర్వహించడానికి ప్రతి కెఫిన్ పానీయం ఒక గ్లాసు సాదా నీటితో సమతుల్యం చేసుకోవాలి అని ఆయన సూచిస్తున్నారు.శీతాకాలపు కీళ్ల నిర్వహణలో హైడ్రేషన్ ఒక భాగం మాత్రమే నంటున్న ఆయన. ‘క్రమం తప్పకుండా కదలిక వ్యాయామాలు, కీళ్ల చుట్టూ కండరాల బలాన్ని నిర్వహించడం, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం శరీరాన్ని వెచ్చగా ఉంచడం అన్నీ మెరుగైన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారు తరచుగా నడక, సైక్లింగ్ లేదా నీటి ఆధారిత వ్యాయామాలు వంటి తక్కువ ప్రభావ కార్యకలాపాల ద్వారా ప్రయోజనం పొందుతారని, అలాగే విటమిన్ డి, కాల్షియం ఒమేగా–3 అధికంగా ఉండే ఆహారాలను తగినంతగా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు.(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..) -
సోలో మహిళా బైకర్ ...సరికొత్త రికార్డ్...
పురుషులతో సమానంగా బైక్ రైడింగ్లో మహిళలు దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రికార్డులు తిరగరాస్తున్నారు. అదే క్రమంలో పూణేకు చెందిన సోలో ఉమెన్ బైకర్ ఐశ్వర్య నాగర్కర్(32) అలియాస్ సఖి–రైడర్ని తన 350సిసి బైక్పై స్వర్ణ చతుర్భుజి హైవేపై ప్రయాణం (గోల్డెన్ క్వార్డిలేటరల్ హైవే జర్నీ) సాగిస్తున్నారు. యంగెస్ట్ ఇండియన్ మదర్ గా గతంలో ఏ మహిళా సోలో రైడర్ సాధించిన ఘనత కాకపోవడం గమనార్హం. ఈ ఘనత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బూన్ ఆఫ్ రికార్డ్లలో నమోదు కానుంది. గత 6వ తేదీన పూణెలో ప్రారంభమైన ఈ జర్నీ దాదాపుగా 6వేల కిమీ కొనసాగనుందని బెంగళూరు, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం నగరాల మీదుగా సాగి తూర్పు ఉత్తర భారత ప్రాంతాల్లో పూర్తి సర్క్యూట్ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 22న పూణేకు తిరిగి చేరుకుంటానని గృహిణి, 8ఏళ్ల కూతురుకి తల్లి కూడా అయిన ఐశ్వర్య చెప్పారు. బైక్ రైడ్ కొనసాగిస్తూనే ‘సాక్షి’తో ముచ్చటించిన ఆమె పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...తెలుగువాళ్ల ఆదరణ మరువలేను..నా బైక్ జర్నీ ప్రారంభమైన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ఒంగోలుకు చేరుకున్నాను. అలాఅలా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం పట్టణాల మీదుగా ప్రయాణించాను. ఈ సందర్భంగా పలు చోట్ల స్థానికులతో సంభాషించాను ప్రతీ చోటా అక్కడి సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించాను. నన్ను స్వంత ఇంటి మనిషిలా ఆదరించిన వారి ఆత్మీయత మరచిపోలేను. నా జర్నీ సందర్భంగా ఇంకా చాలా మంది మహిళలు సంకోచాలతో తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారని అర్ధమైంది. సేవతో మిళితం చేస్తూ...నా బైక్ రైడింగ్ ఇతరుల కంటే వేగంగా ప్రయాణించడమో, రికార్డుల సృష్టికే పరిమితం కాదు... ఇతరులు నా కోసం నిర్దేశించిన పరిమితులను దాటి ప్రయాణించడం నా లక్ష్యం. దీనిని సేవతో మిళితం చేస్తూ సాగుతున్నా. మహారాష్ట్రలోని ఫోఫ్సండి జిల్లా పరిషత్ పాఠశాల సహా పలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధుల కు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. వారికి ఆర్ధిక చేయూత అందించేందుకు విరాళాలు సేకరించడానికి రైడర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహోద్యోగులను సమీకరిస్తుంటాను.కూతురి కోసం మట్టి సేకరణ...నా ఈ తాజా ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ప్రతి రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందో గమనించాను అంతేకాదు నేను ప్రయాణించే ప్రతి రాష్ట్రం నుంచి గుప్పెడు మట్టిని సేకరిస్తానని నా కుమార్తెకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశా. ఎందుకంటే మన దేశం సంస్కృతిలో... ఆహారంలో, భాషలో, సుసంపన్నమైనది. కానీ దేశపు నిజమైన ఆత్మ దాని మట్టిలోనే ఇమిడి ఉంటుందని నా అభిప్రాయం నేను ఆమెకు ఈ మట్టి జాడీలను ఇచ్చినప్పుడు, భారతదేశం మొత్తం ఆమె ఇల్లేనని... ఆకాశమే ఆమె హద్దు అనే నమ్మకాన్ని కూడా బహుమతిగా ఇస్తాను కేవలం మట్టి మాత్రమే కాదు, నేను ప్రయాణించే రహదారుల నుంచి ధైర్యం, నేను స్పృశించే భూమి నుంచి ఆశీర్వాదాలు, నేను కలిసే వ్యక్తుల నుంచి జ్ఞాపకాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణం కిలోమీటర్ల లెక్క గురించి కాదు, ఇది నా దేశంతో అనుసంధానం కావడం గురించి, అది పంచిన ప్రేమను ఇంటికి తీసుకురావడం గురించి.మహిళకు స్ఫూర్తిగా..నేను నా కోసం, నా కూతురి కోసం, తాను కూడా ఎవరూ ఊహించనంత దూరం ప్రయాణించగలనని నిరూపించే ప్రతి మహిళ కోసం ఈ రైడ్ చేస్తున్నాను. ఒక మహిళ బలం పరిమితుల ద్వారా నిర్వచించలేం, వాటిని ఛేదించే ధైర్యం ద్వారా మాత్రమే నిర్వచించవచ్చు. ఇది వారికి చూపించడమే నా లక్ష్యం. నేను సంచరించే ప్రతి రహదారి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా భయం లేకుండా సంచరించే ప్రపంచం వైపు ఒక అడుగు. ఇతర మహిళలు వారి శక్తిని విశ్వసించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునేలా నా ప్రయాణాల ద్వారా, ప్రేరేపించాలనేది నా ఆలోచన. నా మోటార్సైకిల్ కేవలం ఒక యంత్రం కాదు అది నా స్వరం, నా స్వేచ్ఛ, సాధికారత పట్ల నా నిబద్ధత. ప్రతి మైలుతో, మహిళలు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరనే సందేశాన్ని నాతో మోసుకెళ్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, నా భర్త మద్దతు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు. నేను 15 రోజులు ఇంట్లో ఉండడం లేదంటే ఇలా రోడ్ల మీద ప్రయాణిస్తుంటే మా కూతురి బాగోగులు తాను చూసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు , నా అత్తమామలు కూడా తమ చేతనైనంతగా నాకు మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ప్రతీ మహిళ తనను తాను నిరూపించుకునేందుకు కుటుంబం అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.::Satya Babu -
‘అండర్ గ్రౌండ్కి వెళ్లడానికి రెడీ’ అన్న హీరోయిన్
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్సిరీస్లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది. ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది. ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది. గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె. -
కాలుష్యపు కోరల్లో హైదరాబాద్: త్వరలోనే మరో ఢిల్లీ కానుందా?
ఢిల్లీ పొగమంచు తెలుగు రాష్ట్రాలకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ హైదరాబాద్ కూడా ఇప్పుడు కాలుష్యపు ముప్పును ఎదుర్కొంటోంది, ఈ సంవత్సరం మొదటిసారిగా గాలి నాణ్యత (ఏక్యుఐ) ప్రమాదకరమైన ప్రాంతంలోకి జారుకుంటోంది. వాస్తవానికి, గత ఏడు రోజులుగా నగరపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. బెంగళూరు, చెన్నై కంటే అధ్వాన్నంగా మారినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.గత నవంబర్ 28న నగరం సంవత్సరంలోనే అత్యంత కాలుష్యపు గాలి తాకిడిని చవి చూసింది. కాలుష్య స్థాయిలు ‘తీవ్రమైన‘ స్థితికి దగ్గరగా చేరుకోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు విషపూరిత పొగమంచుతో కప్పబడిపోతున్నాయి. అనేక స్టేషన్లలో గాలి నాణ్యత సూచిక (ఏక్యుఐ) 200 దాటింది. ఈ పరిమితి, రోజుకు 8–10 సిగరెట్లు తాగడం వల్ల కలిగే నష్టానికి సమాన స్థితిని ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏక్యుఐ 209కి పెరిగింది, ఇది కేవలం నాలుగు రోజుల్లోనే రెట్టింపు అయింది. ఐఐటిహెచ్ కంది 107 నుంచి 195కి పెరిగింది, అయితే గతంలోని 110 రీడింగ్ల తర్వాత సనత్నగర్ పైపైకి ఎగబాకి 206కి చేరుకుంది. జూ పార్క్, ఐడిఎ పాశమైలారం ఒక్కొక్కటి 204ను నివేదించాయి. పటా¯Œ చెరు కూడా 206 వద్ద అధిక–ప్రమాదకర ప్రాంతాలలోనే ఉంది.ఇటీవల వరకు, నగరం ఒక మోస్తరు కాలుష్య స్థాయిల చుట్టూ ఉండేది, కానీ ఇప్పుడు ఊపిరితిత్తులను ఒత్తిడికి గురిచేసే, గుండె ఒత్తిడిని ప్రేరేపించే దీర్ఘకాలిక శ్వాసకోశ హానిని వేగవంతం చేసే పరిస్థితులను నగరవాసులు ఎదుర్కొంటున్నారని ఆరోగ్య నిపుణుల హెచ్చరిస్తున్నారు.నగరానికి చెందిన ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ అరుణ రెడ్డి మాట్లాడుతూ, ‘అన్ని విధాల ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా శ్వాస క్రియ ఇబ్బందిగా అనిపించే‘ దశలోకి నగరం ప్రవేశిస్తోందని అన్నారు. బయట తిరగడం, సరైన రక్షణ లేకుండా సంచరించడం ఇతర బహిరంగ కార్యకలాపాలు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు తీవ్రమైన బాధ కలిగించేందుకు దారితీయవచ్చని ఆమె హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్ శివార్లలో వాహనాల విస్త్రుతి, నిర్మాణ ధూళి, పారిశ్రామిక ఉద్గారాలు పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ పెరుగుదల సంభవిస్తోంది. ఉపరితలానికి దగ్గరగా కాలుష్య కారకాలను బంధించడం ద్వారా కాలానుగుణ వాతావరణ నమూనాలు ఆ ప్రభావాన్ని బలోపేతం చేశాయి. ఐఎండి శాస్త్రవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ, పట్టణ ఉష్ణ–ద్వీప ప్రభావం వల్ల నగరంలో పెరుగుతున్న వేడి ‘భూస్థాయి ఓజోన్ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది ఇది మరో ప్రమాద పొరను జోడిస్తోంది’’ అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నివాసితులు బయట గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని, బయటకు వచ్చేటప్పుడు మాస్క్లు ధరించాలని మరియు అటువంటి పరిస్థితులలో త్వరగా తీవ్రమయ్యే లక్షణాలను పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. -
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి. -
ఆ ఇద్దరు హీరోల స్నేహ చిహ్నం ఈ పురాతన బైక్.. స్పెషల్ ఏంటంటే..?
షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్–ధర్మేంద్ర) మోటార్ సైకిల్ బాలీవుడ్లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్ సైకిల్ 1942 బిఎస్ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్ సైకిల్ తిరిగి వెలుగులోకి వచ్చింది.ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఎఫ్ఎఫ్ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ’డిఐపిఆర్) కమిషనర్ ఎడిజిపి హేమంత్ నింబాల్కర్ అంటున్నారు.ఈ చిత్రంలో వినియోగించిన బైక్ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్పర్సన్ ఎల్కె అతిక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్ నింబాల్కర్ వివరించారు. ఈ బిఎస్ఎ మోటార్సైకిల్ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్సైకిల్ను బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. ఈ బైక్స్ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్ సైన్యం ఈ మోడల్ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్ నంబర్ ఎం 20 116283 , ఇంజిన్ నంబర్ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్పవర్ను అందించే 500 సిసి సింగిల్–సిలిండర్ సైడ్–వాల్వ్ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్ ఇంధన ట్యాంక్తో వచ్చింది. దీనిలో ముందు భాగంలో గిర్డర్ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్బార్లు ఫుట్రెస్ట్లను కాన్వాస్లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు. -
వణికించే చలి...వేడినీటితో స్నానం... ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?
శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు. నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...ప్రయోజనాలున్నాయి...వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుందిదుష్ప్రభావాలెన్నో...చాలా మందికి ఈ సీజన్లో అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని, పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తామర లేదా సోరియాసిస్ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.అంతేకాదు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది కాదు. నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?ఏం చేయాలి?నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మాయిశ్చరైజింగ్ హెయిర్ కండిషనర్ను అప్లై చేయాలి.పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి. -
గ్లోబల్ రేంజ్లో మన సినిమా.. ప్రతిభకు వేదికగా 'ఇఫీ'
56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ 2025) రెండో రోజు వేడుకల్లో భాగంగా ప్రపంచ సినీ రంగం, కొత్త తరం చిత్రకారుల ప్రతిభ, ఉన్నత స్థాయి దౌత్య చర్చలు, సాంస్కృతిక సంభాషణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మాస్టర్క్లాస్ సిరీస్, క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంఓటి) 2025 ఆవిష్కరణ, అంబాసిడర్ల రౌండ్టేబుల్, ప్రత్యేక సంభాషణ కార్యక్రమాలు, స్టార్-స్టడ్డెడ్ రెడ్ కార్పెట్ వంటి ముఖ్య కార్యక్రమాలు ఇఫీ అంతర్జాతీయ ప్రతిష్ఠను మరో మెట్టు పైకి తీసుకెళ్లాయి.మాస్టర్క్లాస్ సిరీస్ ప్రారంభంసమాచార,ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. ఎల్. మురుగన్ గోవాలోని కళా అకాడమీ లో ఇఫీ 2025 మాస్టర్క్లాస్ సిరీస్ను ప్రారంభించారు. ముఖ్య అధికారులు, ప్రసిద్ధ చిత్రపరిశ్రమ వ్యక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈసారి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, కెనడా వంటి దేశాల ప్రతినిధులు ఈ విభాగంలో పాల్గొంటున్నారు.సీఎంఓటి 2025 ప్రారంభం – 48 గంటల ఫిల్మ్మేకింగ్ చాలెంజ్ఐదో ఎడిషన్ క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సి ఎం ఓ టి) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 125 మంది యువ చిత్ర రూప కర్తలు పాల్గొని 48 గంటల ఇంటెన్సివ్ ఫిల్మ్ మేకింగ్ చాలెంజ్ను ఆసక్తి గా మార్చనున్నారు డా. మురుగన్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియ సృజనాత్మకతకు కొత్త రూపాలు ఇస్తుందని పేర్కొన్నారు. ముంబైలో కొత్తగా ప్రారంభమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ వంటి కార్యక్రమాలు భారత క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేస్తాయన్నారు.రెడ్ కార్పెట్ సెగ్మెంట్ – తారల సందడిఇఫీ రెడ్ కార్పెట్ సెగ్మెంట్ రెండో రోజూ ప్రేక్షకాదరణ పొందింది. ప్రపంచ, ఆసియా, భారత ప్రీమియర్లతో పాటు కమల్ హాసన్, శివ కార్తికేయన్, సాయి పల్లవి సహా ప్రముఖ సినీ తారల రాకతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. దర్శకులు, నటులతో ప్రేక్షకులను దగ్గర చేసే వేదికగా ఇది నిలిచింది.అంబాసిడర్ల రౌండ్టేబుల్.. సహకారానికి కొత్త మార్గాలుఇఫీ 2025లో భాగంగా భాగస్వామ్య దేశాల రాయబారులతో అంబాసిడర్ల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది.సహ-నిర్మాణాలు, టెక్నాలజీ భాగస్వామ్యం, నియంత్రణ సౌలభ్యాలపై విస్తృత చర్చలు జరిగాయి.సమాచార & ప్రసార శాఖ కార్యదర్శి సoజయ్ జాజు మాట్లాడుతూ, భారత్ గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా ఎదుగుతోందని అన్నారు. డా. మురుగన్ మాట్లాడుతూ సహ-నిర్మాణం భవిష్యత్ ఆడియో-విజువల్ సహకారానికి కీలక బలం అవుతుందని పేర్కొన్నారు.అదే విధంగా, విఎ ఫ్ ఎక్స్, యానిమేషన్, పైరసీ నిరోధక చర్యలు, మంత్రిత్వ శాఖ సమన్వయంతో 2025 నాటికి భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగం 31.6 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని వివరించారు.ఆకట్టుకున్న ముజాఫర్ అలీ, షాద్ అలీ ప్రత్యేక సంభాషణప్రముఖ సినీ దర్శకులు ముజాఫర్ అలీ, షాద్ అలీల మధ్య జరిగిన ప్రత్యేక ఇన్ కన్సర్వేషన్ సెషన్ ప్రేక్షకులను అలరించింది. రవి కొట్టరకరా సన్మానం అనంతరం జరిగిన ఈ సంభాషణలో భారతీయ సినిమా తరతరాల మార్పు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, కళాత్మక పరిణామంపై విశేష చర్చ సాగింది -
IFFI 2025: రజనీకాంత్ కి 50ఏళ్లు... భానుమతికి వందేళ్లు....
56వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది, ఇందులో విభిన్న రకాల సినిమాల ప్రదర్శనతో, సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక అభినందన కార్యక్రమంతో పాటు పలు కొత్త టెక్నాలజీ–ఆధారిత ఈవెంట్లు ఉంటాయి.ముఖ్యాంశాలు👉 గ్లోబల్ ఫిల్మ్ షోకేస్: ఈ ఉత్సవంలో 81 దేశాల నుండి 240 కి పైగా సినిమాలు ప్రదర్శించబడతాయి, వీటిలో 13 ప్రపంచ ప్రీమియర్లు, అనేక అంతర్జాతీయ ఆసియా ప్రీమియర్లు ఉన్నాయి.👉50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముగింపు వేడుకలో ప్రముఖ నటుడు రజనీకాంత్ను సత్కరిస్తారు, ఇది ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ. ఆయన సినిమా లాల్ సలామ్ ప్రదర్శిస్తారు.👉 జపాన్ ’కేంద్రీకరణ దేశం’గా , స్పెయిన్ ’భాగస్వామి దేశం’గా ఆస్ట్రేలియా ’స్పాట్లైట్ దేశం’గా వ్యవహరిస్తున్నాయి, ఈ దేశాల నుంచి క్యూరేటెడ్ ఫిల్మ్ విభాగాలు ఉంటాయి.👉ఈ ఉత్సవంలో భారతీయ సినిమా దిగ్గజాలు గురుదత్, రాజ్ ఖోస్లా, రిత్విక్ ఘటక్ భూపేన్ హజారికా, సలీల్ చౌదరి లతో పాటు మన తెలుగు సినీరంగానికి చెందిన దివంగత అద్భుత నటి పి. భానుమతి శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఇదే ఫెస్టివల్లో భాగంగా గత ఏడాది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు జరిగిన విషయం తెలిసిందే.👉పనోరమా విభాగం భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది, ఇందులో 25 చలనచిత్రాలు, 20 నాన్–ఫీచర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినీ ఉత్సతవంలో తమిళ చిత్రం అమరన్ ప్రారంభ చలనచిత్రంగా, కాకోరి ప్రారంభ నాన్–ఫీచర్ చిత్రంగా ఉంటాయి.👉నూతన దర్శకుడి ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ కోసం పోటీలో భారతదేశం విదేశాల నుంచి ఏడుగురు తొలిసారి చిత్ర నిర్మాతలు పాల్గొంటారు, సినిమాలోకి కొత్త వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో‘ (సిఎమ్ఒటి) నిర్వహిస్తున్నారు, దీనిలో భాగంగా 124 మంది యువకులు 48 గంటల చిత్రనిర్మాణ సవాలులో పాల్గొంటారు.👉మాస్టర్ క్లాసెస్ – వర్క్షాప్లు ప్రధానంగా ఉంటాయి. విధు వినోద్ చోప్రా, ఆమిర్ ఖాన్, అనుపమ్ ఖేర్ , బాబీ డియోల్ వంటి ప్రఖ్యాత సినీ ప్రముఖులు 21 మాస్టర్ క్లాసెస్ , ‘ఇన్–కన్వర్సేషన్‘ సెషన్ లను నిర్వహిస్తారు.👉 ‘సినిమాఏఐ హ్యాకథాన్ పేరిట తొలిసారిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సినిమాటిక్ పృజనాత్మకత కలయికను అన్వేషించే హ్యాకథాన్, ఏఐ ఫిల్మ్ ఫెస్టివల్ విభాగంతో పాటు ప్రారంభిస్తారు.👉‘ఇఫెస్టా‘ పేరుతో సాంస్కృతిక కోలాహలం మరో ఆకర్షణ. ప్రధాన ఉత్సవానికి సమాంతరంగా ’ఇఫెస్టా’ నడుస్తుంది. యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిగి ఉన్న ఒక శక్తివంతమైన వినోద జోన్ గా ఇది ఉంటుంది.👉దక్షిణాసియాలో అతిపెద్ద ఫిల్మ్ మార్కెట్ ఫిల్మ్ బజార్:, వేవ్స్ ఫిల్మ్ బజార్ 19వ ఎడిషన్, ఉత్పత్తి, పంపిణీ అమ్మకాల కోసం 300 కంటే ఎక్కువ ఫిల్మ్ ప్రాజెక్ట్లతో సృష్టికర్తలు, పరిశ్రమలు. ప్రేక్షకులను కలుపుతుంది. -
అతను నిద్రపోయి అరవైఏళ్లు దాటింది.. ! వైద్య ప్రపంచానికే అంతుచిక్కని మిస్టరీ..
వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్స్లోని ఒక మారుమూల ప్రశాంతమైన గ్రామం లో.. 81 ఏళ్ల రైతు థాయ్ న్గోక్ నివసిస్తున్నాడు. అతని కథ ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలను మాత్రమే కాదు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే సడలి, వడలిపోయే సాధారణ మనుషుల ధోరణికి భిన్నంగా ఈ రైతు జీవితం ఉండడమే ఈ ఆశ్చర్యాలకు కారణం. ఒకటీ రెండూ కాదు ఏకంగా 62 ఏళ్ల నుంచీ ఈ తాత కళ్లు మూతపడలేదట.గత 1962 నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని న్గోక్ పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధంలో తీవ్రమైన జ్వరం నుంచి కోలుకున్న తర్వాత, 20 సంవత్సరాల వయసులో అతనికి ఈ అసాధారణ పరిస్థితి ప్రారంభమైంది. జ్వరం తగ్గింది కానీ, అతని నిద్ర సామర్థ్యం తిరిగి రాలేదు. ఆరు దశాబ్దాల క్రితం అధిక జ్వరం తర్వాత తన నిద్రలేమి ప్రారంభమైందని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్గోక్ గుర్తుచేసుకున్నాడు. ‘నేను మందులు తీసుకున్నాను, ఇంటి చిట్కాలు ప్రయత్నించాను, నిద్రపోవడానికి మద్యం కూడా తాగాను, కానీ ఏదీ పని చేయలేదు.‘ అంటూ చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు పొరుగువారు కూడా ఇన్ని సంవత్సరాలలో అతను ఎప్పుడూ నిద్రపోవడం తాము చూడలేదని చెబుతున్నారు.అయినప్పటికీ, న్గోక్ అసాధారణంగా అందరిలాగే చురుకైన జీవితాన్ని గడుపుతున్నాడు. ప్రతిరోజూ, అతను తన పొలానికి వెళ్తాడు, భారీ బరువులు ఎత్తుతాడు, రైస్ వైన్ తయారు చేస్తాడు పొరుగువారితో చాట్ చేస్తాడు. మనుగడ కు మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనదని భావించే ప్రపంచంలో, అతని కథ మానవ జీవశాస్త్రం గురించి సైన్స్ మనకు చెప్పే ప్రతిదానినీ సవాలు చేస్తుంది.మీడియా నివేదికల ప్రకారం, పలువురు వైద్యులు ఆ గ్రామాన్ని సందర్శించి న్గోక్ ను చాలాసార్లు పరీక్షించారు అతనికి ఎటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు లేవని కనుగొన్నారు. అతని రక్తపోటు, గుండె. మెదడు అన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. అదే వైద్య నిపుణులను కలవరపెడుతుంది, ఎందుకంటే జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి అంతర్గత అవయవాల పనితీరు కోసం శరీరం విశ్రాంతిపై ఆధారపడటం వల్ల మానవులు నిద్ర లేకుండా కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం జీవించలేరని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి.గత 2023లో, అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్సీక న్గోక్ ఇంటికి వెళ్లాడు. అతనితో గడిపిన బిన్సీ్క, న్గోక్ కార్యకలాపాలను నిశితంగా గమనించాడు తన పొలాలకు వెళ్లి పనిచేయడం, రైస్ వైన్ తయారు చేయడం.. అవన్నీ అయిపోయాక అతను నిశ్శబ్దంగా, పూర్తిగా మేల్కొని కూర్చోవడం చూశాడు. పెద్ద మొత్తంలో మద్యం సేవించిన తర్వాత న్గోక్ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు గంటలు విశ్రాంతి పొంది ఉండవచ్చని బిన్సీక తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నాడు, అయితే ఇది వైద్యపరంగా ఎప్పుడూ నిర్ధారితం కాలేదు. విచిత్రమేమింటే... న్గోక్ రోజువారీ అలవాట్లు కూడా ఆరోగ్యకరమైనవి కావు...పైగా ఆందోళనకరంగా ఉంటాయి. డ్రూ బిన్సీక వీడియో ప్రకారం, అతను దాదాపు రోజుకు అర లీటరు రైస్ వైన్ తీసుకుంటాడు, దాదాపు 70 సిగరెట్లు తాగుతాడు. అయినప్పటికీ అతను శారీరకంగా చురుకుగా ఉంటాడు, వ్యవసాయం చేస్తూనే ఉంటాడుసాయంత్రం తర్వాత విశ్రాంతి తీసుకునే గ్రామంలోని ఇతరుల మాదిరిగా కాకుండా, తన రాత్రులను పనిలో లేదా ఆలోచనలో న్గోక్ గడుపుతాడని స్థానికులు చెబుతున్నారు. అతని ఇలాంటి పరిస్థితి అతన్ని ఇప్పుడు ప్రపంచ ఉత్సుకతగా మార్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్గోక్ కథ, విస్మయం, ప్రశంస సానుభూతి మిశ్రమాన్ని రేకెత్తించింది. కొంతమంది ఆన్లైన్ వినియోగదారులు అతని బలం, ఉత్పాదకతను ప్రశంసిస్తూ, ‘నేను చనిపోయినప్పుడు నిద్రపోతాను‘ అనే నానుడిని న్గోక్ మరొక స్థాయికి తీసుకెళ్లాడని చమత్కరించారు. మరికొందరు అతని పరిస్థితిని యుద్ధ గాయం తాలూకు శాశ్వత ప్రభావంగా, విషాదకరమైన జ్ఞాపకంగా పరిగణించారు, వియత్నాం యుద్ధం ప్రసాదించిన బాధాకరమైన ఒత్తిడికి అతని నిద్రలేమికి ముడిపడి ఉండవచ్చని భావిస్తున్నారు. ‘ఇది యుద్ధం తాలూకు శాశ్వత ప్రభావాలను చూపిస్తుంది అనుభవజ్ఞులు ఏమి అనుభవిస్తారో వెలుగులోకి తెస్తుంది. ఈ వ్యక్తి తన నిద్రలేని సంవత్సరాలలో అద్భుతమైన పని చేశాడు, కష్టపడి పనిచేస్తూ తన అద్భుతమైన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు(చదవండి: 'ఆకాశమంత ప్రేమ' ఈ నాన్నది..! కూతురు కోసం ఏకంగా...)) -
రూ. 240 కోట్ల విజేత: అమ్మానాన్నల కలలు తీరుస్తా...
యుఎఇ లాటరీలో తొలిసారిగా దిర్హామ్ 100 మిలియన్ (రూ. 240 కోట్లు) గెలుచుకున్న వ్యక్తిగా నిలిచిన తెలంగాణకు చెందిన 29 ఏళ్ల అనిల్కుమార్ బొల్లా తన అదృష్టాన్ని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలో ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్ ఐటీ రంగంలో పనిచేయడానికి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం అబుదాబికి వెళ్లాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు, తరువాత ఉద్యోగం కోసం అబుదాబికి వెళ్లే ముందు ప్రభుత్వ పాఠశాలలో ఎలా చదువుకున్నాడో గుర్తుచేసుకుంటూ’ఒక టికెట్ నా జీవితాన్ని మార్చివేసింది’ అని ఈ లాటరీ విజేత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనందంగా చెప్పాడు. తనకు విజయాన్ని అందించిన టికెట్ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉందని, ఎందుకంటే దానిలో తన తల్లి పుట్టిన తేదీని నంబర్ కాంబినేషన్లో చేర్చారని అన్నాడు. తన తల్లిదండ్రులు సోదరుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి తరలించడం తన తొలిప్రాధాన్యత అని అనిల్ చెబుతున్నాడు.యుఎఇ లాటరీ లో దాదాపు ఒక సంవత్సరం గా పాల్గొంటున్న బొల్లా, గత అక్టోబర్ 18 డ్రా కోసం 12 టిక్కెట్లను కొనుగోలు చేశానని, వాటిలో ఒకటి తనను దిర్హామ్ల 100 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను పొందిన మొదటి వ్యక్తిగా నిలిపిందని చెప్పాడు. రాబోయే తన సంపదను ఎలా నిర్వహించాలనుకుంటున్నాడో చెబుతూ తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానన్నాడు. ‘ఈ మొత్తాన్ని నేను ఎలా పెట్టుబడి పెట్టాలి – దానిని సరైన మార్గంలో ఖర్చు చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను‘ అని అనిల్ అన్నాడు. ‘గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు మాత్రమే ఉన్నట్టు నాకు అనిపించింది, కానీ ఇప్పుడు ఇక నా ఆలోచనలు సరైన మార్గంలో ఉండాలి. ఏదైనా భారీగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను.‘ అన్నాడు.తనకు వ్యక్తిగత కలలు ఉన్నాయని, కానీ వాటిని కుటుంబ ప్రాధాన్యతలతో కలిపి సమతుల్యం చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘‘నాకు సూపర్ కారు కొనాలనే కల ఉంది.అలాగే గొప్ప రిసార్ట్లో లేదా సెవెన్ స్టార్ హోటల్లో నా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. నా కుటుంబాన్ని ఇక్కడకు తీసుకువచ్చి వారితో కలిసి నా జీవితాంతం ఆనందించాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్నవి చాలా చాలా చిన్న కలలు , నేను వారి కలలన్నింటినీ నెరవేర్చి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాను’’ అని వివరించాడు. అంతేకాకుండా బహుమతిలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వాలనే ప్రణాళికలను కూడా వెల్లడించాడు. ‘‘విరాళాలు నిజంగా సహాయం అవసరమైన వ్యక్తులకు చేరుతాయని నమ్ముతున్నాను కాబట్టి నేను ఛారిటీకి కొంత డబ్బును ఇవ్వాలి అనుకుంటున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది’’ అని ఆయన అన్నాడు. తన ప్రయాణం ఇతరులకు ప్రేరణగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు ‘‘ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆటగాడు ఆడుతూనే ఉండాలని సూచిస్తున్నాను. ఏదో ఒక రోజు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’’ అంటూ ఉద్భోధిస్తున్నాడు.మరోవైపు ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే అతని తల్లిదండ్రులు మాధవరావు భూలక్ష్మి తమ కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ఓ ఆంగ్ల పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, భూలక్ష్మి ఈ వార్త విన్న తర్వాత తమ కుటుంబం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.‘లాటరీ గెలుపొందినట్లు మేం విన్నాము. మేం చాలా సంతోషంగా ఉన్నాము,‘ అని ఆమె అంటున్నారు. -
కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?
‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది. ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?గర్భిణీలకు...గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.రక్తపోటు...ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ ట్రస్టెడ్ సోర్స్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్ ఆఫ్ హైపర్టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.వెరికోస్వెయిన్స్...కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక లోపలి కాలుపై ఎక్కువగా కనిపిస్తాయి. సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్–వే వాల్వ్లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్ వెయిన్స్గా మారతాయి. చాలా సేపు నిలబడటం కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.భంగిమలో మార్పు...కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా వెన్నెముక తప్పు అమరికకు కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!) -
హీరో మెటీరియల్ నుంచి హీరోయిన్ బరువు దాకా...
ఇది సోషల్ మీడియా యుగం. కారెవరూ ఫేమస్ అవడానికి అనర్హం అన్నట్టుగా తయారు చేసిన సామాజిక మాధ్యమాల యుగం. ఇవి ప్రతీ ఒక్కరికీ కీర్తి దాహాన్ని పాప్యులారిటీ పిచ్చిని పెంచేస్తున్నాయి. ఉఛ్చనీచాలు, కనీస విలువలను మర్చిపోయేలా చేస్తున్నాయి. అయితే ఆ మైకంలో జర్నలిజం కూడా చిక్కుకుపోవడమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలవడానికి ఒకప్పుడు పాత్రికేయులు గొప్ప గొప్ప కధనాలు రాసేవారు. సినిమాలపై అద్భుతమైన సమీక్షలతో ప్రేక్షకులకు మార్గదర్శకత్వం వహంచేవారు. ఇప్పుడు.. దాని కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు సినీ జర్నలిస్టులు అంటేనే సెలబ్రిటీలు చీదరించుకునే స్థాయికి దిగజార్చుతున్నాయి.ఆ మధ్య ఓ సినీ జర్నలిస్ట్ నటి మంచులక్ష్మి వస్త్రధారణపై ప్రశ్నించడం ద్వారా తల బొప్పి కట్టించుకున్న వైనం చూశాం. ఐదు పదుల వయసులో ఉన్న మహిళ అయి ఉండీ ఇలాంటి దుస్తులు ధరించడం కరెక్టా? అనే అసంబద్ధమైన ప్రశ్న ద్వారా మంచులక్ష్మి కోపాన్ని నషాళానికి ఎక్కించారాయన. ఇది చిలికి చిలికి చివరకి మా అసోసియేషన్కి మంచులక్ష్మి ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.ఆ ఉదంతం ఇంకా మరవకముందే... మరో పాత్రికేయ నారీమణి... తమిళ నటీనటుల సాక్షిగా తెలుగు జర్నలిస్ట్ల పరువు తీసిపారేశారు. ఒక యువ కధానాయకుడు, దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్(pradeep ranganathan)ను ప్రశ్నించే క్రమంలో మీరు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్ వివాదం రాజేసింది. దీంతో ఆమెపై నెటిజన్ల నుంచి సినీ జనం దాకా దుమ్మెత్తి పోశారు. సీనియర్ నటుడు శరత్కుమార్ నుంచి మన యువనటుడు కిరణ్ అబ్బవరం దాకా... సదరు జర్నలిస్ట్ ప్రశ్నలోని డొల్లతనాన్ని లేకితనాన్ని ఎత్తిచూపారు.సరే... ఇప్పుడిప్పుడే ఆ సంగతి మరుగునపడుతోంది అనుకునేంతలో... తమిళ నాట మరోసారి మరో సినీ జర్నలిస్ట్ తన నోటికి పని కల్పించాడు. మార్గంకాలి, అనుగ్రహీతన్ అంటోనీ వంటి మళయాళ సినిమాల ద్వారా ప్రతిభావంతురాలైన యువనటిగా పేరు తెచ్చుకుంటున్న యువ కధానాయిక గౌరీ కిషన్(Gouri kishan) ను... తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మీ బరువు ఎంత? అంటూ ప్రశ్నించడం ద్వారా నోటికి ఉండే అన్ని హద్దులనూ చెరిపేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కున్న గౌరీ కిషన్ అదే సమావేశంలో సదరు జర్నలిస్ట్ను పట్టుకుని ఎదురు ప్రశ్నలతో ఉతికి ఆరేయడం వేరే సంగతి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఖుష్బూ, నటి రాధిక, గాయని చిన్మయి... వంటివారు గౌరీ కిషన్కు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు. ఆమె జర్నలిస్ట్ను ఉతికి ఆరేసిన తీరును ప్రత్యేకంగా శభాష్ అంటున్నారు.ఇప్పుడు ఇకనైనా సినిమా జర్నలిజం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి ఈ మూడు సందర్భాల్లోనూ జర్నలిస్ట్లు వేసిన ప్రశ్నలు అత్యంత అసందర్భం, అసంబద్ధం అనేది నిస్సందేహం. అయినప్పటికీ అలా వారు అడగడం వెనుక పాప్యులారిటీ లేదా వైరల్ అవ్వాలనే దురాశ ఉండవచ్చునని అనిపిస్తోంది. వ్యక్తి దురాశ వ్యవస్థకు చేటు కాకూడదు. సినీ జర్నలిజం మొత్తానికి దీని వల్ల కలుగుతున్న, కలగబోతున్న నష్టాన్ని సీనియర్ పాత్రికేయులు, సినిమా పెద్దలు వెంటనే గుర్తించి తగిన మరమ్మతులు చేయడం తక్షణావసరంగా కనిపిస్తోంది. -
టీ తాగుతూ.. పొగ తాగుతున్నారా?
చాలా మంది టీ తాగేటప్పుడు దానికి కాంబినేషన్గా పొగ త్రాగడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా పని విరామ సమయంలో. కానీ చాలా మందిలో కనిపించే ఈ సాధారణ అలవాటు వారికి ఏ మాత్రం గమనించని విధంగా వారి శరీరానికి హాని కలిగించవచ్చు. ‘‘నికోటిన్ కెఫిన్ కలిసి మెదడులో తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి,దాంతో ఆ డబుల్ స్టిమ్యులేషన్ కూడా ఈ కాంబోను మరింతగా అలవాటు చేసి వ్యసనంగా మారుస్తుంది అని ఫరీదాబాద్లోని మెట్రో హాస్పిటల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ ఖురానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెబుతున్న ప్రకారం...వ్యసన ఫలం...నిద్రలేమి...నికోటిన్ డోపమైన్ రష్ను ప్రేరేపిస్తుంది, ఇది మెదడు కు ‘మంచి అనుభూతిని కలిగించే’ రసాయనం, అయితే కెఫిన్ నిద్రను ప్రేరేపించే రసాయనమైన అడెనోసి¯Œ ను అడ్డుకుంటుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడు, అవి రెండూ స్వయంగా ఉద్దీపనను పెంచుతాయి అలా రెండింటినీ కలిపి తాగినప్పుడు ఆ కాసేపు మరింత చురుకుదనాన్ని అనుభవించవచ్చు, కానీ మనకు తెలీకుండా మన మెదడుకు ఆ రెండింటినీ కలిపి కోరుకునేలా శిక్షణ ఇస్తున్నామని అర్ధం.గ్రీన్ టీ తో ప్రభావం తగ్గించవచ్చు...టీలో కూడా నికోటిన్ ఉన్నప్పటికీ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, అయితే అది ధూమపానంతో పోలిస్తే దాదాపు లేనట్టే. అంతేకాకుండా సిగరెట్తో జత చేసే టీ రకం ఏమిటి అనేది కూడా ముఖ్యమైనదే. గ్రీన్ టీలో బ్లాక్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, తద్వారా ఇది కొంత నికోటిన్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది కానీ ఒకటి మాత్రం నిజం ఏ రకమైన: టీ అయినా సిగరెట్ పొగ ప్రభావాలను పూర్తిగా దూరం చేయదు.సిగిరెట్టు మానే ఆలోచన వెనక్కి...ధూమపానం మానాలనుకునేవాళ్లని కూడా ఈ అలవాటు నిరుత్సాహపరుస్తుంది. టీ తాగితే ధూమపానం మానేయడం కష్టం. ‘‘ మెదడు టీ ఆనందాన్ని నికోటిన్ నుంచి వచ్చే కిక్తో అనుసంధానించడం ప్రారంభిస్తుంది. ఒకటి మరొకదానికి ట్రిగ్గర్ అవుతుంది, అందుకే టీ తాగిన ప్రతిసారీ సిగరెట్ తాగాలని కోరుకోవడం ఎక్కువ అవుతుంది.జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం...కెఫిన్ నికోటిన్ రెండూ హృదయ స్పందన రేటు అలాగే రక్తపోటును కూడా పెంచుతాయి. రక్త నాళాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి, కాబట్టి ఈ రెండింటినీ కలపడం గుండె జబ్బులు ఉన్నవారికి మరింత ప్రమాదకరంగా మారుతుంది. టీ కడుపు లో ఆమ్లాన్ని పెంచుతుంది మరోవైపు నికోటిన్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది ఇవి రెండూ కలిసిన తర్వాత కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం పేగుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.గొంతుకీ ప్రమాదమే...అలాగే గొంతుపై కూడా దీని ప్రభావం పడుతుంది ‘ధూమపానం గొంతు పొరను చికాకుపెడుతుంది. దానికి వేడి టీ జోడిం^è డం అంటే వేడి మంటను మరింత తీవ్రతరం చేయడమే. కాలక్రమేణా, ఇది దీర్ఘకాలిక గొంతు సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.టీ , సిగరెట్ల మేళశింపు నాడీ వ్యవస్థను అతిగా ప్రేరేపించే, గుండెను శ్రమపెట్టే ప్రేగులను కలవరపరిచే హానికరమైన జంట అనేది నిస్సందేహం కాబట్టి వీలైనంత వరకూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి, టీని పరిమితంగా తీసుకోవాలి రెండింటినీ మాత్రం కలిపి తీసుకోవడం మాత్రం పొరపాటున కూడా చేయవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు. -
మహిళా క్రికెటర్ కధతో సినిమా... నవంబరు 7న మళ్లీ విడుదల...
కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు కలల్ని ఒడిసిపట్టేది కూడా. సినిమా అంటే వ్యాపారం కావచ్చు కానీ వ్యాపారం మాత్రమే కారాదు. దీన్ని గుర్తించిన సినీ రూపకర్తలకు డబ్బులకు మించిన ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కొన్ని సినిమాలు అరుదుగానైనా అందిస్తాయి. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అండ్ టీమ్ ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. అవును . ప్రస్తుతం మహిళా క్రికెట్ విజయ విహారంలో ఊగిపోతున్న భారతావని సంబరంలో సగర్వంగా పాలు పంచుకోవడానికి వారికి సరైన కారణం ఉంది మరి.అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), సయామి ఖేర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఘూమర్’(Ghoomer Movie) ఈ నవంబర్ 7న తిరిగి థియేటర్లలోకి రానుంది. మాములూగా అయితే ఇది కేవలం ఓ సినిమా రీ రిలీజ్ మాత్రమే. కానీ భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఐసిసి ప్రపంచ కప్ దక్కించుకున్న సందర్భంలో ఈ విజయానికి ఈ సినిమా ఓ కళాత్మక అభినందన కూడా. ఈ విషయాన్ని సినిమా టీమ్ సగర్వంగా ప్రకటించింది.గత బుధవారం ప్రొడక్షన్ బ్యానర్ హోప్ ప్రొడక్షన్ ్స తమ ఇన్ స్ట్రాగామ్లో టీమ్ ఇండియా విజయం సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన సందేశాన్ని అందిస్తూ ఒక నోట్ రాసింది. ‘‘ అభిరుచి, పట్టుదల నమ్మకపు శక్తి.ఘూమర్ రిటర్న్స్ తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలకు అభినందనలు అందిస్తున్నాం’’ అని అభిషేక్ సయామి నటించిన చిత్రం పోస్టర్తో పాటు పంచుకుంది.గత 2023లో విడుదలైన సినిమా ఘూమర్. తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన ఔత్సాహిక క్రికెటర్ అనినా (సయామి)అనే మహిళా క్రికెటర్ పోరాటం చుట్టూ తిరుగుతుంది. వృత్తి పరంగా అవమానానికి గురైన మాజీ క్రికెటర్ పాడీ (అభిషేక్) ఆమెకు ఎడమచేతి వాటం బౌలర్గా మారడానికి శిక్షణ ఇస్తాడు, ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి సహాయపడటానికి ’ఘూమర్’ అనే కొత్త బౌలింగ్ టెక్నిక్ను కనిపెట్టడం ద్వారా ఆమెకు కొత్త ఆశను కలలను ఆయన అందిస్తాడు. ఈ చిత్రం హంగేరియన్ షూటర్ కరోలీ టకాక్స్ జీవిత కథ నుంచి ప్రేరణ పొందింది, ఆయన తన కుడి చేతికి తీవ్రంగా గాయమైన తర్వాత కూడా పట్టుదల సడలకుండా తన ఎడమ చేతితో రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా దర్శకుడు ఆర్. బాల్కి తమ చిత్రం తిరిగి విడుదల కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ‘ఘూమర్ మహిళల క్రికెట్ కు మహిళా క్రికెటర్ల స్థితిస్థాపకతకు ఒక పురస్కారం. ఘూమర్ను చిత్రీకరించిన అదే స్టేడియంలోనే వారు ఘన విజయాన్ని సాధించారు’’ అని బాల్కీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాలను కీర్తించేవారు ఎందరో. కానీ స్ఫూర్తిని అందించే వారు కొందరే. అలాంటివారికి ఆ విజయాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. వ్యాపార లెక్కలకు అతీతంగా ఇలాంటి స్ఫూర్దిదాయక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్ధాం. -
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది. -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్ను ఎలా చిక్గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్తో కంఫర్ట్ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్సెట్టర్గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
భారత మహిళా క్రికెట్కు ఊపిరి పోసిన ఆస్ట్రేలియన్
ఇది 112 సంవత్సరాలుగా మన దేశం కంటున్న కల. 1913లో, ఆస్ట్రేలియాలో జన్మించిన పాఠశాల ఉపాధ్యాయురాలు అన్నే కెల్లెవ్ కేరళలోని కొట్టాయంలో ఉన్న బేకర్ మెమోరియల్ స్కూల్లో బాలికలకు క్రికెట్ను తప్పనిసరి చేశారు. ఒక శతాబ్దం తర్వాత, భారత మహిళా క్రికెట్ జట్టు తన జన్మస్థలం నుంచి వచ్చిన జట్టును ఓడించి కలల ఫైనల్కు చేరుకుంటుందని బహుశా ఆమె అప్పుడే ఊహించారేమో.. తెలీదు. కానీ అదే జరిగింది.భారత్ ఇంతకు ముందు మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్లోకి ప్రవేశించలేదని కాదు, కానీ 2025 ఎడిషన్ చరిత్రలో అద్భుతాలను చవిచూసిన టోర్నమెంట్గా నిలిచిపోతుంది, కలలు పండిస్తూ మన మహిళలు విజేతలుగా మారారు. గత దశాబ్దంలో కాలానుగుణంగా పెరుగుతున్న మహిళల క్రికెట్పై మన దేశపు ఆసక్తిని మేల్కొల్పడానికి వారు అందించిన స్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే భారతదేశంలో మహిళలు ఈ క్రీడను ఆడటం అంటే ఒక పోరాటం, దీనిని అధిగమిస్తూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త స్టార్ల ఆవిర్భావాన్ని చూసింది.ఆదివారానికి ముందు, భారతదేశం రెండు ఫైనల్స్ ఆడింది ఒకటి 2005లో మరొకటి 2017లో... పోరాడి ఓడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 2025 టైటిల్ పోటీ జట్టుకు ప్రత్యేకంగా చేసింది ఏమిటంటే, వారు కిక్కిరిసిన స్టేడియం మధ్య స్వదేశంలో పోరాడారు, అక్కడ ‘ఇండియా! ఇండియా!‘ అనే నినాదం దేశం అంతటా ప్రతిధ్వనించింది. "ఏఆర్ రెహమాన్ జై హో, బాలీవుడ్ సహకారం కొత్త తరపు క్రీడా గీతం, చక్ దే ఇండియా ప్రజలను చైతన్యపరచింది. ఆ కాలంలో ’పంచుకోవడం అంటే శ్రద్ధ’ అనేది నిజంగా ఉండేది. ఎందుకంటే కొన్నిసార్లు వివాహ మండపాల్లో బస చేసేవాళ్లం ఎక్కువగా పాఠశాలల్లో ఖాళీ తరగతి గదుల్లో ఉండేవాళ్ళం. మాకు తోడుగా బొద్దింకలు ఎలుకలు ఉండేవి. చాలా మందికి కేవలం ఒక జత తెల్లటి బ్యాట్లు పరిమితమైన బ్యాట్లు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎందుకంటే క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతో ఆడాము,‘ అని భారత మాజీ కెప్టెన్ నిర్వాహకురాలు శాంత గుర్తుచేసుకున్నారు. శాంత, డయానా ఎడుల్జీ, శుభంగి కులకర్ణి సుధా షాలతో కలిసి ఆటలో కొనసాగారు. ఇలాంటి అలుపెరుగని పోరాటాలు కష్టాల కథలతో మహిళల క్రికెట్ ప్రయాణం దేశవ్యాప్తంగా సాగింది. ఒక, వ్యవస్థీకృత మహిళా క్రికెట్గా రూపుదిద్దుకుంది. ఈ నేపధ్యంలోమహిళా క్రికెట్ ప్రయాణంలో కొన్ని కీలక ఘట్టాలు...👉క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యురాలు ఆలూ బామ్జీ, ఆమె పేరు ను మేళవిస్తూ ఆల్బీస్ అనే మొదటి మహిళా క్రికెట్ జట్టును ఏర్పాటు చేశారు.👉నాలుగు సంవత్సరాల తరువాత, మహేంద్ర కుమార్ శర్మ వ్యవస్థాపక కార్యదర్శిగా భారత మహిళా క్రికెట్ సంఘం లక్నోలో స్థాపించబడింది. 👉1993లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ను లక్నోలో నిర్వహించారు, ఇందులో బొంబాయి, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మూడు జట్లు ఉన్నాయి. రెండు విజిటింగ్ జట్ల నుంచి అదనపు ఆటగాళ్లను ఆతిథ్య జట్టులో చేర్చారు, ఒక కళాశాల మైదానంలో ఆడిన ఈ మ్యాచ్లో మహిళలు క్రికెట్ ఎలా ఆడతారు అనేదానికన్నా లేదా వారు ఏమి ధరిస్తారు అనే దానిపై ఆసక్తి కారణంగా ఇది గణనీయమైన ప్రేక్షకులను ఆకర్షించింది.👉1978లో, భారతదేశం ప్రపంచ కప్లో జట్టుగా ఆతిథ్య జట్టుగా అరంగేట్రం చేసింది. ఆతిథ్య జట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అనే నాలుగు జట్లతో ఈ ఈవెంట్ను నిర్వహించగలగడానికి కేవలం ధైర్యం కంటే ఎక్కువ అవసరం.👉 2006లో బిసిసిఐతో విలీనం అనేక విధాలుగా ఒక మలుపు తిరిగింది, మొదటిసారిగా, మహిళల వన్ డే మ్యాచ్ల కోసం రూ. 2,500 మ్యాచ్ ఫీజును కేటాయించారు. మెరుగైన మైదానాలు,, వసతి గృహాలు హోటల్ గదులు వచ్చాయి.,రిజర్వ్ చేయని రైలు ప్రయాణాల స్థానంలో రిజర్వ్డ్ ఎసి రైళ్లు, విమానాలు వచ్చాయి. రెండు సంవత్సరాల తరువాత, మహిళా క్రికెటర్లు జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రవేశం పొందారు. -
ఉచితంగా బైక్ ఇచ్చిన రాహుల్.. ట్విస్ట్ ఇచ్చిన యువకుడు
ఒక చిన్న టీ కొట్టు యజమాని.. అతనికి సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వంటి పేరున్న నాయకుడు కలవడమే కల లాంటి విషయం. ఇక ఆయన నుంచి ఏకంగా రూ.1.50లక్షలు విలువ చేసే బైక్ను ఉచితంగా అందుకుంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది?. అయినా సరే.. తన ఓటు కాంగ్రెస్కు వేయను అంటూ ఆ టీ కొట్టు యజమాని చెబుతున్నాడు. ఇంతకీ ఈ కథ ఏమిటంటే..గత ఆగస్టు 27న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు బీహార్లో 14 రోజుల ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా దర్భంగాలో ఉన్నప్పుడు ఈ కధ ప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన పార్టీ సహచరులు 52 కి.మీ దూరంలో ముజఫర్పూర్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఆ సందర్భంగా జాతీయ రహదారి 27లోని మాబ్బి సమీపంలోని షాపూర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న మా దుర్గా లైన్ హోటల్లో టీ తాగారు. ఆ తర్వాత, గాంధీ భద్రతా సిబ్బంది, హోటల్ యజమాని సుమన్ సౌరభ్ (21)కి చెందిన బజాజ్ పల్సర్ బైక్ను తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదని ఆరోపించాడు. ఏం జరిగిందో తెలీదు కానీ దాంతో సౌరభ్ తన హనం కోసం తీవ్రంగా అన్వేషించాడు. ‘నా లైఫ్లైన్ అకస్మాత్తుగా తెగిపోయింది’ అని సౌరభ్ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన బైక్ కోసం సాధ్యమైనంత వరకు ప్రతీ తలుపును తట్టినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయాడు.తాను ఒక కారు అద్దెకు తీసుకుని దాదాపు 25,000 ఖర్చు చేసి తిరిగినట్టు చెప్పారు. స్థానిక కాంగ్రెస్, ఆర్జేడీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ) సభ్యులను సంప్రదించినా ఎవరి నుంచీ స్పష్టమైన స్పందన రాలేదని గుర్తు చేసుకున్నాడు. చివరకు స్థానిక మాబ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని కాంగ్రెస్ నాయకుడు మదన్ మోహన్ ఝా సూచించారట. అయితే, తాను కొంతమంది స్థానిక సోషల్ మీడియా వ్యక్తులను సంప్రదించడంతో వారు తన కథను హైలైట్ చేశారని అది రాహుల్ గాంధీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని సౌరభ్ చెప్పాడు.ఇది జరిగిన మూడు రోజుల తర్వాత, సెప్టెంబర్ 1న గాంధీ యాత్ర ముగింపు వేడుక కోసం పాట్నా హోటల్లో క్యాంపెయిన్ చేస్తున్న ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ నుంచి సౌరభ్కి కాల్ వచ్చింది. ‘రాహుల్ గాంధీ నుంచి కొత్త మోటార్ సైకిల్ తాళం తీసుకోవడానికి సెప్టెంబర్ 1న ఉదయం 7 గంటలకు పాట్నాకు రావాలని ఆయన కోరాడు. కాంగ్రెస్ అధినేత రాహుల్ ఆహ్వానం మేరకు సౌరభ్, మళ్ళీ కారు అద్దెకు తీసుకుని, తన తండ్రి అనిల్తో కలిసి పాట్నా చేరుకున్నారు, అక్కడ, పాట్నా హైకోర్టు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాహుల్.. అతడిని కలుసుకుని, రాష్ట్ర రాజధానిలోని బోరింగ్ రోడ్ ప్రాంతంలోని ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసి కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ తాళంను ఆయనకు అందజేశారు.‘ఓ కొత్త మోటార్ బైక్ను పొందడం అనేది నాకు ఊహించని విషయం. అది కూడా రాహుల్ గాంధీ వంటి పెద్ద రాజకీయ నాయకుడి నుంచి అందుకోవడం ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా ఆందోళనను అర్థం చేసుకున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. బైక్ ధర రూ.1.5 లక్షల కంటే ఎక్కువే. ఇది నాకు చాలా పెద్ద మొత్తం ’ అని సౌరభ్ అన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో వీరిద్దరి సమావేశం వీడియోను షేర్ చేసింది. అయితే, దర్భంగా గ్రామీణ నియోజకవర్గంలో ఓటరుగా తన ప్రాధాన్యత గురించి మీడియా అడిగినప్పుడు ‘నేను ఆర్జేడీ అభ్యర్థికి ఓటు వేస్తాను’ అని సౌరభ్ నిర్మొహమాటంగా చెప్పాడు. తన కుటుంబం ఎల్లప్పుడూ ఆర్జేడీ ఓటర్లేనని సౌరభ్ స్పష్టం చేశాడు. బైక్ విషయంతో దానికి సంబంధం లేదన్నట్టుగా అతను తేల్చేశాడు. నవంబర్ ఆరో తేదీన జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో దర్భాంగా పోలింగ్కు వెళుతుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు.-సత్య. -
రూ.600 కోట్ల కలెక్షన్స్.. ఆ తర్వాత చేతిలో ఒక్క సినిమా లేని దర్శకుడు!
రాజకీయాల్లో మాత్రమే కాదు ఏ రంగంలోనైనా హత్యలు కావు ఆత్మహత్యలే ఉంటాయేమో అనిపిస్తుంది ఆ దర్శకుడ్ని చూస్తే... అవును మరి దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్లు అంటే చిన్న విషయం కాదు. అలాంటి సినిమా ఇచ్చిన తర్వాత ఆ దర్శకుడి ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టాలి. పెద్ద పెద్ద బేనర్లు బారులు తీరాలి. కానీ విచిత్రంగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj ) విషయంలో ఇది రివర్స్ అయింది. సినిమా రంగంలో పదేళ్ల కెరీర్లోనే తీసిన తక్కువ సినిమాల్లోనే 3 బ్లాక్ బస్టర్స్ అది కూడా దాదాపుగా రూ.600 కోట్లు కలెక్షన్లు ఇచ్చిన దర్శకుడు బహుశా దక్షిణాదిలోనే మరొకరు లేరేమో. అందుకే కూలీ(Coolie) విడుదల ముందు వరకు రాజమౌళి రేంజ్ లో హైప్ అందుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్, అయితే కేవలం ఒక్క సినిమా మొత్తం అతని పరిస్థితిని తలకిందులు చేసేసింది. (చదవండి: ప్రశాంత్ వర్మ మోసం రూ.200 కోట్లు.. నిర్మాత ఫిర్యాదు)వందల కోట్ల గ్రాస్ వసూలు చేసినా, ఉన్న భారీ తారాగణంతో పోల్చుకుంటూ వేసిన అంచనాలు అందుకోలేకపోయింది. చివరకు కమర్షియల్ లెక్కల్లో అపజయాల లిస్టులోకి చేరిపోయింది. అయినప్పటికీ కూడా ఆ కలెక్షన్లు సాధారణమైనవేమీ కాదు.. మరీ ఒక దర్శకుడి పేరు చెబితేనే భయపడేంత దారుణమైన ఫ్లాప్ కూడా కాదు. అయినా సరే ప్రస్తుతం లోకేష్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది.రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబో మల్టీస్టారర్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మొదలు కావల్సి ఉంది. కానీ కూలీ దెబ్బకు ఆ ఛాన్స్ ని నెల్సన్ దిలీప్ కుమార్ దక్కించుకున్నాడని అంటున్నారు. అలాగే కూలీ తర్వాత ఇంకో సినిమా చేద్దామని లోకేష్ తో చెప్పిన రజని ఆ ఆలోచనను విరమించుకున్నాడని సమాచారం.(చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)ఇదంతా ఒకెత్తయితే అమీర్ ఖాన్ తో తీద్దామని ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ కూడా ఆగిపోవడం లోకేష్ కనగరాజ్కు కలిగిన నష్టాన్ని పతాక స్థాయికి చేర్చింది. కూలీకి ముందు వినపడినా, ఇప్పుడు ఎక్కడా దాని గురించి ప్రస్తావనే వినిపించడం లేదు. మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ 2ని సైతం లోకేష్ వెంటనే మొదలుపెట్టే పరిస్థితిలో లేడట. బడ్జెట్ డిమాండ్ చేస్తున్న మొత్తాన్ని భరించే స్థితిలో నిర్మాత లేకపోవడమే దానికి కారణమంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కలయికలో లోకేష్ కనగరాజ్ ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా తెరకెక్కిస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా ఇందులో నిజం లేదని సమాచారం. ప్రభాస్ కి ఉన్న కమిట్ మెంట్స్ చూస్తే ఇప్పటికిప్పుడు మల్టీస్టారర్లు చేసే పరిస్థితిలో లేడు. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు కరెక్ట్ టైమ్కి పూర్తయితే అదే గొప్ప అని చెప్పాలి. ప్రస్తుత వెనుకడుగు పరిస్థితుల్లో లోకేష్ పేరుని వార్తల్లో ఉంచడం కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని కూడా టాక్.సరే ఫ్లాపులు అందరికీ వస్తాయి కానీ ఒక అబోవ్ యావరేజ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ కి ప్రస్తుతం వచ్చిన పరిస్థితి మాత్రం ఆలోచింపజేసేదే. ఈ సినిమా రిజల్ట్ కన్నా ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన సమీక్షలు, విమర్శలే లోకేష్ పట్ల విరక్తికి కారణం అని చెప్పొచ్చు. ఒక్క రజనీ కాంత్ని తప్పితే... ఇతర భారీ తారాగణాన్ని ఎంచుకోవడంపైన అతిగా ఫోకస్ పెట్టినప్పటికీ వారికి తగ్గ కేరెక్టర్స్ ఇవ్వడంలోనూ, కధనంపైనా తగినంత శ్రద్ధ పెట్టలేదు. లోకేష్ స్టార్స్ని హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యాడని దాదాపుగా ప్రతీ స్టార్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. నాగార్జున, ఉపేంద్ర... లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా వారికి తగినంత ప్రాథాన్యత ఇవ్వడంలో లోకేష్ ఫెయిలయ్యాడు. అన్నింటికన్నా పరాకాష్ట అమీర్ ఖాన్ పాత్ర అని చెప్పాలి. కూలిలో అమీర్ ఖాన్ కి దాహా క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ దాన్ని పరమ దారుణంగా హ్యాండిల్ చేయడంతో ఆ పాత్ర కాస్తా కామెడీకి ఎక్కువ విలనీకి తక్కువగా మారిపోయింది. సినిమా విడుదల తర్వాత తన పాత్రపై అమీర్ ఖాన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది లోకేష్ స్థాయిని పూర్తిగా మసకబార్చింది. ఏది ఏమైనా మంచి టాలెంట్ వున్న లోకేష్ అనవసర అర్భాటాలకు పోయి తెచ్చుకున్న ఈ దశ మారాలంటే వీటిని చేరిపేసే, మరుగున పడేసేలా ఓ క్లీన్ హిట్ పడాల్సిందే.. -
రాముడిగా రణ్బీర్, రావణుడిగా యష్. ట్రోల్స్పై స్పందించిన సద్గురు!
ప్రస్తుతం మన దేశంలో అత్యంత పేరొందిన ఆధ్యాత్మిక గురువుగా సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru Jaggi Vasudev ) చెప్పొచ్చు. ఆయనకు ఏ ఆధ్యాత్మిక గురువుకూ లేనంతగా సినిమా రంగంలో అభిమానులు ఉన్నారు, అలాగే సినీ రంగంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన శివరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో తారలు హాజరై నృత్యాలు చేయడం చూస్తుంటాం. అలాగే తరచుగా సినిమా నటీనటులు, ఇతర ప్రముఖులు ఆయనతో సంభాషణలు జరుపుతూ ఉండడం ఆ విశేషాలు మీడియాలో బాగా హల్ చల్ చేయడం తెలిసిందే. అదే క్రమంలో ఆయన ఇటీవల ప్రతిష్టాత్మక చిత్రం ’రామాయణ’(Ramayana) నిర్మాత నమిత్ మల్హోత్రాతో జరిగిన సంభాషణలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రాముని పాత్రను రణబీర్ కపూర్ పోషించడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రణబీర్ గతంలో పోషించిన పాత్రలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తల గురించి సైతం ప్రస్తావిస్తూ పెద్ద యెత్తున ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఈ సంభాషణలో ఇద్దరూ చర్చించారు. దీని గురించి సద్గురు మాట్లాడుతూ ‘రామ్ పాత్ర కు రణబీర్ సరికాదని చెప్పడం న్యాయమైన తీర్పు కాదు అతను ఏదో ఒక విధంగా గతంలో నటించాడనేది అప్రస్తుతం.. రేపు, మరొక సినిమాలో, అతను రావణుడిలా నటించవచ్చు. అతను ఒక ప్రొఫెషనల్ నటుడు. అంతవరకు చూడాలి. అయితే ఒకటి సినిమా అనేది నటులు లేదా దర్శకుల వల్ల కాదు, ప్రజల వల్ల నడుస్తుంది. కాబట్టి, వారి అంచనాలను కూడా పూర్తిగా తోసిపుచ్చలేం’’ అంటూ వ్యాఖ్యానించారు.కేజీఎఫ్ స్టార్ యష్(Yash)ను రావణుడిగా ఎంపిక చేయడం పట్ల సద్గురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యష్ నాకు బాగా తెలుసు. అతను ఈ సినిమా లో రావణుడు ఎలా అయ్యాడో నాకు తెలియదు. విలన్ అంటే అతనికి చట్టి ముక్కు వంటివి ఉంటాయి. అయితే యష్ ఒక అందమైన వ్యక్తి కదా అంటూ ఆ పాత్రకు యష్ ఎంపిక పట్ల సద్గురు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై సినిమా నిర్మాత నమిత్ తన వైఖరిని సమర్థించుకుంటూ అవును మీరన్నది నిజమే. అతను చాలా అందంగా ఉంటాడు. అంతేకాదు దేశంలో చాలా ప్రతిభావంతుడైన స్టార్ కూడా ‘మేం ఆ పాత్ర ఒక సూపర్ స్టార్ స్థాయి వ్యక్తి పోషించాలని అనుకున్నాం. అంతేకాక అతను కూడా ఆ పాత్ర పోషణను చాలా ఇష్టపడ్డాడు.’’ అంటూ యష్ ఎంపిక గురించి చెప్పాడు. అయితే, సాధారణంగా విలన్లు ఒక ప్రత్యేక రూపంతో ముఖ్యంగా చదునైన ముక్కును కలిగి ఉంటారే తప్ప పదునైన ముక్కు తో ఉండరని సద్గురు అంటూ అది మీరు గమనించారా?‘ అని అంటే... ‘ఇకపై గమనిస్తాను’ అంటూ నమిత్ చమత్కరించారు.ఇదే చర్చలో ఒక సందర్భంలో తెలుగు దిగ్గజ కధానాయకుడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావును కూడా సద్గురు ప్రస్తావించడం విశేషం. ఎన్నో సినిమాల్లో ఎన్టీయార్ కృష్ణుడిగా కనిపించి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, అదే ఆయనను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి ఎన్నికల్లో గెలిచేందుకు కూడా దోహదం చేసిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా, సోషల్ మీడియాలో...ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తింది. భక్తి చిత్రాలకు ఎంపిక చేసేటప్పుడు చిత్రనిర్మాతలు ఆధ్యాత్మిక నాయకులను సంప్రదించాలా? దీనిపై తెలుగు దర్శకుడు డాలీ ఓ మీడియాతో మాట్లాడుతూ ‘సద్గురు గొప్ప వ్యక్తి, ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించే ధైర్యం చేయను. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉంటారు. కానీ పాత్రల ఎంపిక విషయంలో చివరికి, నిర్మాత దర్శకుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసి రణ్బీర్ను రామ్గా, యష్ను రావణ్గా నటింపజేయడం ఉత్తర దక్షిణ భారత ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునే ఒక తెలివైన ప్రయత్నం. రణ్బీర్ అద్భుతంగా నటించగలడు..అలాగే యష్ కూడా మెరిపిస్తాడు. ఇక ట్రోల్స్ అంటారా? విశాల థృక్పధం లేని ట్రోల్లను విస్మరించడం ఉత్తమం‘ అంటూ స్పష్టం చేశారు. -
ఆద్యంతం సంగీతమే...! ఆ మ్యూజిక్ సిటీ ఏదంటే..
ఆ నగరంలో ప్రతీ వీధీ వీనుల విందు చేస్తుంది. ప్రతీ మదీ గానాలాపానలో మునిగి తేలుతుంది. నలు చెరగులా సంగీత ప్రదర్శనల సందడి, చరిత్ర సృష్టించిన సంగీతజ్ఞుల ఒరవడి కనిపించే ఏకైక నగరం అది. అందుకే దానిని మ్యూజిక్ సిటీగా పేర్కొంటారు. కేవలం అనుకోవడం మాత్రమే కాదు గత 2017లో యునెస్కో ద్వారా సంగీత నగరంగా అధికారికంగాఎంపికైంది, ఇంతకీ ఆ నగరం ఏది?ఆ నగరానికి ఆ పేరు రావడానికి కారణం ఏమిటి?గొప్ప వారసత్వం...ఆస్ట్రియా రాజధాని నగరం.. వియన్నా సంగీత నగరంగా పేరొందింది. శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వంతో లోతైన సంబంధానికి ప్రసిద్ధి చెందిన వియన్నా, మొజార్ట్, బీతొవెన్, షుబెర్ట్, హేద్న్, స్ట్రాస్ వంటి ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలను అందించింది, వీరే తదనంతర కాలంలో పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మూలంగా నిలిచారు. గత 18వ 19వ శతాబ్దాలలో, ఈ నగరం గొప్ప స్వరకర్తలు సంగీతకారులను ఆకర్షించి, యూరప్ కు కళాత్మక రాజధానిగా మారింది. ఆస్ట్రియన్ రాచరికం, గ్రాండ్ ఒపెరా హౌస్లు, ప్రేక్షకుల మద్దతు కలిసి వియన్నాను సృజనాత్మకతకు చిరునామాగా మార్చింది.వీధి వీధినా...వీనుల విందేగా...వియన్నాలో సంగీతం రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ప్రతి వీధి, కచేరీ హాల్, కేఫ్ కాలాతీత సంగీత స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం సింఫొనీలు ఒపెరాల నుంచి వీధి ప్రదర్శనల వరకు నిర్వహిస్తుంది. ఇక్కడ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే ఒక సజీవ సంప్రదాయం. సంగీత నగరంగా వియన్నాను మార్చిన ప్రసిద్ధ స్వరకర్తలలో వోల్ఫ్గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్ ఒకరు.. ఆయన వియన్నాలో నివసిస్తున్నప్పుడు ది మ్యాజిక్ ఫ్లూట్ ది మ్యారేజ్ ఆఫ్ ఫిగరో వంటివి సృష్టించారు. అందులో వియన్నాలో తొమ్మిదవ సింఫనీతో సహా గొప్ప సింఫొనీలను కంపోజ్ చేసిన లుడ్విగ్ వాన్ బీథోవెన్, వియన్నా స్థానికుడు, వందలాది పాటలు సింఫొనిక్ భాగాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాంజ్ షుబెర్ట్, సింఫొనీ పితామహుడు జోసెఫ్ హేద్న్, వియన్నా వాల్జ్ను ప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేసిన జోహన్ స్ట్రాస్ ఉన్నారు. అలా ఎంతో కాలంగా వియన్నా సంగీతానికి ప్రపంచ కేంద్రంగా ఎదుగుతూనే ఉంది. చాంబర్ రిసైటల్స్ నుంచి గ్రాండ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనల వరకు. ఈ నగరం ప్రతి సంవత్సరం 15,000 కంటే ఎక్కువ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుండడం విశేషం. వియన్నా ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా, వియన్నా స్టేట్ ఒపెరా వియన్నా బాయ్స్ కోయిర్ వంటి సంస్థలు నగర సంగీత వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంటాయి. ఆకట్టుకునే కచేరీ హాళ్లలో లేదా బహిరంగ వేదికలలో ప్రతీ చోటా ఈ సిటీ దైనందిన జీవితంలో సంగీతం భాగమై ఉంటుంది. ప్రతి హృదయం సంగీతంతో మమేకమైపోయి లయబద్ధంగా ధ్వనిస్తుంది.విశేషాలెన్నో...ప్రపంచంలోని ఏ ఇతర నగరంలో లేని విధంగా 60 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రఖ్యాత స్వరకర్తలకు వియన్నా నిలయంగా ఉంది. నగరంలోని దాదాపు ప్రతి ప్రదేశం సంగీతంతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంటుంది.ప్రసిద్ధ నృత్యం వాల్జ్ 19వ శతాబ్దంలో వియన్నాలో ఉద్భవించింది యూరప్ అంతటా ఆకట్టుకునే నృత్యంగా మారింది.1842లో స్థాపితమైన వియన్నా ఫిల్హార్మోనిక్ ప్రపంచంలోని పురాతన అత్యంత పేరొందిన ఆర్కెస్ట్రాలలో ఒకటి, ఇది ఆస్ట్రియా కు చెందిన గొప్ప సంగీత శైలిని ప్రతిఫలిస్తుంది. వియన్నాలో ప్రతి రాత్రి 10 కంటే ఎక్కువ శాస్త్రీయ సంగీత కచేరీలు జరుగుతాయి,ఫిల్హార్మోనిక్ ప్రదర్శించే వార్షిక నూతన సంవత్సర కచేరీని 90 కి పైగా దేశాలకు ప్రసారం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు.వియన్నా నగరవాసుల్లో దాదాపు సగం మంది సంగీత వాయిద్యం వాయించేవారు లేదా గాయక బృందంలో పాడేవారో అయి ఉంటారు.(చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
వందల కోట్లు పోగొట్టుకుంటోన్న ప్రభాస్.. కారణం ఇదేనట!
టాలీవుడ్ ‘డార్లింగ్’ ప్రభాస్(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్ స్టార్ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్ను ఆదరాబాదరా క్యాష్ చేసుకునే రెగ్యులర్ స్టార్స్కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్ స్టార్ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.’బాహుబలి 2: ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్ బ్రాండ్లు ప్రభాస్ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్ ఫిట్నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు. గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్మెంట్లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్లో ప్రభాస్ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.మరోవైపు టాలీవుడ్లో ప్రభాస్ తో పాటు టాప్ ప్లేస్లో కొనసాగుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్ ఎండార్స్మెంట్లతో సహా అగ్ర బ్రాండ్ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం. ‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్ ఎండార్స్మెంట్లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్మెంట్లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్లను ప్రమోట్ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్ను ఎండార్స్మెంట్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్ తెలిపాడు. తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్కి మాత్రమే ప్రభాస్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్గా ప్రభాస్ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. -
భారతీయ సినిమా వీరవిహారాలు..ఆస్ట్రేలియన్ సినిమా ఆర్తనాదాలు
ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో తొలిసారిగా, స్థానిక బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ సినిమాల కలెక్షన్లను అధిగమించాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. త్వరలో వచ్చే వారం జరగనున్న ఒక ప్రధాన సినిమా పరిశ్రమ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసిన చిత్ర పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నిక్ హేస్, హిందీ, తెలుగు, తమిళం. ఇతర భారతీయ భాషలలోని చిత్రాలు అమెరికన్ బ్రిటిష్ చిత్రాల తర్వాత ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మార్కెట్గా మారాయని చెప్పారు.అవి 2021లో 32.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ సంవత్సరం అంచనా వేసిన దాని కన్నా మిన్నగా 50 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే కాలంలో, ఆస్ట్రేలియన్ చిత్రాలు ‘పేలవమైన‘ బాక్సాఫీస్ ప్రదర్శనతో 54.2 మిలియన్ డాలర్ల నుంచి ఈ సంవత్సరం 16.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని హేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంగ్లోఫోన్ మాట్లాడని చలనచిత్ర రంగం జాతీయ పరిశ్రమ కంటే ముందుకెళ్లిన మొదటి ప్రధాన ఆంగ్ల భాషా మార్కెట్ ఆస్ట్రేలియా ఇది యుకె. యుఎస్ లేదా కెనడాలో కనిపించని నిర్మాణాత్మక మైలురాయి‘ అని ఆయన అంటున్నారు. అంటే ఆంగ్లేతర చిత్రాలు ఆస్ట్రేలియాలో ఈ స్థాయి విజయం సాధించడం మరే దేశంలోనూ లేని వైచిత్రి అని ఆయన భావం.భారీ సంఖ్యలో ప్రేక్షకుల బలం, నమ్మకమైన చిత్రాల సరఫరా కమ్యూనిటీ ఆధారిత మార్కెటింగ్ భారతీయ విజయం వెనుక ఉన్నాయని డెండీ సినిమాస్, ఐకాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంబ్రెల్లా ఎంటర్టైన్మెంట్లలో సీనియర్ పాత్రలు పోషించిన హేస్ అభిప్రాయపడుతున్నారు.గత ఐదు సంవత్సరాలలో అతిపెద్ద భారతీయ హిట్లుగా హిందీ సినిమా యానిమల్(Animal Movie) 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా మరో బాలీవుడ్ మూవీ పఠాన్(Pathaan) 4.7 మిలియన్లు రాబట్టింది. అదే బాటలో జవాన్(Jawan) కూడా 4.7 మిలియన్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ అక్కడ సత్తా చాటింది. తెలుగు సినిమా పుష్ప: ది రూల్ – పార్ట్ 2 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ తర్వాతి స్థానంలోనూ మరో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ 3.6 మిలియన్లతో అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారత సినిమా సత్తా చాటినట్టు న్యూమెరో బాక్స్ ఆఫీస్ డేటా వెల్లడిస్తోంది. ‘‘ఆడియన్స్ స్పీక్ – ఇట్స్ టైమ్ వుయ్ లిజెన్’’ అనే పేరుతో వెలువరించిన ఈ నివేదిక గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్కు ముందు బహుళ మార్గాల ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సినిమాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచిస్తోంది.ఇదే పంథా కొనసాగితే... మరోఐదు సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగితే, న్యూజిలాండ్ సినిమాలు, బహుశా చైనీస్. ఫ్రెంచ్ సినిమాలు కూడా ఆస్ట్రేలియన్ సినిమాలను అధిగమించవచ్చని హేస్ విశ్వసిస్తున్నారు. ‘ఆస్ట్రేలియన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతుండగా, ప్రతి 10 సినిమా టిక్కెట్లలో ఒకటి కంటే తక్కువ ఇంగ్లీష్ కాని భాషా టైటిల్స్కు అమ్ముడవుతున్నాయి‘ అని నివేదిక చెబుతోంది. ‘శనివారం రాత్రి సిడ్నీ లేదా మెల్బోర్న్లోని ఏదైనా సినిమా థియేటర్లోకి నడిచి చూడండి, మీరు అరబిక్, తగలోగ్, హిందీ, వియత్నామీస్, మాండరిన్, గ్రీక్. లాబీలో తదితర డజను భాషలను వినవచ్చు కానీ లైట్లు మసకబారినప్పుడు, దాదాపు ప్రతి స్క్రీన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది.’’ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికీ అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వాటి మార్కెట్ వాటా 2021లో దాదాపు 95 శాతం నుంచి ఈ సంవత్సరం 91 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ‘జనాభా స్క్రీన్ వాటా మధ్య దాదాపు సమానత్వాన్ని సాధించిన ఏకైక విదేశీ భాషా రంగం భారతీయ భాష మాత్రమే‘ అని అది పేర్కొంది. ‘మాండరిన్, అరబిక్ వియత్నామీస్ జనాభా వారి జనాభాతో పోలిస్తే గణనీయమైన రీతిలో వారి స్క్రీన్ వాటా తక్కువగా కనిపిస్తోందని తేల్చింది. -
ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?
ఇడ్లీ అనేది చాలా మంది భారతీయులకు అలవాటైన అల్పాహారం. దక్షిణాదిలో అయితే ఇడ్లీ ఇంటింటి వంటగానే చెప్పొచ్చు. అల్పాహారానికి అసలైన అర్ధంలా తేలికగా అనిపించడంతో పాటు ఇంట్లోనే ఇడ్లీని సులభంగా రుచిగా తయారు చేసుకోగలిగే వీలు దీని ప్రాధాన్యాన్ని పెంచుతోంది.అంతేకాక ఇది అన్నిరకాల జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రతి రోజూ ఉదయం ఇడ్లీ తినడం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారు..?జీర్ణక్రియకు మేలు..ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలు మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, ఇది సజావుగా జీర్ణక్రియ జరిగేందుకు దారితీస్తుంది. ఇది ఆవిరిలో ఉడికించబడి ఉంటుంది కాబట్టి విచ్ఛిన్నం కావడం సులభం అందువల్ల దానిని ప్రాసెస్ చేయడానికి మన కడుపు అతిగా కష్టపడాల్సిన అవసరం రాదు. ఇది ఆమ్లత్వం, బరువు లేదా తరచుగా కడుపు ఉబ్బరంతో పోరాడుతున్న వారికి మేలైన ఎంపికగా ఉంటుంది. సాంబారుతో తినడం వల్ల ప్రేవుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఫైబర్ను కూడా జోడించినట్టు అవుతుంది.దీర్ఘకాల శక్తిఇడ్లీలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శక్తిని నెమ్మదిగా దశలవారీగా విడుదల చేస్తాయి, దాంతో ఎక్కువసేపు మనల్ని చురుగ్గా ఉంచుతాయి. ఇది ఆకస్మిక ఆకలి పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది బిజీగా ఉండే ఉదయం సమయంలో పనులపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. ప్రోటీన్ కూరగాయలతో జత చేసినప్పుడు, ఇడ్లీ తినే ఆలోచనను నియంత్రించే సమతుల్య ప్రారంభాన్ని అందిస్తుంది. స్థిరమైన శక్తి విడుదల తో మధ్యాహ్నం పూట స్నాక్స్గా జంక్ ఫుడ్ తీసుకునే అవసరాన్ని నివారిస్తుంది.గుండె ఆరోగ్యానికి మద్దతుఇడ్లీని ఆవిరిలో ఉడికించినందున, సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది గుండెపై భారం కలిగించే అదనపు నూనె లేకుండా ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2018లో జరిపిన ఒక అధ్యయనంలో అధిక కొవ్వు గల బ్రేక్ఫాస్ట్లను తక్కువ కొవ్వు ఎంపికలతో భర్తీ చేయడం గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుందని కనుగొంది. ఇడ్లీని సాంబార్తో జత చేసినప్పుడు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు గుండె పనితీరును మెరుగ్గా నిర్వహించడానికి మరింత సహాయపడతాయి.అధిక బరువుకు చెక్...ఒక మీడియం ఇడ్లీలో దాదాపు 35 నుంచి 50 కేలరీలు ఉంటాయి, అందుకే ఇది తక్కువ కేలరీలు కోరుకునేవారికి సరైన అల్పాహారం ఎంపికగా మారుతుంది. దీని తేలికపాటి రూపం.. కడుపును మాత్రం నిండుగా ఉంచుతుంది. ఇడ్లీని సాంబార్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీతో కలిపినప్పుడు, రుచితో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంది ఆకలి తగ్గుతుందిరోగనిరోధక శక్తిపులియబెట్టిన ఆహారాలు పేగుకు మేలు చేస్తాయని అంటారు పేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇడ్లీ జీర్ణం కావడం సులభం పేగు బాక్టీరియా వృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన మొత్తం శ్రేయస్సు, మెరుగైన పోషక శోషణ బలమైన సహజ రక్షణ వ్యవస్థకు దారితీస్తుంది. సమతుల్య ఉదరం ప్రశాంతమైన మానసిక స్థితి, కాంతివంతమైన చర్మం రోగనిరోధక శక్తిని అందిస్తుంది.ఇడ్లీ కొంత ప్రోటీన్ కలిగి ఉంటుంది, కానీ సాంబార్, వేరుశెనగ వంటి పప్పులతో కూడిన చట్నీలు జోడించడం వల్ల ప్రోటీన్ పరిమాణం మరింత పెరుగుతుంది.బియ్యంతో తయారైన ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది, అదే సమయంలో రవ్వ ఇడ్లీ తక్కువ ప్రోబయోటిక్ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి సాంబార్ ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీలతో దీన్ని జత చేయడం మేలు.మరిన్ని పోషకాల కోసం రాగులు, ఓట్స్ లేదా మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండిని కూడా ప్రయత్నించవచ్చు.(చదవండి: Young Talent: వయసు 19 భాషలు 400..! జస్ట్ ఒక్క గంటలో 20 భాషల్లో..) -
వారానికి రూ.3కోట్లట.. ముంబయిలో ఆదాయం..ఇప్పుడు గోవాలోనూ..!
బిగ్ బ్రదర్ అనే షో పేరు ఇప్పుడు ఎంత మందికి గుర్తు ఉంటుందో కానీ బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. అప్పటి దాకా పడుతూ లేస్తూ వచ్చిన ఆమె సినీ కెరీర్ను ఆ ఇంటర్నేషనల్ షో ఒక్క చేత్తో ఆకాశానికి ఎత్తేసింది మరి. మరోచేత్తో మన మన దేశంలో జాతీయ స్థాయిలోనూ, పలు ప్రాంతీయ భాషల్లోకి సైతం బిగ్ బాస్ షోలను తెచ్చేసింది.ఆ క్రేజ్ తో కొంత కాలం పాటు సినిమాలను ఒక ఊపు ఊపిన శిల్పాశెట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తెలివిడి బాగా కలిగిన సెలబ్రిటీ. అందుకే సినిమా గ్లామర్ని పాప్యులారిటీని బాగానే ఉపయోగించుకుంటూ విభిన్న రంగాల్లోకి ప్రవేశించింది. యోగా వీడియోలు, క్రీడా ఫ్రాంఛైజీలు, రెస్టారెంట్లు ఇలా కాదేదీ సంపాదనకు అనర్హం అన్నట్టుగా ఆమె దూసుకుపోతోంది. బహుశా బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఇన్ని వ్యాపారాల్లో రాణిస్తున్న మరొక నటి లేదని చెప్పొచ్చు. అదే క్రమంలో భర్తతో కలిసి స్కామ్స్లో ఇరుక్కోవడం, పోలీసు కేసుల్ని ఎదుర్కోవడం అయినా చలించకుండా ముందుకే అడుగేయడం కూడా ఆమెకు మాత్రమే సాధ్యమైంది.ఈ నేపధ్యంలో తాజాగా శిల్పాశెట్టి తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించింది. గోవాలో బాస్టియన్ కొత్త అవుట్లెట్ను శిల్పా శెట్టి ఏర్పాటు చేస్తోంది. ఈ విజయవంతమైన వ్యాపారవేత్త కూడా అయిన ’సుఖీ’ నటి గోవాలోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ బాస్టియన్ కొత్త అవుట్లెట్ కోసం గత శుక్రవారం ప్రారంభోత్సవ పూజ నిర్వహించింది. ఈ ఫొటోలను తన ఇన్స్టాలోని స్టోరీస్లో పోస్ట్ చేసింది. పూజ సందర్భంగా తెల్లటి ముద్రిత సల్వార్ కమీజ్ ధరించిన ఈ ’ధడ్కన్’ నటి ఓ యజ్ఞం చేస్తున్నట్లు కనిపించింది.ఇప్పటికే ముంబైలోని జుహులో బాస్టియన్ పేరిట ఒక రెస్టారెంట్ను ఆమె విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ గత కొంత కాలంగా విజయవంతంగా నడుస్తోంది. ఇది వారం రోజుల్లోనే ఏకంగా రూ.2 నుంచి రూ.3కోట్ల ఆదాయం అర్జిస్తుందని అంటూ గతంలో సెలబ్రిటీల వ్యాపారాలపై మాట్లాడిన సందర్భంగా ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ శోభాడే వెల్లడించారు. అయితే అనూహ్యంగా గత సెప్టెంబర్లో, ముంబై, బాస్టియన్లోని శిల్పా ఐకానిక్ బాంద్రా రెస్టారెంట్ మూసివేయనున్నట్టు కొన్ని ఊహాగానాలు వచ్చాయి. తరువాత వారు బాస్టియన్ ను అమ్మకై అనే దక్షిణ భారత రెస్టారెంట్గా మారుస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత శిల్ప సోషల్ మీడియా ద్వారా ‘లేదు, నేను బాస్టియన్ను మూసివేయడం లేదని హామీ ఇస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు గోవాకు సైతం తమ రెస్టారెంట్ను విస్తరించడం ద్వారా అన్ని ఊహాగానాలకూ ఆమె చెక్ పెట్టింది. -
నార్త్ అమెరికాలో అత్యంత ఎత్తయిన శ్రీరాముడు
ఇటీవలి కాలంలో భారతీయ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ పురాణాలకు, దేవుళ్లు దేవతలకు గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు లభిస్తోంది. దీంతో విదేశాలలో పలు చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అదే క్రమంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఢిల్లీ, గుర్గావ్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ మనేసర్లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్లో చెక్కిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా కెనడాకు తరలించారు. తరువాత దీనిని అమెరికా నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఒకటే మూర్తిగా మలచింది. ఈ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్గ్లాస్ స్టీల్తో తయారు చేయడం విశేషం. ఇటీవలే జరిగిన ఈ శ్రీరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా భిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులలో, మహిళా లింగ సమానత్వ మంత్రి రీచర్ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షఫ్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూ కూడా హాజరయ్యారు. విగ్రహం ఏర్పాటు చేసిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, శ్రీరాముని కొలువుదీర్చడం వల్ల ఉత్తర అమెరికా అంతటా సందర్శకులకు ఆసక్తి పెరుగుతుందని గుర్తించామన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారన్నారు. చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!ప్రజలు ఆలయాన్ని సందర్శించడంతో పాటు కెనడాలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారు‘ అని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ‘చాలా గర్వించదగ్గ విషయం‘ అని సిద్ధూ అన్నారు. ఈ మూర్తిని ఏర్పాటు చేయడం కేవలం గర్వకారణం కాదు. ఇది సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ధర్మం ఎల్లప్పుడూ మన మార్గాన్ని నడిపించాలని గుర్తు చేస్తుంది‘ అని కేంద్రం వ్యవస్థాపకుడు ప్రధాన పూజారి ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అన్నారు.చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు కుషాగర్ శర్మ మాట్లాడుతూ, ‘10,000 మందికి పైగా ప్రజలు భక్తి ఐక్యత కలిసి శ్రీరాముని 51 అడుగుల ఎతై ్తన మూర్తిని ఆవిష్కరించింది‘ అని అన్నారు. ‘ఇది కేవలం మన విశ్వాసానికి ఒక వేడుక మాత్రమే కాదు, సాంస్కృతిక సామరస్యం ఆధ్యాత్మిక వారసత్వానికి విలువనిచ్చే కెనడియన్లందరికీ గర్వకారణమైన క్షణం‘ అని అన్నారు. మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు దిగేటప్పుడు ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని చెప్పారు. అలాగే ఈ అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం త్వరలో ప్రయాణీకులను స్వాగతించే మొదటి ప్రదేశాలలో ఒకటిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
సెవన్ హిల్స్ సిటీ ఎక్కడ?
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముఖ్యంగా తెలుగువారికి ఏడు కొండలు అనగానే తిరుమల, తిరుపతి గుర్తొస్తాయి. కలియుగ దైవం వెంకటేశ్వరుడిని ఏడు కొండలవాడా అంటూ మనసారా స్మరించుకోకుండా కోట్లాది భక్తులకు రోజు గడవదు. అయితే ఏడుకొండల నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మరొక నగరం కూడా ఉంది. అలా సెవన్ హిల్స్ సిటీగా("City of Seven Hills") ప్రసిద్ధి చెందిన ఆ నగరం ఇటలీ(Italy) రాజధాని రోమ్(Rome)లో ఉంది.ఏడు వేర్వేరు ఎత్తులలో లేదా దాని చుట్టూ నిర్మించిన నగరాలను వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా సెవెన్ హిల్స్ నగరం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలా అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటి రోమ్, ఈ పురాతన పట్టణం అవెంటైన్, కైలియన్, కాపిటోలిన్, ఎస్క్విలిన్, పాలటైన్, క్విరినల్ విమినల్ అనే ఏడు కొండలపై నిర్మితమై ఆ పేరుకు ప్రసిద్ధి చెందింది. ఈ కొండల భౌగోళిక లక్షణం అది మాత్రమే కాదు, అవి రోమన్ నాగరికతకు జన్మస్థలం కూడా. ఇవి అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలలో ఒకదానికి పునాదిగా మారాయి. ఇందులో ప్రతి కొండకు ఒక ప్రత్యేకమైన కథ ఉండడం విశేషం, ఇది రోమ్ గుర్తింపును రూపొందించిన ఇతిహాసాలు, దేవాలయాలు రాజభవనాలతో నిండి ఉంది. ఇవి రోమ్ పురాణాలకు, వారి సంస్కృతికి రాజకీయ కార్యకలాపాలకు కూడా మూలం. పాశ్చాత్య నాగరికతను ప్రభావితం చేసే దీని ప్రకృతి దృశ్యాలు, రోమ్ నగర స్థాపకులైన రోములస్ రెముస్ ల కధలకు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి.పేరు వెనుక చరిత్రరోమ్ నగర ప్రారంభం క్రీ.పూ 753 నాటిది. కవల సోదరులు రోములస్ రెమస్ కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రోములస్ పాలటైన్ కొండను ఆదర్శవంతమైన ప్రదేశంగా ఎంచుకుని రోమ్గా మారేలా దాని నిర్మాణాన్ని ప్రారంభించాడు. కాలక్రమేణా, కాపిటోలిన్ అవెంటైన్ వంటి సమీపంలోని కొండల ప్రజలు కలిసి, ఒకే బలమైన విశాలమైన నగరాన్ని సృష్టించారు. ఈ ఏడు కొండలు మొదట అడవులు నదులతో చుట్టుముట్టబడిన ప్రత్యేక గ్రామాలు. జనాభా పెరిగేకొద్దీ, గ్రామాలు విలీనం అయ్యి ఒకే నగరంగా మారాయి. ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతన ప్రపంచాన్ని పాలించిన నాగరికత అయిన రోమన్ సామ్రాజ్యానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నగరంగా నిలుస్తోంది రోమ్.. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా సందర్శకులు ఈ ఏడు కొండలను సమీపంలోని చారిత్రక విశేషాలను ఆసక్తిగా అన్వేషిస్తారు.(చదవండి: The Chai Story: పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...) -
పేరు మార్చుకున్న రిషబ్ శెట్టి.. ఎందుకు? అసలు పేరు ఏంటి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు. అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు. అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు. పేరు మార్పు తన కెరీర్లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం. -
ప్రతీ కుక్కకూ ఓ దీపావళి..దివాలీ శునకపూజ..ఎక్కడంటే..
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని, ప్రతీ పనికిరాని అని మనం అనుకునే వ్యక్తికీ కూడా ఒక రోజంటూ వస్తుందని వాడుకగా చెప్పుకుంటాం. అయితే నేపాల్లో నిజంగానే కుక్కలకు అంటూ ఒక రోజు వస్తుంది. కుక్కలకే కాదు కాకులకు కూడా. ఈ వివరాలు తెలియాలంటే దీపావళి సందర్భంగా నేపాల్ లో కనిపించే ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి.యమ పంచక్ లేదా దీపావళి అని కూడా పిలిచే తీహార్ , నేపాల్లో జరుపుకునే అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. తరచుగా లైట్ల పండుగ అని కూడా పేర్కొనే తీహార్, ఉత్సాహభరితమైన ఆచారాలు, కుటుంబ బంధాలు ప్రకృతితో సహజీవనపు వేడుకగా గుర్తింపు పొందింది. నేపాల్ అంతటా హిందువులు, బౌద్ధులు కూడా జరుపుకునే పండుగ ఇది. ఐదు రోజుల పాటు దేవతలు, జంతువులు సోదర సోదరీమణుల మధ్య అను బంధాన్ని ఈ పండుగ గౌరవిస్తుంది. హిందూ చాంద్రమాన క్యాలెండర్ (కార్తీక మాసం) ఆధారంగా ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు తీహార్ వేడుకలు జరుపు కుంటున్నారు. ఈ ఉత్సవం నేపాల్ ఇళ్లు, వీధులను కాంతులతో, సంగీత సంబరాలతో నింపుతుంది. దాదాపుగా మన దగ్గర జరిగే దీపావళి తరహాలోనే ఈ పండుగ కూడా ఉంటుంది. రంగు రంగుల లైట్లు రంగులను ఆస్వాదించడం, లక్ష్మీ దేవిని పూజించడం, రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం వరకూ కాకపోతే.. మానవులు జంతువులు, సోదరులు సోదరీ మణుల మధ్య బలమైన సంబంధాన్ని ప్రదర్శించడం ప్రత్యేకత అని చెప్పాలి.తీహార్ అంటే?కాంతి ప్రేమ ల పండుగ, ఇది జంతువుల ప్రాముఖ్యత, కుటుంబ సంబంధాల విలువలను, దైవిక ఆశీర్వాదాలను నొక్కి చెబుతుంది. ఇది యముడు (మరణ దేవుడు) , లక్ష్మీదేవి (సంపద శ్రేయస్సు నిచ్చే దేవత) లను గౌరవించడానికి ప్రకృతిలో అంతర్భాగంగా ఉన్న జంతువుల పట్ల కృతజ్ఞతను తెలియజేయడానికి జరుపుకుంటారు. చెడుపై మంచి విజయంపై సాధించే మాదిరిగా కాకుండా, తీహార్ పండుగ ఐక్యత, శ్రేయస్సు మానవులు, దేవతల మధ్య అనుబంధాన్ని చూపించేదిగా ఉంటుంది. చదవండి: ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనంప్రత్యేకం ‘‘కుకర్ తిహార్’’ (Kukur Tihar )ఐదు రోజుల పాటు జరిగే పండుగలో రెండవ రోజు కుకర్ తిహార్ గా జరుపుకుంటారు. ఆ రోజు కుక్కలకు గజ్రాలు (పూల హారం) వేసి అలంకరిస్తారు, తిలకం (కుంకుమ బొట్టు) పెడతారు, ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. ఈ ఆచారం వెనుక భావన ఏమిటంటే హిందూ పురాణాల్లో కుక్కలను యమ« దర్మరాజు దూతలుగా పరిగణిస్తారు. కాబట్టి వాటిని గౌరవిస్తే మనకు రక్షణ లభిస్తుందని నమ్మకం. విశేషం ఏమిటంటే ఆ రోజున వీధి కుక్కలకు సైతం పూజ చేస్తారు మన దేశంలోనూ గోవులకు పూజలు చేసే సంప్రదాయం ఉన్నా ఈ విధంగా కుక్కలకు పూజ చేయడం మాత్రం ఒక్క నేపాల్లో తప్ప మరెక్కడా లేదు.ఐదు రోజులు ఐదు విధాలుగా...–1వ రోజున కాగ్ తిహార్ జరుపుతారు. ఆ రోజున కాకులకు, గద్దలకు పూజ చేస్తారు. అన్నం, తీపి పదార్థాలు ఇస్తారు. వీటిని గౌరవిస్తే చెడు శకునాలు దరిచేరవనీ నమ్మకం.–2వ రోజు కుకర్ తీహార్ పేరుతో కుక్కలకు పూల హారం, తిలకం వేసి పూజ చేస్తారు. వీటిని కూడా యమధర్మరాజు దూతలుగా పరిగణిస్తారు.–3వ రోజు గై తిహార్ పేరుతో ఉదయం వేళలో ఆవులను పూజిస్తారు. ఆవు సంపద, శాంతి, మాతృత్వానికి చిహ్నం గా నమ్ముతారు. అదే రోజునసాయంత్రం ఇళ్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు.–4వ రోజున గోవర్ధన్ పూజ / ‘మ్హ ’ పూజ చేస్తారు. ఆ రోజున ఎద్దులను పూలతో, పసుపుతో అలంకరించి పూజిస్తారు.. అంతేకాదు అదే రోజు ‘‘మ్హా పూజ’’ అంటే స్వశరీరాన్ని పూజించి ఆత్మశుద్ధి పొందడం.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ–5వ రోజున భాయ్ తికా పేరుతో అక్కాచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్ల అనుబంధంను వేడుకగా జరుపుకుంటారు.ఆ రోజు అక్కాచెల్లెమ్మలు తమ అన్నల తలపై రంగురంగుల తికా (ఏడు రంగులతో) వేస్తారు. అన్నలు చెల్లెమ్మలకు బహుమతులు ఇస్తారు. ఇది ప్రేమ, రక్షణ, బంధుత్వానికి ప్రతీకగా భావిస్తారు. -
ఈ తియ్యటి పండుతో షుగర్కి చెక్ : తాజా అధ్యయనం
అమ్మో యాపిల్, అమ్మో మామిడి పండా? అమ్మో సీతాఫలమా? మధురమైన అలాంటి పండ్లు మన చేత అమ్మో అనిపిస్తున్నాయి అంటే... నిస్సందేహంగా అది డయాబెటిస్ సమస్య వల్లే అని చెప్పొచ్చు. దాంతో చాలా కాలంగా తియ్యటి పండ్లు అనేవి షుగర్ వ్యాధి ఉన్నవారికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కొన్ని అధ్యయనాలు ఈ ఆలోచనలకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అలాంటిదే ఆ తాజా అధ్యయన ఫలితం. ఇది పండ్లు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని చెప్పడం మరింత విశేషం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సహజమైన మధురమైన తీపికి పేరుగాంచిన మామిడి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చునట. తాజా పరిశోధనలు దీనిని వెల్లడించాయి. జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో, తక్కువ చక్కెర ఉన్న స్నాక్స్ ఎంచుకున్న వారితో పోలిస్తే, వాటికి బదులుగా రోజూ మామిడి పండ్లు తినే వ్యక్తుల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపడింది. అంతేకాదు వారు శరీర కొవ్వును సైతం తగ్గించుకుంటారని తేలింది. గత ఆగస్టులో ‘‘డైలీ మ్యాంగో ఇంటెక్ ఇంప్రూవ్స్ గ్లైసెమిక్ అండ్ బాడీ కంపోజిషన్ అవుట్కమ్స్ ఇన్ అడల్ట్స్ విత్ ప్రిడియాబెటిస్: ఎ రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీ’’ అనే శీర్షికతో ఫుడ్స్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఫలితాలు, మొత్తం ఆహారాలలో చక్కెర పోషక సందర్భం చక్కెర కంటెంట్ కంటే చాలా కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెబుతున్నాయి.మామిడి ప్రయోజనాల వెనుక సైన్స్ఈ సందర్భంగా సైన్స్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జార్జ్ మాసన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రైదే బసిరి మాట్లాడుతూ ఆహారంలో ఎంత చక్కెర ఉందో దాని గురించి మాత్రమే కాదు, మొత్తం పోషక సమతుల్యత గురించి వివరించారు. ఉదాహరణకు, మామిడి పండ్లు ఒక ప్రత్యేకమైన సమతుల్యతను అందిస్తాయి అవి సహజమైన చక్కెరలను కలిగి ఉన్నప్పటికీ, వీటితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఈ కలయిక నెమ్మదిగా చక్కెర శోషణకు సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.అయితే దీనికి విరుద్ధంగా, ప్రాసెస్ చేసిన తృణæధాన్యాలు లేదా ప్యాక్ చేసిన తక్కువ చక్కెర కలిగిన స్నాక్స్ వంటివి ఈ సహజ సమతుల్యతను కలిగి ఉండవు తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతూ అతిగా తినకుండా నిరోధిస్తుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్, సురక్షిత వినియోగ చిట్కాలుమామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ మితమైన పరిధిలోకి వచ్చేలా 51–56 మధ్య స్కోర్ చేస్తుంది, ఇది నారింజ రసంతో పోల్చదగిన పరిధి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఎడిఎ) చెబుతున్న ప్రకారం, ఇది మామిడి పండ్లను తక్కువ నుంచి మధ్యస్థ వర్గంలో ఉంచుతుంది, ఇది మితమైన వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. చక్కెరలు జోడించకుండా తాజాగా, ఫ్రోజెన్ లేదా సరైన విధంగా నిల్వ చేసిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలని ఎడిఎ సూచిస్తోంది. ఒక సాధారణ పండు ద్వారా దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది ఒక కప్పు మామిడిలో మూడింట రెండు వంతులకు సమానం. అయితే ఎండిన పండ్ల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల అవి చక్కెరలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి తాజా పండ్లు ఎండిన రకాల కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని ఏడిఎ పేర్కొంది.అదనపు ఆరోగ్య ప్రయోజనాలురక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, మామిడి పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. 2011లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీన్ని వెల్లడించింది. ఫ్రీజ్–డ్రైడ్ మామిడితో కూడిన ఆహారం ఎలుకలకు తినిపించడం వల్ల లిపిడ్ లేదా ఫెనోఫైబ్రేట్ రోసిగ్లిటాజోన్ వంటి చక్కెర–తగ్గించే మందులతో చికిత్స పొందిన వాటితో పోలిస్తే తక్కువ శరీర కొవ్వు, తగ్గిన కొలెస్ట్రాల్ మెరుగైన గ్లూకోజ్ స్థాయిలు కనిపిస్తాయని గమనించారు. మామిడి వంటి పండ్లను ఒకరి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా తీపి కోరికలు తీరడమే కాకుండా జీవక్రియ ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుందని, ఈ ఉష్ణమండల పండును సమతుల్య జీవనానికి ఆశ్చర్యకరంగా స్మార్ట్ ఎంపికగా మారుస్తుందని పరిశోధన నొక్కి చెబుతుంది.అధిక రక్త చక్కెర సంకేతాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, అధిక రక్త చక్కెర, హైపర్ గ్లసీమియా అని పేర్కొనే ప్రారంభ సంకేతాలు క్రమ క్రమంగా కనిపిస్తాయి అధిక దాహం లేదా ఆకలి, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి అస్పష్టమైన దృష్టి ఉండవచ్చు. పెరుగుతున్న గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి శరీరం కష్టపడడం వల్లే ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఎక్కువ కాలం పాటు అదుపు చేయకుండా వదిలేస్తే, దీర్ఘకాలిక హైపర్ గ్లసీమియా నిరంతర అలసట, అనూహ్యంగా బరువు తగ్గడం, చర్మ ఇన్ఫెక్షన్లు, త్వరగా నయం కాని కోతలు లేదా పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సకాలంలో జీవనశైలి మార్పులు, వైద్య జోక్యం వల్ల నరాల దెబ్బతినడం వంటి మధుమేహ సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి?ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఫైబర్, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పిండి లేని కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. శుద్ధి చేసిన చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలను బాగా పరిమితం చేయండి. గ్లూకోజ్లో హెచ్చుతగ్గులు తగ్గుదలను నివారించడానికి చిన్న, సాధారణ భోజనం తినండి. చురుకైన నడక లేదా యోగా వంటి రోజువారీ వ్యాయామంతో కనీసం 30 నిమిషాలు చేస్తూ చురుకుగా ఉండండి. ఒత్తిడి హార్మోన్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి కాబట్టి ధ్యానం లేదా లోతైన శ్వాస ద్వారా ఒత్తిడిని నియంత్రించండి. తగినంత నిద్ర పొందండి హైడ్రేటెడ్గా ఉండండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి చక్కెరను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడానికి తరచు వైద్య సలహాను అనుసరించండి. -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నాగార్జున లానే...మాకూ న్యాయం కావాలి అంటున్న నటీనటులు
ఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్ఎక్స్లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది. దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.భయపెడుతున్న ఏఐ..ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ప్లాట్ఫారమ్లలో సోషల్ మీడియా ప్రొఫైల్లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఇ–కామర్స్ సైట్లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్ఫారమ్లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాది (షెట్టి) డీప్ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
పావురాలు Vs పౌరులు: ఎవరు ముఖ్యం? పెటాపై ప్రజాగ్రహం...
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది. పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్లైన్లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు. -
పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...
మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయినప్పటికీ టీ జన్మస్థలం భారత దేశం కాదు ఈ పానీయంపై చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 19వ శతాబ్దంలో పెద్ద ఎత్తున టీ సాగును ప్రవేశపెట్టింది. మొదట్లో, భారతీయులను అది లక్ష్యం చేసుకోలేదు. టీ ఎగుమతి ఇతర ప్రముఖ సంపన్న దేశాలకు ఉండేది. కానీ అనూహ్యంగా భారతీయులు ఆ విదేశీ అలవాటును తమ స్వంతం చేసుకున్నారు.అయితే 1900లలో బ్రిటిష్ కంపెనీలు స్థానికంగా టీని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, దానిని మరింత రుచికరంగా మార్చడానికి పాలు చక్కెరను జోడించమని వారే మనవాళ్లని ప్రోత్సహించారు. ఈ ఆలోచన వారు ఊహించిన దానికంటే బాగా పనిచేసింది. భారతీయులు ఆ పానీయాన్ని స్వీకరించడమే కాదు, దానిని తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు.కలిసి...కరిగిపోయి...భారతీయ వంటశాలలలో పాలు అంటే ఒక పదార్ధం కంటే ఎక్కువ ఇది పోషణ, స్వచ్ఛత సంప్రదాయం. బాల్యంలో హల్దీ దూద్ గ్లాసుల నుంచి పండుగ స్వీట్ల వరకు, పాలు అనేక రకాలుగా భారతీయుల్ని వారి అభిరుచుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి అది మనం తాగే టీలో కూడా సులభంగా, వేగంగా కలిసిపోయింది. భారతదేశంలోని చిన్న పట్టణాలు మార్కెట్లలో టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతం దాని స్వంత రుచులను దానికి జోడించింది.ఆ తర్వాత మసాలా చాయ్ వచ్చింది. వెచ్చదనం కోసం అల్లం, సువాసన కోసం ఏలకులు, కిక్ కోసం లవంగం, గాఢత కోసం దాల్చిన చెక్క... పాల తర్వాత టీలో కలిపే జాబితా లో చేరిపోయాయి.చాయ్...రాజా చాయ్...20వ శతాబ్దం మధ్య నాటికి, చాయ్వాలా రైల్వే ప్లాట్ఫామ్లు వీధి మూలలను ఆక్రమించి, ప్రయాణికులకు కార్మికులకు ఆవిరితో కూడిన పాల టీ గ్లాసులను అందించారు. వలసరాజ్యాల ఎగుమతిగా ప్రారంభమైన ఈ పానీయం రోజువారీ అలవాటుగా ఎన్ని విధాలుగా అయినా మార్పు చేర్పులకు అనుకూలించేదిగా మారింది. భాష, కులం వంటకాల ద్వారా వ్యత్యాసాలున్న మన దేశంలో, టీ ఒక విధంగా ఉమ్మడి అభిరుచిని నిర్మించింది. ఇద్దరు అపరిచితులు ఒక మాటను పంచుకోకపోవచ్చు, కానీ పంచుకున్న కప్పు చాయ్ ఎంతటి దూరాన్ని అయినా కరిగించగలదు అన్నంతగా ప్రభావాన్ని చూపుతోంది.మరికొన్ని దేశాలకూ విస్తరించిన మిల్క్ టీ...భారతదేశం వెలుపల, టీ వేరే రూపాల్లో సంచరిస్తోంది. టీ పుట్టిన చైనా జపాన్లలో తేనీటి స్వచ్ఛతకు విలువ ఇస్తారు. వారి దృష్టి ఆకుపై, దాని వాసనపై మాత్రమే ఉంటుంది. వారు పాలు కలపరు. బ్రిటిష్ వారు కూడా పాలు అతి తక్కువగానే కలుపుతారు.మన దేశం కాకుండా యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తైవాన్ థాయిలాండ్ వంటి దేశాలలోనూ పాలతో టీ అనే అలవాటు ఉన్నప్పటికీ మన దేశంతో పోటీపడే స్థాయిలో కాదు. మంగోలియా, ఇథియోపియా, బురుండి, కెన్యా ఆఫ్రికాలోని అనేక ఇతర దేశాలు ముఖ్యమైన మిల్క్ టీ సంప్రదాయాలు ఉన్నాయి. -
హీరోయిన్ను అలా టచ్ చేసిన సౌబిన్.. వీడియో వైరల్
సందట్లో సడేమియా... శునకానందం పొందాలయా...అన్నట్టుగా మారుతోంది కొందరు ప్రబుద్ధుల ప్రవర్తన. అభిమానం పేరిట అసభ్యత ముదురుతోంది. ముఖ్యంగా హీరోయిన్లపై అది అనుచితంగా మారుతోంది. రకరకాల కారణాలతో జన సమూహాల్లోకి వస్తున్న కధానాయికలను అసభ్యకరంగా తాకకూడని చోట తాకుతున్న సంఘటనలు కంపరం కలిగిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలలో బాధితులుగా మారిన పలువురు తారల జాబితాలో ఇప్పుడు మళయాళ నటి నవ్యనాయర్ కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే... పాతిరాత్రి అనే మళయాళ చిత్రంలో సౌబిన్ షాహిర్ (కూలీ ఫేమ్) నవ్యనాయర్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని వీరిద్దరూ పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే క్రమంలో కోజికోడ్లోని హైలైట్ మాల్లో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ తర్వాత సినిమా తారాగణం వేదిక నుంచి బయటకు వెళుతుండగా, ఊహించని సంఘటన జరిగింది, అక్కడ జనంలో ఉన్న ఒక వ్యక్తి నటి నవ్య నాయర్ను అకస్మాత్తుగా వెనుక నుంచి తడిమాడు. ఇది జరిగిన వెంటనే సౌబిన్ షాహిర్(Soubin Shahir) కూడా నవ్యనాయర్ను కాపాడే క్రమంలో తాను కూడా టచ్ చేశాడు. ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. తొలుత తనను తాకిన వ్యక్తి వైపు నవ్యనాయర్ ఉరిమిచూడడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లలో అనేక మంది నటికి మద్దతుగా కామెంట్స్ చేశారు. అయితే కొందరు మాత్రం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు, అపరిచితులు తాకితే ఉరిమి చూసిన నటి సౌబిన్ తాకితే ఎందుకు ఊరుకుంది? అంటూ కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై చాలా మంది అభిమానులు సౌబిన్ను సమర్థించడానికి ముందుకు వచ్చారు, వీడియోను పరిశీలనగా చూడాలని అందులో, అగంతకుడు తాకిన తర్వాత ఆమెకు రక్షణగా మాత్రమే సౌబిన్ వ్యవహరించాడని అంటూ కొందరు పరిణితి ప్రదర్శించారు. అంతేకాక తనను రెండవ సారి తాకింది సౌబిన్ అని ఆమెకు తెలుసు. అంటూ గుర్తు చేశారు. ‘‘ఒకరి శరీరంపై చేతులు పెట్టడానికి అనుమతి అవసరం... ఈ సంఘటనలో సౌబిన్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిoచినట్టు స్పష్టంగా తెలుస్తోంది.’’ అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.రతీనా దర్శకత్వం వహించి బెంజీ ప్రొడక్షన్స్ నిర్మించిన పాతిరాత్రి సినిమాలో నవ్య సౌబిన్లు పోలీస్ ఆఫీసర్లు జాన్సీ, హరీష్ పాత్రలను పోషించారు. అర్ధరాత్రి జరిగే ఒక రహస్య సంఘటనను వారు వెలికితీసే థ్రిల్లర్ ఈ జంటను అనుసరిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల అవుతోంది. View this post on Instagram A post shared by IndianCinemaGallery (@indiancinemagallery_official) -
పన్నెండు వేల కోట్లకు అధిపతివి.. పాన్ మసాలా అమ్ముకునే ఖర్మేంటి?
గత కొంత కాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. చేతిలో చానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక, ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు. అలాంటిదే ఒక తాజా వీడియో ని యూ ట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేశాడు. తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాథీ వాతపెట్టాడు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాప్యులారిటీని పైసల కోసం ఎడాపెడా వాడుకుంటున్న నేపధ్యంలో ఈ వీడియో అనేకమందిని ఆకర్షించింది.హాలీవుడ్ స్టార్స్ని దాటేసిన షారూఖ్షారూఖ్ ఖాన్ కు నా ప్రశ్న‘ పేరుతో భారతీయ యూట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేసిన ఇటీవలి వీడియో లో చెప్పిన ప్రకారం... బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్ని అందుకున్నారు, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ నటుడి నికర విలువను 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. ఈ నేపధ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ, సంపదల విషయంలో టామ్ క్రూజ్ ది రాక్ (డ్వేన్ జాన్సన్) వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది. ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాలా.. దాదాపు రూ. 12,400 కోట్లు. మీరు విన్నది నిజమే ‘షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే రూ. 12,400 కోట్లకు పెరిగింది‘ అని రాతీ చెప్పారు. ‘అది ఎంత డబ్బో మీకు తెలుసా? అబ్బో మనం ఊహించడం కూడా కష్టం,‘ అని అతను నొక్కి చెప్పాడు.కూర్చుని తిన్నా తరగనంత...పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత , ప్రతిరోజూ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించి, అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, అతను తన మొత్తం నికర విలువలో దాదాపు రూ. 400–500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాథీ వీడియోలో విశ్లేషించాడు. ఈ నేపధ్యంలో ‘షారూఖ్ ఖాన్కి నా ప్రశ్న, మీకు ఈ డబ్బు సరిపోలేదా? అది సరిపోతే, మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైనదాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు?‘అంటూ రాథీ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు.గత 2014లో పాన్ మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్మెంట్ రుసుము గురించి కూడా రాథీ చర్చించాడు ‘‘మీకు నిజంగా ఈ అదనపు రూ. 100–200 కోట్లు అవసరమా?‘ అని నిలదీశాడు‘ దాని గురించి మరొక విధంగా ఆలోచించండి: దేశంలోని అగ్ర నటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే, అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది?‘ అంటూ ఆలోచించమని కోరాడు. అంతేకాదు ఆ వీడియోను సదరు సూపర్స్టార్కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు.గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్ కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రతీ సెలబ్రిటీని, సినీ అభిమానిని ఆలోచింపజేసేలా థృవ్ రాథీ వీడియో ఉందనేది నిస్సందేహం.My question to Shah Rukh Khan.@iamsrk pic.twitter.com/MZjCbsIkjx— Dhruv Rathee (@dhruv_rathee) October 15, 2025 -
రిషబ్ శెట్టి నివాసం..విశేషాల ఆవాసం... రేటు ఎంతంటే..?
కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు, కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్ శెట్టి భవనం కళ, సంప్రదాయం సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది,ఆ ఇంట్లోని ప్రతీ చోటూ ఒక కధను చెబుతుంది. ఆ ఇంటిలోని పలు చోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం.ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మింతమైన ఈ భవనం ఓ క్లాసిక్ గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశ ద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయ గంటను కలిగి ఉంటుంది, ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్ను అందిస్తుందిలోపలికి అడుగు పెట్టగానే ఈ స్థలం నాలుగు మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది, ఇల్లు సూర్యకాంతి తో చుట్టుముట్టేలా...300 కిలోల గ్రానైట్తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారా లోని రైఫిల్, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి.కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి ’ఛాంటింగ్ కార్నర్’ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నిర్దిష్ట నల్ల రాయిపై ఏడు సెకన్ల పాటు గానీ నిలబడితే, గాలి భూత కోల శ్లోకాలతో నిండిపోతుంది, దాదాపుగా కాంతారా లోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది.ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్ స్క్రీనింగ్ గది కూడా ఉంది. ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు, 150–అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టచ్ ఇస్తూ గదిలోని షాండ్లియర్ను మంగళూరు టైల్స్తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ అని పేరు కలిగిన ప్రొజెక్టర్, ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథ ను జోడిస్తుంది.తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకూ కొనసాగుతుంది. నల్ల రాయి కౌంటర్ ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్ చేస్తుంటారు. కోరి గస్సీ (చికెన్ కర్రీ) వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 1,200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది, వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ థ్రిల్లర్ల వరకు, శెట్టి విస్త్రుత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి.పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్, కెమెరాలు ప్రవేశ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి యక్ష అనే రిటైర్డ్ కోస్టల్ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్ లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి ఆసక్తికరంగా, కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్వర్డ్ మారుతుంటుంది. View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
ఆ దంపతుల అభి‘రుచే’ సపరేటు.. అమెరికాలో వడాపావ్ పిక్నిక్కి అదే రూటు
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు. అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్లో వడ పావ్ పిక్నిక్లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్లైన్లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు. View this post on Instagram A post shared by The Vada Pav Project (@thevadapavproject) (చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!) -
'వాకింగ్' తినక ముందా? తిన్నతర్వాతా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం అత్యధికులకు అందుబాటులో ఉన్న మంచి వ్యాయామం వాకింగ్. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం కావడంతో దీనిని అనేకమంది ఎంచుకుంటున్నారు. అయితే వాకింగ్కు సంబంధించి పూర్తి ప్రయోజనాలు లభించాలంటే ఎప్పుడు ఎలా వాక్ చేయాలి అనేదానిపై అవగాహణ ఉండాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజూ మూడు లేదా నాలుగు పూటలా తినే అలవాటున్నవారు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం...భోజనం ముందు...అప్పటికి ఖాళీ కడుపుతో ఉన్నా లేదా తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుని ఉన్న స్థితిలో నడవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ కరుగుతుందన్నమాట. నడకకు ముందు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన భోజనంతో పోలిస్తే ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, నడకకు అవసరమైన శక్తి ఖర్చు తగ్గుతుంది. అల్పాహారం లేదా భోజనానికి ముందు చిన్నపాటి నడక భోజన కాంక్షను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంపై గ్లూకోజ్ లోడ్ పడకుండా చురుకుదనాన్ని పెంచుతుంది. ఉదయం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు ముందు 10–20 నిమిషాలు, తేలికపాటి నడక మేలు.భోజనం తర్వాత...భోజనం తర్వాత కూర్చోవడం కంటే 2–10 నిమిషాలు తేలికగా నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చోటు చేసుకునే చక్కెర స్థాయి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక కలిగించే లాభాలు మిగిలిన సమయాల్లో చేసే సుదీర్ఘ నడకతో ధీటుగా ఉంటాయని అవి తేల్చాయి. నడక జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణ కోసం ప్రతి భోజనం తర్వాత చిన్న నడక అవసరం. భోజనం తర్వాత తేలికపాటి నడక గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది యాసిడ్ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది; అయితే భోజనం తర్వాత తీవ్రమైన లేదా వేగవంతమైన నడక మాత్రం మంచిది కాదు. అలాగే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం 10–20 నిమిషాల వ్యవధిలో ప్రారంభించి 5–15 నిమిషాలు కొనసాగిస్తే జీర్ణ ప్రయోజనాలకు ఉపయుక్తం.లక్ష్యాన్ని బట్టి సమయ పాలన...ప్రాథమిక లక్ష్యం కొవ్వు తగ్గడం అయితే, ఖాళీ కడుపుతో నడవడం వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఏమీ తినకుండా శ్రమించినప్పుడు శరీరం గతంలో పేరుకున్న కొవ్వు నిల్వలను శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఈ ప్రక్రియను కొవ్వు ఆక్సీకరణం అంటారు. సరైన ఆహారం తీసుకుంటూ ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే కొందరికి తినడానికి ముందు నడవడం వల్ల తల తిరుగుతుంది లేదా అలసట రావచ్చు, అలాంటి వారు నడకకు ముందు ఒక చిన్న బలవర్ధకమైన చిరుతిండి (ఉదాహరణకు బాదం వంటి నట్స్తో చేసినవి)తీసుకోవడం మంచి ఆలోచన.డయాబెటిస్ తగ్గాలంటే...రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి, భోజనం తర్వాత నడవడం మంచిది. తిన్న 30 నిమిషాలలోపు 10–15 నిమిషాలు తేలికపాటి నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.మనసు మాట వినాలి...కొంతమందికి ఖాళీ కడుపుతో నడవడం వల్ల బాగా శక్తివంతంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం. ఉపవాసం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా వారు మానసికంగా పదునుగా మారి పనిపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఫీలవుతారు. మరికొందరికి భోజనం తర్వాత నడవడం వల్ల చురుకుగా అనిపించవచ్చు. అంతిమంగా, వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కూడా గమనించాలి. ఉదయాన్నే నడుస్తున్నా లేదా రాత్రి భోజనం తర్వాత అయినా, క్రమం తప్పకుండా నడవడం మాత్రం చాలా అవసరం. గుండె, మెదడు, మానసిక స్థితి జీవక్రియకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
అయోధ్య రామ్ లీలా... రికార్డుల హేల
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీరాముని నగరమైన యోధ్య మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. దసరా నవరాత్రలు నేపధ్యంలో ఉత్తర ప్రదేశ్లోని అయోధ్య వేదికగా నిర్వహించిన రామ్లీలా (Ayodhya Ramlila ) ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప రామ్లీలాగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిజిటల్ విప్లవ యుగంలో, ఈ కార్యక్రమం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా మారింది. ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం...3–డీ సాంకేతికత ఆధునిక వేదిక అలంకరణ ఈ «ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. ఎక్కువ సంఖ్యలో రామ భక్తులను చేరుకోవడానికి రామ్లీలా ప్రత్యక్ష ప్రసారం కోసం ఈ సంవత్సరం 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఈ ప్రసారం, ఆరాధన, టాటా ప్లే, షెమరూ మీ, Vఐ యాప్, ఎయిర్టెల్, షెమరూ భక్తి యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీలు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల వ్యాప్తంగా జరిగింది. అకేలే షెమరూ భక్తి యూట్యూబ్ ఛానెల్లో ఎనిమిది కోట్లకు పైగా ప్రజలు దీనిని వీక్షించారు. వేదికపైనే కాకుండా తెరపై కూడా, ఈ కార్యక్రమం కొత్త చరిత్రను సృష్టించింది. ఈ సంవత్సరం, రామ్లీలాను 50 కి పైగా దేశాలలో ఆన్లైన్లో ప్రసారం చేశారు మొత్తం 62 కోట్లకు పైగా రామభక్తులు వీక్షించారు.ఐదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన వీక్షకులు....అయోధ్యలోని రాంలీల ప్రతి సంవత్సరం డిజిటల్ వీక్షకుల పరంగా రికార్డులను సృష్టించడం గమనించదగ్గ విషయం. గూగుల్ డేటా ప్రకారం, 2020లో 16 కోట్ల మంది వీక్షకులు, 2021లో 20 కోట్ల మంది వీక్షకులు, 2022లో 25 కోట్ల మంది వీక్షకులు, 2023లో 40 కోట్ల మంది వీక్షకులు, 2024లో 41 కోట్ల మంది వీక్షకులు మరియు 2025లో 62 కోట్ల మంది వీక్షకులు దీనిని వీక్షించారు. ఈ అద్భుతాన్ని సాకారం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. గత 2020లో రామ్లీలాను అప్పటి పర్యాటక సాంçస్కృతిక శాఖ మంత్రి నీలకాంత్ తివారీ ప్రారంభించారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి మార్గం సుగమం చేశారు.దేశ దేశాలలో శ్రీరామ నామస్మరణ...రామ్లీలా సమితి వ్యవస్థాపకులు సుభాష్ మాలిక్ శుభం మాలిక్ ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విప్లవానికి కేంద్రంగా మార్చారు. రామ్నగరి అయోధ్యలో ప్రదర్శించిన ఈ రామ్లీలా మొత్తం ప్రపంచపు రామ్లీలాగా మారింది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, మంగోలియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఎఇ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మారిషస్, ఫిజి, ట్రినిడాడ్, టొబాగో, కెన్యా, నైజీరియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, రష్యా, కెనడా, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలో కోట్లాది మంది రామభక్తులు దీనిని వీక్షించారు.(Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు)అయోధ్యలోని రామ్లీలా శ్రీరాముని కథ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే సాంస్కృతిక వారధి అని నిరూపించేలా యోగి సర్కార్ సహకారం డిజిటల్ టెక్నాలజీ సంగమం రామ్లీలాను ప్రపంచ వేదికపైకి తీసుకువచ్చాయి భారతీయ ఆధ్యాత్మిక వైభవం అంతర్జాతీయ విశేషంగా మారింది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?సినీ సందడి...శ్రీరాముని నగరమైన అయోధ్యలో జరిగిన గ్రాండ్ రామ్లీలా ఈ సంవత్సరం సినీ తారల సందడితో మరింత ప్రత్యేకంగా మారింది. మన దేశపు ప్రముఖ నటులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయంగా మార్చారు. ఢిల్లీ, ముంబై నుంచి 250 మందికి పైగా సినీ కళాకారులు ఈ రామ్లీలాకు హాజరై పలు రకాల ప్రదర్శనలు సమర్పించారు. ప్రముఖ నటి భాగ్యశ్రీ తల్లి సీతమ్మ పాత్రను పోషించి ప్రదర్శించింది. విందు దారా సింగ్ తన శక్తివంతమైన నటనతో హనుమంతుని పాత్రకు ప్రాణం పోశారు. ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి చెందిన షాబాజ్ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. ప్రముఖ నటుడు అనిల్ ధావన్ విభీషణుడి పాత్రను పోషించారు. హాస్యనటుడు సునీల్ పాల్ నారదమునిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీనితో పాటు, మనోజ్ తివారీ, రవి కిషన్, రాకేష్ బేడి, రజా మురాద్, అష్రాని, అవతార్ గిల్, రీతు శివపురి, షీబా మరియు అరుణ్ బక్షి కూడా తమ తమ పాత్రలతో రామ్లీలాకు అభినయ వైభవాన్ని జోడించారు.అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణ కేంద్రంగా మారిన రాంలీలా సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మిస్ యూనివర్స్ 2024చ 2025ల రాక కూడా ఈ ఈవెంట్ను కొత్త శిఖరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించింది. -
బ్యాక్ పెయిన్ ఉంటే...స్వీట్ తిన్నా, టీ తాగినా తంటాలే!
ఇప్పుడు అత్యధికులను వేధిస్తున్న నొప్పుల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఎక్కువ సేపు కూర్చుని చేసే పనుల వల్ల కావచ్చు వాహనాల డ్రైవింగ్ వల్ల కావచ్చు అనేక మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. మాత్రలు, ఫిజియోథెరపీలతో కూడా ఫలితం కనిపించక ఆవేదన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో ... తీసుకునే ఆహారం కూడా ఈ సమస్య ఎదుర్కుంటున్న వారి వెన్ను నొప్పిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి అంటున్నారు వైద్యులు. వారు చెబుతున్న ప్రకారం.. డిస్క్ అనే పదం ’ఇంటర్ వెర్టెబ్రే’ కు సంక్షిప్త రూపం. , ఈ డిస్క్లు వెన్నెముక (వెన్నుపూస) ఎముకలను వేరు చేసే స్పాంజి కుషన్లు అని చెప్పొచ్చు. ఈ డిస్క్లు షాక్, శోషణను అందిస్తాయి, వెన్నెముకను స్థిరంగా ఉంచుతాయి వెన్నుపూస కదలికను అనుమతించడానికి ’పివోట్ పాయింట్లు’ ఇస్తాయి. వీటిలో ఏర్పడే ఇబ్బందులే వెన్నునొప్పికి దారి తీస్తాయి. అయితే చక్కెరతో పాటు అసమతుల్య ఆహారం డిస్క్ రికవరీకి ఆటంకం కలిగిస్తాయి, వెన్నునొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి పోషకాహారం తప్పనిసరి అంటున్నారు హైదరాబాద్కి చెంఇన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒబైదుర్ రెహమాన్, ఈ సందర్భంగా ఆహారం లో మార్పు చేర్పులు చేసుకోకపోతే వెన్నునొప్పి నుంచి కోలుకోవడం కష్టమని ఈ ఆర్థోపెడిక్ సర్జన్ విడుదల చేసిన ఓ వీడియోలో స్పష్టం చేశారు. ఈ అలవాట్లు వెన్నునొప్పిని ఎలా ప్రభావితం చేస్తాయో డిస్క్ సమస్య నయం కాకుండా చేసే ఆ 4 ఆహారపు అలవాట్లు... ఏమిటంటే...చక్కెర లేదా చక్కెరతో టీచక్కెర కలిపిన స్వీట్లు అధికంగా తీసుకోవడం బ్యాక్ పెయిన్ ఉన్నవారికి చేటు చేస్తుంది. అంతేకాదు చక్కెర కలిపిన టీ, కాఫీలు సైతం రోజువారీ పలు దఫాలుగా తాగడం వల్ల నడుము ప్రాంతం, శరీరంలో మంట వస్తుంది డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది.వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలువేపుళ్లు చాలా రకాలుగా ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. అదే విధంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు, అది కూడా నడుముకి దిగువ భాగంలో మంటను కలిగిస్తుంది, డిస్క్ సమస్య నయం కాకుండా నిరోధిస్తుంది,తక్కువ ప్రోటీన్ ఆహారంతక్కువ ప్రోటీన్ ఆహారం లేదా అధిక కార్బ్ లేదా అధిక కొవ్వులు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు, డిస్క్ కోలుకునే సమయంలో తగినంత పోషకాహారాన్ని పొందదు. అధిక ప్రోటీన్ ఆహారం డిస్క్ సమస్యల పరిష్కారంలో చికిత్సకు మేలు చేస్తుంది. అధిక బెడ్ రెస్ట్చివరగా, ఎక్కువ సేపు పడుకోవడం కూడా మంచిది కాదు. అధిక బెడ్ రెస్ట్లో ఉంటూ, రోజువారీ నడకలకు సమయం కేటాయించకపోతే కూడా, డిస్క్ కోలుకునేందుకు అవసరమైన పోషకాహారాన్ని పొందలేదు. నేషనల్ స్పైన్ హెల్త్ ఫౌండేషన్ ప్రకారం, కాల్షియం విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషకాలు ఎముక సాంద్రత, కండరాల పనితీరు మొత్తం కణజాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి బోలు ఎముకల వ్యాధి, క్షీణించిన డిస్క్ వ్యాధి దీర్ఘకాలిక వెన్నునొప్పి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. -
ఫేస్బుక్లో చాటింగ్.. పేరెంట్స్ వద్దన్నా పెళ్లి.. ‘కాంతార’ హీరో లవ్స్టోరీ
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీయార్కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీయార్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీయార్, రిషబ్ ల తర్వాత హైలెట్గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి. హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అణకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం కాంతారా కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రగతి శెట్టి(Pragathi Shetty) రిషబ్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక సినిమా కార్యక్రమంలో క్యాజువల్గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్గా మారారు. రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరి ప్రేమకధ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు. .దాంతో రిషబ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే, ప్రగతి పట్టు వీడకపోవడంతో... అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు వారికిద్దరు అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబు, పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం..సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్లను అభిమానులతో పంచుకుంటుంది. రిషబ్ 41 పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫొటోలు, గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త, పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్ట్లు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజి అభిరుచికి సానబెట్టింది. అలా ఆమె సినిమారంగంలో కాస్ట్యూమ్ డిజైనర్గా మారేందుకు అదే బాటలు వేసింది. ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి... కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్లో అనూహ్యంగా రాణిస్తోంది. ప్రేమ నుంచీ పెళ్లి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నదీ జంట. సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం. -
OG: ఆహా ఓహో అన్నా... చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు. ఇక పవన్ ఫ్యాన్స్ తమ హడావిడికి హద్దే లేదన్నట్టుగా చెలరేగిపోయారు. వెయ్యి కోట్ల దాకా కలెక్షన్లు వచ్చేస్తాయంటూ పుష్ప రికార్డులు కూడా బద్దలైపోతాయంటూ ఊహాగానాలు చేసేశారు. అభిమానుల ఆశలు ఆకాంక్షలు అర్ధం చేసుకోదగినవే కానీ...పాపం వారి ఆశల్ని వమ్ము చేస్తూ ఓజీ నాలుగు రోజుల్లోనే నీరుగారిపోయింది(OG Box Office Collection). నాలుగు రోజుల్లో 252 కోట్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతుంటే...ఇందులో షుమారుగా ఓవర్సీస్ 50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్లు పైగా. కానీ తమిళ, హిందీ, కన్నడ పరిస్థితి ఏమిటి? తెలుగు వాళ్లున్న చోట్ల తప్ప వేరే భాషా ప్రేక్షకులు ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఓజీని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందీ మార్కెట్లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది 2 కోట్లలోపే.. ఇక కన్నడిగులు అయితే మరీ కరివేపాకులా తీసి పారేశారు. నాలుగు రోజుల్లో నాలుగైదు లక్షలు దాటలేదు. దాంతో అక్కడ సినిమా అప్పుడే కనుమరుగైంది తమిళనాడు పరిస్థితి చూస్తే...నాలుగు రోజుల్లో 76 లక్షలు మాత్రమే గ్రాస్. తెలుగు వారున్న ప్రతీ చోటా బెనిఫిట్ షోల రూపంలో ఇష్టా రాజ్యంగా అభిమానుల్ని దోచుకోవడం, తెలుగు రాష్ట్రాల్లోని ధియేటర్లలో టిక్కెట్ల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం... ఇవన్నీ కలిపితేనే ఆ మాత్రమైనా కలెక్షన్లు. అది కూడా ప్రకటిస్తున్న కలెక్షన్లలో ఎంత వరకూ నిజమో పబ్లిసిటీ స్టంటో తెలీదు.మొత్తం మీద విపరీతమైన అంచనాలతో వచ్చిన పవన్ 2 సినిమాలూ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. హరిహర వీరమల్లు డిజాస్టర్గా నిలిస్తే... ఓజీ కలెక్షన్లు కూడా పాన్ ఇండియా రేంజిలో లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరచింది. పవన్ తర్వాత సినీ రంగంలోకి వచ్చిన మిగిలిన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే గ్లోబల్ స్టార్లుగా రూ.వేల కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంటే బోలెడంత ఫాలోయింగ్ ఉన్నట్టు చెప్పుకుంటున్న పవన్(Pawan Kalyan) మాత్రం పాన్ ఇండియా ఇమేజ్కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని ఓజీ సినిమా కుండబద్ధలు కొట్టినట్టు నిరూపించింది. పైగా ఇమ్రాన్ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్ ను ప్రధాన విలన్గా పెట్టుకున్నా అక్కడి ప్రేక్షకులు కన్నెత్తి కూడా ఓజీని చూడలేదంటే... ఇక చెప్పేదేముంది? కొసమెరుపు ఏమిటంటే... ఓజీ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలోనే వచ్చిన ప్రభాస్ సాహో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే... వసూళ్లు మాత్రం రూ.250 కోట్లు దాటేశాయి. ఇందులో నార్త్ ఇండియా కలెక్షన్లే అత్యధికంగా ఉండడం గమనార్హం. దీనిని బట్టి పవన్ లేదా ఆయనతో సినిమా తీసేవారు తెలుసుకోవాల్సిన చేదు వాస్తవం ఏమిటంటే... హీరోలు మెప్పించాల్సింది అభిమానుల్ని మాత్రమే కాదు. -
కమల్ హాసన్ రికార్డ్ బ్రేక్ చేసిన చిన్నారి త్రిష...
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో, స్వచ్ఛమైన, కల్తీ లేని భారతీయ సినిమా చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది,ఆరేళ్ల మరాఠీ బాల కళాకారిణి త్రిషా తోసర్ జాతీయ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు పొందిన మరాఠీ చిత్రం ‘‘నాల్ 2’’లో చిమి (రేవతి)గా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు థోసర్ను జాతీయ పురస్కారం వరించింది. మళయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలతో పాటు ఎందరో అతిరధ మహారధులు సాక్షిగా ఆమె ఆ పురస్కారాన్ని అందుకుంటూంటే హర్షధ్వానాలు మారుమోగాయి. ఈ చిన్నారి విజువల్స్ కూడా వేగంగా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి, ఆమెను టాక్ ఆఫ్ ద సినీ సర్కిల్¯గా మార్చి చర్చనీయాంశంగా చేశాయిు.ఈ సందర్భంగా ఆమె స్పందన కూడా అందర్నీ ఆకట్టుకుంది. ‘ ఇంత గొప్ప గౌరవాన్ని స్వీకరించడానికి వేదికపైకి వెళ్ళినప్పుడు, ఆడిటోరియం మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. నా తల్లిదండ్రులు పెద్దలు అందరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు, మనస్ఫూర్తిగా గట్టిగా ఏడ్చారు. చప్పట్లు కొట్టారు, ఏమి సాధించానో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఒక్కటి తెలుసు – ఈ అవార్డు ద్వారా, నా మహారాష్ట్ర. నా మొత్తం కుటుంబం పేరు ఉన్నత స్థాయికి చేరుకుందని. నా తల్లి చెప్పినట్లుగా, గత 70 సంవత్సరాల జాతీయ అవార్డులలో, ఈ గౌరవాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలినని. నా ఈ విజయానికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబానికి, నా చిత్ర బృందానికి, నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసిన నా దర్శకుడు సుధాకర్ యక్కంటికి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన సీనియర్ జ్యూరీ సభ్యులందరికీ, ముఖ్యంగా, నా ప్రియమైన ప్రేక్షకులకు, ఎన్నెన్నో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మద్దతు వల్లనే నేను ఇంత చిన్న వయస్సులో ఈ స్థానానికి చేరుకోగలిగాను. మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ నాతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇంతే బాధ్యత నిజాయితీతో పని చేస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అంటూ స్పందించింది. ఈ స్పందన కూడా బాగా వైరల్ అవడంతో పాటు ఆమెను కాబోయే స్టార్ గా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.ఈ సందర్భఃగా అభినయ లోకనాయకుడు కమల్ హాసన్ ఆ చిన్నారిని మనసారా కొనియాడారు. తాను ఒకప్పుడు సాధించిన మైలురాయిని అధిగమించినందుకు ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు . కళతూర్ కన్నమ్మ అనే తమిళ సినిమా ద్వారా జాతీయ అవార్డ్ సాధించిన కమల్ ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన బాల నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ రికార్డ్ను ఇప్పుడు త్రిష తిరగరాసింది. ఈ సందర్భంగా కమల్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన స్పందించారు. ‘‘ప్రియమైన త్రిషా తోషర్, నా హర్షధ్వానాలు నీకు దక్కుతాయి. నా మొదటి అవార్డు వచ్చినప్పుడు నాకు అప్పటికే ఆరేళ్ల వయసు...నువ్వు నా రికార్డును అధిగమించావు. ఇలాగే కొనసాగండి మేడమ్. మీ అద్భుతమైన ప్రతిభతో పని చేస్తూనే ఉండండి. ఇంట్లోని మీ పెద్దలకు నా ప్రశంసలు.‘ అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఆ చిన్నారి బాల నటికి అభినయ శిఖరం లాంటి కమల్ నుంచి అందుకున్న ఈ పొగడ్త మరో అత్యున్నత పురస్కారంతో సమానం అనడంలో సందేహం లేదు. -
Kantara Chapter 1: కసరత్తుల నుంచి కలరియపట్టు దాకా...
గత 2022లో విడుదలైన కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి సినిమా విజయాలలో నటీనటుల భాగస్వామ్యానికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. భారతీయ సంస్కృతి ఆచారాల ఆధారంగా ఆకర్షణీయమైన కథను ఎలా రూపొందించవచ్చో చెబుతూ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఈ సినిమాకు ఆయనే హీరో. రచయిత దర్శకుడు కూడా కావడం గమనార్హం. తాజాగా రిషబ్ తన శ్రమకు తగిన ఫలితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. మరోవైపు కాంతారా 2022లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా జాతీయ అవార్డును అందుకున్నాడు.చేసే పనిమీదే మనసును లగ్నం చేసేవారిని అపజయాలు మాత్రమే కాదు భారీ విజయాలు కూడా ఆపలేవు. అందుకే రిషబ్ అంకితభావం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ కాంతారా సీక్వెల్ రూపకల్పనలోనూ కనిపిస్తూనే ఉంది. కాంతారా చిత్రాల సాక్షిగా ఆ పాత్రలో ఇమిడిపోయేందుకు తనను తాను చెక్కుకున్న శిల్పిలా మారాడు.. రిషబ్. కాంతారా సిరీస్ కోసం ఆయన నేర్చుకున్న కొన్ని నైపుణ్యాలను పరిశీలిస్తే కళ కోసం ప్రాణం పెట్టడం అంటే ఏమిటో అర్ధమవుతుంది.భూత కోలాదక్షిణ కర్ణాటక, ఉడిపి సమీప ప్రాంతాల్లో తులు మాట్లాడే వారు సంప్రదాయంగా భూత కోలా, భూత ఆరాధన పేర్లతో తమను కాపాడే ఆత్మలను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా వస్త్రధారణతో పాటు వారు చేసే నృత్యం, అరుపులు కూడా సంక్లిష్టంగా ఉంటాయి. కాంతారా సినిమాలో రిషబ్ స్వయంగా భూత కోలా ను నేర్చుకుని మరీ ప్రదర్శించాడు. అందుకే ఆ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా ఆ నృత్యం మారింది.బుల్ రేస్ (కంబాల)కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ ముగిశాక సంప్రదాయంగా నిర్వహించే కంబాల రేసు కూడా కాంతారాలో హైలెట్. చిత్రీకరణ సమయంలో రిషబ్ ఇరవై నాలుగు గంటలకు పైగా ఎద్దులతో పరుగెత్తుతూనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతని నటనలోని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.కలరిపయట్టుప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటైన కేరళకు చెందిన కలరిపయట్టును కూడా రిషబ్ అభ్యసించాడు. తెరపై అతని రూపం, పోరాటాలు∙వాస్తవికంగాగా ఉండేలా చూసుకోవడానికి, ఆ పోరాట కళను నేర్చుకోవడానికి ఆయన ఒక సంవత్సరం పాటు కష్టతరమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు.ట్రాన్స్ఫార్మేషన్..జిమ్లో వర్కవుట్స్ చేస్తే వ్యాయామం అంటారు కానీ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటే వ్యాయామ పరిభాషలో ట్రాన్స్ఫార్మేషన్గా పేర్కొంటారు. తదుపరి రానున్న కాంతారా చాప్టర్ 1 కోసం తన శరీరాన్ని కఠినమైన కసరత్తులతో చెక్కుకున్నాడు. తొలి భాగానికి పూర్తి విరుద్ధంగా అనూహ్యమైన రీతిలో రిషబ్ కనిపిస్తాడు.గుర్రపు స్వారీతన పాత్రను పండించేందుకు రిషబ్ మరో నైపుణ్యాన్ని జోడించాడు. రానున్న కాంతారా చాప్టర్ 1లోని యాక్షన్ సన్నివేశాలకు వాస్తవికత అద్దేందుకు ఆయన గుర్రపు స్వారీని నేర్చుకున్నాడు.సాంప్రదాయ ఆచారాలను నేర్చుకోవడం మరియు పురాతన యుద్ధ కళలను నేర్చుకోవడం వంటి రిషబ్ శెట్టి అంకితభావం, కాంతారా ఎందుకు ఒక సంచలనం అయ్యిందో మరియు కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలుగా ఎందుకు నిలిచిందో చూపిస్తుంది. రిషబ్ తన అసాధారణ ప్రతిభ మరియు సజనాత్మక విధానంతో కథను రీమేక్ చేస్తూనే ఉన్నాడు. -
ఆది పరాశక్తి సాక్షిగా..ఆపరేషన్ సింథూర్
దేశవ్యాప్తంగా దేశభక్తి పెల్లుబుకేలా చేసిన ఆపరేషన్ సింథూర్ ఇప్పుడు దైవభక్తిలో సైతం మిళితమయ్యాయి. గత వినాయక చవితి ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా అనేక మండపాలు ఇదే థీమ్ను ఎంచుకోగా ఈ సంవత్సరం దుర్గా పూజ వేడుకలు లోతైన భక్తి జాతీయతా వాదాన్ని మిళితం చేశాయి, ప్రతీ సంవత్సరం గొప్ప కళాత్మకత సామాజిక స్పృహ కలిగిన థీమ్లకు ప్రసిద్ధి చెందిన సెంట్రల్ కోల్కతాలోని దుర్గా పూజ కమిటీ, తన 56వ సంవత్సరపు నవరాత్రి వేడుకల్ని కూడా అంతే వైవిధ్యంగా నిర్వహిస్తోంది. భారతదేశ సాయుధ దళాల ధైర్యం త్యాగాలకు నివాళులర్పించడానికి ‘ఆపరేషన్ సింథూర్‘ థీమ్తో ఒక భారీ వైవిధ్య భరిత మండపాన్ని ఆవిష్కరించింది. సెంట్రల్ అవెన్యూను రవీంద్ర సరణిని కలిపే చారిత్రాత్మక ప్రదేశం తారా చంద్ దత్తా వీధిలోని ఈ శక్తి ప్రతిబింబ మండపం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.ప్రముఖ చిత్ర, కళాకారుడు దేబ్శంకర్ మహేష్ రూపొందించిన ఈ పండల్లో థీమ్కు ప్రాణం పోసే అనేక ఆకర్షణీయమైన కళాకృతులు కొలువుదీరాయి ఈ మండపం ప్రాంగణంలో , సందర్శకులు భారత ఆర్మీ ట్యాంకులు క్షిపణుల సజీవ ప్రతిరూపాలను సందర్శించవచ్చు. ఈ థీమ్ ముఖ్యాంశం దేశంలోని ఇద్దరు ధైర్యవంతులైన మహిళలు, భారత సైన్యానికి కీర్తిని తెచ్చిన కల్నల్ సోజియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యాజ్మా సింగ్లకు నివాళిగా కూడా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. అక్కడ కొలువుదీరిన వారి విగ్రహాలు సైన్యంలో మహిళల బలం నాయకత్వానికి శక్తివంతమైన చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ మండపంలో కొలువు దీరిన దుర్గాదేవి విగ్రహాన్ని శిల్పి కుష్ధ్వా బేరా సృష్టించారు.ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ చీఫ్ ఆర్గనైజర్ రాకేష్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ‘దుర్గా పూజ మాకు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ప్రజలను కలిపి ఉంచే భావోద్వేగం. ప్రతి సంవత్సరం, సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, మా పెవిలియన్ ద్వారా లోతైన సందేశాన్ని అందించే థీమ్ను కూడా ఎంచుకోవడానికి మేం ప్రయత్నిస్తాం.‘ అని చెప్పారు. ‘‘ఈ సంవత్సరం థీమ్, ‘ఆపరేషన్ సింథూర్‘, ధైర్యం అంకితభావంతో మన దేశాన్ని రక్షించే మన దేశ సైనికులకు మా గౌరవప్రదమైన సమర్పణ. ఈ సంవత్సరం పండుగ ద్వారా, మేం వారి శౌర్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నాము సందర్శకులలో మన సైనిక శక్తి పట్ల గర్వం దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యం’’ అంటూ వివరించారు.ఈ సందర్భంగా యంగ్ బాయ్స్ క్లబ్ యూత్ ప్రెసిడెంట్ వికాంత్ సింగ్ మాట్లాడుతూ, ‘ మన దేశాన్ని అచంచలమైన అంకితభావంతో రక్షించే మన సైనికుల ధైర్యం త్యాగానికి ఇది మా సెల్యూట్ . ఈ సంవత్సరం థీమ్ మన సాయుధ దళాల లోని ధైర్యవంతులైన పురుషులు మహిళలకు నివాళి’’ అని చెప్పారు. -
మటన్ Vs చికెన్ ఆరోగ్యానికి ఏది మంచిది..!
మాంసాహారం పట్ల మన ప్రేమకు హద్దే లేదని...ఏటా దేశవ్యాప్తంగా హాంఫట్ అనిపిస్తున్న టన్నుల కొద్దీ భిన్న రకాల మాంస విక్రయాలు నిరూపిస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా నాన్ వెజ్ ప్రియత్వం అంతకంతకూ ఇనుమడిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక వండేశైలులు మేళవించే ముడి దినుసుల బట్టి రుచి ప్రాచుర్యాలు మారవచ్చేమో గానీ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంటోంది. ఈ మాంసాహారాల్లో మటన్ చికెన్ అత్యధిక శాతం మంది తీసుకునే ఆహారం అనేది తెలిసిందే.మాంసం పట్ల ప్రేమ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. భారతదేశంలోని తూర్పు పశ్చిమ ప్రాంతాలలో మేక మాంసం ప్రసిద్ధి చెందినప్పటికీ, దేశంలోని ఉత్తర ప్రాంతంలో చికెన్ ఆధిపత్యం చెలాయిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం కోడి, మేక మాంసం రెండూ ఇష్టపడతాయి.మటన్ వద్దు.. చికెన్ ముద్దు...అయితే గత కొంతకాలంగా వైద్యులు చెబుతున్న ప్రకారం గానీ, పోషకాహార నిపుణుల సూచనలను బట్టి గానీ చూస్తే మటన్ లేదా మేక/గొర్రె(mutton) మాంసంతో పోలిస్తే చికెన్ /కోడి(chicken) మాంసం అత్యంత ఆరోగ్యకరం. మేక మాంసం అనారోగ్యకరం. అయితే దీనికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది ఓ తాజా అధ్యయనం.అధ్యయనం ఏం చెబుతుంది?ముడి మేక కోడి మాంసం మధ్య పోలికను చూపించే ఇఎస్డిఎ ఫుడ్ డేటా సెంట్రల్కు చెందిన డిజిటల్ జర్నల్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, మటన్ చికెన్ రెండింటిలో ప్రోటీన్ స్థాయిలు దాదాపు సమానంగా ఉన్నాయని, కానీ మేక మాంసం ఇనుము, పొటాషియం రాగి వంటి ఖనిజాలను అలాగే శాట్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను గణనీయంగా తక్కువగా కలిగి ఉంటుందని పేర్కొంది. అది మేక మాంసాన్ని గుండెకు ఆరోగ్యకరమైన ఎంపికగా చేస్తుంది, ఇది కోడి మాంసంతో పోల్చదగిన ప్రోటీన్ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రెండు మాంసాలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో నిండి ఉన్నాయని అధ్యయనం చెబుతుంది. ఇది కండరాల పెరుగుదలకు మెరుగైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది.మేక మాంసం కోడి మాంసం రెండూ సహజంగా జంతు ప్రోటీన్తో సమృద్ధిగా ఉంటాయి. అయితే వాటి పోషక విలువలు ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలలో మాత్రం చాలా తేడా ఉంది. ప్రోటీన్ విషయానికి వస్తే, కోడి మాంసం మేక మాంసం కంటే కొంత ఎక్కువ పరిమాణం కలిగి ఉంటుంది. ఒక 100 గ్రాముల కోడి మాంసంలో దాదాపు 21.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అయితే అదే ఒక 100 గ్రాముల మేక మాంసం దాదాపు 20.6 గ్రాముల ప్రోటీన్లను అందిస్తుంది. రెండు మాంసాలు అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ని కలిగి ఉంటాయి, ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు కూడా అవసరం.ఎందులో ఎక్కువ కొవ్వు ఉంటుంది?మేక మాంసం చికెన్ కంటే తక్కువ మొత్తం కొవ్వు, శాట్యురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. ఇది 3–ఔన్సులకు దాదాపు 2.6 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది, తద్వారా గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఎంపిక అవుతుంది. అంతేకాకుండా, మేక మాంసంలో ఇనుము జింక్ (Zinc) వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. మరోవైపు కోడి మాంసంలో బి5, బి6, డి, ఇ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి శక్తి జీవక్రియతో పాటు ఎముక ఆరోగ్యానికి ఉపయుక్తం.ఏది మంచిది?క్లుప్తంగా చెప్పాలంటే, మేక మాంసం. కోడి మాంసం రెండూ అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో అధిక–నాణ్యత ప్రోటీన్ను అందిస్తాయని అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాబట్టి ఒకటి మంచిది కాదు మరొకటి మంచిది అనే తీర్పులు సరైనవి కావని స్పష్టం చేస్తోది. ఈ రెండింటిలో ఒక ఎంపిక ప్రధానంగా వ్యక్తిగత పోషక ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, మెరుగైన ఆరోగ్యం కోసం నాన్ వెజ్ ఆహారాన్ని మితంగా తీసుకోవడం మాత్రమే ఉత్తమం.చదవండి: Devi Navratri: దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే.. -
అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్
ప్రపంచ సాంకేతిక రంగం అసాధారణ వేగంతో విస్తరిస్తోంది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే దశాబ్దాలుగా.. అమెరికా భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రధాన గమ్యస్థానంగా ఉండడంతో, మనవాళ్ల ఆలోచనలు అమెరికాను దాటి వెళ్లలేదు. అయితే, పెరుగుతున్న వీసా పరిమితులు మాత్రమే కాదు, అమెరికన్ నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల కూడా గత కొంతకాలంగా చాలా మంది భారతీయ నిపుణులు కెరీర్ కోసం అమెరికాను దాటి ఇతర నగరాల వైపు చూడటం ప్రారంభించారు.కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 నివేదిక ప్రకారం.. యూరప్, ఆసియా ఇతర ప్రాంతాలలోని అనేక నగరాలు తమను తాము ప్రపంచ ఐటీ కేంద్రాలుగా వేగంగా మలచుకుంటున్నాయి. ఈ గమ్యస్థానాలు కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచ స్థాయి కెరీర్లకు వేదికలను అందించడమే కాకుండా, మెరుగైన జీవనశైలికి కూడా హామీ ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ వెలుపల కెరీర్ అవకాశాలను అన్వేషిస్తున్న వారి కోసం కొలియర్స్ నివేదిక అందించిన 25 ఐటీ కేంద్రాల జాబితా ప్రకారం, అవి ఏవేవి అంటే..లండన్ (యునైటెడ్ కింగ్డమ్)బలమైన వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అభివృద్ధి చెందుతున్న ఏఐ పర్యావరణ వ్యవస్థ మద్దతుతో లండన్ యూరప్ కి ఒక ప్రబల ఆర్థిక సాంకేతిక శక్తి కేంద్రంగా ఉండి ఐటీ కెరీర్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారింది.బీజింగ్ (చైనా)ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బలమైన పట్టు ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రధాన ఆవిష్కరణ కేంద్రం.బెంగళూరు (భారతదేశం)తరచుగా భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలువబడే బెంగళూరు, ఐటీ సేవలు, స్టార్టప్లు గ్లోబల్ ఆర్ అండ్ డి లో దేశాన్ని ముందుండి నడిపిస్తూనే ఉంది.పారిస్ (ఫ్రాన్స్)బహుళజాతి కంపెనీలు వినూత్న స్టార్టప్ల శక్తివంతమైన మిశ్రమంతో, పారిస్ సాంకేతిక ప్రతిభకు అగ్రగామిగా యూరోపియన్ కేంద్రంగా ఉంది.డబ్లిన్ (ఐర్లాండ్)బలమైన స్టార్టప్ వ్యవస్థ ప్రతిభ సమూహంతో యూరప్ సాంకేతిక రంగానికి చిరునామాగా డబ్లిన్ ఉద్భవించింది.టోక్యో (జపాన్)రోబోటిక్స్, ఆటోమేషన్ ఏఐ లకు ప్రసిద్ధి చెందిన టోక్యో ఆసియా ఖండపు హైటెక్ ఆవిష్కరణల రాజధానిగా ఎదుగుతోంది.మ్యూనిచ్ (జర్మనీ)అధునాతన ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఐటీ సాంకేతికత ఆధారిత పరిశ్రమలలో లోతైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది.స్టాక్హోమ్ (స్వీడన్)ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్లకు నిలయం, స్టాక్హోమ్ వ్యవస్థాపకత ఆవిష్కరణలకు కేరాఫ్గా వృద్ధి చెందుతోంది.షాంఘై (చైనా)ఈ-కామర్స్, ఫిన్టెక్ కృత్రిమ మేధస్సులలో సామర్ధ్యాలతో వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.బెర్లిన్ (జర్మనీ)డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రసిద్ధి చెందిన బెర్లిన్, యువ ఆవిష్కర్తలకు ఒక సరికొత్త అయస్కాంతంగా మారింది.సియోల్ (దక్షిణ కొరియా)ఎలక్ట్రానిక్స్, 5జీ, ఏఐ స్వీకరణలో అగ్రగామిగా ఉన్న సియోల్, డిజిటల్ సరిహద్దులను విస్తరిస్తూ దూసుకుపోతోంది.షెన్జెన్ (చైనా)ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎకోసిస్టమ్లో కీలకమైన నగరం, ప్రపంచ డిజిటల్ సేవల విస్తరణకు గణనీయంగా దోహదపడుతోంది.టొరంటో (కెనడా)ఏఐ పరిశోధన టెక్ స్టార్టప్లకు కేంద్రంగా ఉన్న టొరంటో పెట్టుబడి ప్రపంచ ప్రతిభ రెండింటినీ ఆకర్షిస్తుంది.బుకారెస్ట్ (రొమేనియా)విస్తరిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో తూర్పు ఐరోపాలో ఐటీ అవుట్సోర్సింగ్కు నిఖార్సైన గమ్యస్థానం.మాడ్రిడ్ (స్పెయిన్)ఫిన్టెక్, టెలికాం డిజిటల్ సేవలలో బలమైన మాడ్రిడ్, యూరోపియన్ ఐటీ హబ్గా క్రమంగా దినదినాభివృద్ధి చెందుతోంది.ఆమ్స్టర్ డామ్ (నెదర్లాండ్స్)ఫిన్టెక్ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్ధ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం డిజిటల్ వాణిజ్యానికి కూడా ఒక కేంద్రం.హైదరాబాద్ (ఇండియా)అనేక ఆర్ అండ్ డి కేంద్రాలకు నిలయం, హైదరాబాద్ భారతదేశ ఐటీ విస్తరణకు మూలస్తంభంగా వేగంగా ఎదుగుతోంది.పూణే (ఇండియా)అభివద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో, పూణే అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది.హాంగ్జౌ (చైనా)ఇ–కామర్స్ డిజిటల్ ఆవిష్కరణలలో ప్రముఖ నగరం, హాంగ్జౌ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రంలో నిలుపుతోంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)బ్యాంకింగ్ రంగానికి బలమైన సంబంధాలతో యూరప్ ఖండపు ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ హబ్గా గుర్తింపు పొందింది.మెక్సికో నగరం (మెక్సికో)లాటిన్ అమెరికాలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ హబ్, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)బ్లాక్చెయిన్, ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్ ఆవిష్కరణ స్థిరత్వం రెండింటినీ అందిస్తుంది.వార్సా (పోలాండ్)తూర్పు ఐరోపాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల కేంద్రం, యువ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మద్దతుతో విస్తరిస్తోంది.గ్వాంగ్జౌ( చైనా)ఆవిష్కరణలను తయారు చేయడం డిజిటల్ సేవలను విస్తరించడంపై దృష్టి సారించిన చైనా నగరం.రోమ్ (ఇటలీ)ఇయు సాంకేతిక కార్యక్రమాల బలమైన అండతో యూరప్లో డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న నగరం. -
రష్మికకు కొత్త సవాల్.. పోరాడాల్సిందే!
జర్మనీలో జన్మించిన వియత్నామీస్ మూలాలున్న యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ న్గుయెన్(Andy Long Nguyen), ఆయన కుంగ్ ఫూ వారియర్ (2017) యాక్సిడెంట్ మ్యాన్: హిట్మ్యాన్ హాలిడే (2022) వంటి హాలీవుడ్ చిత్రాల నుంచి శివాయ్ (2016), సనక్ (2021) వంటి బాలీవుడ్ చిత్రాల దాకా పనిచేశాడు. ఇటీవల తెలుగు పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఎడి కి పని చేయడం ద్వారా స్టంట్స్ కొరియోగ్రఫీలో అంతర్జాతీయ కెరీర్ను అందుకున్న టాప్ యాక్షన్ డైరెక్టర్గా నిలిచారు.ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.‘‘జర్మనీ లో డబ్ చేయబడిన భారతీయ చిత్రాలను చూస్తున్న టీనేజర్గా, అమితాబ్ బచ్చన్ను డైరెక్ట్ చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆయన వయస్సు గురించి తొలుత నాకు ఆందోళన ఉండేది అయితే షూటింగ్ సమయంలో ఆయన తన వయస్సులో సగం మంది కంటే చురుకుగా కదిలారు’’ అంటూ ఆయన చెప్పాడు. ‘‘ దేవుళ్ళు, అమరులు, దిగ్గజాలు, రోబోలు అంతరిక్ష నౌకలతో నా మొదటి పౌరాణిక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం అది. సవాలుగాగానూ, అద్భుతంగా కూడా ఉంది, ’’అని ఆయన గుర్తుచేసుకున్నాడు. నాగ్ అశ్విన్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ ‘స్టోరీబోర్డులు లేదా రిఫరెన్స్లపై ఆధారపడకుండా నాగ్ తన టీమ్ని నడిపించే విధానం సూపర్. తక్కువ సూచనలతోనే అందరి దృష్టి తన వైపు మళ్ళించగలిగాడు. అది చాలా ఆకట్టుకుంది.’’ అని చెప్పాడు ఆండీ.తెలుగు సినిమాలో లాంగ్ తదుపరి అతి పెద్ద ప్రాజెక్ట్ మైసా( Mysaa), ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna) నటిస్తోంది. అది కూడా తొలిసారిగా ఆమె ఒక యాక్షన్ క్వీన్గా మారనుంది. ఈ విషయంపై ఆండీ మాట్లాడుతూ ‘‘రష్మికతో అంతకు ముందుగానే పనిచేయాల్సి ఉండింది. ఆమెతో పనిచేయడం పట్ల నేను సంతోషంగా అంతకు మించి ఆసక్తిగా ఉన్నాను. రష్మిక చాలా చురుకైన యువతి.. అయితే నేను డైరెక్ట్ చేయబోయే పాత్ర కోసం తనను తాను మరింత సాన బెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కఠినమైన శారీరక స్టంట్ శిక్షణ పొందవలసి ఉంటుంది, ఇది ఆమెకు పూర్తిగా కొత్త అనుభవం సరికొత్త సవాల్ కూడా ’’అని అంటున్నాడాయన.ఆండీకి, ఫైట్ కొరియోగ్రఫీ అంటే శారీరక కదలికలు గురించి మాత్రమే కాదు – ఇది కథ చెప్పడం కూడా. ‘కథకు ఉపయోగపడే విధంగా పాత్రను మరొక స్థాయికి తీసుకెళ్లే విధంగా యాక్షన్ను రూపొందించడాన్ని ఇష్టపడతాను. ఏ నైపుణ్యాలు అర్ధవంతంగా ఉంటాయో, వారు ఎందుకు పోరాటంలోకి ప్రవేశిస్తారో వారి లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం కోసం స్క్రిప్ట్ , పాత్రలను అధ్యయనం చేయడం చాలా ముఖ్యం’’ అని వివరించాడు. అతను యాక్షన్ ను కథనం నుంచి∙విడదీయలేని భాగంగా వర్ణించాడు. ‘యాక్షన్ అనేది సంభాషణ కు మరొక రూపం అది ప్రతి ఇతర సన్నివేశంతో సంపూర్ణంగా మిళితం కావాలి. పోరాటం వెనుక ఉన్న భావోద్వేగం కొరియోగ్రఫీ లాగే ముఖ్యమైనది అంటున్న ఆయన ‘హైదరాబాద్ భారతదేశంలో తన మొదటి గమ్యస్థానంగా తనపై శాశ్వత ముద్ర వేసిందనీ, ఇక్కడి వంటకాలు మరపురానివని చెప్పాడు, గోల్కొండ కోట యాక్షన్–సాహసం కోసం వేచి ఉన్న రెడీమేడ్ మూవీ సెట్ లాగా తనకు అనిపిస్తుంది.‘ అంటూ వర్ణించాడు. -
కిచెన్లో ప్లాస్టిక్ భూతం: రోజూ ఎన్ని రకాలుగా తింటున్నామో తెలుసా?
మనం ప్రతీ రోజూ భోజనం చేస్తున్నాం.. స్నాక్స్ తింటున్నాం..కూల్ డ్రింక్సో, కొబ్బరి బొండాం నీళ్లో తాగుతున్నాం...అని మాత్రమే అనుకుంటే పొరపాటు.. మనం మైక్రోప్లాస్టిక్స్ ( microplastics) అని పేర్కొనే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం తినేస్తున్నాం. ఓ అధ్యయనంలో ఈ ప్లాస్టిక్ ముక్కలు మన శరీర వ్యవస్థల ద్వారా సక్రమంగా వెళ్ళడం లేదని తేలింది. అవి మన శరీరాల లోపల పేరుకుపోతున్నాయని గుర్తించడం జరిగింది. విచిత్రం ఏమిటంటే...మన శరీరం లోపల పేరుకుపోతున్న ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడి నుంచో ఊడిపడడం లేదు.నిత్యం మనం ఉపయోగించే కొన్ని రకాల వంట సామాగ్రి ద్వారానే వస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్లు శారీరక కాలుష్యానికి కారణంగా మారాయని గుర్తిస్తున్న శాస్త్రవేత్తలు అవి కలిగించే ఆరోగ్య ప్రభావాల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా మనం 22 మిలియన్ల మైక్రో, నానోప్లాస్టిక్లను పీల్చుకుంటున్నామని అంచనా వేస్తున్నారు. ఇలా పేరుకుపోతున్న మైక్రోప్లాస్టిక్లు మన శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తాయని తేలింది. రక్త నాళాలలో చేరి గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలతో ఇవి ముడిపడి ఉన్నాయి. కణజాల వాపు, కణాల మరణం ఊపిరితిత్తుల కాలేయంపై ప్రభావాలు కూడా గుర్తించారు. మనుషులకు మాత్రమే కాదు జంతువులు సముద్ర జీవులలో, అవి ఆక్సీకరణ అలాగే క్యాన్సర్ను కూడా కలిగిస్తాయనీ, కూడా భావిస్తున్నారు. మరి ఇంతకీ ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయ్?చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలునాన్స్టిక్ వంట సామాగ్రిప్లాస్టిక్ నాన్స్టిక్ వంట సామాగ్రి వంట సమయంలో ఆహారంలోకి మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తాయని ఒక కొత్త అధ్యయనం కనుగొంది, దీనివల్ల ఈ హానికరమైన కాలుష్య కారకాలకు గురికావడం పెరుగుతుంది. టెఫ్లాన్–పూతతో కూడిన వంట సామాగ్రి మిలియన్ల సంఖ్యలో మైక్రోప్లాస్టిక్ కణాలను కలిగి ఉంటుందని ఆస్ట్రేలియన్ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.కంటైనర్స్...ప్రస్తుతం హోమ్ డెలివరీ సేవలు పెరగడంతో, ఎప్పుడూ లేనంతగా ప్లాస్టిక్ కంటైనర్ల వినియోగం సర్వసాధారణంగా మారింది, కానీ ఈ కంటైనర్లు వేడి చేసినప్పుడు లేదా కడిగినప్పుడు ఆహారంలో మైక్రోప్లాస్టిక్లను సులభంగా జోడించగలవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెస్టారెంట్లు సాధారణంగా ఉపయోగించే అన్ని రీ యూజ్డ్ ప్లాస్టిక్ టేక్ అవుట్ కంటైనర్లు మైక్రోప్లాస్టిక్లను కలిగి ఉన్నాయని ఒక అధ్యయనం కనుగొంది. ప్లాస్టిక్ పాత్రలు ఆహారంలోకి మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ముఖ్యంగా వేడి ఆహారాలతో ఉపయోగించినప్పుడు. ఆ ఆహారాన్ని మనం తింటున్నప్పుడు శరీరపు రక్తప్రవాహంలోకి స్థిరపడే మైక్రోప్లాస్టిక్లను కూడా తింటున్నట్టే అవుతుందట.ఇదీ చదవండి : వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడుటీ బ్యాగ్స్...ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ మైక్రోప్లాస్టిక్లు టీ బ్యాగులలో కూడా దాగి ఉండవచ్చు. టీ తయారీ క్రమంలో,టీ బ్యాగ్ అత్యధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు మైక్రోప్లాస్టిక్లను విడుదల చేస్తుంది. దీనికి టీ బ్యాగుల తయారీలో కీలకమైన భాగం అయిన పాలీప్రొఫైలిన్ కారణం. స్పెయి¯Œ లోని అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ బార్సిలోనా పరిశోధకులు ఒక టీ బ్యాగ్ మునిగిన ప్రతి మిల్లీమీటర్ నీటికి బిలియన్ల మైక్రోప్లాస్టిక్ నానోప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని కనుగొన్నారు.సుగంధ ద్రవ్యాలుప్రస్తుతం చాలా సుగంధ ద్రవ్యాలు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను ఉపయోగిస్తున్నాయి, ఇటీవలి అధ్యయనంలో అన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రోప్లాస్టిక్లు ఉన్నాయని కనుగొన్నారు.ప్లాస్టిక్ స్ట్రాలు : ప్లాస్టిక్ స్ట్రాలు సైతం మైక్రోప్లాస్టిక్లు నానోప్లాస్టిక్లను విడుదల చేస్తాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి, ప్రతి సంవత్సరం జలమార్గాలలో ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సరఫరా అవుతోంది. ఈ స్ట్రాలు ఇతర ప్లాస్టిక్లు నీటిలోకి వచ్చిన తర్వాత, అవి నీటిని మాత్రమే కాకుండా దానిలో కనిపించే జంతువులను కూడా ప్రభావితం చేస్తాయి.వాటర్ బాటిల్స్...డబ్బాలు...బిస్ఫనోల్ ఎ (బిపిఎ) అనే రసాయనం వాటర్ బాటిల్స్, ఆహార సరఫరా చేసే డబ్బాల తయారీలో ఉపయోగించే వివాదాస్పద పదార్థం, ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. నేడు, బిపిఎ రహిత యాక్రిలిక్ వంటివి అందుబాటులోకి వచ్చాయి కానీ అవి కూడా పూర్తి సురక్షితమైనవిగా చెప్పలేం, ఎందుకంటే వాటిలో కూడా మైక్రోప్లాస్టిక్లు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ తరహా పదార్ధాల వినియోగాన్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్ల ద్వారా ఆ భాషలో కెరీర్కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. -
కార్చే కన్నీరు సైతం... క్వాలిటీ కోల్పోతోంది...
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.టియర్స్...వండర్స్...ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి. అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.పొరను కాటేస్తున్న తెర...కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు. స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.కన్నీటి క్వాలిటీ కోసం...టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...తగినంత నీరు తాగుతుండాలి..కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్లేయర్ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.కన్నీరు కూడా విలువైనదే...తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.–డా.రూపక్కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం) -
నైట్ పార్టీలో రేఖ డ్యాన్స్ వైరల్.. మాధురీ, ఊర్మిళ సైతం వెలవెల!
ఎవర్ గ్రీన్ గ్లామర్ స్టార్గా వెలుగొందుతున్న బాలీవుడ్ నటి రేఖ..మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్తో అభిమానుల మనసు దోచుకుంది. ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ వన్నె తరగని వర్ఛస్సుతో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. అయితే ఈ డ్యాన్స్ ఆమె తాజా సినిమాలోది కాదు.. ఒక నైట్ పార్టీలో కావడం విశేషం.ఈ అపురూప నృత్య సన్నివేశం చోటు చేసుకుంది బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ పుట్టిన రోజు నాడు కావడం విశేషం. తన కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని సన్నిహితులతో షబానా 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనేక మంది బాలీవుడ్ స్టార్లు హాజరైన ఈ పుట్టినరోజు వేడుకల్లో రేఖ, హృతిక్ రోషన్, స్నేహితురాలు సబా ఆజాద్, సోను నిగమ్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్ తదితరులు ప్రముఖంగా కనిపించారు. బాలీవుడ్లో ఇలాంటి పార్టీలు జరగడం సహజమే అయినా ఈ పార్టీలోని వీడియోలు వైరల్ కావడానికి మరో సీనియర్ నటి రేఖ డ్యాన్స్ దోహదం చేసింది. ’పరిణీత’లోని ’కైసీ పహేలి జిందగని’ పాట కోసం రేఖ చేసిన నృత్యం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.రేఖ తన ట్రేడ్మార్క్ గ్రేస్ ఎనర్జీతో ఈ నృత్యానికి కేంద్ర బిందువుగా మారిన వెంటనే, ఆ పార్టీకి హాజరైన వారంతా అక్కడే గుమికూడడం గమనార్హం. అంతేకాదు రేఖ అడుగులు కదుపుతుంటే అందరూ చప్పట్లు కొట్టి, ఉత్సాహపరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ నృత్యం ద్వారా ఆమె బాలీవుడ్ ఫరెవర్ దివాగా తాను ఎందుకు ఎప్పటికీ కొనసాగుతుందో మరోసారి అందరికీ గుర్తు చేశారు. ’డ్యాన్సింగ్ క్వీన్’ గా పిలువబడే మాధురీ దీక్షిత్, రంగీలా లో డ్యాన్స్లతో షాకిచ్చిన ఊర్మిలా మాతోండ్కర్, డర్టీ పిక్చర్తో స్మితను గుర్తు చేసిన విద్యాబాలన్ వంటి రేఖ తదుపరి తరం హీరోయిన్స్ సైతం రేఖతో చేతులు కలిపి నృత్యం చేయడానికి ఒకరితో ఒకరు పోటీపడడం కనిపించింది. తమదైన శైలిలో వారు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరి చూపూ రేఖ మీదే ఉండిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా తీసిన ఈ పార్టీలోని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్గా మారి అభిమానులకు ఆనందోత్సాహాలను పంచాయి. వైరల్ క్లిప్లలో, రేఖ, ఊర్మిళ, మాధురి, విద్య, షబానా అజ్మీ కలిసి నృత్యం చేసే అరుదైన సందర్భం అందరినీ ఆకట్టుకుంది. రేఖ మొదట మాధురి, ఊర్మిళ, విద్య...ఇలా ఒకరి తర్వాత ఒకరితో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది. తరువాత, ఆమె తన తరం నటి షబానాను తనతో డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించింది. ఈ పార్టీలో బర్త్ డే గాళ్ షబానా అజ్మీ సైతం తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి చేసిన నృత్యం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంది. అలాగే షబానా అజ్మీ తన భర్త జావేద్ అఖ్తర్తో కలిసి కోనీ ఫ్రాన్సిస్ ప్రసిద్ధ పాట ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి నృత్యం చేశారు. ఈ పాటలు, నృత్యాల తాలూకు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి View this post on Instagram A post shared by Rekha (@legendaryrekhaofficial) -
చేతితో తినడం వల్ల వెయిట్లాస్ కూడా..
ఆహారాన్ని చేతితో నోటికి అందించడం అనేది తరతరాల సంప్రదాయం. అయితే ఆధునిక అలవాట్లు చేతితో ఆహారాన్ని తీసుకునే అలవాటును రానురాను తగ్గించేస్తున్నాయి. పురాతన, అనాగరిక జీవనశైలిగా దానిని పరిగణిస్తున్నాయి. అయితే చేతివేళ్లతో నేరుగా తీసుకుని ఆహారాన్ని ఆస్వాదించడం ఓ సంతృప్తి కరమైన విషయం. ఇది సంస్కృతీ, సంప్రదాయంకి మించిన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ప్రసిద్ధ వైద్య నిపుణుడు విద్యావేత్త అయిన డాక్టర్ కరణ్ రాజన్ చెబుతున్నారు. చేతులతో తినడం అనే పురాతనదేశీ ఆచారం అర్థవంతమైనది మాత్రమే కాకుండా మనం ఊహించలేని ఎన్నో ఆరోగ్యలాభాలను అందిస్తుంది అంటున్న ఆయన ఆ లాభాలను ఇలా వివరిస్తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియా విమాన ప్రమాదం, కీలక పరిణామం : అమెరికా కోర్టులో జీర్ణక్రియకు మేలు...ఫోర్క్ లేదా స్పూన్కు బదులుగా వేళ్లను ఉపయోగించి భోజనం చేసినప్పుడు, సహజంగానే తినే వేగం మందగిస్తుంది. చేతుల ద్వారా అందుకున్న ఆహారం నమలడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శ్రద్ధగా నమలడాన్ని ప్రోత్సహిస్తుంది, లాలాజలం నుంచి జీర్ణ ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఈ స్రావాలు జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించి పోషకాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాయి, కడుపు ప్రేగులకు అవసరమైన సున్నితమైన ప్రక్రియను సృష్టిస్తాయి.అతిని నివారిస్తుంది..వెయిట్లాస్ కోసం డైట్లో ఉంటున్నవారు తక్కువ తినాలని అనుకుంటారు. అలా అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహజమైన మార్గం చేతులతో తినడం. దీని వల్ల మెదడు మరింత అవగాహనతో తినేందుకు సహాయపడుతుంది. ఆహారాన్ని తాకడం వల్ల కలిగే స్పర్శ అనుభూతి సంతృప్తి భావనను బలోపేతం చేసే సంకేతాలను చురుకుగా పంపుతుంది. త్వరిత, అధిక సంతృప్తి కలగడం తినే అవసరాన్ని తగ్గిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థకు మేలు..మరో ఆకర్షణీయమైన ప్రయోజనం ఈ శరీరపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన. శుభ్రం చేసిన చేతులతో ఆహారం తిన్నప్పుడు, అది హానిచేయని సూక్ష్మజీవులను ప్రోత్సహిస్తుంది. ఈ జీవులు సురక్షితమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య తేడాను గుర్తించడానికి రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. ఒక విధంగా, ఇది ప్రేవుల రోగనిరోధక రక్షణకు వ్యాయామం ఇస్తుంది, శరీరంలోని సహజ సమతుల్యతను బలోపేతం చేస్తుంది.ఉష్ణోగ్రత మార్గదర్శిగా వేళ్ల చిట్కాలుబుద్ధిపూర్వకంగా తినడంలో వేళ్ల పాత్ర ఎంతో ఉంటుంది. వేళ్ల కొనల వద్ద ఉన్న చర్మం నోటి లోపల సున్నితమైన లైనింగ్ కంటే థృఢంగా, నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది వేళ్లను సహజ థర్మామీటర్గా చేస్తుంది. ఇది వ్యక్తులు తినడానికి ముందు ఆహార ఉష్ణోగ్రతను పరీక్షించడానికి వీలు కలిగిస్తుంది. ఇటువంటి అవగాహన అసౌకర్యాన్ని నివారించడమే కాకుండా మరింత ఆలోచనాత్మకంగా, ఏకాగ్రతతో తినే అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. మీ వేళ్లు డైజెషన్ జాయ్స్టిక్లు అంటూ డాక్టర్ కరణ్ రాజన్ అభివర్ణిస్తారు. అయితే ముందుగా మీ చేతులను కడుక్కోండి అని మాత్రం సూచిస్తున్నారు. డాక్టర్ కరణ్ రాజన్ గురించిడాక్టర్ కరణ్ రాజన్ ప్రముఖ వైద్యుడు, రచయిత ప్రముఖ ఆరోగ్య సంభాషణకర్త. ఆయన సండే టైమ్స్ నంబర్ 1 బెస్ట్ సెల్లర్గా నిలిచిన‘‘ దిస్ బుక్ మే సేవ్ యువర్ లైఫ్’’ను రాశారు. ఆరోగ్య–కేంద్రీకృత స్టార్టప్ అయిన లోమ్ సైన్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఇన్ స్టాగ్రామ్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ను కలిగి ఉన్నారు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
బాయ్ ఫ్రెండైనా ఉండాలి..బ్యాగ్రౌండ్ ఐనా ఉండాలి
చలనచిత్ర రంగంలో తారలుగా రాణించాలని చాలా మందికి ఉంటుంది. అయితే అది అందరి వల్లా సాధ్యపడేది కాదు టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు ఇంకా చాలా చాలా ఉండాలి. అలాంటి వాటిలో ఇటీవల బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం సినీ పరిశ్రమలో అప్పటికే స్థిరపడిన కుటుంబాలు, వారికి సంబంధీకులకే తప్ప బయటివారికి అండా దండా లభించవనేది. అందువల్లే బయటివారికి సినిమా రంగంలో అంత త్వరగా అవకాశాలు రావని, ఏదోలా వచ్చినా సక్సెస్ అయినా కూడా స్థిరపడడం కష్టమేనని బయటి నుంచి ఆ రంగంలోకి వచ్చిన వారి ఆరోపణ. అలా ఆరోపిస్తున్నవారిలో తాజాగా సీనియర్ నటి అమీషా పటేల్ కూడా చేరింది. కహోనా ప్యార్ హై సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు తెరంగేట్రం చేసిన ఈ నటి ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన బద్రి, నాని, నరసింహుడు, పరమవీర చక్ర..సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఆ తర్వాత అకస్మాత్తుగా సినిమాలకు దూరమైన అమీషా ఐదు సంవత్సరాల విరామం తర్వాత 2023లో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మతో కలిసి గదర్ 2 చిత్రంతో తిరిగి తెరపైకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చివరిగా 2024లో విడుదలైన తౌబా తేరా జల్వా చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రతికూల సమీక్షలు వచ్చాయి, కానీ అమీషా నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అమీషా ఇంతవరకూ ప్రకటించలేదు.ఎన్ని హిట్ సినిమాల్లో చేసినా అమీషాకు రావాల్సినంత స్టార్ డమ్ రాలేదు. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టాప్ హీరోయిన్ కాకపోవడానికి కారణమైన సినిమా పరిశ్రమ పరిస్థితులపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్త పరచింది.తన మనస్తత్వం కారణంగా సినీ పరిశ్రమ లోపలి వ్యక్తులు తనను ఇష్టపడరని అమీషా చెప్పింది, సినీరంగంలో రాణించాలంటే ఏదో ఒక శిబిరానికి చెందిన వారై ఉండాలంది. ‘ నేను శిబిరాలకు చెందినదానిని కాదు, వారితో పంచుకోవడానికి నాకు దురలవాట్లు లేవు. మందు తాగను, సిగిరెట్ త్రాగను లేదా పని కావాలని మస్కా–లగావో (కాకాపట్టడం లాంటివి) చేయను నా అర్హత ప్రకారం నాకు ఏది దొరికితే అది నాకు లభిస్తుంది. ఆ కారణంగా వారు నన్ను ఇష్టపడరు. అయినా సరే నేను లొంగిపోను.‘ అంటూ తేల్చి చెప్పేసింది. తనకు తొలి చిత్రం అవకాశం కూడా అతి కష్టమ్మీద వచ్చిందని అంది. ‘కహో నా... ప్యార్ హై’ సినిమా కోసం తాను మొదటి ఎంపిక కాదని, తొలుత కరీనా కపూర్ ను ఎంచుకున్నారని తెలిపింది. అయితే నిర్మాత రాకేష్ రోషన్ కు కరీనా కపూర్తో విభేదాలు వచ్చాక ఆమె ప్రవర్తన పట్ల అసంతృప్తి వచ్చిన కారణంగా ఆమెను ఆ సినిమా నుంచి తొలగించిన తర్వాత మాత్రమే తనకు ఆ అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకుంది. పరిశ్రమ లో సన్నిహితుడో, భాగస్వామి లేనప్పుడు ఒంటరిగా అందులో ఇమడడం చాలా కష్టం అంటోందామె. ‘సినిమా పరిశ్రమకు చెందిన ఓ బాయ్ఫ్రెండ్ లేదా ఒక భర్త లేనప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మీరు పవర్ ఫుల్ కపుల్గా లో ’సగం’ కానప్పుడు రాణింపు చాలా కష్టం. ఎందుకంటే మీకు మద్దతు ఇచ్చే వ్యక్తులు ఉండరు. మిమ్మల్ని సమర్థించడానికి ఎటువంటి కారణం లేదు కదా ఆఫ్ట్రాల్.. మీరు బయటి వ్యక్తి.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. -
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్ఎస్ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారత పౌరాణిక విభాగం (ఐఎమ్డి) తన ఇటీవలి తన ఇఎన్ఎస్ఓ బులెటిన్లో భూమధ్యరేఖ పసిఫిక్పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్ఎమ్సిఎఫ్ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) బ్రెజిల్లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది. -
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్ని మరిపిస్తాడా?
ఓ వైపు పెద్ద పెద్ద హీరోల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో వస్తున్న చిత్రాలు ఊరించి ఊరించి ఉస్సురుమనిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకుల్లో పెద్దగా ఫాలోయింగ్ లేని స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసేస్తున్నాయి. అది మరీ వింత కాకపోయినా ఈ మధ్య తరచుగా జరుగుతుండడమే గమనార్హం. మరీ ముఖ్యంగా బలమైన నెట్ వర్క్,సమర్ధులైన సాంకేతిక నిపుణులు పనిచేసిన భారీ చిత్రాల్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక అప్రతిష్ట పాలవుతున్నాయి. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ గానీ, హరి హర వీరమల్లు, కన్నప్ప లాంటి సినిమాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో చిన్న చిత్రాల్లోని గ్రాఫిక్స్ కళ్లప్పగించేలా చేస్తూ సినిమాని బ్లాక్ బస్టర్గా మారుస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు మిరాయ్(Mirai Movie) కూడా జేరింది. విడుదలైన రోజు నుంచి మిరాయ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో పాటు సమీక్షలు కూడా సాధిస్తోంది. ఈ చిత్రం బృందంలో సాంకేతికత పాత్ర భారీగా ప్రశంసలు అందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరంగా, హాలీవుడ్లోని అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ కంపెనీలతో సమానమైన అవుట్పుట్ను మిరాయ్ బృందం అందించగలిగింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఇదంతా హైదరాబాద్లోనే స్థానికంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నియమించిన టీమ్ ఈ అద్భుతమైన ఆవిష్కరణను అందించడం.ట్రైలర్ విడుదలైనప్పుడే వీక్షకులు అందరూ అవుట్పుట్కి ఆశ్చర్యపోయారు నేడు, సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ ముందు పక్షి ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, రాముడి సీన్లు...తెరపైన ఆవిష్కృతమవుతుంటే.. ప్రేక్షకులు ఆ అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరుని కళ్లప్పగించి చూస్తుండటం కనిపిస్తోంది. ఇటీవల అనేక భారీ బడ్జెట్ చిత్రాలు పరిశ్రమలలోని టాప్ కంపెనీల నుంచి కూడా నమ్మదగిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ను పొందడంలో తరచుగా విఫలమవుతున్న పరిస్థితిలో హైదరాబాద్లోని సాంకేతిక నిపుణులే దీనిని సాధించగలగడం మరింత ఆశ్చర్యానందాలను కలిగిస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ లో ఎటువంటి అస్పష్టత రాకుండా కూడా చిత్రబృందం చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నారు, పరిమిత వనరులతోనే టీమ్ మిరాయ్ ఈ అద్భుతమైన అవుట్పుట్ను సాధించడం గమనార్హం.ఈ సినిమా సాధించిన అనూహ్య విజయం రాబోయే మరో అగ్రహీరో ప్రభాస్ భారీ చిత్రం రాజా సాబ్(The Raja Saab) ను చర్చనీయాంశంగా మారుస్తోంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాజాసాబ్ కూడా మిరాయ్ ను అందించిన అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రానుంది. రెబల్ స్టార్ అభిమానులు ఈ చిత్రానికి కూడా అదే రకమైన అవుట్పుట్ ను ఊహిస్తున్నారు. దాంతో ఆ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి. రాజా సాబ్ ఒక హర్రర్ డ్రామా, దీనిని చాలా వరకూ సెట్లోనే చిత్రీకరించారు దాంతో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమా బృందం విడుదల చేసిన టీజర్ కూడా బాగుంది మిరాయ్ లాగే దీనికి కూడా అద్భుతమైన గ్రాఫిక్స్ జతగూడితే...ప్రభాస్ అనే అగ్నికి ఆజ్యం పోసినట్టే అయి ఇక అభిమానులకు రికార్డుల పండగే అని చెప్పొచ్చు. -
అందం.. అభినయం.. రమ్యకృష్ణ తర్వాతే ఎవరైనా
అందం అపురూపం. అభినయం స్ఫూర్తి దీపం.. దక్షిణాది ఎవర్గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. రమ్య కృష్ణన్... మన రమ్యకృష్ణ... భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక. ఎంత మందికి తెలుసో గానీ... ఇప్పటికీ అంటే దాదాపు 55 ఏళ్ల వయసులో కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి రూ. 3-4 కోట్లు వరకూ వసూలు చేస్తుందని సమాచారం. గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది. అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు. సినిమా సినిమాకీ గ్లామర్తో పాటు స్టార్ డమ్ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. 13ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం...రమ్య సెప్టెంబర్ 15, 1970న మద్రాసులో (ప్రస్తుత చెన్నై) జన్మించారు. ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు. రమ్య కృష్ణ నటనా ప్రయాణం 13 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళ చిత్రం నేరం పూలరంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర (1993)చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది. సుభాష్ ఘై 'ఖల్ నాయక్'(1993), మహేష్ భట్ 'చాహత్'(1996) , డేవిడ్ ధావన్ 'బనారసి బాబు' (1997), అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్ (1998)లో గోవిందాతో కలిసి శపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది.నాలుగు దశాబ్ధాల నటనా ప్రస్థానం..ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగానూ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే. దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్ లోనే రాణిస్తున్నారామె. ఐదు భాషలలో 200 కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు. కంటె కూతుర్నే కను, స్వీటీ నాన్న జోడి, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, పడయప్ప(నరసింహ), సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే. నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం.. నభూతో అంటారు సినీ విమర్శకులు. అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, బిహైండ్వుడ్స్ గోల్డ్ మెడల్.. ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది. కాలక్రమంలో తన కెరీర్ను చిన్నితెరకూ విస్తరించి సన్ టీవీ కోసం కలసం, తంగం వంటి టీవీ సీరియల్లలో కనిపించింది. థంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్ లో జడ్జిగా కనిపించింది. వివాదాలూ...ఎక్కువే...ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడు కె.ఎస్. రవికుమార్తో వివాహేతర సంబంధం. 1999లో రమ్య కె.ఎస్.రవికుమార్తో పడయప్ప, పాటాలి (1999), పంచతంతిరం (2002) చిత్రాలలో కలిసి పనిచేసింది. తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ, కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం, రమ్య కెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం రూ. 75 లక్షలు తీసుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి, అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కుని తిరిగి కెరీర్ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య. ఆ తర్వాత, ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని 2003 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకుంది. వారి వివాహం జరిగే సమయానికి, రమ్య వయసు 33, కృష్ణ వంశీ వయసు 41. 2005 ఫిబ్రవరి 13నఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. పిల్లాడి పేరు రిత్విక్ వంశీ.అందానికి తెరరూపంగా...–అల్లుడుగారు–అల్లరిమొగుడు–అల్లరి ప్రియుడు–హలో బ్రదర్–మేజర్ చంద్రకాంత్అభినయానికి ప్రతిరూపంగా..–సూత్రధారులు–అమ్మోరు–నరసింహ–బాహుబలి ది బిగినింగ్–అన్నమయ్య–కంటే కూతుర్నే కనుచలనచిత్ర రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం... చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం. -
అలాంటి మగవాడ్ని చీరలో ఊహించుకుంటాను: తమన్నా
ఇప్పుడు దేశంలో ఉన్న అగ్రగామి నటీమణుల్లో ఒకరుగా ఉంది తమన్నా భాటియా.. అటు సినిమాలు, ఇటు ఐటమ్ సాంగ్స్ మరోవైపు వెబ్ సిరీస్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం డయానా పెంటీతో కలిసి చేసిన ’డూ యు వాన్నా పార్టనర్’ వెబ్ సిరీస్ సక్సెస్ను ఆమె ఎంజాయ్ చేస్తోంది, ఒక మహిళ స్వంతంగా వ్యాపార రంగంలో అది కూడా పురుషులు మాత్రమే చేయగలరు అని అందరూ నమ్మే మద్యం తయారీ రంగంలోకి మహిళలు ప్రవేశించడం... తదనంతర పరిస్థితుల చుట్టూ అల్లుకున్న అంశాలతో ’డూ యు వాన్నా పార్టనర్’ రూపొందింది. ఈ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె . ఒక పురుషుడు తనను ‘ఇక తనేమీ చేయడానికి లేదు‘ లేదా ‘అతనే తుది నిర్ణయం తీసుకున్నాడు అని భావించేలా చేసిన ప్రతిసారీ (అంటే ఆమెను చులకనగా తీసి పారేసిన సమయంలో) ఆమె ఎలా స్పందిస్తుందనే విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా పురుషాధిక్య చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్లేస్ను సొంతం చేసుకోవడం అనేది ఎలా సాధ్యమైందనే విషయంపైన కూడా తమన్నా ఈ సందర్భంగా మాట్లాడింది. అంతేకాక ఇటీవల తన నటన పట్ల విమర్శలు, ఎక్స్పోజింగ్పై వస్తున్న కొన్ని కామెంట్స్ గురించి కూడా ఆమె చెప్పాలనుకున్నట్టు ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.‘‘ఒక పురుషుడు నాకు సంబంధించిన విషయాలలో తుది నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక అందులో నేనేం చేయడానికి ఉండదు. అయితే, నాకు అనిపించేలా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు’’ అంటూ చెప్పిందామె. అంటే ఒక సినిమాలో తాను చేసేదేముంది జస్ట్ ఏదో పాటల్లో అలా గ్లామరస్గా కనిపించడమే కదా అంటూ మాట్లాడి తన ప్రాధాన్యత తగ్గించాలని కొందరు మగవాళ్లు భావిస్తారనే అర్ధం వచ్చేలా మాట్లాడింది. అలా వారు ప్రయత్నించినప్పుడల్లా, తాను అలాంటి మగవాళ్లను చీరలో లేదా కొన్ని గ్లామరస్ దుస్తుల్లో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు ఊహించుకునే దానిని అంటూ చెప్పింది. ఆ ఆ ఊహల్లో అతను చాలా అసహ్యంగా కనిపించేవాడనీ అప్పుడే తనకు తానేం చేయగలదో అతనేం చేయలేడో అనేది తనకు అర్ధమయ్యేదని అంటూ అమ్మాయిలు మాత్రమే గ్లామర్ కు కేరాఫ్ అని వారికి మాత్రమే ఎక్స్పోజింగ్ బాగుంటుందని చెప్పకనే చెప్పింది. కాబట్టి వారికి ఎప్పుడూ తన అవసరం ఉంటుందనే గ్రహింపు తెచ్చుకోవడమే తాను చేసే పనిని ధైర్యంగా చేసేలా చేసిందని అంది, ‘‘ఎందుకంటే ఒక మహిళ చేయగలది, ఒక మహిళ మాత్రమే చేయగలదని నేను విశ్వసిస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. అదే సమయంలో మంచి చెడుల గురించి కూడా ఆమె మాట్లాడింది.‘‘నువ్వు మంచి వ్యక్తివి అయినంత మాత్రానే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు ఏదో ఒకటి చేయగలవని నీ దగ్గర ఏదో ఉందని అనుకుంటేనే ఎవరైనా నీకు పని ఇస్తారు.’’ అంటూ తనకు ఎవరూ ఊరికే పని ఇవ్వడం లేదని గుర్తు చేసింది. ఏదేమైనా మన మనసులో ఉన్నదాన్ని బయట పెట్టడమే మంచిదని అంటోంది తమన్నా. ప్రజలు ఎలా భావిస్తారో అని ఎక్కువగా ఆందోళన చెందడం అంతిమంగా మనకు ప్రతికూలంగానే మారుతుంది‘’ అంటూ చెప్పుకొచ్చింది -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్స్టోన్స్, డైమండ్స్ వాచ్ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్టైల్ ఆటోమేటిక్ టూర్బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
నేపాల్ సంక్షోభం...కోల్కతా రెడ్లైట్ ఏరియాను తాకిన వైనం!
నేపాల్లో సంభవించిన తాజా పరిణామాలు అక్కడి సంక్షోభ ప్రభావం ఎల్లలు దాటుతోంది. అనేక దేశాల్లో విస్తరించిన ఉన్న నేపాలీయుల గుండెల్లో గుబులు రేపుతోంది. అదే క్రమంలో మన దేశంలోని పలు సంప్రదాయ వ్యభిచార కేంద్రాల్లో, కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన ప్రాంతంలోనూ ఈ పరిణామాల ప్రభావం పడింది. కోల్కతాలో, ముఖ్యంగా సోనాగాచిలో నేపాల్ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి, గతంతో పోలిస్తే కొంత మేర తగ్గినప్పటికీ అక్కడ నేపాల్ మహిళలు పెద్ద సంఖ్యలోనే ఇప్పటికీ వ్యభిచార వృత్తిలో ఉన్నారు. కాలిఘాట్ నుంచి హౌరా హుగ్లీలోని పలు వ్యభిచార గృహాలలో నేపాలీలే ప్రధాన భాగాన్ని ఆక్రమించారు, ప్రస్తుతం నేపాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులుగా నా తల్లితో మాట్లాడలేదు. నేను కాల్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, నెట్వర్క్ పనిచేయడం లేదని ఫోన్ చెబుతుంది. ఆమె సురక్షితంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు,’’ అని దశాబ్ద కాలంగా సోనాగాచిలో నివసిస్తున్న తూర్పు నేపాల్కు చెందిన ఒక సెక్స్ వర్కర్ తనను కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘‘ప్రతి నెలా నేను పోఖారా సమీపంలోని మా తాతామామలతో నివసించే నా ఇద్దరు కుమారులకు డబ్బు పంపుతాను. ఈ నెల, నేను ఏదైనా పంపగలనో లేదో నాకు తెలియదు. వారికి డబ్బు రాకపోతే, నా పిల్లలు ఏం తింటారు? ఎలా తింటారు?’’ అంటూ మరొక మహిళ విలపించింది.వీరందరి ఆందోళన ఏమిటంటే వారి కుటుంబాల మనుగడ. వారు అలా వేల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చి విటుల ముందు తమ శరీరాన్ని విస్తరాకులా పరుస్తున్న కారణమే అది. మన కోల్కతా నుంచి నేపాల్కు వీరి ద్వారా వెళ్లే మొత్తాలు పెద్దవేమీ కాకపోయినప్పటికీ, గ్రామీణ నేపాల్లోని పలు కుటుంబాలకు అవే జీవనాధారం. ఈ ఆకస్మిక సంక్షోభం వీరిపై ఆర్థిక ఒత్తిడిని సృష్టించడమే కాకుండా వారి నిస్సహాయ భావనను మరింత తీవ్రతరం చేసింది. ‘‘మేం ఇంటికి వెళ్లాలనుకుంటున్నా, మార్గం కనపడడం లేదు,’’ అని సోనాగాచిలోని మరో నేపాలీ మహిళ అన్నారు. ‘‘సరిహద్దు మూసివేశారు అనేక విమానాలు రద్దు అయ్యాయి. మేం ఇక్కడ మా కుటుంబాలు అక్కడే చిక్కుకున్నాయి. మేం నిస్సహాయంగా ఉన్నాం.’’ అంటూ ఆమె భోరుమంది. ‘‘ఈ మహిళలు బాధలో ఉండటం సహజం. వారు తమ కుటుంబాలను సంప్రదించలేరు, అలాగే చెల్లింపులు వారికి చేరుతాయో లేదో కూడా వారు ఖచ్చితంగా చెప్పలేరు. అధికారులతో సమావేశం నిర్వహించి, వారు తమ కుటుంబాలతో మాట్లాడి ఇంటికి తిరిగి డబ్బు పంపగలిగే మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాము‘ అని స్థానిక మహిళల సమస్యలపై పనిచేసే ముఖోపాధ్యాయ అన్నారు. సోనాగాచిలోని రెడ్–లైట్ జిల్లాలో దాదాపు 200 మంది నేపాలీ సెక్స్ వర్కర్లు ఉంటారని అంచనా. దశాబ్దాలుగా, నేపాలీ మహిళలు కోల్కతాలోని రెడ్–లైట్ బెల్ట్లలో నివసిస్తూన్నారు. తరచుగా అక్రమ రవాణా కారణంగా సరిహద్దులు దాటి దారుణమైన పరిస్థితులలో తప్పనిసరై ఈ మురికికూపంలో మగ్గిపోతున్నారు. -
ఫ్లాష్ బ్యాక్...అన్నయ్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్!
నటనే అయినప్పటికీ కూడా నిజ జీవితంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు... తెరపై జంటగా కనిపించడాన్ని భారతీయ ప్రేక్షకులు ఏ మాత్రం ఒప్పుకోరు. అందుకే నటనను ఎంత ప్రొఫెషనల్గా తీసుకున్నప్పటికీ అలాంటి సాహసం మన దేశంలోని ఏ నటిగానీ ఏ నటుడుగానీ చేయరు. కానీ చాలా కాలం క్రితమే అలాంటి ధైర్యం చేసింది ఓ అందాల బాలీవుడ్ నటి. తన స్వంత అన్నయ్యతో రొమాంటిక్ జోడిగా నటించి, నర్తించి ఆ తర్వాత జనాగ్రహానికి గురైంది. ఆమె పేరు మిను ముంతాజ్.భారతీయ సినిమాలో ప్రతిభావంతులైన నృత్యకారిణి, క్యారెక్టర్ నటిగా ప్రసిద్ధి చెందిన మిను ముంతాజ్, ముంబైలో జన్మించిన ఆమె తండ్రి ముంతాజ్ అలీ కూడా ప్రముఖ నటుడు నృత్యకారుడు కూడా. ఆమె అతని నుంచి నృత్య కళను నేర్చుకోవడం దగ్గర నుంచి అతని అడుగుజాడల్లోనే నడిచింది, కాలక్రమంలో ఆమె తండ్రి మద్యానికి బానిసగా మారాడు. దాంతో టీనేజ్లోనే మిను కుటుంబ ఆర్థిక భారాన్ని మోయవలసి వచ్చింది.నటనపై ఇష్టం అనే కన్నా సంపాదన కోసమే మిను 1955లో 13 సంవత్సరాల వయసులో నానాభాయ్ భట్ చిత్రం హకీమ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తల్లికి ఇష్టం లేకున్నా, సినిమా కెరీర్ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, మిను ముంతాజ్ తన కుటుంబాన్ని పోషించడానికి తప్పనిసరై నటనను కొనసాగించింది. 14 సంవత్సరాల వయస్సులోనే పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రజాదరణ పొందింది. హిందీ చిత్ర పరిశ్రమలో 1950లు 60లలో, ఆమె ప్రముఖ సెలబ్రిటీగా మారింది. అప్పటి చాలా మంది తారల్లాగే మిను ముంతాజ్ది కూడా ఒక పెద్ద కుటుంబం ఆమెకు నలుగురు సోదరులు నలుగురు సోదరీమణులు ఉండేవారు. ఆమె అన్నయ్య మెహమూద్ సైతం అప్పటికే బాలీవుడ్లో స్థిరపడిన హాస్య నటుడు. అతను నటించిన హౌరా బ్రిడ్జి సినిమా 1958 లో విడుదలైంది. అయితే ఈ సినిమాలో ‘‘కోరా రంగ్ సునారియా కలి’’ అనే రొమాంటిక్ పాటలో మెహమూద్ సరసన మిను ముంతాజ్ ప్రియురాలిగా హొయలొలికిస్తూ నటించారు. సినిమా విడుదలైన తర్వాత, ఆ రొమాంటిక్ పాత్రలో నటించిన నటులు నిజ జీవితంలో తోబుట్టువులని తెలుసుకుని ప్రేక్షకులు షాక్కి గురయ్యారు. ఈ తారల నైతికత కుటుంబ సంబంధాల సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలు వీధుల్లో కి వెళ్లి మరీ నిరసన తెలిపారు. దీనికి స్పందించిన నటులు క్షమాపణ చెప్పడమే కాక మిను ముంతాజ్ తాను కుటుంబ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా మాత్రమే ఆ పనిచేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో కొంత కాలానికి ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత ఆ వివాదం ప్రభావమో మరొకటో గానీ మిను ముంతాజ్ స్వల్ప కాలంలోనే అవకాశాలు లేక పరిశ్రమకు దూరమై, ఒక దర్శకుడిని వివాహం చేసుకుని ు కెనడాలో స్థిరపడింది, అక్కడ నివసిస్తూ 2003లో, మిను ముంతాజ్ ఆరోగ్యం క్షీణించడం జ్ఞాపకశక్తి కోల్పోవడం ప్రారంభమైంది వైద్య పరీక్షల్లో ఆమెకు 15 సంవత్సరాలుగా గుర్తించబడని మెదడు కణితి ఉందని తేలింది. అనారోగ్యంతో చాలా కాలం పోరాడిన మిను ముంతాజ్ 2021లో మరణించారు, -
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ.. సోలో టూరే సో బెటరూ...
ఒంటరి ప్రయాణం అనేది ఒక ఆసక్తికరమైన అనుభవం, ఎందుకంటే ఇది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, స్వీయ–ఆవిష్కరణ ఫ్లెక్సిబులిటీలను అందిస్తుంది. అయితే అలా సింగిల్గా ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఉల్లాసమైన అనుభవాలు మాత్రమే కాదు భద్రత, సౌలభ్యం కూడా ప్రధానమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని చూస్తే 5 దేశాలు సోలో ట్రావెల్కి అత్యంత ఎంచుకోదగినవిగా మారాయి. ఒంటరిగా ప్రయాణీకులకు కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి, విభిన్న వ్యక్తులతో సంభాషించడానికి రాజీ పడకుండా మనసుకు నచ్చిన ప్రదేశాలను అన్వేషించడానికి వీలు కల్పించే ఆ దేశాలలో...జపాన్భద్రత, పరిశుభ్రత అత్యంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కారణంగా వ్యక్తిగత ప్రయాణికులకు నెం1 గమ్యస్థానం జపాన్. టోక్యో, క్యోటో ఒసాకా వంటి నగరాలు ప్రశాంతమైన దేవాలయాలు, రద్దీగా ఉండే మార్కెట్లు ఆధునిక ఆకర్షణలతో సంప్రదాయ మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఒంటరి ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ప్రాంతాలు సందర్శించేలా ప్రజా రవాణా బాగా పనిచేస్తుంది చౌకగా బస చేయడానికి క్యాప్సూల్ హోటళ్ళు హాస్టళ్లు కూడా పుష్కలంగా లభిస్తాయి.న్యూజిలాండ్ఇది స్నేహపూర్వకంగా ఉండే ప్రజలు తక్కువ నేరాలు కలిగిన చిన్న దేశం, అందువల్ల ఒంటరి ప్రయాణానికి సరైనది. టోంగారిరో ఆల్పైన్ క్రాసింగ్ను హైకింగ్ చేయడం సౌత్ ఐలాండ్లోని ఫ్జోర్డ్లను సందర్శించడం వంటి అన్ని స్థాయిల ఫిట్నెస్కు అనుగుణంగా ఉండే కార్యకలాపాలతో న్యూజిలాండ్ సోలో ట్రావెల్కు అనుకూలతలు కలిగి ఉంది.పోర్చుగల్సుందరమైన ప్రదేశం, పురాతన పట్టణాలు పర్యాటకులను ఇష్టపడుతూ ఆకర్షించే ఆదరించే సంస్కృతి కలిగిన దేశం పోర్చుగల్. లిస్బన్ పోర్టో వంటి చిన్న నగరాలు కాంపాక్ట్, నడవడానికి అనుకూలమైనవి సాంస్కృతిక అనుభవాలతో నిండి ఉన్నాయి పాత స్మారక చిహ్నాలు సందడిగా ఉండే స్ట్రీట్ లైఫ్ రెండూ ఆకట్టుకుంటాయి. పోర్చుగల్లోని కేఫ్ సంస్కృతి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు స్థానికులు ఇతర ప్రయాణికులతో సులభంగా పరిచయాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయి.కెనడాఇది వాంకోవర్, టొరంటో మాంట్రియల్ వంటి బహుళ సాంస్కృతిక, బాగా అనుసంధానించబడిన నగరాలను కలిగి ఉన్న దేశం. భద్రత విషయంలో ఉన్నత స్థానంలో ఉంది. ఒంటరి ప్రయాణికులు పట్టణాల్లోనే పలు ఆకర్షణలను సందర్శించవచ్చు. జాతీయ ఉద్యానవనాలలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు లేదా కాలానుగుణ స్కీయింగ్, హైకింగ్ వన్యప్రాణుల వీక్షణను చేపట్టవచ్చు.థాయిలాండ్చౌక ధరలకు ప్రయాణించాలనుకునే ఒంటరి ప్రయాణికులకు థాయిలాండ్ అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటి. బ్యాంకాక్, చియాంగ్ మాయి, ద్వీపాలు స్ట్రీట్ ఫుడ్ టూర్స్, దేవాలయాలు, బీచ్లు నైట్ లైఫ్తో సహా అన్ని రకాల అనుభవాలకూ నిలయం. థాయిలాండ్ పర్యాటక మౌలిక సదుపాయాలు హాస్టళ్లు, గైడెడ్ టూర్లు, రవాణా సేవలు మొదలైన వాటితో బాగా అభివృద్ధి చెందాయి.(చదవండి: శ్రీనగర్ టూర్..! మంచుతోటలో చందమామ కథ) -
ప్రభాస్ సినిమా చూసి భారతీయ సినిమాలను నిషేధించాడు!
భారత్కు చిరకాల మిత్ర దేశం, పొరుగు దేశమైన నేపాల్ అల్లర్లతో అట్టుడికిపోతోంది. అవినీతితో పాటు సోషల్ మీడియాపై నిషేధాలతో మొదలైన ప్రజాగ్రహానికి ప్రధాని సహా ప్రభుత్వం మొత్తం దాసోహమైపోయింది. అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని , దేశాధ్యక్షుడు సహా రాజీనామా చేసేశారు. ఈ నేపధ్యంలో ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖాట్మాండు మేయర్గా ఉన్న బాలేంద్ర కు యువతలో ఉన్న ఆదరణ, ఆయనను ప్రధానిగా కోరుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో తదుపరి ప్రధాని ఆయనే అనే ఆలోచన బలపడుతోంది.ఈ నేపధ్యంలో కాబోయే ప్రధానిగా పేర్కొంటున్న బాలేంద్ర షా కు భారత్ తో ఉన్న వైరుధ్యాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఆయన రెండేళ్ల క్రితం భారత సినిమాలపై చూపించిన అవసరానికి మించిన ఆగ్రహం ప్రస్తావనార్హంగా మారింది. రెండేళ్ల క్రితం ఖాట్మండు మేయర్ హోదాలో ఆయన ఖాట్మాండు నగరంలో భారతీయ సినిమాల ప్రదర్శనలను నిలిపేయాలని ఆదేశించారు. దాంతో ఖాట్మాండు మెట్రోపాలిస్తో పాటు, పోఖారా మెట్రోపాలిటన్ నగరం కూడా భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధం విధించింది. ఈ విషయంలో పోఖారా మేయర్ ధనరాజ్ ఆచార్య కూడా బాలేంద్ర షా మార్గాన్నే అనుసరిస్తూ బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని మధ్య నేపాల్లోని మెట్రోపాలిటన్ నగరంలోని సినిమా హాళ్లను ఆదేశించారు. రెండు మెట్రోపాలిటన్ నగరాల మేయర్ల ఆదేశాల తర్వాత, అక్కడ సినిమా హాళ్లు హిందీ లేదా బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను రద్దు చేసి, వాటి స్థానంలో హాలీవుడ్ నేపాలీ సినిమాలను అప్పటికప్పుడు ప్రవేశపెట్టాయి. ఇంతకీ ఇలా బాలీవుడ్ చిత్రాలపై నేపాల్ మేయర్ల ఆగ్రహానికి కారణమైంది టాలీవుడ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా కావడం విశేషం. దీనికి కారణాలను బాలేంద్ర షా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘భారతీయ చిత్రం ఆదిపురుష్ చూశాను. ఆ సినిమాలో రాముని సతీమణి జానకి జన్మ స్థలంపై తప్పు సమాచారం ఉంది . అందులో ఆమెను భారతదేశపు కుమార్తె అని చెప్పే సంభాషణ ఉంది (నేపాలీయులు సీతమ్మ తమ నేలపైనే జన్మించినట్టు విశ్వసిస్తారు), ఇది సరికాదని, అభ్యంతరకరమైనదని మేం వారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్దడానికి 3 రోజుల సమయంతో అల్టిమేటం ఇచ్చాము. అయినా వారు పట్టించుకోలేదు. నేపాల్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఆత్మగౌరవాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటం ప్రతి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వేతర రంగం నేపాలీ పౌరుడి ప్రథమ కర్తవ్యం అనడంలో ఎటువంటి సందేహం లేదు‘ అని ఖాట్మండు మేయర్ అప్పట్లో తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.అయితే ఆ తర్వాత నేపాలీ రాజధానిలో ప్రదర్శనపై నిషేధం నేపధ్యంలో, ’ఆదిపురుష్’ నిర్మాణ సంస్థ ’టి–సిరీస్’ నేపాలీ మేయర్కు లేఖ రాసింది. అనంతరం సినిమాల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆదేశాలిస్తూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్ధుమణిగింది. -
మా అమ్మతో ఆరు నెలలే ఉన్న మాజీ బాయ్ ఫ్రెండ్
కొన్ని బంధాలు ఎలా బలపడతాయో ఎలా రూపుమారతాయో ఎవరూ చెప్పలేరు. అవ్యాజ్యమైన అనుబంధాలు అనుభూతించిన వాళ్లు మాత్రమే ఆ అనుభూతిని వర్ణించగలరు. ఒంటరి తల్లికి బాయ్ ఫ్రెండ్గా తండ్రి స్థానంలోకి వచ్చిన ఓ వ్యక్తి కేవలం ఆర్నెళ్లలోనే ఆమెతో బ్రేకప్ అయి విడిపోతే... కూతురు స్థానంలో ఉన్న చిన్నారితో... జీవిత కాలపు బంధం అల్లుకోవడం నిజంగా ఆశ్చర్యకరం మాత్రమే కాదు అపురూపం కూడా. దక్షిణాఫ్రికాలో నివసించే లారెన్ మెల్నిక్ ఈ తరహా అనుబంధాన్ని ఆస్వాదించారు. ఒక అంతర్జాతీయ మేగ్జైన్ కోసం ఆమె తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...నాకు నాలుగు సంవత్సరాల వయసులో చార్లెస్ మా అమ్మతో ఆరు నెలల పాటు డేటింగ్ చేశాడు, ఆమెను విడిచిపెట్టినా ఆ తర్వాత కూడా నా జీవితాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. బ్రేకప్ అనంతరం కూడా అతను అమ్మ స్నేహం గానే ఉన్నారు. దీని వల్ల అతను ఎక్కడ ఉంటున్నా అప్పుడప్పుడు ఇంటికి రావడం వచ్చినప్పుడల్లా నాకు చిన్న చిన్న బహుమతులు తీసుకువస్తుండేవాడు. , అతను (మేం నివసించిన) జోహన్నెస్బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకు మారిన తర్వాత కూడా నాతో టచ్లో ఉండటానికి ఫోన్ కాల్స్ చేసేవాడు.మా బంధం గురించి మా అమ్మకు ఎప్పుడూ మిశ్రమ భావాలు ఉండేవి, నేను టీనేజర్గా ఉన్నప్పుడు అమ్మతో ఏదైనా గొడవ పడినప్పుడు, నేను ఫోన్ తీసుకుని, చార్లెస్కు ఫోన్ చేసి, సరదాగా అరిచేదాన్ని ‘నా తల్లితో మాట్లాడండి ఆమె సరిగా లేదు!‘ అంటూ చెబుతుంటే ఆమె నన్ను నెట్టేసేది. ఈ రోజుల్లో, చార్లెస్ నేను మా గ్రూప్ కాల్స్లో పరిహాసాలతో ఆమెను నిత్యం ఆటపట్టించేవాళ్లం. మా బంధాన్ని చార్లెస్ నాకు చూపించిన ఊహించని మార్గాలను కూడా అమ్మ అర్ధం చేసుకుంది. అతను నాకు డ్రైవింగ్ స్కూల్ పాఠాలు కూడా కొని పెట్టాడు నా విద్యార్థి రుణంలో మిగిలిన భాగాన్ని తను తీర్చడం ద్వారా మా ఇద్దరినీ ఆశ్చర్యపరిచాడు ఆ తర్వాత నేను ఉద్యోగినై సంపాదించడం ప్రారంభించినప్పుడు, అతను నా అత్యంత తరచుగా గడిపే ప్రయాణ స్నేహితులలో ఒకడు గా మారాడు.మేం కలిసి ప్రయాణించేటప్పుడు, అపరిచితులు తరచుగా ఆయన నా తండ్రి అని అనుకుంటారు ఎందుకంటే మా సంబంధంలో సాంప్రదాయ తండ్రి–కూతురు సంబంధం లోని అన్ని లక్షణాలు ఉన్నాయి – అది నిజం కాదు అనేది తప్ప. ఇలాంటి క్షణాలు మా బంధం ఎంత అసాధారణమైనదో నాకు తరచు గుర్తు చేస్తాయి.నేను పసిబిడ్డగా అతని ఒడిలో కూర్చోనివ్వమని అడిగినప్పుడు చార్లెస్ తక్షణమే బంధాన్ని అనుభవించానని చెప్పాడు. నాకు తెలిసినది ఏమిటంటే, నా తల్లి (నా తండ్రి కాకుండా) మా ఇంటికి తీసుకువచ్చిన వారిలో నేను ఇష్టపడిన అంగీకరించిన ఏకైక వ్యక్తి ఆయనే. నా జీవితంలో ఆయన ఉండాలనే ఆలోచన ప్రణాళికా బద్ధంగా జరగనప్పటికీ... విధికి మాత్రం తన ప్లాన్స్ తనకు ఉన్నాయి.అందుకే నేను చార్లెస్ను ‘రెండవ తండ్రి‘ అనే పేరుకు స్థిరపడ్డాను. ఎల్లప్పుడూ షరతులు లేని మద్దతు, మార్గదర్శకత్వం ప్రేమను అందించే వ్యక్తిని మీరు అలా కాక ఇంకా ఏమని పిలుస్తారు? డిఎన్ఎ బంధం కాకపోవచ్చు కానీ అతను తండ్రికి సిసలైన నిర్వచనం.తన లాంటి డైనమిక్ పర్సన్ని మరెవరినీ నేను ఎప్పుడూ కలవలేదు. ఖచ్చితంగా, కొందరు సవతి నాన్నలతో చక్కని బంధాలను ఏర్పరుచుకుంటారు, కానీ అమ్మ మాజీ ప్రియుడితోనా? అంటే... అవును ఇది అసాధారణమైనది, వింతైనది కుటుంబం అంటే మీ ఇంటిపేరు పంచుకునే వ్యక్తుల కంటే ఎక్కువ అని చార్లెస్ నాకు అర్థమయ్యేలా చేశాడు – అది మీరు నిర్మించేది. నిజమైన నిబద్ధత లేబుల్స్ రూపంలో రాదు అని ఆయన నాకు నేర్పించారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరి జీవితంలో కనిపించడానికి మీరు ప్రతిరోజూ చేసే పని. మనలో చాలా మందికి సంక్లిష్టమైన కుటుంబ బంధాలు ఉన్నాయి, కానీ మా సంబంధం ద్వారా నేను నేర్చుకున్నది... మిమ్మల్ని నిస్సందేహంగా కావాలని ఎంచుకునే వ్యక్తులే మిమ్మల్ని ఎక్కువగా అనుభూతి చెందేలా చేస్తారు. అది మీ రక్తం అయినా లేదా మీరు కనుగొన్న కుటుంబం అయినా సరే. -
మా ఆడపిల్లల్ని "అదోలా" చూస్తున్నారు..
తమ ఊరికి మంచి పేరు తేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఊరి పేరే తమకు చెడ్డ పేరు తెస్తోందని ఆ ఊరివాళ్లు వాపోతున్నారు. గతంలో అప్పుడెప్పుడో తమ తాతల కాలం నాడు వాడుకలోకి వచ్చిన ఆ పేరు ఇప్పుడు తమ పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుకు కూడా అడ్డంకిలా పరిణమించిందని ఆందోళన చెందుతూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు కూడా చేస్తుండడం విశేషం. ఆ ఊరు ఏంటి? ఆ ఊరి పేరు ఎందుకు ఆ ఊరివాళ్ల పాలిట గుదిబండలా మారింది అనే వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో ఉన్నాయి పక్కపక్కనే ఉన్న రెండు ఊర్లు. ప్రస్తుతం ఆ ఊరి పేర్లే మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అసభ్యకరంగా ఉన్న ఆ పేర్లను చెప్పడానికి ఇబ్బందిగా ఉందని తాము సభ్యతగా జీవిస్తున్నా తమ ఊరి పేరు మాత్రం తమను దిగజారుస్తోందనేది వీరి ఆవేదన. ఆ ఊర్లకు అలాంటి పేర్లు రావడానికి కూడా గత చరిత్ర దోహదం చేసిందని ఆ ప్రాంతంలోని పాత తరం వారు చెబుతున్నారు. ఈ రెండు గ్రామాలు కొండల్ని ఆనుకుని ఏర్పడ్డాయి చాలా కాలం క్రితం సంపన్నులైన పర్లాఖిమిండి రాజవంశీయుల ప్రాపకంతో ఆ ఊర్లు ఏర్పడ్డాయట. సదరు రాజ వంశంలోని మగవారు తమ ఆధీనంలోని ఉంపుడుగత్తెలను ఉంచడం కోసం ఆ ప్రాంతాలను ఎంచుకున్నారట. అంతేకాకుండా వారికి కొన్ని భూములను కూడా బహుమతులుగా ఇచ్చారట. ఈ కారణంగానే ఆ ఊర్లకు అలాంటి పేర్లు వచ్చాయని ఆ ఊరి చరిత్ర గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అక్కడ ఉంపుడుగత్తెలను ఉంచేవారు కాబట్టి ఆ ఊర్లను సానిపాలెం, సవర సానిపాలెం అంటూ పిలిచేవారట. అలా అలా అదే పేర్లు రికార్డులలోకి కూడా ఎక్కాయట. ఆ ఊర్లలోని ఒకటైన సానిపాలెంలో దాదాపు 220 కుటుంబాలు ఉన్నాయి. ఆ దగ్గరలో ఎస్టీ కులాల వారు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని సవర సానిపాలెంగా పిలుస్తున్నారు. కొంత కాలం పాటు ఆ పేర్లు అలాగే కొనసాగినా... ప్రస్తుతం ఆ ఊర్లలో అనేక మంది విద్యావంతులుగా , అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుండడంతో ఆ ఊరి పేర్లు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో గ్రామస్తులు తమ ఊర్ల పేర్లను మార్చాలని కోరుతున్నారు. ఆధార్, రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లలో ఆ ఊరి పేర్లు ఉండటంతో అవమానంగా ఉందని, మరీ ముఖ్యంగా పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపధ్యంఓ తమ ఊర్ల పేరు మార్చాలని కోరుతూ ఈ రెండు గ్రామాల ప్రజలు తహసీల్దార్, డీఆర్వోలకు అలాగే శ్రీకాకుళం జెడ్పీ కార్యాలయంలో కూడా . వినతిపత్రాలు అందజేశారు. సానిపాలెం పేరును రామయ్యపాలెంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, గ్రామాల పేర్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిన విషయాన్ని ఆ ఊరివాళ్లు గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పేరు మార్పునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.చాలా సందర్భాల్లో తమ ఊరి పేరు చెప్పాలంటేనే సిగ్గుగా ఉంటోందని స్థానికులు అంటున్నారు.. తమ గ్రామం పేరు చెప్పి అవమానాలు కూడా పడ్డామంటున్నారు. కొందరు ఊరి పేరు చెప్పగానే నవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో రాజుల కాలం నాటి పేర్లు అలాగే ఉన్నాయని.. వాటిని ఇప్పుడైనా మార్చాలని కోరుతున్నారు. వీరి వినతికి స్పందించి ప్రభుత్వం పేరు మార్పు ఎప్పుడు చేస్తుందో...చూడాలి. -
మగాళ్లూ..కన్యత్వం గురించి లైట్ తీస్కోండి..అది ఒక్కరాత్రి మేటర్
సెలబ్రిటీల వ్యాఖ్యలు ఇటీవల రేపుతున్నంత దుమారం మరేవీ రేపడం లేదనేది వాస్తవం. విభిన్న రకాల మాధ్యమాలు అందుబాటులోకి రావడం, వాటిలో వారు తమ అభిప్రాయాలను పంచుకోవడం, అనేక వేదికల మీద ఇంటర్వ్యూలలో మాట్లాడే మాటలు.. వాటిలో ఏ కాస్త తేడా ఉన్నా అవి స్వల్ప కాలంలోనే వైరల్ అయి ఆ సెలబ్రిటీల గొంతులో పచ్చి వెలక్కాయలా మారడం చూస్తూనే ఉన్నాం.అదే విధంగా ఇటీవల మరో సెలబ్రిటీ చేసిందంటూ వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు పెను సంచలనం కలిగించాయి. సంప్రదాయాలకు, నైతికతకు విలువిచ్చే భారతీయుల మనోభావాలు గాయపడే విధంగా మాజీ మిస్ వరల్డ్ ప్రస్తుత హాలీవుడ్ నటి, పాశ్చాత్యుడిని పెళ్లాడిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు సరసన రాజమౌళి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ మధ్య ఆమె ‘కన్యత్వం ఒక రాత్రిలో ముగుస్తుంది, కానీ మర్యాదలు శాశ్వతంగా ఉంటాయి‘ కాబట్టి మగవాళ్లు కన్యల కోసం వెదకి వేసారి పోవాల్సిన అవసరం లేదనీ మనిషిగా పరస్పర మర్యాదలు ముఖ్యం అంటూ ఆమె చేసిందన్న వ్యాఖ్యల్ని అనేక మాధ్యమాలు హైలెట్ చేశాయి.సహజంగానే ఈ వ్యాఖ్యలు చాలా త్వరగా వైరల్ కావడంతో విపరీతమైన దుమారం చెలరేగింది. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మొదటి నుంచీ పాశ్చాత్య పోకడల్ని ఇష్టపడే వ్యక్తిగా ప్రియాంక చోప్రా కు ఉన్న పేరు ఈ వ్యాఖ్యలు ఆమే చేసిందంటూ అత్యధికులు నమ్మేందుకు కూడా దోహదం చేసింది. గత కొంత కాలంగా ప్రియాంక మన బాలీవుడ్ సినిమాల కంటే ..హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుండడం వంటివి కూడా దీనికి కొంత వరకూ కారణం. ఈ నేపధ్యంలో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ చిచ్చు రాజుకున్న కొన్ని రోజుల తర్వాత తీవ్రత గమనించిన ప్రియాంక నష్ట నివారణ చర్యలకు దిగారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె ఖండించారు. ఆ మాటలు తనవి కాదంది, ‘ఏదైనా సరే ఆన్లైన్లో ఉన్నంత మాత్రాన అది నిజం కాదు‘ అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను ఖండించారు. తనదిగా సూచించే ఈ కోట్ నకిలీదని వైరల్ కావడానికి పన్నిన వ్యూహమని ఆమె ఇన్స్ట్రాగామ్లో స్పష్టం చేసింది. ఇలా వైరల్ అయ్యేందుకు కూడా కల్పిత కంటెంట్ సృష్టిస్తున్నారని ఆన్లైన్ విశేషాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు దాన్ని థృవీకరించుకోవాలని చోప్రా తన అభిమానులను కోరారు. -
జరిమానానా?దారి దోపీడీనా?
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు ఇదే సందు అదే సందు అన్నట్టుగా పెరుగుతున్న చలానాల వడ్డింపు కూడా తరచు చర్చనీయాంశంగా మారుతోంది. డ్రంకెన్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మ్ట్ రహిత డ్రైవింగ్.... తదితర ఉల్లంఘనల పట్ల బాగా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. కేసులు రాయడంతో పాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఈ పరిస్థితి ద్విచక్రవాహనదారులకు తీవ్ర సంకటంగా మారింది. మోటార్ సైక్లిస్ట్స్ లలో సాధారణంగా దిగువ మధ్య తరగతివారే అధికం కావడంతో భారీ మొత్తంలో జరిమానాలను భరించలేక తరచుగా వారు గొడవలకు నిరసనలకు దిగుతుండడం అలాంటి ఘర్షణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండడం కూడా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్న ఒక ద్విచక్ర వాహనదారుడు తనకు విధించిన జరిమానాపై ఏకంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇలా పెద్ద మొత్తంలో ఇష్టా రాజ్యంగా జరిమానాలు విధించడం అంటే అది మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనే అని పిటిషనర్ ఆరోపించారు.హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవేంద్ర చారి అనే ప్రైవేట్ ఉద్యోగి 2025 నంబర్ 26655న ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు, గత మార్చి 17న ఇద్దరు అదనపు రైడర్లతో (ట్రిపుల్ రైడింగ్) కలిసి ప్రయాణించిన కారణంగా తనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు) విధించిన జరిమానాను ఆయన కోర్టులో సవాల్ చేశారు. చట్టంలో అనుమతించబడిన జరిమానాలకు మించి చలాన్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ద్విచక్ర వాహన నేరానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 100–రూ. 300 మాత్రమే జరిమానా విధించాల్సి ఉండగా రూ. 1,200 కట్టమని ఆదేశించడాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు రూ. 1,200 మొత్తం జరిమానాగా విధించారని అయితే మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 177 అటువంటి నేరానికి చాలా తక్కువ జరిమానాను నిర్దేశిస్తుందని, కాబట్టి ఈ జరిమానా చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. ‘వాహనదారులలో భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో వేల రూపాయల చట్టవిరుద్ధ చలాన్లు విధించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది అని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ ఆక్షేపించారు.‘‘చట్టం ద్వారా అనుమతించబడిన జరిమానాలకు మించి ఏ పౌరుడిని శిక్షించలేం. అయితే ఆదాయాన్ని సంపాదించాలనే దురుద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడం మర్చిపోయి వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన విమర్శిస్తున్నారు. ఈ పిటిషన్ను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు చట్టబద్ధమైన పరిమితులను మించి జరిమానాలు ఎందుకు విధిస్తున్నారో వివరణ సమర్పించడానికి హోంశాఖకు, ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఒక వారం గడువు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇలాంటి అధిక జరిమానాల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పలువురు వాహనదారుల ను ఈ పిటిషన్ ఆకర్షిస్తోంది. తెలంగాణలో ట్రాఫిక్ జరిమానాలు అమలు తీరుతెన్నులపై హైకోర్టు నుంచి భవిష్యత్తు రాబోయే నిర్ణయం ప్రభావితం చేయనుందని చెప్పొచ్చు. -
రాగి జావ, అంబలి ఆహారం...వెయిట్ లిఫ్టింగ్లో విజయం
ఆమె బరువులు ఎత్తడం మాత్రమే కాదు..మన స్ఫూర్తిని కూడా పైకి ఎత్తుతోంది అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు. సాక్షాత్తూ మహీంద్రా గ్రూప్ అధినేతగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆయన లాంటి ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందుకున్న ఆమె అత్యంత సాదా సీదా వ్యక్తి. మరీ ముఖ్యంగా 82 ఏళ్ల వయసున్న వృద్ధురాలు. ఆ వయసులో ఆమె బరువులు ఎత్తడమే విచిత్రం అనుకుంటే ఆ పని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఉండడం గొప్ప విశేషం. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పరిధిలో ఉన్న పొల్లాచ్చి అనే చిన్న పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఆనంద్ మహీంద్రాకు ప్రేరణగా నిలిచింది. శారీరక సామర్ధ్యానికి వయస్సు అడ్డంకి కాదని ప్రపంచానికి నిరూపించడమే ఆ ప్రేరణకు కారణం. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియషిప్లలో పోటీ పడి అందరినీ ఆశ్చర్యపరిచిన కిట్టమ్మాళ్ ధైర్యసాహసాలు శక్తి సామర్ధ్యాల కథ దానికి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు ఇవన్నీ వైరల్గా మారాయి.80 వర్సెస్ 30...ఇటీవల కునియాముత్తూరులో జరిగిన ’స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో కిట్టమ్మాళ్ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది, అక్కడ ఆమె పోటీ పడింది తన వయసుకు కాస్త అటూ ఇటూగా ఉన్నవారితో కూడా కాదు ఏకంగా 30 ఏళ్లలోపు ఉన్న మహిళలతో పోటీపడింది. పోటీలో పాల్గొన్న మొత్తం 17 మంది ఇతర మహిళలతో పోటీ పడి ఆమె ఐదవ స్థానాన్ని దక్కించుకుంది, ఓపెన్ ఉమెన్స్ విభాగంలో 50 కిలోల బరువును డెడ్లిఫ్టింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.ఇంటి పనులే రాటు దేల్చాయి..తను ఇంటి రోజువారీ అవసరాల్లో భాగంగా చేసిన పనులే తనను వెయిట్ లిఫ్టర్గా మార్చాయి అంటున్నారు కిట్టమ్మాళ్. ప్రతిరోజూ 25 కిలోల బియ్యం సంచులను మోయడం డజన్ల కొద్దీ కుండల నీరు మోస్తూ తీసుకురావడం అలవాటు అయిందని అదే తనను రాటు దేల్చిందని వివరించారు. తద్వారా బలశిక్షణ తనకు సహజంగానే సాధ్యమైందని చెప్పారు. తన శక్తిని గుర్తించిన తన మనవళ్లు రోహిత్, రితిక్లచే మార్గదర్శకత్వంతో తాను ఇంటి బరువుల నుంచి జిమ్ శిక్షణకు మారానని తెలిపారు. గత నెల రోజులుగా డెడ్లిఫ్టింగ్ పద్ధతులను నేర్చుకుంంటూ వచ్చానన్నారు. దీనితో పాటే తన స్టామినాకు తన జీవితకాలపు ఆహారపు అలవాట్లు కూడా కారణమయ్యేయేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యార్ధులైన ఆధునికులు అందరూ జపిస్తున్న మిల్లెట్ మంత్రాన్ని ఆమె ఎప్పటి నుంచో ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె (రాగులతో చేసిన జావ సజ్జలతో గంజి... గుడ్లు, మునక్కాయ సూప్, వంటివి తీసుకుంటూ అపరిమిత శక్తి సామర్ధ్యాలను స్వంతం చేసుకున్నారు.ఆమె గురించి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...82ఏళ్ల వయసులో ఒక మహిళ బరువులు లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు మనలోని స్పిరిట్ని లిఫ్ట్ చేస్తోంది. ఉత్సాహంగా జీవించడానికి, ధైర్యంగా కలలు కనడానికి మీ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ఆలస్యం అనేది లేనే లేదని గుర్తు చేస్తుంది. వయస్సు లేదా సాంప్రదాయ జ్ఞానం పరిమితులను నిర్ణయించదు. మీ సంకల్ప శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది.At 82, a woman is lifting not just weights but our spirits., winning powerlifting championships and defying every cliché about age.She’s a reminder that it’s never too late (or too early) to live with vigour, to dream boldly, and to pursue your goals.Age or conventional… pic.twitter.com/fCLQO1PoDJ— anand mahindra (@anandmahindra) September 1, 2025(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
ముద్దంటే చేదే అంటున్న స్టార్స్... ఎందుకు?
ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణమయ్యాయి. ముఖ్యంగా లిప్కిస్ సీన్స్ అయితే దాదాపుగా సగం సినిమాల్లో అంతకన్నా ఎక్కువగా వెబ్సిరీస్లలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మన భారతీయ సంప్రదాయ జీవనశైలి దృష్ట్యా ఇప్పటికీ ఆ తరహా దృశ్యాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునో లేక వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపించో పలువురు సినీ తారలు తాము అలాంటి దృశ్యాలు, ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించమనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా దక్షిణాది నటుడు విశాల్ కూడా చేరారు. ఇటీవలే తన పెళ్లి నిశ్చితార్ధం చేసుకున్న ఈ హీరో ఇకపై తెర ముద్దులకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.అలా ఆన్ స్క్రీన్ కిస్లకు దూరంగా ఉండే నటుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన ఎప్పటినుంచో లిప్కిస్ సీన్ల కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటువంటి సన్నివేశాలు తనకు అసౌకర్యకరం అనిపిస్తాయనీ, తన అభిమానులు కూడా కుటుంబంతో కలిసి చూడలేరని అంటున్నాడు. అదే విధంగా తొలినాళ్ల నుంచీ షారూఖ్ ఖాన్ కూడా అదే బాటలో ఉన్నాడు. అయితే జబ్ తక్ హై జాన్ , జీరో సినిమాల్లో మాత్రం దర్శక నిర్మాతల కోరిక మేరకు తప్పనిసరై చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక మళయాళ స్టార్ ఉన్నీ ముఖుందన్ కూడా ఆన్ స్క్రీన్ కిస్సింగ్కు విముఖమే. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం వల్ల అలాంటి స్క్రిప్ట్స్ ఆయన దగ్గరకు రావు. ప్రేమ ప్రదర్శనకు కిస్ తప్పనిసరి కాదంటున్న ఆయన; కుటుంబ ప్రేక్షకులందరు చూడగలిగే చిత్రాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అయితే మార్కో పేరుతో ఈ హీరో భయంకరమైన హింసను చూపించడంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారు ధియేటర్లు వదిలి వెళ్లిపోవడం గమనార్హం. నటి జెనీలియాలాగే ఆమె భర్త నటుడైన రితేశ్ దేశ్ముఖ్ సైతం ముద్దంటే చేదే అంటున్నాడు. మన హీరోల్లో శర్వానంద్ది కూడా ఇదే పంథా అయితే మహా సముద్రం వంటి ఒకటి రెండు సినిమాల్లో మాత్రం కొంచెం పక్కకి జరిగినట్టు కనిపిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబులతో లిప్ టు లిప్ టచ్ చేసిన కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి అనంతరం పెదాలపై ముద్దులకు నో అని చెప్పేసింది. అలాగే మహానటి సినిమా ద్వారా సాధించిన క్లీన్ ఇమేజ్ను కాపాడుకుంటూ కీర్తి సురేష్ కూడా వాటికి దూరంగానే ఉంటోంది. ఒక తెలుగు చిత్రంలో కధ ప్రకారం లిప్–కిస్ సన్నివేశం ఉందని చెప్పడంతో ఆమె ఆ సినిమా అవకాశాన్ని కాదనుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా నో కిస్సింగ్ ప్లీజ్ అంటున్నారు. దాదాపు 18ఏళ్ల పాటు లిప్ కిస్లకు, మితిమీరిన ఎక్స్పోజింగ్కు దూరంగా ఉన్న తమన్నా ఇప్పుడు ఆ రెండింటికీ సై అంటున్నారు. దక్షిణాది హీరో హీరోయిన్లు ఇంకా ఈ ముద్దు సీన్ల విషయంలో ముదిరిపోయినట్టు కనిపించడం లేదు గానీ బాలీవుడ్ మాత్రం ఓ రేంజ్లో ముదిరిపోయింది.ఈ సందర్భంగా ఈ కిస్సింగ్ సీన్లకు సంబంధించి హీరో హీరోయిన్లు అందరూ ఒకెత్తయితే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఒక్కడే ఒకెత్తుగా చెప్పాలి. సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ తెరపై ముద్దుల పంట పండిస్తున్న ఈయన సీరియల్ కిస్సర్ కిరీటం అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు. ముద్దులు పెట్టి పెట్టి ముఖం మొత్తిందో లేక కొత్తగా వచ్చిన భార్య తిట్టిందో గానీ ఈ హీరో ఇక లిప్ కిస్లకు నో అంటూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ ఏడేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత కాలం క్రితం వరకూ కఠినంగానే అమలు చేసిన ఇమ్రాన్ ఆ తర్వాత తన నిర్ణయానికి కొన్ని సవరణలు చేశాడు. ‘‘కండలు చూపించని సల్మాన్ను ముద్దులు కురిపించని ఇమ్రాన్ను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు’’ అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆయన... తన భార్య కోరిక మేరకు ఎడా పెడా ఆ సీన్లు చేయనని. తప్పనిసరైతేనే ఓకే అంటానంటున్నాడు. -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
అల్లు అర్జున్ ‘ఇంటి’ పేరు ‘అల్లు’ కాదా?. మహేశ్ ‘ఇంటి’పేరు ఘట్టమనేని కాదా?
‘‘మన్నాత్’’ అనగా మనసా వాచా కోరుకున్నవన్నీ నిత్యం జరుగుతాయని వ్యక్తం చేసే ఆకాంక్ష. ‘‘జన్నత్’’ అనగా స్వర్గం అదే క్రమంలో వస్తుంది మన్నాత్ కూడా. ఇంతకీ ఈ మన్నాత్ అనే పదం మన దేశంలో ఇంత పాప్యులర్ కావడానికి కారణం ఏమిటో తెలుసా? అది బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇంటిపేరు కావడమే. ఇంటిపేరు అంటే మనం అనుకునేది కాదండోయ్.. సాధారణంగా ఇంటి పేరు అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? వంశపారం పర్యంగా మన పేరు కు ముందు వస్తున్న ఇనీషియల్ కదా. వాడుకలో ఎందుకని అలా మారిందో గానీ నిజానికి అది వంశం పేరు. చాలా మంది తమ నివాస భవనాలకు పెట్టుకునే పేర్లను కూడా ఇంటి పేరు అనే పేర్కొంటారు. తాము స్వంతం చేసుకున్న ఇంటికి పేర్లు పెట్టడం అనేది సాధారణ పౌరులతో పాటు సెలబ్రిటీలకు కూడా సాధారణమే.గత 2001లో షారుఖ్ ఖాన్ ఒక ‘విల్లా వియెన్నా’ని కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మన్నాత్. అత్యంత ఖరీదైన సెలబ్రిటీ బంగ్లా అనే స్టేటస్ నుంచి మొదలై ఈ ఇంటి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది.ఈ నేపధ్యంలో మరికొందరు తారలు పెట్టుకున్న ఇళ్ల పేర్లు పరిశీలిస్తే...బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి పేరు కూడా ఆయన లాగే బాగా పాప్యులర్. ఆయన ఇంటి పేరు ‘జల్సా’’‘‘జల్సా’’ అంటే ఆనందం సంబురాలకు ప్రసిద్ధి అనేది మనకు తెలిసిందే. జూహూలో ఉన్న ఈ బంగ్లా, బచ్చన్ అభిమానులకు నిత్య సందర్శనీయ ప్రదేశంగా మారింది.అదే విధంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆయన భార్య సీనియర్ నటి కాజోల్ లు నివసించే ఇంటి పేరు భక్తి భావనలకు చిరునామాగా ఉంటుంది. వీరి ఇంటి పేరు‘శివ శక్తి’’ ఈ పేరులో శివుడి శక్తి తో పాటు దైవ భక్తి కూడా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా రాజకీయ నేత, సీనియర్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా నివసించే భవనం పేరు రామాయణ్.. తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా కలసి వచ్చేలా ఆయన ఇంటికి పేరు పెట్టారు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన 27 అంతస్థుల సౌధానికి అంటిల్లా అని నామకరణం చేశారు. బోలెడన్ని విలాసాలు, రహస్య సంపదలు ఉన్న 15వ శతాబ్ధపు ద్వీపం పేరట ఇది.అలాగే బాలీవుడ్ యువ జంట రణబీర్ కపూర్ అలియాభట్లు తాజాగా అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. దీనికి కృష్ణరాజ్ బంగ్లా అంటూ పేరు పెట్టారు. తన నానమ్మ కృష్ణ కపూర్ తాతయ్య రాజ్ కపూర్ ల పేర్లు కలిసి వచ్చేలా అలా నామకరణం చేశారు.ఇక మన టాలీవుడ్ స్టార్స్ సైతం తమ తమ ఇళ్లకు పేర్లు తమ అభిరుచులకు అనుగుణంగా పెడుతున్నారు అయితే ప్రస్తుతానికి అవి మరీ బాలీవుడ్ స్థాయిలో పాప్యులర్ కాకపోయినా, అన్ని విషయాల్లోనూ బాలీవుడ్ని అధిగమిస్తున్న మన టాలీవుడ్ స్టార్స్ ఇంటి పేరు పాప్యులారిటీలోనూ పోటీ పడతారేమో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి బ్లెస్సింగ్ అనే పదం ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఉన్న విశాలమైన ఉద్యానవనం కు అల్లు గార్డెన్స్ అని పేరు పెట్టారు.జూబ్లీహిల్స్లోని తన భవనానికి సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా పద్ధతిగా చాలా మంది తెలుగువారి ఇళ్లకు ఉండే పేరును తలపించేలా శ్రీ లక్ష్మీ నిలయం అనే పేరు పెట్టారు. ఇక టాలీవుడ్ రౌడీ...విజయ్ దేవరకొండ మాత్రం ఇంటి పేరునీ తన వంశం పేరునీ ఒకటి చేసేశారు. ఆయన ఇంటికి దేవరకొండ హౌస్ అని పేరు పెట్టడం ద్వారా. -
అభిమాన నేత కోసం భర్తనే చంపి...రొమ్ము కోసేసినా..
దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిలో చాలా మంది తమ పోరాటాలకు, అప్పుడు అందించిన సేవలకు తగిన గుర్తింపును పొందారు. అయితే స్వాతంత్య్ర యోఢులుగా గుర్తింపు పొందిన వారిలో అత్యధికులు పురుషులే కాగా.. అలా వెలుగులోకి వచ్చిన మహిళలు తక్కువ మందే. అలాంటి వారిలో నీరా ఆర్య ఒకరు. ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో భారతీయులకు తెలియని ఆ పేరు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఇప్పుడీ గుర్తింపు రావడానికి ఆమె జీవిత కధ బయోపిక్గా తెరకెక్కడం కూడా ఓ కారణం. భారత జాతీయ సైన్యంలో మొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య. దేశం పట్ల నిస్వార్థ అంకితభావం కలిగిన నీరా ఆర్య సాహసోపేతమైన కథ కన్నడ చిత్ర నిర్మాత దర్శకత్వం వహించిన చిత్రం ద్వారా వెలుగులోకి వస్తోంది.ఉత్తరప్రదేశ్కు చెందిన నీరా ఆర్య(Neera Arya) మార్చి 5, 1902న బాగ్పత్ జిల్లాలోని ఖేక్రా నగర్లో ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి, సేథ్ ఛజ్జుమల్, ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త, ఆయన నీరా ఆమె సోదరుడు బసంత్ లకు కోల్కతాలో విద్యాభ్యాసం చేయించారు. చిన్నప్పటి నుంచీ, నీరా తన దేశ శ్రేయస్సు, జాతీయతా భావాల పట్ల బలమైన మక్కువను చూపించేవారు. ఆ మక్కువతోనే పాఠశాల చదువు పూర్తి చేసిన తర్వాత, ఆజాద్ హింద్ ఫౌజ్లోని రాణి ఝాన్సీ రెజిమెంట్లో సైనికురాలిగా చేరారు.అయితే ఆమె తండ్రి ఆమెను బ్రిటిష్ ఆర్మీ అధికారి, సిఐడి ఇన్ స్పెక్టర్ అయిన శ్రీకాంత్ జై రంజన్ దాస్కు ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రి మాట కాదనలేక పెళ్లి చేసుకున్నప్పటికీ... ఆ దంపతులు ఇద్దరివీ భిన్నమైన నమ్మకాలు భిన్నమైన దారులుగా మారాయి, ఒకరు బ్రిటిష్ ప్రభుత్వం కోసం పనిచేస్తుంటే మరొకరు భారతదేశపు అజాద్ హింద్ ఫౌజ్ కోసం.. చేస్తుండడం ఇద్దరి మధ్య గొడవల్ని సృష్టించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యంలో నీరా భాగమని శ్రీకాంత్ తెలుసుకుని, అతను ఆమె నుంచి ఏదో ఒకలా నేతాజీ గురించిన సమాచారం పొందడానికి ప్రయత్నించాడు. అయితే నీరా అతను ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా చెప్పడానికి నిరాకరించేది.ఒక రోజు, నీరా బోస్ను కలిసేందుకు వెళుతుండగా శ్రీకాంత్ ఆమెను రహస్యంగా అనుసరించాడు. చెంత తుపాకీతో సహా స్థావరాన్ని చేరుకున్న శ్రీకాంత్ అక్కడ దాడికి పాల్పడి బోస్ డ్రైవర్ను కొట్టడం మొదలుపెట్టాడు.భర్తను చూసి అవాక్కయిన నీరా.. ఆ సమయంలో బోస్ను రక్షించడానికి ఏ మాత్రం సంకోచించకుండా తన భర్త శ్రీకాంత్ను చంపేసింది.దీని ఫలితంగా బ్రిటిష్ వారు ఆమెను అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలుకు పంపారు. కానీ ఆమె తన దేశం కోసం ప్రేమించడం పోరాడటం అప్పుడూ ఆపలేదు. ఆమె జైలు శిక్ష సమయంలో, నీరా భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గురించి, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గురించి సమాచారం వెల్లడిస్తే ఆమెకు బెయిల్ ఇస్తామని ప్రలోభ పెట్టినా కూడా తన అభిమాననేత గురించి చెప్పడానికి ఆమె నిరాకరించింది. అంతేకాదు తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి జైలు అధికారులపై ఖాండ్రించి ఉమ్మివేసింది.దీంతో ఆమె అక్కడ చిత్ర హింసలకు గురయ్యారు. సుభాష్ చంద్రబోస్ తన గుండెల్లో ఉన్నారని చెప్పినందుకు శిక్షగా ఆమె రొమ్ములు కూడా కత్తిరించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ క్రూరమైన హింస ఎదుర్కున్నా, నీరా విధేయురాలిగా ఉండి, ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి మహిళా గూఢచారిగా బోస్ తో గుర్తింపు దక్కించుకుంది. నీరా ఆర్య జీవిత కధ∙ఆధారంగా రూపొందిన ఈ చిత్రంతో రూపా నాయర్ బాలీవుడ్లో నటిగా దర్శకురాలిగా అరంగేట్రం చేయనున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న రచయిత వరుణ్ గౌతమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. -
అగ్నిపర్వతంపై విఘ్ననాయకుడు! 700ఏళ్ల గణపతి ఎక్కడో తెలుసా?
విఘ్నాధిపతి గణపతి నవరాత్రులు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నిజానికి ఈ ఉత్సవాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మారాయి. పలు దేశాలలోనూ గణేశ్ చతుర్ధి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ పూజలు, వేడుకల విశేషాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి విశేషాల్లో అనేకమందిని ఆకట్టుకుంటున్న వైవిధ్య భరిత ఉత్సవం ఓ అగ్నిపర్వతం మీద జరుగుతుండడం విశేషం. అది కూడా మన దేశంలో కాకపోవడం మరో విచిత్రం.ఇండోనేషియాను ‘రింగ్ ఆఫ్ ఫైర్‘ అని పిలుస్తారు ఏకంగా 141 అగ్నిపర్వతాలను కలిగి ఉండి వాటిలో 130 ఇప్పటికీ బాగా చురుకుగా ఉండడంతో ఆ దేశానికి ఆ పేరు వచ్చింది. అలా ఇండోనేషియాలో చురుకుగా ఉన్న అగ్నిపర్వతాల్లో వీటమౌంట్ బ్రోమో కూడా ఒకటి. ఇది దాని సహజ సౌందర్యం సాంస్కృతిక ప్రాముఖ్యత రెండింటికీ ప్రసిద్ధి చెందింది. ‘బ్రోమో‘ అనే పేరు హిందూ దైవం బ్రహ్మ అనే పేరును జావానీల ఉచ్చారణ నుంచి ఉద్భవించింది.ఇది ఈ ప్రదేశపు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత థృఢంగా చేస్తుంది. మౌంట్ బ్రోమో బ్రోమో పర్వతం టెంగర్ సెమెరు నేషనల్ పార్క్లో ఒక భాగం, ఇది 800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కలిగి ఉంది. మొత్తం 2,392 మీటర్ల ఎత్తులో ఇతర ఇండోనేషియా శిఖరాలతో పోలిస్తే దాని ఆకర్షణ యాత్రికులను, పర్యాటకులను కట్టిపడేస్తుంది.ఇండోనేషియాలోని ఈ మౌంట్ బ్రోమో అంచున ఓ గణేష్ విగ్రహం. ఉంది. ఇది 700 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని స్థానికులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర గణపతి మూర్తి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా దాని చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతకు కూడా పేరొందింది. టెంగర్ తెగకు చెందిన ప్రజలు స్థాపించిన ఈ గణపతి చాలా విశిష్టత కలదని విశ్వసిస్తారు. ఈ తెగ అగ్నిపర్వతానికి సమీపంలో నివసిస్తోంది. తరతరాలుగా, వారు రక్షణ కోసం గణేష్ను పూజించడం చుట్టూ పలు సంప్రదాయాలను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా స్థానికులను ఇది అగ్నిపర్వత విస్ఫోటనాల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షిస్తుందని నమ్ముతారు, అందుకే ఈ వల్కనో వినాయకుడికి పూలు పండ్లను అర్పించే ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ పూజల వల్లనే అందమైన బ్రోమో టెంగర్ సెమెరు జాతీయ ఉద్యానవనంలో ఉన్న ఈ ప్రదేశం విశ్వాసం, వారసత్వం సహజ సౌందర్యాన్ని సంపూర్ణంగా మిళితం చేస్తూ ఒక ప్రత్యేకమైన తీర్థయాత్ర గమ్యస్థానంగా అవతరించింది. ఇక్కడ గణేష్ చతుర్థి సమయంలో జరిగే వేడుకలు ఇండోనేషియా వెలుపల కూడా భక్తులను ఆకర్షిస్తాయి, ప్రపంచంలోని అత్యంత అసాధారణమైన సహజ పరిస్థితులలో వర్ధిల్లే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది మారింది. ఇండోనేషియాలో హిందూ సమాజం చాలా కాలంగా బలమైన ఉనికి కలిగి ఉంది వినాయకునికి పూజలు చేసే లెక్కలేనన్ని దేవాలయాలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే మౌంట్ బ్రోమో వద్ద ఉన్న గణేష్ విగ్రహం అగ్నిపర్వతం అంచున ఉండటం వల్ల అసాధారణమైనదిగా పేరొందింది. స్థానిక సంప్రదాయం ప్రకారం, ఈ విగ్రహం దైవిక శక్తులను కలిగి ఉంది, చుట్టుపక్కల గ్రామాలను విస్ఫోటనాలు ఈ గణపతి రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. ఈ ప్రాంతంలో నిరంతర భద్రత సామరస్యాన్ని వర్ధిల్లజేయడానికి ప్రార్థనలు, పువ్వులు పండ్లు అందిస్తారు. ఈ ప్రదేశంలో నిర్వహించే రోజువారీ ఆచారాలు సమాజ రక్షణ, భాగస్వామ్య భక్తి శాశ్వత ఆధ్యాత్మిక సంబంధాన్ని బలోపేతం చేస్తాయి.(చదవండి: గణేశ్ చతుర్థి బహిరంగ వేడుకలు అలా మొదలయ్యాయి..!) -
బిర్యానీని ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా?
భారతీయ బిర్యానీలలో టాప్ ఇవే...బిర్యానీ అంటే ఒక వంటకం కాదు, అది ఒక అనుభూతి. భారత దేశంలో అత్యధిక సంఖ్యలో భోజన ప్రియులు బిర్యానీని ఇష్టపడతారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే ఈ రుచికరమైన బిర్యానీ సువాసనగల బాస్మతి బియ్యాన్ని మ్యారినేట్ చేసిన మాంసం, కూరగాయలు సుగంధ ద్రవ్యాలతో తయారవుతుంది. గొప్ప రుచి సువాసనకు ప్రసిద్ధి చెందిన బిర్యానీ దక్షిణాసియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన వంటకాల్లో ఒకటి, దీనిని రోజువారీ భోజనంలో పండుగ సందర్భాలలో రెండింటిలోనూ ఎంజాయ్ చేస్తారు.పుట్టుక వెనుక...బిర్యానీ అనే పదం పర్షియన్ పదం అయిన ‘‘బిరియన్’’ నుంచి పుట్టింది. ఈ పదానికి అర్థం ’వంటకు ముందు వేయించినది’. ఇదే బిర్యానీని ఇంగ్లీషులో మిక్స్డ్ రైస్ డిష్ అంటూ పేర్కొంటారు. దీనిని 16వ శతాబ్దంలో మొఘలులు భారతదేశానికి పరిచయం చేశారని నమ్ముతారు. కాలక్రమేణా, హైదరాబాదీ దమ్ బిర్యానీ నుంచి లక్నోయి అవధి శైలి వరకు వైవిధ్యాలు బిర్యానీకి ప్రాంతీయ పరిçమళాలు అద్దాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన వంట పద్ధతి సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో దేనికదే ప్రత్యేకత చాటుకుంటున్నాయిు. అయితే అన్నింట్లోనూ టాప్గా నిలుస్తోంది హైదరాబాదీ బిర్యానీయే.సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, కారామెలైజ్డ్ ఉల్లిపాయలు దమ్ వంట శైలికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాదీ చికెన్ బిర్యానీతో పాటు ఆన్లైన్లో ఎక్కువగా శోధించిన బిర్యానీ వంటకాలలో హైదరాబాదీ మటన్ బిర్యానీ కూడా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉంది లక్నోయి (అవధి) బిర్యానీ – మాంసం, బియ్యం సువాసనగల సుగంధ ద్రవ్యాలతో కలిపి దీనిని వండుతారు. ఈ అవధి బిర్యానీ శైలి తక్కువ కారం ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఆ తర్వాతి స్థానంలో కోల్కతా బిర్యానీ నిలుస్తుంది. బంగాళాదుంపలు ఉడికించిన గుడ్లతో పాటు సువాసనగల బాస్మతి బియ్యం జోడించడంతో ఈ బిర్యానీ ప్రసిద్ధి చెందింది. కోల్కతా బిర్యానీలో సూక్ష్మమైన తీపి తేలికైన మసాలా మిశ్రమం ఉంటుంది, ఇది వెజ్ బిర్యానీ ప్రియులకు మాత్రమే కాదు నాన్–వెజ్ బిర్యానీ అభిమానులకు కూడా ప్రసిద్ధ ఎంపికగా నిలిచింది.కేరళ రాష్ట్రపు మలబార్ బిర్యానీ కూడా భోజన ప్రియుల అభిమానాన్ని దక్కించుకుంటోంది. షార్ట్–గ్రెయిన్ జీరకాసల అనే బియ్యంతో తయారు అవుతుంది. కొబ్బరి, నెయ్యి తాజా మసాలాల కలయిక దీనికి కొత్త రుచులు అద్దుతుంది. మలబార్ చికెన్ బిర్యానీతో పాటు మలబార్ ఫిష్ బిర్యానీ కూడా బాగా పాప్యులర్.పాకిస్తాన్లోని సింథ్ మూలాలు కలిగిన టాంగీ బిర్యానీ, పెరుగు, టమోటాలు, పచ్చిమిర్చి గాఢమైన మసాలాలతో వండుతారు. సింధీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రసిద్ధి చెందాయి,మరోవైపు పాకిస్తాన్ వంటకంగా పేరొందిన ఆఫ్ఘని బిర్యానీ భారతీయ బిర్యానీలతో పోలిస్తే తక్కువ కారంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, పప్పులు, తేలికైన మసాలా మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. పాకిస్తానీ బిర్యానీ, ఆఫ్ఘని చికెన్ బిర్యానీ కాబూలి పులావ్ మధ్యప్రాచ్యం మధ్య ఆసియాలో పేరొందాయి. -
లావు తప్ప మరేదీ కనపడదా..? హీరోయిన్ ఆక్రోశం
హీరోల విషయంలో లావా?సన్నమా? పొట్టా? బట్టా? జుట్టా? విగ్గా? ఇవేవీ సమస్యలుగా కనిపించవు. కానీ అదే హీరోయిన్ విషయానికి వచ్చేసరికి అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలని ఆశిస్తారు. శరీరపు కొలతల దగ్గర నుంచి ప్రతీ ఒక్కటీ బాగుంటేనే ఆమె కధానాయిక అని లేకపోతే పనికిరాదు అంటూ ఈసడిస్తారు. ఆడైనా, మగ అయినా అభినయమే ప్రధాన అర్హతగా కొనసాగాల్సి ఉన్నా దానిని మహిళల విషయానికి వచ్చేసరికి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు, దర్శకుల నుంచి మాత్రమే బాడీ షేమింగ్ ఎదుర్కున్న సినీ పరిశ్రమకు చెందిన యువతులు... ఇప్పుడు ఏ సంబంధం లేనివారు సైతం తమను, తమ శరీరాన్ని కామెంట్ చేస్తుంటే భరించాల్సిన పరిస్థితిని సోషల్ మీడియా సృష్టించింది. మొన్నటి విద్యాబాలన్ దగ్గర నుంచి నిన్నటి నిత్యా మీనన్ దాకా ప్రతీ ఒక్కరూ ఎదుర్కున్న సమస్య ఇది. ఇప్పుడు ఈ జాబితాలో మరో అందమైన నటి కూడా చేరారు. ఆమె మంజిమా మొహన్(Manjima Mohan ).తెలుగులో సాహసమే శ్వాసగా సాగిపో, కధానాయకుడు వంటి సినిమాల్లో నటించిన మంజిమా మోహన్ పలు మళయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితులు. మళయాళ సినీతార మన్జిమా మొహన్,ఐదేళ్ల చిన్న వయసులోనే నటన ప్రారంభించి 2001 దాకా వరుసగా నటించారు. ఆ తరువాత ఒరు వేదక్కన్ సెల్ఫీ అనే చిత్రంతో 2015లో లీడ్ పాత్రలో తిరిగి కనిపించారు. ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే తర్వాత చిత్రాల్లో కూడా నటనకు ప్రశంసలతో పాటే దురదృష్టవశాత్తూ ఆమె శరీరపు బరువు కూడా ఎగతాళికి నోచుకుంది.మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై తన బరువును ఉద్ధేశ్యించి పలువురు చేసిన క్రూర వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు ఆమెను భావోద్వేగాలను సంక్షోభం లోకి నెట్టాయని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలిపారు. ‘బరువు తగ్గించడం వల్ల మరి కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తాయేమో; కానీ అది ముఖ్యం కాదు. నిజానికి సినిమా రంగం దాటితే నా బరువు ఎవరికీ ఒక విషయమే కాదు. అవును...సినిమా నా జీవితంలో ఒక భాగమే. అయితే నా లక్ష్యాలు స్క్రీన్ కు మించినవి ఎన్నో ఉన్నాయ్‘ అని ఆమె చెప్పారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల్ని తట్టుకోవడం తన వల్ల కావడం లేదని ఆమె అంగీకరించారు. అధిక బరువు అనే సమస్య వల్ల శారీరకంగా భావోద్వేగపరంగా సంక్లిష్టమైన దశను తాను అనుభవించానని, చివరకి బరువు తగ్గేందుకు డాక్టర్లను సంప్రదించానని కూడా ఆమె వెల్లడించారు. ఏదో రకంగా బరువు తగ్గాలని అనుకున్నా. అవసరమైతే సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకున్నా ‘‘ అని ఆమె అన్నారుతనకు పిసిఓడి సమస్య ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తాను తన ఆరోగ్య పరమైన మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు. తాను బరువు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలేవీ లేనప్పుడు దాని గురించి చింతించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. నటుల అభినయమే ప్రధానం కావాలని వారి రూపు రేఖలు కాదని అంటున్న ఈ 32ఏళ్ల మహిళ ఆవేదన ఈ సోషల్ జమానా అర్ధం చేసుకుంటుందా? -
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్కి గురి చేసింది.అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్తో పాటు బనానా చిప్స్లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
బాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా(Manisha Koirala ). సుభాష్ ఘయ్ తీసిన 1942 ఎ లవ్ స్టోరీ సినిమా, అందులోని పాటల్లో మనీషా కొయిరాలా అందాన్ని మర్చిపోవడం అంత తేలిక కాదు అంటారు బాలీవుడ్ సినీ ప్రేమికులు. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనీషా.. పలు విషయాలను పంచుకుంది. అందాల నటిగా తెరపై గ్లామర్ను గుబాళింపజేసిన మనీషా బాలీవుడ్లో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ్గా నిలిచింది. ‘అగ్ని సాక్షి’ (1996) సినిమాలో కలిసి నటించినప్పుడు సహ నటుడైన నానా పటేకర్తో సంబంధం ఏర్పడింది. అప్పటికే పెళ్లయిన నానా పటేకర్ ప్రతీ తెల్లవారుఝామున మనీషా ఇంటి నుంచి తిరిగి రావడం అనేకమార్లు వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సౌదాగర్ లో నటించిన వివేక్ ముష్రాన్తోనూ ఆమెకు సంబంధం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక మార్కెట్ సినిమా సమయంలో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న మనీషా కి ఆర్యన్ వేద్ ప్రేమ ఓదార్చింది.. సినిమా రంగంలో మాత్రమే కాదు సినీయేతర రంగాల వారితో కూడా ఆమె సంబంధాలు అప్పట్లో బాగా వెలుగు చూశాయి. నానా పటేకర్తో బ్రేకప్ బాధలో ఉండగా, హుస్సేన్ బాబాయ్గా పేరొందిన డిజె హుస్సేన్, నేపాల్లోని ఆస్ట్రేలియన్ అంబాసిడర్ క్రిస్పిన్ కొన్రాయ్, లండన్కు చెందిన నైజీరియన్ వ్యాపారి సిసిల్ ఆంథోనీ, అమెరికన్ స్పోర్ట్స్ కౌన్సిలర్ క్రిస్టోఫర్ డోరిస్...ఇలా పలువురితో ఆమె సంబంధాలు పెట్టుకుందని అప్పట్లో వెల్లడైంది. వీటన్నింటినీ వదిలించుకుని నేపాల్కు చెందిన సామ్రాట్ దహాయ్ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది. క్యాన్సర్తో పోరాడిన తర్వాత మనిషా కోయిరాలా చాలా మారిపోయింది. ‘‘ఆ వ్యాధి నాకు జీవితం విలువ తెలిసివచ్చేలా చేసింది, ఒక్క క్షణాన్ని కూడా వృధా చేసుకోకూడదని నేర్పింది. ఆ ఎదురుదెబ్బకు ముందు నేను అనేక చెత్త పనుల్లో, చెత్త సంబంధాల్లో చాలా సమయాన్ని వృధా చేసుకున్నాను,’’ అని మనీషా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని ఇలాగే ఉండాలని అనుకుంటున్నానని ఆమె అంటోంది. ‘‘ఇకపై నేను నిరర్థకమైన సంబంధాలేవీ పెట్టుకోను. ఒంటరితనం నుంచి రక్షించడానికి ఎవరైనా మగవాడు రావాలని కూడా ఎదురు చూడను. నేను సింగిల్నే కానీ ఒంటరిగా లేను. ఇప్పుడు నా సహవాసాన్ని నేనే ఆస్వాదించడం మొదలుపెట్టాను. నాకు లాంగ్ ట్రెక్కింగ్లు చేయడం ఇష్టం. దీర్ఘ ధ్యాన విరామాలు తీసుకుంటాను. అయితే నాలాగా జీవనశైలిని మార్చుకోవడానికి ఏదో పెద్ద నష్టం, కష్టం వచ్చే వరకూ ఎదురు చూడవద్దు. ఇప్పుడే మార్చుకోండి’’ అంటూ మనీషా తోటి మహిళలకు సలహా ఇస్తోంది. అనుభవం నేర్పిన పాఠాలతో ఒకనాటి సిల్వర్ స్క్రీన్ బ్యూటీ... భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటోంది. తన జీవితాన్ని ఓ పాఠంగా తీసుకోవాలని యువతులకు సూచిస్తోంది. -
రజనీతో మంచి పాత్రకి నో..విలన్ పాత్రకి సై
విమర్శలు, ప్రశంసలకు అతీతంగా కూలీ సినిమా కలెక్షన్ల రికార్డ్స్ సృష్టిస్తోంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నాగార్జున(Nagarjuna Akkineni) తొలిసారిగా స్టైలిష్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోపే బ్రేక్ ఈవెన్కు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనూహ్యమైన కాంబినేషన్లను సెట్ చేయడం ద్వారా సినిమాపై పెంచిన ఆసక్తి కలెక్షన్ల వర్షంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సైమన్ అనే కోల్డ్ బ్లడెడ్ విలన్ విలన్ పాత్రలో నాగార్జున కనిపించడం కూడా కలెక్షన్ల జోరుకి బాగా దోహదం చేసినట్టు కనిపిస్తోంది. దక్షిణాదితో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రతీ చోటా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజున రూ. 17 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో తెలుగు వెర్షన్ 1.3 మిలియన్ డాలర్లను సంపాదించింది, ఇది జూ.ఎన్టీయార్, హృతిక్ రోషన్ల వార్ 2 తెలుగు వెర్షన్ కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.నాగార్జున విలన్ పాత్రను పోషించడంపై ఆ పాత్రను మలచిన తీరు ఆయన వీరాభిమానులకు అంతగా రుచించనప్పటికీ... మొదటి నుంచీ నాగార్జున వైవిధ్య భరిత పాత్రల ఎంపికను ప్రశంసించే వారికి మాత్రం సంతృప్తినే అందించింది. వీటికి అతీతంగా మరోవైపు నాగార్జున మాత్రం ఈ విజయాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం నుంచి తామెన్నో నేర్చుకున్నామని, సినిమా యూనిట్లో ప్రతీ ఒక్కరితో ఆయన ప్రవర్తించే తీరు, సినిమా పూర్తి అయిన వెంటనే అందరికీ గిఫ్ట్ బాక్స్లు ఇచ్చి వారిని ఆదరించిన విషయాలు నాగార్జున గుర్తు చేసుకుంటూ కొనియాడడం తెలిసిందే. రజనీకాంత్ తో కలిసి నటించాలని తాను ఎంత కోరుకున్నారో తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారు నాగ్.అయితే రజనీతో చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న విధానం చూస్తుంటే గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ సందర్భంగా దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి సంఘటనలు గుర్తుకు తెస్తున్నారు. అప్పట్లో రజనీకాంత్ హీరోగా దళపతి అనే సినిమా తీశారు దర్శకుడు మణిరత్నం. ఆ సమయంలోనే సెన్సేషనల్ స్టార్ కాంబినేషన్కి ఆయన ప్లాన్ చేశారు. అందులో భాగంగా మళయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా ఆ సినిమాలో తీసుకున్నారు. తెలుగులో సినిమాకి ఊపు తెచ్చేలా మరో పాత్రకి నాగార్జున తీసుకోవాలని ఆయన భావించారు. ఈ విషయంపై కొన్ని రోజుల పాటు సంప్రదింపులు జరిగాయి. అయితే రజనీకాంత్తో, మణిరత్నంతో సినిమా చేయాలని ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ నాగార్జున ఎందుకో గాని ఆ పాత్రకి అంగీకరించలేదు. దాంతో ఆ పాత్ర కోసం అప్పట్లో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన అరవింద్ స్వామిని తీసుకున్నారు. నిజానికి ఆ సినిమాలో రజనీ, మమ్ముట్టి పాత్రలకు పూర్తి భిన్నంగా అరవింద్ స్వామిది చాలా పాజిటివ్ పాత్ర. రౌడీయిజం, దాడులు,ప్రతిదాడులను అణచివేయాలనే జిల్లా కలెక్టర్ పాత్ర అరవింద్ స్వామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్న సినీ వర్గాలు...అప్పట్లో రజనీ తో కలిసి మంచి పాత్ర చేయని నాగ్...ఇప్పుడు విలన్ పాత్ర చేయడం విశేషమంటూ గుర్తు చేసుకుంటున్నారు. -
'సోలో' డేటింగ్.. సూపర్ క్లిక్...
ఇద్దరు వ్యక్తులు కలిసి డేటింగ్ కి వెళ్తే... ఆ డేట్ అధ్యంతం పరస్పరం మెప్పించుకోవాలనో ఒప్పించుకోవాలనో... ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే తాము పరస్పరం అర్ధం చేసుకోవాలి అని అనుకుంటున్న విషయం ఇద్దరికీ తెలుసు కాబట్టి... డేటింగ్ అలా ఉంచితే జీవితం లో ప్రతీ దశ లోనూ ఎవరో ఒకరిని మెప్పించక తప్పదు.. దాంతో అది తీవ్రమైన ఒత్తిడి కి దారి తీస్తోందిమరో వైపు ప్రస్తుతం అనేకమంది వ్యక్తిగత జీవితం లో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కన్నా తమని తాము ఎక్స్ ప్రెస్ చేయడానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అయితే అది అంత సులభం గా జరిగేది కాదు.. అందుకే ఒంటరి జీవితాలు కూడా పెరుగుతున్నాయ్ ఈ నేపథ్యంలోనే సోలో డేటింగ్ అనే భావన కూడా పుంజుకుంది.అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. మి టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్లో అయితే "ఒంటరి డైనింగ్" (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా "సోలో ట్రావెల్ & డేటింగ్" ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా యువత, ముఖ్యంగా మెట్రో సిటీస్లో, వీకెండ్ సోలో డేట్స్ ని ట్రెండ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో "సెల్ఫ్ కేర్" అనే భావనకు కొత్త దిశ గా దీన్ని పేర్కొoటూన్నారు సోలో డేటింగ్... ఇలాఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. ఇది కేవలం ఒంటరిగా ఉండటం కాదు, ఒక రొమాంటిక్ పార్ట్నర్ తో వెళ్ళినట్టు మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు న ఏదైనా కాఫీ షాప్ లోనో కల్చరల్ స్పేస్ లోనో కూర్చోవడం, సినిమా, డ్రామా.. వంటివి చూడటం, ప్రకృతి మధ్యలో ట్రెక్కింగ్ చేయడం, లేదా మనసుకు నచ్చిన చోటు ఎక్కడికైనా వెళ్లడం వంటివన్నీ ఇందులోకి వస్తాయి.సోలో డేటింగ్ ప్రత్యేకత ఏమిటి?ఇంటెన్షనల్ టైమ్ అలోన్ – యాదృచ్చికంగా ఏదో ఒంటరిగా ఉండటం కాదు, ప్రణాళిక బద్దంగా నాణ్యమైన సమయం మనకోసమే సమయం కేటాయించుకోవడం.ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్ – కాంప్రమైజ్ అవకుండా మనకిష్టమైనదే చేయడం.ప్రెజర్ లెస్ హ్యాపీ నెస్ – ఎవరినీ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేకుండా, మన మనసు చెప్పింది అనుసరించడం.సోలో డేటింగ్... ప్రయోజనాలుకాన్ఫిడెన్స్ పెరుగుతుంది – ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల పై ఆధారపడడం తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది – సామాజిక బాధ్యతల నుండి విరామం లభిస్తుంది.సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది – నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చినది ఏంటో తెలుసుకునే అవకాశం లభిస్తుంది.స్పాంటేనియిటీ పెరుగుతుంది – ఇతరుల కోసం ఎదురు చూడకుండా కొత్త విషయాలు ప్రయత్నించే ధైర్యం వస్తుంది.సోలో డేటింగ్ కోసం...కొన్ని ఎంపికలుపార్క్లో పుస్తకంతో పిక్నిక్పెయింటింగ్ లేదా పొటరీ క్లాస్ఒంటరిగా సినిమా లేదా మ్యూజియం సందర్శనమనసుకు నచ్చిన మ్యూజిక్ తో ఒక లాంగ్ డ్రైవ్రెస్టారెంట్లో ఫ్యాన్సీ డిన్నర్...అంతర్జాతీయ ట్రెండ్స్అమెరికా, యూరప్ దేశాల్లో సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్గా మారింది. #MeTime, #SoloDate, #SelfLove అనే హాష్ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చివరగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, సోలో డేటింగ్ అనేది లొన్లీగా ఫీల్ అవ్వడం కాదు. అది మనసు నింపుకోవడం, మనల్ని మనమే ప్రేమించడం. ఒంటరి తనం ప్రాప్తించింది అంటే భాధ కలుగుతుంది కానీ ఈ ఒంటరి తనం ప్లాన్ చేసుకుంది అంటే ఏదో సాధించిన ఆనందం ఆవరిస్తుంది అంటున్నారు సైకాలాజిస్ట్స్..ఎస్. సత్యబాబు -
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు -
రాత్రుళ్లు నిద్రపోడు, 60ఏళ్ల హీరో సూపర్ ఫిట్
ఆరోగ్యంగా మంచి ఫిజిక్తో తమ వయసు కన్నా బాగా తక్కువున్నట్టు కనిపించే ఎవరిని ఫిట్నెస్ సీక్రెట్ చెప్పమన్నా....సాధారణంగా వచ్చే సమాధానాలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ‘‘ఉదయాన్నే లేస్తాను, వ్యాయామం చేస్తా, తాజా పండ్లు తింటాను..దురలవాట్లకు దూరంగా ఉంటా, రాత్రుళ్లు త్వరగా నిద్రపోతా, కనీసం 7గంటలైనా నిద్ర ఉండేలా చూసుకుంటా...’’వంటివి. అయితే వీటన్నింటికీ భిన్నంగా చెబుతున్నాడో హీరో. మరో రెండు నెలల్లో 60ఏళ్ల వయసుకు చేరుకోబోతున్న ఆ హీరో ఇప్పటికే సిక్స్ ప్యాక్ మాత్రమే కాదు ఎయిట్ ప్యాక్ కూడా చేసేశాడు. అది కూడా మద్యం సేవించడం, రాత్రుళ్లు నిద్రపోకపోవడం...వంటివి చేస్తూనే... ఎవరా హీరో? ఏమాతని కధ?వచ్చే నవంబర్ 2వ తేదీ నాటికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)కు 60 ఏళ్లు నిండుతాయి, కానీ అతని వయస్సులో సగం ఉన్న పురుషులను కూడా సిగ్గుపడేలా చేసే శరీరాకృతి అతని స్వంతం. గత ఎన్నో సంవత్సరాలుగా గ్రీకు వీరుని తలపించే ఫిజిక్తో ఈ సూపర్ స్టార్ కొనసాగుతున్నాడు. ఇటీవలే తన ఫిట్నెస్ అలవాట్లు ఆహార క్రమశిక్షణ గురించి మీడియాతో పంచుకున్నాడు. బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో లాగే ఇప్పటికీ తనను చురుగ్గా కనిపించేలా చేసే దినచర్యల గురించి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ వివరించాడు.‘నేను ఉదయం ఐదు గంటలకు పడుకుంటాను అంతేకాదు.. తొమ్మిది లేదా పది గంటలకు మేల్కొంటాను‘ అని ఆయన చెప్పాడు. అంతేకాదు రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు పని ముగించుకుని తాను ఇంటికి తిరిగి వస్తానన్నాడు. అప్పుడు ఆ టైమ్లోనే తాను వ్యాయామం చేస్తానని చెబుతున్నాడు. బహుశా చాలా మందికి ఇది అసాధ్యం., కానీ షారూఖ్కు కొన్ని సంవత్సరాలుగా అది సాధారణం. వ్యాయామం చేసి, స్నాన ం అన్నీ పూర్తి చేసుకుని తెల్లవారుఝామున 5గంటలకు నిద్రపోతాడన్నమాట. అంతేకాదు ఆసక్తికరంగా, షారూఖ్ తాను పండ్లు తిననని చెబుతున్నాడు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారి నుంచి సాధారణంగా ఇలాంటి మాట వినడం # జరగదు. ఆయన తన మందు అలవాటు గురించి మాట్లాడుతూ...‘‘ఒక నిర్దిష్ట పాత్ర కోసం ఒక షేప్ లోకి రావాలంటే మాత్రం ఆల్కహాల్ను మానేస్తాను అని చెప్పాడు. దానితో పాటే తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, స్వీట్లు కూడా అంటూ వివరించాడు. కొన్నిసార్లు ఐస్ క్రీం లేదా చాక్లెట్ తింటాను అంటున్న షారుఖ్ జంక్ ఫుడ్ లేదా డెజర్ట్లను తానేమీ ప్రత్యేకంగా ఇష్టపడనని చెప్పాడు. అంతేకాదు తందూరీ చికెన్ అంటే తాను పడి చస్తానంటున్నాడీ హీరో.దశాబ్దాలుగా ఆయన వదల్లేని వంటకం ఏదైనా ఉంటే, అది తందూరీ చికెన్. దీనిని తన కంఫర్ట్ ఫుడ్ అని పేర్కొంటూ నేను దీనికి బానిసని చెప్పాలి. అవసరమైతే నేను సంవత్సరంలో 365 రోజులు ఇదే తినగలను’’ అన్నాడు.మరి మంచి లక్షణాలు, అలవాట్లు ఏమీ లేవా అంటే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కఠినమైన వ్యాయామం, ప్రోటీన్ అధికంగా ఉండే, శుభ్రమైన భోజనం తన ఆహారం, తన ఎవర్ గ్రీన్ ఎనర్జీకి ఆధారం అంటాడు షారుఖ్. తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ‘నేను గ్రిల్డ్ చికెన్, లీన్ మీట్స్, పప్పుధాన్యాలు తీసుకుంటాను. గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటాను‘ అని స్పష్టం చేశాడు. ‘నేను తక్కువ పరిమాణంలోనే ఆహారం తీసుకుంటాను. ‘ అని ఆయన చెప్పాడు. ఇది వివిధ సినిమా పాత్రల డిమాండ్లకు అనుగుణంగా తన శరీరాన్ని త్వరగా మార్చుకోవడానికి తాను అనుసరించే వ్యూహం అని చెప్పాడు.సినిమా సెట్లలో తయారుచేసిన ఆహారానికి బదులుగా ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినడానికి ఇష్టపడతాడు. అతని సాధారణ మధ్యాహ్నం భోజనంలో తరచుగా చేపలు లేదా తందూరీ చికెన్ ఉంటుంది, కొన్నిసార్లు బీన్ స్ప్రౌట్స్ లేదా ఏదైనా వెజ్కర్రీ జతవుతుంది. ‘సాధారణంగా తందూరీ రోటీతో తందూరీ చికెన్, అప్పుడప్పుడు మటన్ డిష్‘ అంటూ తన డిన్నర్ మెనూ వివరిస్తాడు.ఆయన భార్య చిత్ర నిర్మాత ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్ ‘డైజెస్టివ్ బిస్కెట్లతో మంచి ఐస్ క్రీం‘ అని పిలిచే దానిని తయారు చేస్తారు. మీ 50 ఏళ్ల వయసు దాటాక ఫిట్గా ఉండటం అంటే విపరీతమైన భోజన ప్రియత్వమో, దురలవాట్లో కాదు అలాగే ఆకలితో అలమటించడం కూడా కాదు. శరీరానికి ఏది పని చేస్తుందో తెలుసుకోవడం ముఖ్యం అంటాడు షారూఖ్. -
రజనీకాంత్ 50 ఏళ్ల జర్నీ: విలన్ నుంచి సూపర్స్టార్గా..
రజనీకాంత్ (Rajinikanth) తొలిసారిగా 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాలో వెండితెరపై కనిపించారు. అది ఆగస్టు 15న విడుదలైంది. అప్పట్లో ఆయన ఇంత పెద్ద హీరో అవుతారని ఎవరూ కనీసం ఊహించను కూడా లేదు. ఐదు దశాబ్దాల తర్వాత, తలైవా అనేది కేవలం ఒక బిరుదు కాదు, అది ఒక నినాదమైపోయింది. సన్ గ్లాసెస్, ఆ సిగరెట్ స్టైల్స్... ఇంకా పంచ్ డైలాగ్లతో పాటు రజనీకాంత్ కెరీర్.. నిర్భయమైన పాత్రల ఎంపికల మీద కూడా నిర్మితమైంది. విలన్గా ఎంట్రీ..దీని కోసం తన సొంత ఇమేజ్ను దెబ్బతీసుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సమకాలీకుల్లో చాలా మందికి భిన్నంగా.. ఇమేజ్కు తోడ్పడే సురక్షితమైన పాత్రలు మాత్రమే పోషించడానికి ఆయన మొదటి నుంచీ నిరాకరిస్తూనే ఉన్నాడు. తన తరంలోని చాలా మంది తారలు రొమాంటిక్ హీరోలుగా అరంగేట్రం చేస్తున్న పరిస్థితుల్లో, రజనీ విలన్గా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మూండ్రు ముడిచ్చు (1976) వంటి ప్రారంభ చిత్రాల్లో విలన్ పాత్రలను పోషించాడు. నిజానికి ప్రేక్షకులు తమ హీరోలను విపరీతంగా ఆరాధించే యుగంలో అది అంత సులభమేం కాదు. అయినా సరే రజనీకాంత్ విలన్గా తన బ్రాండ్ను సరికొత్తగా నిర్మించుకున్నాడు. నాటి 70's చివర్లో, 80's ప్రారంభంలో రజనీ విలన్, చిన్న చిన్న పాత్రల నుంచి ప్రధాన పాత్రల్లోకి మారారు. అలాగని తెరపై వీరోచిత పాత్రలకే ఆయన పరిమితం కాలేదు. ఆరిలిరుంతు అరుబతు వారై (1979) వంటి చిత్రాలలో ఆయన కౌమారదశ నుంచి వృధ్ధాప్యం వరకు కష్టపడుతున్న వ్యక్తిగా నటించారు. ఇది ఒక అన్నదాత త్యాగాల గాధను చూపిస్తుంది. ఇది ఇప్పటికీ అతని అత్యంత అద్భుతమైన నటనల్లో ఒకటిగా పరిగణన పొందుతోంది. తమిళ సినిమాలో అతిపెద్ద స్టార్ అయిన తర్వాత కూడా, రజనీ తన ప్రయోగాత్మక పంథాను వదులుకోలేదు. అవర్గల్ (1977) ముల్లుమ్ మలరుమ్ (1978)లలో, ఆయన తన ఇమేజ్కు భిన్నమైన పలు పాత్రలు పోషించారు. స్టార్డమ్ కు కట్టుబడే హీరోల ఆలోచనలకు భిన్నంగా కొనసాగారు.కమర్షియల్ సినిమాతో మలుపు...‘మాస్ హీరో‘ గా రజనీని ఎవరికీ అందనంత ఎత్తులో అమాంతం కూర్చోబెట్టిన సినిమాలు బిల్లా (1980), బాషా (1995), శివాజీ (2007)లు. ఇవి మొత్తంగా భారతీయ వాణిజ్య సినిమాలో మైలురాళ్ళు. కానీ ఈ బ్లాక్బస్టర్లలో కూడా, ఆయన పాత్రపరమైన తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. మనసున్న డాన్ పాత్రలో మనస్సాక్షికి లోబడే టెక్ మొగల్ పాత్రలో కనిపించి మెప్పించాడు. 2000ల తర్వాత, రజనీ ఎంథిరన్/రోబో (2010) కాలా (2018) చిత్రాలతో సాహసోపేత పాత్రలకు సై అంటూనే ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లవుతున్నా.. అభిమానులను అలరించేందుకు మరిన్ని సినిమాలతో ముందుకు వస్తానంటున్నాడు రజనీకాంత్.చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ -
ఆయన నా జీవితాన్ని మార్చేశారన్న బన్నీ.. ఆయన ఎవరు? విశేషాలివే
మనకు ఎందరో హీరోలు ఉన్నారు కానీ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇప్పటికీ ఒక్కరే. అయితే ఎవరికైనా విజయాలు ఎవరికీ ఊరకనే రావు కష్టపడడం అనే ప్రాధమిక లక్షణంతో పాటు తమను తాము ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసుకోవడం, ఇంకా ఎన్నో ప్రయాసలు అందులో ఇమిడి ఉంటాయి. ఒక విజయవంతమైన వ్యక్తిలో అలాంటి మార్పు చేర్పులకు ఎన్నోదోహదం చేస్తాయి. తమకు ఎదురైన సంఘటనలు కావచ్చు తాము ఎదుర్కున్న సమస్యలు కావచ్చు తాము విన్న ప్రసంగాలు లేదా చదివిన పుస్తకాలు కూడా కావచ్చు. వారి వ్యక్తిత్వ వికాస క్రమంలో ఇమిడి ఉంటాయి. గంగోత్రి సినిమాతో మొదలై స్టైలిష్ స్టార్ తో ఆగకుండా ఐకాన్ స్టార్ దాకా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణంలో కూడా అలాంటివే ఉన్నాయి. తాజాగా బన్నీ తన జీవితాన్ని మార్చిన పుస్తకం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ది క్రియేటివ్ యాక్ట్: ఏ వే ఆఫ్ బీయింగ్‘ (రిక్ రూబిన్ రచన)ను తన ఆల్టైమ్ ఫేవరెట్స్లో ఒకటిగా పేర్కొన్నాడు. అలాగే ఈ పుస్తకం తన జీవితాన్నే మార్చిందని తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్లో చెప్పాడు. సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆ పుస్తకాన్ని చదవాలని కూడా బన్నీ సూచించాడు. మరి అల్లు అర్జున్ను మెప్పించిన, జీవితాన్నే మార్చిన ఆ పుస్తకం విశేషాలు తెలుసుకుందాం..ది క్రియేటివ్ యాక్ట్ – ఏ వే ఆఫ్ బీయింగ్ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ ప్రొడ్యూసర్ అమెరికాకు చెందిన రిక్ రూబిన్ (63)రాసిన ది క్రియేటివ్ యాక్ట్ ఏ వే ఆఫ్ బీయింగ్ (సహ రచయిత: నీల్ స్ట్రాస్). డెఫ్ జామ్ రికార్డింగ్స్అనే హిప్ హాప్ లేబుల్ కూడా స్థాపించిన రిక్ రూబిన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో వివిధ రకాల కళాకారులతో పని చేసిన తన అనుభవాలే ఆధారంగా సృజనాత్మకతపై తన దృక్పథాన్ని ఈ పుస్తకంలో పంచుకున్నారు. సృజన అనేది మనం చేసే పనిలో కాదు మన దృష్టి, మనసు, పరిసరాలను చూసే తీరులో ఉంటుందనేది రచయిత అభిప్రాయం. సృజనాత్మకతను ఒక ప్రత్యేక ప్రతిభగా కాకుండా మనిషి జీవన విధానంలో భాగంగా ఇది చూపిస్తుంది. సాధారణ మానవుడు కూడా సృజనాత్మకతను అలవాటు చేసుకోవచ్చని, అది మనసు విపులీకరణలో ఉందని ఈ పుస్తకం చెబుతుంది. కళాకారులు స్వతహాగా సృష్టించేవారు కారనీ వారు సృజనాత్మక ప్రవాహానికి రిసీవర్లు అని రూబిన్ అభిప్రాయం.గత 2023 జనవరిలో విడుదలైన ఈ పుస్తకం 432 పేజీలతో, ‘క్రియేటివిటీ‘ ‘పర్సనల్ ట్రాన్స్ ఫార్మేషన్‘ విభాగాలకు చెందిన పుస్తకాల్లో అత్యంత అధికంగా విక్రయాలు సాధించిన పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. పుస్తకం 78 చిన్న భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం వేర్వేరుగా చదువుకోవచ్చు. ఈ పుస్తకం అనేక మంది ప్రశంసలతో పాటు న్యూయార్క్ టైమ్స్ నంబర్ వన్ బెస్ట్సెల్లర్ గా నిలిచింది. బ్రిటిష్ మార్కెట్లో బాగా హిట్ అయ్యింది. దీని ధర రూ.615; కాగా ప్రస్తుతం అమెజాన్లో రూ.595 (సగటు ధరలో 40% తగ్గింపు) కే లభిస్తోంది. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. చాంతాడంత క్యూలలో నిలుచోవాల్సిన పనిలేదు. రోజూ వైన్ షాప్లో కనపడుతుంటే జనం అదోలా చూస్తారనే సంకోచాలక్కర్లేదు. దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చుని కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. అంతేనా, దానితో కలిపి లాగించే సైడ్ డిష్లు కూడా ఒకేసారి అందుకోవచ్చు. మరి మందుబాబుల ఇలాంటి కల సాకారం కావాలంటే.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు షురూ కావాలి. ఈ దిశగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందడుగేశాయి.ఒడిశా పశ్చిమ బెంగాల్లు మద్యం హోమ్ డెలివరీని అనుమతిస్తున్న తొలి రెండు భారతీయ రాష్ట్రాలుగా ఘనత దక్కించుకున్నాయి. ఇదే కోవలో స్విగ్గీ, జొమాటో బిగ్బాస్కెట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఆన్ లైన్ మద్యం అమ్మకాలను అనుమతించే అవకాశాన్ని అనేక ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ లు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో కేరళ మరింత చురుకుగా ఈ విషయంపై చర్చిస్తోందని రేపో మాపో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.కేరళ స్టేట్ బేవరేజెస్ (మార్కెటింగ్ – మాన్యుఫ్యాక్చరింగ్) కార్పొరేషన్ లిమిటెడ్ (బిఇవిసిఒ) రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాల ద్వారా మద్యం ఇంటికి డెలివరీ చేసే ప్రతిపాదనను ఇటీవలే ముందుకు తెచ్చింది. కేరళలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను సులభతరం చేయడానికి అబ్కారీ చట్టాన్ని సవరించే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ, బిఇవిసిఒ ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చింది.గత జూలైలో బిఇవిసిఒ ఎండి హర్షిత అత్తలూరి ఈ ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖకు సమర్పించారు. ఆన్లైన్లో మద్యం డెలివరీ కోసం ఫుడ్, కిరాణా డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ నుంచి తాము ప్రాజెక్ట్ ప్రతిపాదనను అందుకున్నట్లు అత్తలూరి చెప్పారు. ‘ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, మేం టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాము. ఎవరు తక్కువ మొత్తాన్ని బిడ్ చేస్తారో వారికి బిడ్ ఇవ్వడం జరుగుతుంది.ఈ ప్రతిపాదన ప్రకారం, 23 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే మద్యం కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వయస్సును నిర్ధారించడానికి ఐడీని తనిఖీ చేస్తారు. మా అవుట్లెట్లలో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులు కూడా ఆన్ లైన్ లో విక్రయాలు జరుగుతాయి,‘ అని హర్షిత అత్తలూరి చెబుతున్నారు.రిటైల్ అవుట్లెట్లలో రద్దీని నివారించడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య కారణం. కేరళలో మద్యం దుకాణాల ముందు పొడవైన క్యూలు కనపడడం సర్వసాధారణం, పలు చోట్ల ఇది ట్రాఫిక్ రద్దీకి కూడా దారితీస్తుంది. తమిళనాడు వంటి 4700 మద్యం దుకాణాలు ఉన్న రాష్ట్రాల మాదిరిగా కాకుండా, కేరళలో కేవలం 283 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల పొడవాటి క్యూలు, రద్దీ ఏర్పడుతుంది. ఆన్ లైన్ అమ్మకాలు చురుకుగా మారిన తర్వాత, విక్రయాల్లో గణనీయమైన భాగం ఆన్ లైన్ అమ్మకాల ప్లాట్ఫామ్కు మళ్లుతుంది. ఇది అవుట్లెట్ల ముందు రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది‘ అని అత్తలూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా మద్యం హోమ్ డెలివరీ ఆదాయాన్ని కూడా పెంచుతుందని కూడా బిఇవిసిఒ ఆశిస్తోంది. ఇప్పటికే అనేక రకాల చర్యల ద్వారా మద్యం మీద ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంది కేరళ రాష్ట్రం. గత 2016–17లో మద్యం నుంచి వచ్చిన ఆదాయం రూ.8778.29 కోట్లు కాగా కేవలం ఏడేళ్ల కాలంలో..గత 2024–25లో, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.19,700 కోట్లు కావడం దీనికి అద్దం పడుతోంది. అయితే ‘ఆన్ లైన్ అమ్మకాలతో ఈ ఆదాయం మరింత అసాధారణ రీతిలో పెరుగుతుందని తాము ఆశిస్తున్నాం అంటున్నారు హర్షిత అత్తలూరి అయితే ఈ ప్రతిపాదనను గతంలో పరిశీలించి తిరస్కరించామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.‘మద్యం అమ్మకం అనేది 1953 నాటి చట్ట నిబంధనల ప్రకారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాలను ప్రవేశపెట్టాలంటే, అందుకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాలి అంతేకాకుండా తదనుగుణంగా నియమాలను రూపొందించాలి. అన్నింటికన్నా ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి‘ అని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. కోవిడ్ సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో మద్యం అమ్మకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం ఒక అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. మద్యం వనరు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న తరుణంలో కోవిడ్ కాలపు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే జరిగితే పొరుగు రాష్ట్రమైన కేరళ లో ఆన్లైన్ విక్రయాలు ప్రారంభమై భారీ ఆదాయం కళ్ల జూస్తే.. ఆదాయం కోసం ఆవురావురు మంటున్న మన తెలుగు రాష్ట్రాలు సైతం అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. -
ఆ విషయంలో గెలుపు నాగార్జునదే.. టాలీవుడ్ చరిత్రలో తొలిసారి!
అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni ) అకస్మాత్తుగా అన్ని సోషల్ మీడియా వేదికలపైనా వైరల్గా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా నటించిన కూలీ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ లాంచ్ అయి సూపర్ డూపర్ హిట్ అంచనాలను అందుకుంది. మరీ ముఖ్యంగా ఈ టీజర్లో నాగార్జున లుక్ బాగా క్లిక్ అయింది. నాగార్జున తన సినీ జీవితంలో తొలిసారిగా విలన్ గా నటిస్తుండడం దక్షిణాది ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అందుకు తగ్గట్టే నాగార్జున రోల్ అత్యంత స్టైలిష్గా తీర్చిదిద్దినట్టు తెలుస్తుండడం కూడా నాగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది. నిజానికి ఈ సినిమా లో విలన్ పాత్ర ను ఎంచుకోవడం పట్ల మొదట్లో నాగ్ ఫ్యాన్స్ కొంత ఇబ్బంది పడ్డారనేది నిర్వివాదం. అయితే తాజా అప్ డేట్స్తో వారిలో కూడా ఫుల్ జోష్ కనిపిస్తోంది.ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున తన వయసులో సగం తగ్గిపోయినట్టు కనపడ్డారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని నాగ్ స్వయంగా చెప్పడం, తాను నాగార్జున అభిమానినని లోకేష్ అనడం... కూడా అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రీ రిలీజ్లో నాగ్ లుక్, ఆయన మాటలు ఆయన గురించి తలైవా రజనీ కాంత్ పొగడ్తలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా టీజర్లో నాగార్జున తన హెయిర్ని కుడి చేత్తో వెనక్కి తోస్తున్న బిట్ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఏతావాతా కూలీ సినిమా విడుదలకు ముందే ఒక విషయం మాత్రం రూఢీ అయిపోతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అనూహ్యంగా ఉండబోతోందని. రజనీకాంత్ లాంటి వీర మాస్ హీరోకి సమ ఉజ్జీగా ఆయన తెరపై విలన్ రోల్లో దుమ్మురేపనున్నారని.ఈ నేపధ్యంలో మరోసారి సీనియర్ హీరోల పాత్రల ఎంపిక ప్రస్తావనకు వస్తోంది. ప్రస్తుతం నాగార్జునతో పాటు ఆయన సమకాలీకులు ఒకనాటి అగ్ర హీరోలు ముగ్గురు ఇంకా ఫుల్ యాక్టివ్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరెవరూ సాహసించని రీతిలో నాగార్జున తన పాత్రల ఎంపికను అమాంతం మార్చుకుని ఈ విషయంలో అందర్నీ దాటేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున గ్లామర్తో పోటీపడే వారు ఎవరూ లేరనేది నిజం. అయినప్పటికీ వయసుకు తగ్గట్టుగా మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. కుబేర సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషించి, కూలీ లో ఏకంగా విలన్ పాత్రకు కూడా సై అనడం ద్వారా ఒక నటుడికి సినిమా కలెక్షన్లు, ఇమేజ్లు మాత్రమే కాదు వైవిధ్య భరిత పాత్రల్లో నటించానన్న తృప్తి కూడా చాలా అవసరమని చెప్పకనే చెప్పారు. నిన్నే పెళ్లాడుతా తో గ్రీకు వీరుడి ఇమేజ్ తెచ్చుకుని వెంటనే అన్నమయ్య లాంటి పాత్ర చేసిన నాటి దమ్మూ ధైర్యం, తెగువనే ఇప్పటికీ చూపిస్తున్నారు నాగార్జున. అందుకే.. టాలీవుడ్ చరిత్ర లో తొలిసారిగా... సినిమా విడుదల కాకముందే జనం మనసులు గెలిచిన విలన్ అనిపించుకుంటున్నారు. -
ఉత్తరకాశీ ఉపద్రవం.. పాండవుల శివాలయం మాయం!
నిజానికి ధరాలి ఎప్పుడూ పేరొందిన పర్యాటక ప్రదేశం కాదు. అయితే అటువైపుగా రాకపోకలు సాగించే యాత్రికులకు మాత్రం బాగానే తెలుసు. గౌముఖ్–తపోవన్ లేదా లామా టాప్కు వెళ్లే మార్గంలో ట్రెక్కర్లు దాని గుండానే వెళతారు. అయితే ఇప్పుడు ధరాలి అనే పేరు దేశమంతా మారుమోగడానికి ఓ దురదృష్టకర ఉపద్రవం కారణమైంది.అప్పుడెప్పుడో 19వ శతాబ్దం మధ్యలో, ఉత్తరకాశీకి సమీపంలోని హర్సిల్లో స్థిరపడిన బ్రిటిషర్ ఫ్రెడరిక్ ‘‘పహాడి’’ విల్సన్, ఆపిల్ తోటలు ఎర్ర రాజ్మా వ్యాపారాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేశాడు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చింది. అలా నేడు, ధరాలి ఆపిల్ పండ్లు ఉత్తర భారతదేశం అంతటా సరఫరా అవుతున్నాయి. కానీ గత వారం, ఈ తోటలను పోషించిన టెర్రస్లు విరిగిపోయాయి. వాటి రవాణాకు వాడిన ఫుట్బ్రిడ్జిలు మాయమయ్యాయి. అనేక అందమైన ఇళ్లు అర్ధభాగాలే మిగిలాయి. కుటుంబాలు తమ భూమి అడవిలో కలిసిపోవడాన్ని కన్నీళ్లతో చూశాయి. హర్సిల్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ కొండలలోని ప్రశాంతమైన పర్వత గ్రామాన్ని ఖీర్ గడ్ నది అకస్మాత్తుగా ఉప్పొంగి ముంచేసింది. ఇళ్ళు, తోటలు సహా మరెన్నో జ్ఞాపకాలను తుడిచేసింది. అందులో కల్ప కేదార్ ఆలయం కూడా ఉంది. దీనిని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. కాలభైరవుని ముఖంతో చెక్కబడిన ఈ నిర్మాణం, 1900ల ప్రారంభంలో ఈ మందిరాన్ని హిమనీ నదుల మార్పు పూడ్చిపెట్టింది. అయినప్పటికీ కల్ప కేదార్ ఆలయ గోపురం స్పష్టంగా కనిపించేది తాజా వరదతో ఆ గోపురం కూడా అదృశ్యమైంది. ఇది ఆ ప్రాంత వాసుల్ని కలచివేసింది. ధరాలి మాజీ గ్రామ ప్రధాన్ మనోజ్ రాణా మాట్లాడుతూ ‘ఇది కేవలం వరద కాదు. ఇది మా గ్రామ హృదయాన్ని చీల్చేసింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.#WATCH | Uttarkashi, Uttarakhand | A lake has been formed in Harsil following the flash floods due to the cloudburst that occurred on August 5 pic.twitter.com/xjardbbKzd— ANI (@ANI) August 9, 2025స్థానికులకు, కల్ప కేదార్ కేవలం ఒక శిల కాదు. ఇది దైవిక రహస్యాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెలికితీత కోసం 1980లలో అనేక ప్రయత్నాలు చేసినా భూమి నీటి పొరల క్రింద తరతరాలుగా దాగి ఉన్న శివలింగం పూర్తిగా వెలుగు చూడలేదు. పురాణాల ప్రకారం, శివుడు పాండవుల పాపాలను వదిలించుకోవడానికి నిరాకరించి హిమాలయాలలో చెల్లాచెదురుగా విస్తరించాడు. అందుకే కేదార్నాథ్ లాగానే కల్ప కేదార్ కూడా ఆ శకలాలలో ఒకటిగా భావిస్తారు.Kheer Gad river surged and tore thru village Dharali. Flash flood buried what little remained of its oldest monument: Kalp Kedar temple, that's a shrine dedicated to Shiva/Kalbhairava.Bhim Shila boulder stopped Kedarnath's destruction in 2013. Dharali is near-demolished in 2025. pic.twitter.com/DZF7V0RzBR— Souvik Mukherjee (@svmke1) August 8, 2025ధరాలి అధికారికంగా పంచ కేదార్ తీర్థ మార్గంలో లేకపోయినా, గ్రామస్తులు కల్ప కేదార్ను వాటితో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉందని విశ్వసిస్తారు. ‘కల్ప కేదార్ ఈ ప్రాంతానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఆది శంకరాచార్య పునరుద్ధరించారు. శివుని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పూజించారు’ అని చార్ ధామ్ తీర్థ పురోహిత్ మహాపంచాయతీ ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ సతి వివరిస్తారు. కనపడినంత మేరకు మాత్రమే భక్తి శ్రద్ధలతో తాము కొలుస్తున్న దైవం.. ఇప్పుడు లేశ మాత్రం కూడా కనపడకుండా మాయం అవడం ధరాలి గ్రామవాసుల ఆవేదనను అంతులేకుండా చేస్తోంది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రకృతి ఉత్పాతాలు ఆలయాన్ని ముంచేసినా, మళ్లీ తిరిగి కల్పకేదార్ ఎప్పటిలా వెలుగులోకి వచ్చి పూజలు అందుకుందని ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్మతున్న గ్రామస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.Kalp Kedar temples at Dharali, Uttarakhandc Oct 20, 1865 pic.twitter.com/HrmR9WxiN6— Christopher (@gazwa_e_bhindi) June 15, 2025 -
రాత్రి 8 గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం, ఎక్కడో తెలుసా?
ప్రస్తుత బిజీ రోజుల్లో ఏ ఊరి లోనైనా సరే వీధులన్నీ నిర్మానుష్యం అవ్వాలి అంటే కరోనా అన్నా రావాలి కర్ఫ్యూ అన్నా పెట్టాలి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే అర్ధరాత్రుళ్లు కూడా పట్టపగల్ని తలపించేంత రద్దీ కనిపిస్తుంది. రాత్రి మొత్తం చేసే ఉద్యోగాలు పెరిగిపోవడంతో నైట్ లైఫ్ కూడా అందరికీ అలవాటై పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... కొన్ని గ్రామాలు, పట్టణాలలో మాత్రం రాత్రి 8గంటల నుంచే వీథులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ తర్వాత ఉదయం సూర్యోదయం అయే దాకా రోడ్ల మీద జనసంచారం కోసం భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. అలాంటి ఊర్లు ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి మరి. అది కూడా మన దేశంలోనే ఉన్నాయి.తెల్లవారుఝామునే నిద్ర లేవడం, సూర్యుడి వెలుతురులోనే పనులన్నీ చక్కబెట్టుకోవడం, సూర్యాస్తమయం తోనే ఇల్లు చేరడం, చీకటి పడకముందే రాత్రి భోజనం పూర్తి చేసి నిద్రపోవడం...ఇలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి వింటే...అబ్బో అదెప్పుడో మన తాత ముత్తాతల కాలం నాటిదిలే అనుకుంటాం కానీ.. ఇప్పటికీ చిత్కుల్, కల్ప, తీర్థన్ స్పితి వంటి గ్రామాలలో అదే జీవనశైలి కనిపిస్తోంది. ఈ గ్రామాల పేర్లు బహుశా మనలో చాలామందికి తెలియక పోవచ్చు కానీ ఆయా గ్రామాల్లో జన జీవితం మన తాత ముత్తాతల కాలం నాటి జీవనశైలినే తలపిస్తుంది. ఇలాంటి గ్రామాలు వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టే... హిమాచల్ ప్రదేశ్ను స్లీపింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అక్కడి ప్రజలు అనుసరించే ప్రశాంతమైన జీవనశైలి తత్ఫలితంగా ఆస్వాదించే నాణ్యమైన నిద్ర నుంచే ఆ రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది. ఈ రాష్ట్రం దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన పర్వత గాలితో పాటు నిశ్చింతగా నడిచే గ్రామ జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. రద్దీగా ఉండే నగరాల మాదిరిగా కాకుండా, ఇక్కడి జీవితం నిశ్శబ్దంగా విశ్రాంతిగా ఉంటుంది.హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు చాలా సరళమైన దినచర్యను అనుసరిస్తారు. ఎక్కువ మంది పెందరాళే పడుకుని సూర్యోదయంతో మేల్కొంటారు. పగటిపూట పని చేస్తారు. సూర్యాస్తమయం తర్వాత, దుకాణాలు మూసి వేస్తారు. వీధులన్నీ బోసిపోయి నిశ్శబ్దంగా మారుతాయి, కుటుంబాలు ఇంటి లోపలే ఉంటాయి. చీకటి పడకముందే భోజనం చేస్తారు రాత్రి 8 నుంచి 9గంటల మధ్యలోనే నిద్రపోయే వీరి అలవాటు ‘స్లీపింగ్ స్టేట్‘ గా కిరీటాన్ని అందించింది.హిమాచల్ ప్రదేశ్లో, ప్రజలు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు. పర్వత వాతావరణం, పుష్కలమైన సూర్యరశ్మి ప్రశాంతమైన వాతావరణం ప్రజలు విశ్రాంతిగా రోజువారీ దినచర్యను నిర్వహించుకునేలా సహాయ పడతాయి. కొండలలో నదులు గాలుల ప్రవాహంలాగే వారి జీవితాలు నెమ్మదిగా సున్నితంగా కదులుతుంటాయి. పర్యాటకులు తరచుగా బిజీగా ఉన్న నగర జీవితం నుండి విరామం తీసుకొని ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఈ ప్రదేశాలను సందర్శిస్తారు. అయితే ‘‘స్లీపింగ్ స్టేట్’’ అంటే ఆ ప్రదేశం అభివృద్ధిలో మందగమనంతో ఉందని కొందరు అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ పదం ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది తప్ప సోమరితనం లేదా అభివృద్ధి లేకపోవడం కాదు. భారతదేశంలో. హిమాచల్ ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆపిల్లను పండిస్తుంది సిమ్లా కిన్నౌర్ వంటి పట్టణాలు వాటి ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాష్ట్రం పర్యావరణ హితంగా పేరుపడింది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పొగ రహిత రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఇదే. పర్యావరణాన్ని కాపాడటానికి, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక్కడి ధర్మశాల దలైలామా నివాసం. ఈ పట్టణం ప్రశాంతమైన ప్రదేశం భారతదేశంలో టిబెటన్ సంస్కృతి, బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రం. దీనితో పాటే మనాలి నుంచి స్పితి వరకు పర్యాటకులు నగర జీవితం నుంచి విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి హిమాచల్ను ఎంచుకోవడానికి కారణాల్లో...ప్రకృతి అందాలతో పాటు నాణ్యమైన నిద్ర కూడా ఓ కారణం కావచ్చు. -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
గోవా వెళ్తున్నారా? ఈ విషయం తెలుసా? రూ.లక్ష కట్టాల్సిందే...
దేశంలో పర్యాటకుల్ని అత్యధిక సంఖ్యలో ఆకర్షించే రాష్ట్రం గోవా...అటు అంతర్జాతీయ, ఇటు దేశీయ పర్యాటకులను కూడా ఇక్కడ బీచ్లను సందర్శించడానికి భారీ సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గోవాకి మహరాజ పోషకులుగా ఉన్నారు. అంతేకాదు గోవాలో క్యాసినోలు సహా అనేక వ్యాపారాలు నడిపేవారిలోనూ తెలుగువారి వాటా పెద్దదే. దాంతో గోవా కు తెలుగు రాష్ట్రాలకు మధ్య రాకపోకలు భారీగానే సాగుతుంటాయి. ఈ నేపధ్యంలో తాజాగా గోవా ప్రభుత్వం విధించిన పలు నిబంధనలు మన తెలుగు వారు కూడా తప్పక తెలుసుకుని గుర్తుంచోవాల్సిన విషయంగా మారింది.మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రం పర్యాటక పరంగా ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో పర్యాటక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గోవా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రోడ్లపై చెత్తను అక్రమంగా పారవేస్తే కఠినమైన జరిమానాలు విధించనుంది. ఈ తరహాలో పదేపదే ఉల్లంఘనకు పాల్పడితే రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే బిల్లును ఆమోదించింది. దీని కోసం గోవా బయోడిగ్రేడబుల్ చెత్త (నియంత్రణ) చట్టం, 1996 కు సవరణను చేసింది. నదులు, సరస్సులు కాలువలు వంటి సున్నితమైన నీటి వనరులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ ప్రదేశాలలో చెత్త పారవేయడాన్ని నియంత్రించడం దీని లక్ష్యం. కొత్త నిబంధనల ప్రకారం, చెత్తను వేస్తూ పట్టుబడిన వ్యక్తులు మొదటి నేరానికి రూ. 200 నుంచి ప్రారంభమయ్యే జరిమానా తదుపరి ఉల్లంఘనలకు పెంచుకుంటూ పోతారు. అలా అలా ఏకంగా రూ. 3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థాలను పర్యవేక్షించడానికి అక్రమ డంపింగ్లో పాల్గొన్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి కూడా ఈ బిల్లు గోవా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకి అధికారం ఇస్తుంది. సవరించిన చట్టం ప్రకారం బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ కాని వ్యర్థాలను కాలువలు, వెంట్లు, మురుగు కాలువలు, క్వారీ షాఫ్ట్లు లేదా పర్యావరణాన్ని కలుషితం చేసే లేదా మురుగునీటి వ్యవస్థలకు ఆటంకం కలిగించే ప్రదేశాలలో వేయడం నిషేధం.చెత్త సేకరణ కేంద్రాలను గుర్తించి తెలియజేయడానికి స్థానిక సంస్థలు ఇప్పుడు బాధ్యత వహిస్తాయి. ఆస్తి యజమానులు, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు బ్రాండ్ యజమానులతో సహా అందరూ అధీకృత వ్యర్థాల ఏజెన్సీలను ఉపయోగించి వారి ప్రాంగణాల నుంచి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను సరైన రీతిలో నిర్మూలించాలి. బల్క్ వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు, సేకరించేవారు, రీసైక్లర్లు కో–ప్రాసెసర్లు ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి గెజిట్–నోటిఫైడ్ విధానాల ప్రకారం అధికారాన్ని పొందాలి.రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేయడానికి గోవా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక అడుగు ఇది. సరైన అనుమతలు లేకుండా నీటిలో పడవలు నడపడం, వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయమని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రాంతాలలో మద్యం సేవించడం లేదా రోడ్లపై, బహిరంగంగా గాజు సీసాలు పగలగొట్టడం, బహిరంగ ప్రాంతాలలో వంట చేయడం, చెత్త వేయడం, నియమించబడని మండలాల నుంచి వాటర్ స్పోర్ట్స్ లేదా టిక్కెట్ల అమ్మకాలు నిర్వహించడం, అనధికార హాకింగ్, భిక్షాటన చేయడం లేదా బీచ్లలో వాహనాలను నడపడం రాష్ట్రం వెలుపలి ప్రదేశాలకు అనుమతి లేకుండా పర్యాటక సేవలను విక్రయించడం వంటి పలు నిషేధిత అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వినోదం కోసమో, వ్యాపారం కోసమో..గోవాకు ఏ కారణంతో వెళ్లేవారైనా తాజా నిబంధనల గురించి అవగాహన పెంచుకుని వెళ్లడం బెటర్. ఎందుకంటే ఇలాంటి నిబంధనలు విధించడం మాత్రమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా గోవా ప్రభుత్వానికి బాగా తెలుసు..సో బహుపరాక్..(చదవండి: నచ్చినట్లుగా తలరాతనే మార్చుకుందామె..! హ్యాట్సాప్ నీతు మేడమ్..) -
పదేళ్లలో ఆదాయం వందల కోట్లు,ఇదీ ప్రభాస్ హీరోయిన్ సత్తా..
ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అత్యంత సుపరిచితమైన విమర్శకుల ప్రశంసలు పొందిన పేర్లలో ఒకరిగా కృతిసనన్ ఎదిగింది. అయితే, ఆమె స్టార్డమ్కు మార్గం ఇంజనీరింగ్ క్లాస్రూమ్ల నుంచే మొదలైంది.ఇంజనీరింగ్ టూ సిల్వర్స్క్రీన్..సంప్రదాయ. ఇంజనీరింగ్ నేపథ్యం నుంచి వచ్చిన కృతి బాలీవుడ్ తో ఎటువంటి కుటుంబ సంబంధాలు లేకుండా, వినోద ప్రపంచంలోకి పూర్తిగా బయటి వ్యక్తిగా ప్రవేశించింది. ఆమె మొదట్లో మోడలింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది, క్రమంగా తన విలక్షణమైన శైలి ఆత్మవిశ్వాసంతో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. 2014లో ప్రముఖ నటుడు జాకీ ష్రో కుమారుడు టైగర్ ష్రోతో కలిసి యాక్షన్ రొమాన్స్ చిత్రం హీరోపంతిలో నటించడంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ అరంగేట్రం విజయవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. శరవేగంగా ఆకట్టుకునే అందాల తారగా మారి భారతీయ సినిమాలోని అత్యంత ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాన్ని సంపాదించింది. ఆదిపురుష్లో ప్రభాస్ సరసన సీత పాత్రలోనూ నటించింది.2015లో, రోహిత్ శెట్టి బ్లాక్ బస్టర్ దిల్ వాలేలో షారుఖ్ ఖాన్, కాజోల్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో కృతి బరేలీ కి బార్, లుకా చుప్పీ, హౌస్ ఫుల్ 4 తదితర చిత్రాల ద్వారా స్థిరమైన విజయాలను దక్కించుకుంటూ వచ్చింది. మిమి (2021)లో పోషించిన సర్రోగేట్ తల్లి పాత్ర ఆమెకు ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందించింది. అందంతో పాటు అభినయ ప్రతిభ ఉన్న నటిగా బాలీవుడ్లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.బిజినెస్లో బిజీ బిజీగా...అనంతరం కృతి అభిరుచులు కెమెరాకు మించి విస్తరించాయి. మోడలింగ్ సినిమా సెట్లలో గ్లామర్ సౌందర్య పోషణతో సంవత్సరాల తరబడి పరిచయం ఉండడంతో కృతి సులభంగా స్కిన్ కేర్ స్పేస్ లోకి ప్రవేశించింది. కోవిడ్, లాక్డౌన్ సమయంలో, ఆమె చర్మ సంరక్షణ దినచర్యలు, ఉత్పత్తులను లోతుగా అర్థం చేసుకోవడంలో మునిగిపోయింది. ఈ అభిరుచి 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫర్ ను ప్రారంభించడానికి దారితీసింది. హైఫన్ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ బ్యూటీ లేబుల్లలో ఒకటిగా నిలిచింది, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ చర్మ సంరక్షణ లేబుల్ దాని మొదటి సంవత్సరంలోనే రూ. 100 కోట్ల అద్భుతమైన ఆదాయాన్ని ఆర్జించింది, అత్యంత పోటీతత్వ మార్కెట్లో తనను తాను స్థిరపరచుకుంది. కత్రినా కైఫ్ కే బ్యూటీ, మీరా రాజ్పుత్ అకైండ్, ఆష్కా గోరాడియా రెనీ కాస్మెటిక్స్ వంటి వాటితో పోటీ పడుతోంది. కృతికి చర్మ సంరక్షణ పట్ల ఉన్న నిజమైన మక్కువ, ఆమె స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించడం ఈ బ్రాండ్ శీఘ్ర విజయానికి మూలస్తంభంగా మారింది.ఫిట్...హిట్...స్కిన్ కేర్ ఉత్పత్తుల కంటే ముందే . 2022లో, ఆమె ఫిట్నెస్ బ్రాండ్ అయిన ది ట్రైబ్ను సహ యజమానురాలిగాస్థాపించింది. దీనికి ఆమె మిమి షూటింగ్ కోసం కృతి తన పాత్రను పండించడం కోసం దాదాపు 15 కిలోగ్రాముల బరువు పెరిగింది. లాక్డౌన్ కారణంగా జిమ్లు మూసేయడంతో అదనపు బరువు తగ్గడం ఆమెకు బాగా కష్టమైంది. దాంతో వర్చువల్ సెషల్ ద్వారా నలుగురు వ్యక్తిగత శిక్షకుల మార్గదర్శకత్వంలో తాను ఇంట్లోనే వ్యాయామం చేశానని కృతి వెల్లడించింది. ఈ లోతైన వ్యక్తిగత సవాలుతో కూడిన దశ ఆమెను ఆ శిక్షకులతో కలిసి ది ట్రైబ్ ఏర్పాటుకు ప్రేరేపించింది. అదే సంవత్సరంలో, ఆమె ముంబైలోని ఉన్నత స్థాయి జుహు ప్రాంతంలో తన మొదటి ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించింది. రెండు సంవత్సరాల తరువాత, 2024లో, ముంబైలోని మరొక ఉన్నత పరిసర ప్రాంతమైన బాంద్రాలో రెండవ స్టూడియో తెరిచింది. -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...!
స్నేహం అనే భావన మనసులను తాకే అంశం. తెలుగు, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్హిట్ స్నేహగీతాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయమయ్యాయి. ఆ పాటలు కేవలం సంగీతానికే కాకుండా, స్నేహ బంధం విలువను గుర్తు చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ సినిమాల్లోని హిట్ పాటలు వింటూ మన చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులను గుర్తు చేసుకోకుండా ఉండలేం. అలాంటి కొన్ని పాటల్ని, మన స్నేహితుల్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా...గుర్తు చేసుకుంటూ...స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...సాక్షాత్తూ అల్లా దిగివచ్చి వరమిస్తా కోరుకో అంటే.. కూడా ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్కనేస్తం చాలంటాను... అంటూ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నవాడు ఎంత సంపన్నుడో వివరిస్తుందీ పాట. 1974లో విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమాలోని ‘‘స్నేహమేరా జీవితం’’. పాట ఫరెవర్ ఫ్రెండ్ షిప్ సాంగ్ అని చెప్పాలి. మాధవపెద్ది సత్యం సంగీత దర్శకత్వంలో గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో పాటు గాయకుడు జి. ఆనంద్ కూడా తన గాత్రం జత చేశారు. రచయిత : సి.నా.రె. అక్షరాద్భుతాలు ఆవిష్కరించగా సంగీతదర్శకుడు: రోహిణీ చంద్ర. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు.. అంటూ స్నేహితుడి బాధను పంచుకోవడానికి కులమతాల అడ్డులేదంటూ చాటుతుందీ పాట. సినిమాలో స్నేహితుడైన ఎన్టీయార్ ను ఉద్ధేశిస్తూ లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఆవిష్కరించిన పాటాభినయం మరచిపోలేనిది.స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...ప్రాణ స్నేహితులు (1988) చిత్రంలోని ఈ పాట స్నేహ బంధానికి సాటిలేని విలువను అందిస్తుంది. తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా... . బంధువులెందరు ఉన్నా, నిజమైన స్నేహానికి సాటిరారనే భావాన్ని పల్లవి – చరణాలలో గొప్పగా ఆవిష్కరిస్తుంది. ‘త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం స్నేహం ... అంటూ స్పష్టం చేస్తుంది. స్నేహం గొప్పతనాన్ని చాటడానికి బహుశా ఇంత కన్నా మంచి పాటను ఎంచుకోలేమేమో...భువన చంద్ర పదాలు, రాజ్కోటి స్వరాలు కూర్చిన ఈ పాటకు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో జీవం పోశారు. కృష్ణంరాజు, శరత్బాబు, మురళీమోహన్ లు స్నేహితులుగా నటించారు.మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ...స్నేహం అంటే యుక్త వయస్కుల మధ్యే కాదు నడి వయస్కుల మధ్య కూడా ఉంటుంది. వయసుతో పాటే పరిణితి చెందిన ఆ స్నేహ బంధపు గొప్ప తనాన్ని చాటి చెబుతుంది. 1999లో విడుదలైన స్నేహం కోసం చిత్రంలోని మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ పాట. మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్కుమార్ లు స్నేహితులుగా జీవించిన పాట ఇది. ప్రతీ ఒక్కరికీ అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించేలా ఈ పాటలోని సాహిత్యాన్ని లెజండరీ రైటర్ కీ.శే.సిరివెన్నల సీతారామశాస్త్రి రాయగా గాయకుడు రాజేష్ అద్భుతంగా ఆలపించారు. ఒక్క పాటలో స్నేహం అంటే ఆటలు, పాటలతో పాటు పరస్పర బాధ్యత కూడా అంటూ చూపించడం జరిగింది. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నీను వీడ అంటూ సాగే ఆ పాటలో..ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు తల్లీ తండ్రినైనా ప్రేమ పంచినా తీరులోన నే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేసానో నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా? వంటి పదాలు స్నేహ పరిపూర్ణతను చాటుతాయి. ‘ముస్తఫా ముస్తఫా‘ (ప్రేమ దేశం – 1996)..ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట బాధ్యతలెరుగని స్నేహ బంధాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. స్నేహితుల మధ్య ఉన్న సరదాలను, చిలిపి బంధాన్ని వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ పాట వినపడని ఫ్రెండ్షిప్ డే వేడుక అరుదే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే... అంటూ సాగే ఈ పాట నాటి యువ హీరోలు అబ్బాస్, వినీత్ల సాక్షిగా కోడె వయసు కుర్రకారు ఫ్రెండ్ షిప్కి ఇచ్చే విలువను కళ్లకు కడుతుంది.చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో...1989లో విడుదలైన చిన్నారి స్నేహం అనే సినిమాలోని ఈ పాట చదువు ముగించుకుని కెరీర్లు వెదుక్కుంటూ సాగిపోయే దశలో..వీడ్కోలు పలుకుతున్న స్నేహితుల భారమైన హృదయాలకు అద్దం పడుతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో.మనసైతే మళ్లీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏ నాటికి ఏదవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో.. అంటూ ఎవరెక్కడ ఉన్నా చిన్నారి స్నేహాన్ని మాత్రం చిర కాలం నిలుపుకోవాలని కాంక్షిస్తూ సాగే ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి హృద్యంగా రాయగా చక్రవర్తి అంతే హాౖయెన స్వరాలు సమకూర్చారు. చంద్రమోహన్, రఘు, సీత తదితరులు చిన్నారి స్నేహితులుగా మెప్పిస్తారు. -
విద్యార్ధుల వేసవి సెలవులు రద్దు?
వేసవి సమయంలో తీవ్రమైన ఎండల వేడి తరచుగా రోజువారీ కార్యకలాపాలకు అసౌకర్యంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను ఇబ్బందుల పాటు చేస్తుంది. ఎండలు మండే వేళ, వడదెబ్బల వంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యంగా భావితరాన్ని రక్షించడానికి పుట్టుకొచ్చాయి సమ్మర్ హాలిడేస్. దశబ్ధాల తరబడి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు మొదటి సారి చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా వర్షాకాలం సైతం తన తఢాఖా చూపిస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు ఒక్క రోజులోనే దేశంలోని అనేక పెద్ద పెద్ద నగరాలను అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సమయంలో తరచుగా పాఠశాలలకు కూడా సెలవులు (Holidays) ప్రకటించడం జరుగుతోంది.నిజానికి కొందరు విద్యార్ధులైనా ఎండల నుంచి ఎసి బస్సులు, పాఠశాలల్లో ఎసిల ద్వారా అన్నా తప్పించుకోవచ్చునేమో కానీ నగరాల్లో ట్రాఫిక్, పొంగిపొర్లే నాలాలు, డ్రైనేజీలు తదితర పరిస్థతుల దృష్ట్యా చూస్తే తీవ్రమైన వర్షాల నుంచి తప్పించుకోవడానికి స్కూల్కి డుమ్మా తప్ప వేరే మార్గమే లేదు. ఈ నేపధ్యంలో అసలు వేసవి సెలవుల్ని వర్షాకాలం సెలవులుగా మారిస్తే ఎలా ఉంటుంది? అంటూ ఒక కొత్త చర్చ దేశంలో మొదలైంది. ఈ చర్చకు శ్రీకారం చుట్టింది రుతుపవనాలను ఎదురేగి ఆహ్వానించే తొలి రాష్టమైన కేరళ (Kerala). తమ రాష్ట్రంలోని వేసవి సెలవులను ఏప్రిల్ మే నెల నుంచి జూన్, జూలై వర్షాకాల నెలలకు మార్చాలా? అనే చర్చ ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది.నైరుతి రుతుపవనాల ప్రారంభంతో పాటే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది, అయితే భారీ వర్షపాతం వాతావరణ సంబంధిత హెచ్చరికల కారణంగా తరచుగా పాఠశాల తరగతులకు అంతరాయం కలుగుతోంది. తరచుగా తలెత్తుతున్న ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, కేరళ ప్రభుత్వం గరిష్ట రుతుపవన కాలంలో సెలవులను తిరిగి షెడ్యూల్ చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఈ విషయంపై చర్చోపచర్చల్లో భాగంగా కొందరు ప్రత్యామ్నాయంగా మే–జూన్ నెలను కూడా సూచించారట. అయితే ‘‘ఈ మార్పు వల్ల లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి? ఇది విద్యార్థుల అభ్యాసం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆచరణాత్మకంగా ఉంటుందా? మనం ఇతర భారతీయ రాష్ట్రాలు లేదా దేశాల నుంచి ఈ విషయంలో పాఠాలు నేర్చుకోగలమా?’ అంటూ కేరళ మంత్రి శివన్ కుట్టి (Sivankutty) అడిగారు, దీనిపై ఆయన ప్రజల నుంచి సూచనలను కూడా ఆహ్వానిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాణాత్మక సంభాషణకు ఈ చొరవ మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ,కేరళ విద్యాశాఖా మంత్రి తన పోస్ట్లోని కామెంట్స్ విభాగంలో ప్రజలు తమ అభిప్రాయాలను సిఫార్సులను పంచుకోవాలని కోరుతున్నారు. ఈ నేపధ్యంలో కేరళలో దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. వర్షాల కారణంగా విలువైన విద్యా సంవత్సరంలో అనేక రోజులు స్కూల్స్ మూతబడుతున్న పరిస్థితిలో ఇది చర్చనీయాంశమేనని అనేకమంది అభిప్రాయపడ్డారు. దీనిపై ఆన్ మనోరమ అనే స్థానిక మీడియా సంస్థ నిర్వహించిన పోల్లో 42 శాతం మంది జూన్–జులై మధ్య సెలవుల మార్పుకు అనుకూలంగా స్పందించగా 30.6 మంది మాత్రం ఏప్రిల్–మే అనే పాత విధానాన్ని యథాతధంగా కొనసాగించాలని కోరారు. అలాగే 27.52 శాతం మంది మే నుంచి జూన్ వరకూ సెలవుల్ని సవరించాలని సూచించారు.చదవండి: బుడ్డోడి ఫైరింగ్ స్టంట్కి షాకవ్వాల్సిందే! -
హీరో భార్య 'అనొద్దన్న సెలబ్రిటీ వైఫ్'.. మిగిలిన హీరోల భార్యలు..?
ఓ పెద్ద నటుడు, మరీ ముఖ్యంగా అగ్ర హీరోల భార్యలుగా మారడం చాలా మందికి అదృష్టం కావచ్చు అయితే కొందరు మాత్రం కేవలం వారి భార్యలుగా దక్కిన అదృష్టంతో మాత్రమే మిగిలిపోవాలని కోరుకోవడం లేదు. తమను తాము నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించడంలో మన మాధ్యమాలు తరచుగా విఫలమవుతుంటాయి. ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత వంటింటికి మాత్రమే పరిమితమైన గృహిణి ఆకాంక్షలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత కూడా గడపదాటి తనను తాను నిరూపించుకుంటూ సాగిపోయే వివాహిత ఆకాంక్షలు మరోలా ఉంటాయి అనేది నిర్వివాదం. ఏ వ్యక్తి అయినా తాను సాధించిన విజయాలకు, ప్రత్యేకతలకు తగ్గ వ్యక్తిగత గుర్తింపును ఆశించడం సహజం. దీనికి మగ, ఆడ వ్యత్యాసం లేదు. ఈ నేపధ్యంలో తాజాగా మళయాళ నటుడు ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియా మీనన్ తాజాగా ఇచ్చిన ఒక సంచలనాత్మక ప్రకటన ప్రస్తావనార్హం.ప్రసార మాధ్యమాలతో పాటు అనేక మంది తనను తరచుగా ప్రృధ్వీరాజ్ భార్యగా పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. తాను కేవలం ఒక టాప్ హీరో, నటుడు, సినీ ప్రముఖుడు ‘పృథ్వీరాజ్ భార్య‘గా మాత్రమే పరిగణన పొందాలనే దానిని కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు తన స్వంత కెరీర్లో ఒక విజయవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని ఆమె బహిరంగంగానే స్పష్టం చేశారు. ఆమె తనకంటూ స్వంత ఇమేజ్ సృష్టించుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. ఏ మగవాడికి సంబంధించి అయినా ‘అతని భార్య‘, ‘అతని తల్లి‘ లేదా ‘అతని కుమార్తె‘గా తగ్గిపోకూడదని ఆమె అంటున్నారు.పూర్వ జర్నలిస్ట్, ప్రస్తుత చిత్ర నిర్మాత, పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్కు సహ యజమాని అయిన సుప్రియా, ‘ఎల్2: ఎంపురాన్‘ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఇవే కాక తన కంటూ స్వంత వృత్తిపరమైన విజయాలు ఉన్నప్పటికీ, నిరంతరం తన భర్త పేరుతోనే గుర్తించబడటం అనేది తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె ధైర్యంగా వెల్లడించడం హర్షణీయం.ఇలా ఒక అగ్రహీరో భార్య బహిరంగంగా వ్యాఖ్యానించడం అనేది నిజంగా ఒక గేమ్ ఛేంజర్ కావచ్చు. మహిళల స్వయం సాధికారత గురించి మాట్లాడే ఉపన్యాసాలు దంచే ఎందరో ప్రముఖులు వారి భార్యలు సాధిస్తున్న విజయాలను తమ సెలబ్రిటీ స్టేటస్ మాటున బలిచేస్తున్న పరిస్థితి ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంది. అదే సమయంలో పలువురు నటుల భార్యలు హీరోయిజం అనే షాడో మాటున తమని తాము కోల్పోకుండా వ్యక్తిగత విజయాల కోసం తపిస్తుండడం కనిపిస్తోంది. ఉదాహరణకు టాలీవుడ్ హీరో రామచరణ్ భార్య ఉపాసన, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ... వంటివారు వ్యక్తిగతంగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటున్నారు. జీవిత భాగస్వామికి మాత్రమే కాదు తమ కష్టాల ఫలితంగా అందుకున్న తమ వ్యక్తిగత విజయాలకూ గుర్తింపు కోరుకోవడం తప్పు కాదు.. అది.. మహిళ అయినా మగవారైనా.. -
బుస్ బుస్..స్నేక్ వెరైటీల్లో టాప్ 10 దేశాలివే...
ఇది వానాకాలం...సిటీలో ఉన్నవారికి ఈ సీజన్లో ఏవేవో గుర్తు రావచ్చు గానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రం వెంటనే గుర్తొచ్చేవి, వారిని అప్రమత్తం చేసేవి పాములు అని చెప్పాలి. ఈ సమయంలో పాములు పొలాల్లో నుంచి ఇళ్లలోకి కూడా ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గ్రామీణులు, నగర శివార్లలో ఉన్నవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు ప్రపంచంలో పాముల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు ఏవేవి? ఎన్నెన్ని జాతులు పాములు ఉన్నాయి? మన దేశం ఏ స్థానంలో ఉంది? ఒక్కసారి పరిశీలిస్తే...పాముల సంఖ్యలో తొలిస్థానం మెక్సికో దేశం దక్కించుకుంటోంది. ఈ దేశంలో దాదాపుగా 400కిపైగా సర్ప జాతులు ఉన్నట్టు అంచనా. వీటిలో రాటిల్ స్నేక్స్, కోరల్ స్నేక్స్, బోవా పాములు వంటివి ఉన్నాయి.పాముల సంఖ్యలో 2వ స్థానాన్ని దక్కించుకుంది బ్రెజిల్. అయితే జాతుల రీత్యా చూస్తే ఈ దేశంలో 420కిపైగా పాములు ఉన్నట్టు లెక్కించారు. వీటిలో చెట్లలో నివసించే వాటి నుంచి అనకొండ వంటి భారీ సర్పాల వరకూ ఉన్నాయి.ఈ జాబితాలో ఇండోనేసియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో సముద్ర సర్పాలు, పైథాన్స్ వంటి రకాలతో కూడిన 376 సర్ప జాతులకు ఈ దేశం నిలయంగా ఉంది.పామును దైవంగా కొలిచే కోట్లాది మంది ప్రజలున్న మన భారత దేశం ఈ లిస్ట్లో 4వ ప్లేస్ దక్కించుకుంది. కోబ్రాలు, పచ్చని పల్లి పాములు, క్రైట్స్ సహా 305 సర్ప జాతులు మన దేశంలో ఉన్నాయట.దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలకు చిరునామా అయిన కొలంబియా మన తర్వాత 5వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో మొత్తం 305 రకాల స్నేక్ వెరైటీలు ఉన్నాయి. బుష్ మాస్టర్స్, కోరల్ స్నేక్స్ వంటి పాముల జాతులకు ఈ దేశం పేరొందింది.జనాభాలో నెం2గా ఉన్న చైనా పాముల జనాభాలో 6వ స్థానం చేజిక్కించుకుంది. పిట్ వైపర్స్ వంటి అరుదైన జాతులతో సహా 246 వెరైటీలు చైనాలో ఉన్నాయి.సైజులో చిన్న అయినా పాముల పాప్యులేషన్లో పెద్ద దేశాల సరసన చోటు సంపాదించింది ఈక్వడార్. ఈ దేశంలో అమెజానియన్ రెయిన్ ఫారెస్ట్, క్లౌడ్ ఫారెస్ట్స్ వంటివి పాముల నిలయాలుగా మారి 241 సర్పజాతులకు ఈ దేశాన్ని అడ్రెస్గా మార్చాయి.మొత్తం 226 సర్ప జాతులతో వియత్నాం 8వ స్థానం అందుకుంది. కోబ్రాలు, కీల్ బ్యాక్స్ వంటి వెరైటీలతో ఈ దేశంలోని అడవులు సర్ప నిలయాలుగా పేరొందాయి.ప్రకృతి సౌందర్యంతో, పర్యాటకుల ఆకర్షణలో ముందున్న మలేషియా 9వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో రంగురంగుల పాములు ప్రత్యేక ఆకర్షణ. మొత్తంగా 216 స్నేక్ వెరైటీలు ఉన్నాయట.టాప్ 10లో చివరి దేశంగా నిలిచిన ఆస్ట్రేలియాలో 215 సర్పజాతులు ఉన్నాయని లెక్కించారు. అత్యంత ప్రమాదకరమైన టైపాన్స్, బ్రౌన్ స్నేక్స్, టైగర్ స్నేక్స్కు ఈ దేశం కేరాఫ్గా ఉంది. -
నా సినిమా టిక్కెట్ రూ.20: అమితాబ్ పోస్ట్ పై చర్చ...
ప్రతి ఆదివారం జుహులో తన ఇంటి ముంగిటకు వచ్చే అభిమానులను పలకరించే దశాబ్దాల సంప్రదాయానికి పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఇంకా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులను పలకరించిన తరువాత తన బ్లాగులో ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, కొన్ని సందేశాలను కూడా పంచుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే అదే విధంగా ఆయన తాజాగా కూడా ఓ పోస్ట్ పెట్టారు. అందులో భావోద్వేగ భరిత సందేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటి కన్నా అందరినీ ఆకట్టుకుంది 1975 నాటి భారతీయ సంచలనం... క్లాసిక్ సినిమా ’షోలే’ సినిమా టిక్కెట్. దాదాపు 50 ఏళ్ల వయసు కలిగిన ఈ టిక్కెట్ను అత్యంత జాగ్రత్తగా భధ్రపరచిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా దానిని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ టిక్కెట్ ధర కేవలం రూ. 20 మాత్రమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ఆయన తన పోస్ట్లో ‘‘‘’షోలే’ టికెట్ను జాగ్రత్తగా భద్రపరిచా... ఈ టిక్కెట్ అప్పుడు రూ. 20 !! ధర.. ఈ రోజుల్లో థియేటర్ హాళ్లలో ఎరేటెడ్ డ్రింక్ (సాఫ్ట్ డ్రింక్) ధర అదే నని నాకు చెప్పారు. అది నిజమా?? చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పడానికి కాదు.. ఆప్యాయత ప్రేమ,‘ అంటూ ఆయన ఆ పోస్ట్లో నర్మగర్భంగా రాశారు.అయితే అమితాబ్ తన దగ్గరున్న ఈ టికెట్ ను పోస్ట్ చేయడం ఎంత ఆసక్తి కలిగించిందో నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్ అందుకుందో.. అలాగే ఆయన రూ.20కి థియేటర్లో సాఫ్ట్ డ్రింక్ కొనవచ్చునని అనడం కూడా అంత చర్చకు దారి తీసింది. ఎందుకంటే ప్రస్తుతం ధియేటర్లలో రూ.20కి సాఫ్ట్ డ్రింక్ కొనే పరిస్థితి లేదు. రూ.100 ఆ పై ధరల్లో మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. ఈ నేపధ్యంలో అమితాబ్ రూ.20కే లభిస్తాయనడంతో... సెలబ్రిటీలకు ధరలపై ఉన్న అవగాహన చాటుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ల ధరలు అదే విధంగా తినుబండారాల ధరలకు సంబంధించిన సోషల్ చర్చకు కూడా బిగ్ బి పోస్ట్ దారి తీసింది.మరోవైపు 1975లో విడుదలైన ‘షోలే‘, వచ్చే ఆగస్టు 15తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇందులో అమితాబ్తో పాటు ధర్మేంద్ర కూడా నటించారు ఈ సినిమా ఆ సంవత్సరం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, జై వీరు (అమితాబ్ మరియు ధర్మేంద్ర పోషించారు) అనే ఇద్దరు మాజీ ఖైదీల చుట్టూ తిరుగుతుంది, నటులు అమ్జాద్ ఖాన్, సంజీవ్ కుమార్ మరియు హేమ మాలిని మరియు జయ బచ్చన్ ఈ చిత్రంలోని తారాగణాన్ని ముగించారు. -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
జపాన్లో నాగార్జున పేరు ‘నాగ్–సమా’ ఎందుకంటే...
గత కొంత కాలంగా భారతీయ నటులు, ముఖ్యంగా దక్షిణాది హీరోలకు జపాన్లో బ్రహ్మరధం పడుతున్నారు. ఈ ట్రెండ్ని టాప్ లెవల్కి చేర్చింది సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అనడం లో సందేహం లేదు. రోబో వంటి సినిమాల ద్వారా ఆయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్, ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా జూ.ఎన్టీయార్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా జపాన్ సినీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక అభిమానం సంపాదించారు.ప్రస్తుతం వీరి సినిమాల కలెక్షన్లు అక్కడ భారీ స్థాయిలో ఉంటున్నాయి. అదే క్రమంలో ప్రస్తుతం జపాన్లో మరో హీరో కూడా స్థానికుల ఆదరణ పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... తెలుగు సీనియర్ స్టార్, కింగ్, అక్కినేని నాగార్జున. ఇటీవల ఆయన జపాన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు, అంతేకాదు అక్కడ ఆయనను ప్రత్యేకమైన పేరుతో పిలుచుకుంటున్నారు. అక్కడి అభిమానులు నాగార్జునను ’నాగ్–సామ’ అని ఇష్టంగా పేర్కొంటున్నారు.ఇటీవల నాగార్జున నటించిన పలు చిత్రాలు జపాన్ ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేశాయి. ముఖ్యంగా హిందీలో రూపొందిన బ్రహ్మాస్త్ర లో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే విధంగా తాజాగా విడుదలై సూపర్ హిట్ అయిన కుబేరా సినిమాలో నాగార్జున చేసిన కీలక పాత్ర కూడా అక్కడి వారి ఆదరణ చూరగొంది. దాంతో జపాన్లో అభిమానులను దక్కించుకున్న భారతీయ నటుల సరసన నాగార్జున కూడా చేరారు.జపాన్ సంస్కతిలో, దేవుళ్ళు, రాజవంశం లేదా గొప్ప స్థాయి వ్యక్తులు వంటి ఉన్నత గౌరవం ఉన్న వ్యక్తులకు ‘సామ‘ అనేది వారి స్థాయికి అందించే గౌరవంగా ఉపయోగిస్తారు. నాగార్జున పట్ల అభిమానాన్న చూపడానికి జపనీస్ అభిమానులు ఈ పదాన్ని ఎంచుకోవడం ద్వారా సరిహద్దులకు ఆవలన నాగార్జునకు గొప్ప గౌరవాన్నే అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో త్వరలో రానున్న కూలీ జపాన్లో ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా తొలిసారి నాగార్జున విలన్గా కనిపించనున్నారు. అంటే అది కూడా ఆయన కెరీర్లో చాలా ప్రత్యేకమైన పాత్రగానే చెప్పాలి. మరోవైపు అదే సినిమాలో జపాన్లో మంచి ఇమేజ్ ఉన్న రజనీకాంత్ హీరోగా వస్తున్నారు. దీంతో.... ఈ ప్రాజెక్ట్ ఇటు ఇండియాతో పాటు జపాన్లో కూడా క్రేజీగా మారిందని చెప్పొచ్చు. -
మహేష్,విజయ్ దేవరకొండ,అల్లు అర్జున్,రవితేజ.. ‘మల్టీ’స్టారర్
అభిమాన హీరో సినిమాను ఫలానా థియేటర్లో చూశాం అని చెప్పుకోవడం ఎప్పుడూ ఉండేదే. అయితే అభిమాన హీరో ధియేటర్లో ఫలానా హీరో సినిమా చూశాం అని చెప్పుకునే రోజులు శర వేగంగా వచ్చేస్తున్నాయి. సినిమా హీరోలు వరుసపెట్టి మల్టీఫ్లెక్స్ సహ యజమానులుగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.తొలి క్లాప్ మోహన్లాల్దే...నిజానికి ఈ తరహా ట్రెండ్కి శ్రీకారం చుట్టింది మళయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అని చెప్పొచ్చు. గత పాతికేళ్లకు పైగా ఆశీర్వాద్ సినిమాస్ పేరిట నిర్మాణ సంస్థ ను నిర్వహిస్తున్న ఆయన తాను సహ యజమానిగా కేరళలో ఆశీర్వాద్ సినీప్లెక్స్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ నెలకొల్పారు.కాన్సెప్ట్ ఆధారిత సినీ అనుభవం..కాన్సెప్ట్–ఆధారిత సినిమా చూసే అనుభవం. అనే సరికొత్త శైలితో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ రంగంలోకి దూసుకొచ్చారు. ఆయన 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేరు మీద తన సొంత లేబుల్ ఎన్వై సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా చిన్న పట్టణాలు నగరాల్లో సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. రూ. 600 కోట్ల నుంచి రూ. 750 కోట్ల పెట్టుబడితో మల్టీఫ్లెక్స్లు ఏర్పాటు చేస్తున్నారు ఆయన గ్రూప్ తమ మొదటి మల్టీప్లెక్స్ను మధ్యప్రదేశ్లోని రత్లాంలో రైల్వే నేపథ్య ఇంటీరియర్తో ప్రారంభించింది. అలాగే గురుగ్రామ్లోని ఎలాన్ ఎపిక్ మాల్లో ఒక విలాసవంతమైన మల్టీప్లెక్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో మాక్టెయిల్ బార్, ఎన్వై కేఫ్ అమోర్ లాంజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి‘మల్టీ’ బాటలో ముందున్న టాలీవుడ్కోవిడ్ సమయంలో ఈ ట్రెండ్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ ఒకరి తర్వాత ఒకరుగా హీరోలను జత చేసుకుంటూ శరవేగంగా ముందంజలో దూసుకుపోతోంది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 2021లో మల్టీఫ్లెక్స్ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన ఆసియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ – మహేష్ బాబు జాయింట్ వెంచర్) ను స్థాపించాడు. ఆయనతో పాటే నేను సైతం అంటూ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా అదే ఏడాది థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆసియన్ విజయ్ దేవరకొండ (ఎవిడి) సినిమాస్ కు యజమానినని ఆయన సగర్వంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొదటి ఎవిడి సినిమా అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, లో ప్రారంభమైంది.మహేష్ బాబు విజయ్ దేవరకొండ తర్వాత ఆసియన్ సినిమాస్తో చేతులు కలిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన కూడా అదే సంవత్సరంలో ఆసియన్ సినిమాస్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు హైదరాబాద్లోని అమీర్పేటలో ’ఎఎఎ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ నెలకొల్పాడు. ఆసియన్ సినిమాస్ ఈ సారి మాస్ మహారాజ్ను ఎంచుకుంది. మాస్ జాతరకు చిరునామాగా పేరున్న హీరో రవితేజతో కలిసి హైదరాబాద్లోని వనస్థలిపురంలో జాయింట్ వెంచర్ ఆర్ట్ సినిమాస్ పేరుతో నెలకొల్పింది. ఇది జులై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రారంభం కానుంది.విస్తరణ బాటలోనూ సై..మరోవైపు మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ యాజమాన్యంలోని కొండాపూర్లోని ఎఎంబి సినిమాస్ మరింతగా విస్తరిస్తోంది. ఈ మల్టీఫ్లెక్స్లో బార్కోహెచ్డిఆర్ ప్రొజెక్షన్ తో కూడిన కొత్త స్క్రీన్ వచ్చే ఆగస్టులో వార్ 2తో ప్రారంభం అవుతుంది, తద్వారా ఇది హైదరాబాద్ టెక్ కారిడార్లో సినీ అభిమానులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. మరోవైపు జనవరి 2026లో, కోకాపేటలోని అల్లు సినిమాస్ హైదరాబాద్లో మొట్టమొదటి డాల్బీ సినిమాను పరిచయం చేయనుంది. -
OTT: 2025లో ఎక్కువ మంది చూసిన హిందీ వెబ్ సిరీస్, షోస్ లివే..!
2025లో ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ పెద్దగా సందడి చేయలేకపోయింది. అయితే ఇంటింటి థియేటర్గా అవతరించిన ఓటీటీ రంగం మాత్రం వరుస హిట్లు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న సిరీస్లతో జోరుగా సాగుతోంది. విశేషం ఏమిటంటే గొప్ప హైప్ ఉత్సాహంతో దూసుకొచ్చిన అనేక సిరీస్లు విఫలమైతే, తక్కువ మధ్యస్థపు అంచనాలతో వచ్చిన పలు షోలు వాటి ఆకర్షణీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకర్షించాయి. అటువంటివాటిలో కొన్ని...బ్లాక్ వారెంట్... వావ్ కంటెంట్...ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో రిలీజైన్ బ్లాక్ వారెంట్ ఈ సంవత్సరం ఇప్పటివరకు విడుదలైన అత్యంత ఉత్కంఠభరితమైన షోలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రై మ్ థ్రిల్లర్ ఇప్పటివరకు లైమ్లైట్లోనే ఉంది. ఈ సిరీస్లో జహాన్ కపూర్, రాహుల్ భట్ తదితరులు తమ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు.పాతాళ్లోక్...సూపర్ క్లిక్జైదీప్, అహ్లవత్ ప్రముఖ పాత్రల్లో నటించిన పాతాల్ లోక్ సీజన్ 2 కూడా మంచి విజయం సాధించింది. ప్రైమ్ వీడియో అందిస్తున్న ఈ సంవత్సరపు మరో హిట్ థ్రిల్లర్ గా నిలిచింది. హై ప్రొఫైల్ హత్య కేసు దర్యాప్తు అనుకోని రీతిలో అనేక ఇతర రహస్యాలను వెలుగులోకి తీసుకురావడాన్ని ఈ సిరీస్ ప్రదర్శిస్తుంది.రియలిస్టిక్ షేడ్స్తో...బ్లాక్ వైట్ అండ్ గ్రే.. లవ్కిల్స్నిజజీవిత సంఘటనల ఆధారంగా అంటూ నమ్మించేలా రూపొందిన బ్లాక్, వైట్ గ్రే కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సోనీలివ్ లో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రతీ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. హై–ప్రొఫైల్ వ్యక్తుల వరుస హత్యల నేపధ్యంలో ఇది నిజమైన సంఘటనల ఆధారంగా దీనిని పుష్కర్ సునీల్ మహాబల్, హేమల్ ఎ ఠక్కర్ లు రూపొందించారు.సైకలాజికల్ థ్రిల్...ఖాఫ్...ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఖాఫ్ కూడా సక్సెస్ జోరు కొనసాగిస్తోంది. గత ఏప్రిల్ నెలలో విడుదలైన ఈ సిరీస్లో... మోనికా పన్వర్, రజత్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటించిన ఖౌఫ్ భయానక శైలి కారణంగా చాలా సంచలనం సృష్టించింది, ప్రేక్షకులపై భారీ ప్రభావాన్ని చూపింది.ఈ ఓటీటీ షోలను అసాధారణంగా చేసింది దీర్ఘకాలం పాటు కొనసాగే ట్విస్టులతో కథ చెప్పడం, ఏదేమైనా భారతీయ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థ్రిల్లర్ల వైపు పూర్తిగా మొగ్గుతున్నారు మరోవైపు ఈ షోలు 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ కంటే ఓటీటీని రంగాన్ని సక్సెస్ఫుల్గా మార్చాయి ఈ ఏడాదిలో ఇదే విధంగా తన పైచేయిని కొనసాగిస్తుందా?చూడాలి. -
తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్
నిర్భయమైన వైఖరి స్వీయ వ్యక్తీకరణకు పేరుగాంచిన విద్యాబాలన్, నటన, గ్లామర్ల కలబోతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కధ ఆధారంగా రూపొందిన డర్టీ పిక్చర్ ద్వారా సౌత్ ప్రేక్షకల ప్రశంసలూ దక్కించుకున్న విద్యాబాలన్కు తరచుగా ఎదురయే విమర్శ, లేదా సలహా ఏదైనా ఉందంటే అది ఆమె ఓవర్ వెయిట్ గురించి మాత్రమే. గతంలోనూ కొన్నిసార్లు బరువు పెరిగి తగ్గి, పెరిగి...మార్పులకు గురవుతున్న విద్యాబాలన్... ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల సందర్భంగా తన శరీరపు బరువు విషయంలో సంవత్సరాలుగా తనపై వచ్చిన విమర్శల నేపధ్యంలో ఈ సమస్యను అధిగమించడానికి తాను పడిన వ్యయ ప్రయాసల్ని ఆమె వెల్లడించింది.‘ నేనొక సిగ్గుపడని ఆశావాదిని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. బరువు తగ్గడానికి నేను చేయని పోరాటం లేదు. నిజాయితీగా చెప్పాలంటే, ఆ విషయానికి వస్తే నాలో ఏ తప్పు లేదని నేను అనుకుంటున్నాను అంటుందామె. బరువుపై విమర్శలను చూసి బెదిరిపోని ఆమె మనస్తత్వం, విమర్శలను తట్టుకోవడానికి సినీరంగంలో కొనసాగడానికి సహాయపడిందని ఆమె అభిప్రాయపడుతోంది. ‘‘ఆ వైఖరి నాకు సహాయపడింది. నేను ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించాను ఎలాంటి అభద్రతాభావాలు నన్ను ఎప్పుడూ వెనక్కి నెట్టలేదు‘ అంటూ ఓవర్ వెయిట్ అనే సమస్యను జయించడానికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో చెప్పకనే చెబుతుందామె.‘నా జీవితాంతం, నేను సన్నగా మారడానికి ప్రయత్నించాను. తీవ్రమైన ఆహార నియమాలు పాటించాను. అన్ని రకాల వ్యాయామాలను చేశాను. కొన్నిసార్లు బరువు తగ్గాను, కానీ మళ్లీ తిరిగి బరువు పెరిగిపోయేదాన్ని.‘ అంటూ గుర్తు చేసుకుంది.ఇటీవల బాగా వెయిట్ లాస్ అయి స్లిమ్ గా కనపడుతున్న విద్యాబాలన్...ఈ సంవత్సరం ప్రారంభంలో చెన్నైకి చెందిన పోషకాహార సంస్థ తో కనెక్ట్ అయినప్పుడు తన సమస్య ఏమిటో తనకి అర్ధం అయిందని చెప్పింది. ‘వారు నాకు, ’మీది కొవ్వు కాదు, అది ఇన్ఫ్లమేషన్’ అని చెప్పారు. అది నా విషయంలో గేమ్–ఛేంజర్ గా పనిచేసింది అని ఆమె వివరించింది తాను స్వతహాగా శాఖాహారిని అని కూరగాయలు తింటున్నా కూడా బరువు పెరగడానికి కారణం ఈ సంస్థను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని అంటోంది. ‘‘ అన్ని కూరగాయలు ఆరోగ్యకరమైనవని మనం అనుకుంటాము, కానీ అది నిజం కాదు. మీ శరీరానికి ఏది సరైనదో మీరు అర్థం చేసుకోవాలి. మరొకరికి పనికొచ్చేది మీకు పనికి రాకపోవచ్చు. అదే విధంగా పాలకూర సొరకాయ వంటి కొన్ని నాకు సరిపోవని నాకు అంతకు ముందు తెలియదు’’ అంటూ వెల్లడించింది.ఆత్మవిశ్వాసం అద్దం నుంచి రాదు అది లోపలి నుంచి వస్తుంది అని అంటున్న విద్య... దీర్ఘకాలంగా తాను చేస్తున్న బరువుపై పోరాటంలో సరైన సక్సెస్నే సాధించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె తన ఆహారంలో ‘ఇన్ఫ్లమేషన్ను తొలగించే‘ విధానాన్ని అవలంబించింది, శరీర బరువు త్వరగా తగ్గించగలిగింది. అవగాహనతో కూడిన ఈ విజయం ఇకపైనా కొనసాగిస్తుందని ఆమె అభిమానులు ఆశించవచ్చు. -
తల తడిస్తే... వర్షపు నీరే కదా అని వదిలేస్తే... వెంట్రుకలకు మూడినట్టే?
వర్షాలు పడుతున్న వేళ రోజువారీ కార్యకలాపాల కోసం రోడ్ల మీద తిరిగే వారికి జుట్టు తడవడం సర్వసాధారణం. అయితే సరైన జాగ్రత్తలు, సంరక్షణ తీసుకోకపోతే మాత్రం దాని ప్రభావం అంత సాదా సీదాగా ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమీ కాదులే అని తడిసిన జుట్టును వదిలేస్తే.. అపార నష్టం కలుగవచ్చునని స్పష్టం చేస్తున్నారు. వర్షాల సీజన్లో తల వెంట్రుకలను ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై పలువురు స్కిన్–హెయిర్ కేర్ నిపుణులు అందిస్తున్న సూచనల సమాహారం ఇది..వర్షాకాలం ప్రభావం కేశాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది, వర్షపు నీటిలోని కాలుష్య కారకాల వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి, మీ జుట్టు సంరక్షణ పద్ధథులను మార్చుకోవాలి. తలని పరిశుభ్రంగా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా కడగడం, కండిషనింగ్ చేయడం అవసరం. హెయిర్ మాస్క్లను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం పొడిబారడం వంటివి నివారించవచ్చువర్షపు నీటికి ఉండే ఆమ్ల స్వభావం జుట్టును దెబ్బతీస్తుంది, కాబట్టి బయటకు వెళ్లే సమయంలో లేదా వర్షపు సమయంలో తలను గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్తో కప్పడం చాలా అవసరం. (కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు!)జుట్టు తడిసినట్టయితే కాలుష్య కారకాలను తొలగించడానికి వీలైనంత త్వరగా తేలికపాటి షాంపూ కండిషనర్తో జుట్టును కడగాలి.రుతుపవనాల తేమ తలని జిడ్డుగా మారుస్తూ రకరకాల ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. అదనపు నూనె ధూళిని తొలగించడానికి తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును క్రమం తప్పకుండా (వారానికి 2–3 సార్లు) కడగాలి.టీ ట్రీ ఆయిల్ లేదా వేప నూనెతో కూడిన షాంపూలను వాడటం మరింత ఉపయుక్తం ఎందుకంటే ఇవి యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. (కరిష్మా మాజీ భర్త సంజయ్ కపూర్ మరణంపై తల్లి సంచలన ఆరోపణలు)ప్రతి హెడ్ వాష్ తర్వాత జుట్టును కండిషన్ చేయాలి. తద్వారా జుట్టు బిరుసు తనాన్ని నియంత్రించవచ్చు తేమను జోడించవచ్చు.జుట్టును తేమగా మార్చడానికి బలోపేతం చేయడానికి వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ లేదా హెయిర్ స్పా ఉపయోగించవచ్చుజుట్టు కడుక్కోవడానికి ముందు నూనె రాయడం ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఎక్కువసేపు నూనె ఉంచడం సరికాదు.. ఎందుకంటే అది మురికిని ఆకర్షిస్తుంది.అధిక తేమ వల్ల జుట్టు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి హెయిర్ డ్రైయర్లు స్ట్రెయిటెనర్లు వంటి హీట్ స్టైలింగ్ సాధనాల వాడకాన్ని తగ్గించండి. వేడిని ఉపయోగించాల్సి వస్తే, హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే బెటర్.పుష్కలంగా పండ్లు, కూరగాయలు నీటితో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జుట్టుకు దోహదం చేస్తుంది.ఆహారంలో ఆమ్లా (ఇండియన్ గూస్బెర్రీ)భాగం చేయండి. ఎందుకంటే ఇందులో జుట్టుకు మేలు చేసే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. -
రష్మిక డియర్ డైరీ వెనుక దాగున్న కొంత కష్టం.. ఎంతో ఇష్టం
నేషనల్ క్రష్ అంటే ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా రష్మిక అని ఒకటే సమాధానం ఉండొచ్చు కానీ ఇప్పుడు మరో నేషనల్ క్రష్ కూడా వచ్చేసింది. పైగా రష్మిక తానే స్వయంగా తెచ్చేసింది. పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్గా మారి అందం అభినయంతో పరవశాలను పంచుతున్న మన శ్రీవల్లి...డియర్ డైరీ పేరుతో పరిమళాలను కూడా మోసుకొస్తోంది. ఇటీవలే పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన రష్మిక దీని వెనుక తన ఆలోచనలను అనుభవాలను భావోద్వేగాలను పంచుకుంది.అన్ని విధాలుగా, రెండు సంవత్సరాల వ్యయప్రయాసల అనంతరం రూపుదిద్దుకున్న డియర్ డైరీ, రష్మిక మందన్నకు కేవలం ఒక ప్రముఖ సువాసనల ఉత్పత్తికంటే ఎక్కువ. , తన చిన్నతనంలో వ్రాసిన జర్నల్ ఎంట్రీల నుంచి ప్రేరణ పొంది, తరువాత అదే పేరుతో తన ప్రసిద్ధ ఇన్స్ట్రాగామ్ సిరీస్లోనూ మనం చూసిన డియర్ డైరీ...‘‘ఇది కేవలం వ్యాపార వెంచర్ కాదు,’’ అని ఆమె చెప్పింది. ‘‘సువాసన నాకు చాలా వ్యక్తిగతమైనది. ఇది నన్ను తక్షణమే చిన్ననాటి క్షణాలకు తీసుకువెళుతుంది. నా తల్లి బాడీ లోషన్, కూర్గ్ గాలి సువాసన, నా జీవితంలో ముఖ్యమైన అధ్యాయాలలో నేను ధరించిన పెర్ఫ్యూమ్’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంటుంది. ‘‘ ఈ పెర్ఫ్యూమ్లు నేను తిరిగి ఇచ్చే మార్గం. ఇది నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కౌగిలింత’’అంటోంది.డియర్ డైరీ అనే పేరు వెనుక.. ‘‘ నేను కూర్చుని డైరీ రాసేదానిని. దానికి వేరే పేరు పెట్టాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు దాన్ని ఎప్పుడూ ‘డియర్ డైరీ’ అని సంబోధించేదాన్ని. సంవత్సరాల తరువాత, నేను ఇన్స్ట్రాగామ్లో సిరీస్ను ప్రారంభించినప్పుడు, జీవితంలోని చిన్న, నిశ్శబ్ద విషయాలు ముఖ్యమైనవని ప్రజలకు గుర్తు చేయాలనుకున్నాను అందుకే అది సహజమైన కొనసాగింపుగా మారింది’’ అని వెల్లడిస్తుంది.కర్ణాటకలోని కొడగు (గతంలో కూర్గ్) జిల్లాలోని ఒక చిన్న ప్రాంతమైన విరాజ్పేట (విరాజపేట అని కూడా పిలుస్తారు)లో పుట్టి పెరిగిన రష్మిక, కర్ణాటక కొండ ప్రాంత దట్టమైన పచ్చదనం మట్టి గాలితో ఊసులాడుతూ పెరిగింది, ఆమె జ్ఞాపకాలలోకి చొచ్చుకుపోయిన అవన్నీ ఇప్పుడు ఆమె బ్రాండ్.లో ప్రతిఫలిస్తాయి ‘‘అక్కడ ప్రతీ ఇంటికి ఒక వాసన ఉంది’ఆ విషయం‘‘అలాంటి ప్రదేశంలో పెరిగిన ఎవరైనా మీకు చెబుతారు.’’ అంటుందామె. ‘నేను ఆ పెర్ఫ్యూమ్ని వేరేగా చూడలేదు. నేను దానిని నాలాగా చూశాను. నేను కేవలం రష్మిక నే అయితే...నేషనల్ క్రష్, ఇర్రీప్లేసబుల్, కాంట్రవర్షియల్ – అనే పేర్లు నాకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అవి కూడా ఈ బ్రాండ్లో భాగం అయ్యాయి’’ అంటూ వివరించింది.ప్రపంచ బ్యూటీ లేబుల్లను స్కేలింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందిన న్యూయార్క్కు చెందిన ది పిసిఎ కంపెనీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఉత్పత్తి డియర్ డైరీ, దీనిలో 3 ఫ్లేవర్స్కి నేషనల్ క్రష్, ఇర్రీప్లేసబుల్, కాంట్రవర్షియల్ అంటూ పేర్లు పెట్టడం విశేషం.మనం కలలు కంటాం. కానీ వాస్తవికత వేరోలా ఉంటుంది‘ అని ఆమె చెప్పింది. ఈ పెర్ఫ్యూమ్ గురించి ‘‘ఇది నా బిడ్డ. మా వంతు ప్రయత్నం చేసాం. ఇప్పుడు అది అందరికీ అందుబాటులో ఉంది, దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి సిద్ధంగా ఉన్నాం. వారి అభిప్రాయంతో మా బిడ్డ పెరగాలని నేను కోరుకుంటున్నాను.‘ అంటూ చెబుతోంది రష్మిక.. చూడాలి మరి నేషనల్ క్రష్ వ్యాపారంలో ఎంతగా ఎదుగుతుందో. -
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ కిచెన్ మనదేశంలోనే..! రోజుకి ఏకంగా..
కట్టెలు లేవు, కిరోసిన్ లేదు, ఎల్పీజీ లేదు కేవలం సూర్యుడి శక్తి తప్ప. ఒక్క చుక్క గ్యాస్ లేదా విద్యుత్తును ఉపయోగించకుండా ఆ కిచెన్ ఏకంగా 50 వేల మందికి వంట చేస్తోంది. అసాధ్యం అనిపిస్తుందా? అదేదో విదేశాల్లోనో, అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలలోనో కాదు. మన ఇండియాలోనే జరుగుతోంది. మన దేశంలోని ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఇది ప్రతిరోజూ కనిపించే దృశ్యం. అక్కడ ఏర్పాటు చేసిన సౌరశక్తి ఆధారిత వంటగది ప్రపంచ స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచానికి క్లీన్ ఎనర్జీ సత్తాను చాటుతోంది. .బ్రహ్మ కుమారీల శాంతివన్ కాంప్లెక్స్లోని ఆరావళి కొండలలో ఎత్తయిన చోట ఏర్పాటు చేసిన ఈ భారీ సెటప్ వేల సంఖ్యలో వేడి, పోషకమైన, శాఖాహార భోజనాలను వండడానికి సూర్యుని శక్తిని ఉపయోగిస్తుంది. ఈ వంటగది సౌర ఫలకాలతో కాకుండా సౌర ఉష్ణ శక్తిపై నడుస్తుంది. అంటే సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చడానికి బదులుగా, ఇది సూర్యరశ్మిని కేంద్రీకరించడానికి వేడిని ఉత్పత్తి చేయడానికి అద్దాలను ఉపయోగిస్తుంది. చాలా వరకు రిఫ్లెక్టర్లు రోజంతా సూర్యుడిని అనుసరించే తిరిగే ఫ్రేమ్లపై అమర్చబడి ఉంటాయి. ఈ కదలిక వారికి పొద్దుతిరుగుడు పువ్వుల మాదిరిగానే గరిష్ట సౌర శక్తిని సంగ్రహించడానికి సహాయపడుతుంది!ఇక్కడే మ్యాజిక్ జరుగుతుంది..సూర్యకాంతి రిఫ్లెక్టర్ కేంద్ర బిందువును తాకినప్పుడు, ఉష్ణోగ్రతలు 800డిగ్రీల వరకు పెరగవచ్చు – అది సీసం కరిగించేంత వేడిగా ఉంటుంది!. ఈ తీవ్రమైన వేడిని ఆవిరిగా మార్చి ఉపయోగిస్తారు. అదే వంటగదికి శక్తినిస్తుంది. ప్రతి రిఫ్లెక్టర్ సాంద్రీకృత కాంతి ప్రత్యేకంగా రూపొందించిన 42 స్టీల్ రిసీవర్లపైకి మళ్ళించబడుతుంది. ఇవి వేడిని గ్రహించి నీటిని ఆవిరిగా మారుస్తాయి. దాంతో ప్రతిరోజూ 3,500 కిలోగ్రాములకు పైగా ఆవిరి ఉత్పన్నమవుతుంది.ఆహారం ఎలా వండుతారంటే...ఆవిరిని ఆరు ఇన్సులేట్ చేసిన హెడర్ పైపుల ద్వారా సేకరించి సెంట్రల్ స్టీమ్ డ్రమ్లోకి పంపుతారు. ఇక్కడి నుంచి, ఇది వంటగది లోపల ఉన్న భారీ వంట పాత్రలలోకి పంపిణీ అవుతుంది అలా బియ్యం, పప్పులు, కూరలు వండేందుకు ఇక్కడ ఇది ఉపకరిస్తుంది. ఎటువంటి నిప్పు ఉద్గారాలు లేకుండా పాత్రలను కడగడం క్రిమిరహితం చేయడం ఇలా ప్రతిదీ శుభ్రంగా సమర్ధవంతంగా జరుగుతుంది. ఇది కేవలం అద్దాల ప్యాచ్వర్క్ కాదు. మొత్తం వ్యవస్థ సెమీ–ఆటోమేటెడ్. ప్రతి సాయంత్రం ఫోటోవోల్టాయిక్–శక్తితో పనిచేసే మోటారు టైమర్ సిస్టమ్ రిఫ్లెక్టర్లను రీసెట్ చేస్తుంది. కాబట్టి అవి మరుసటి రోజు మళ్ళీ సూర్యుడిని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. డీజిల్ బ్యాకప్ వ్యవస్థ (వర్షాకాలంలో మాత్రమే ) వల్ల మేఘావృతమైన రోజులు వర్షంలో కూడా, వంటగది ఆగదు. ఈ వ్యవస్థ 1998లో మొదటిసారి పూర్తిగా ప్రారంభించబడినప్పుడు, రోజుకు 20,000 భోజనాలను వండడానికి అనేది ఉద్ధేశ్యం కాగా మౌలిక సదుపాయాలను విస్తరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరిన్ని మాడ్యూల్లను జోడించడం ద్వారా ఇది త్వరగా అంచనాలను అధిగమించింది. నివాసితులు, స్వచ్ఛంద సేవకులు, అతిథులు విద్యార్థులు ఇలా విభిన్న వర్గాలకు కలిపి ఈ వంటగది ఇప్పుడు ప్రతిరోజూ 50,000 మందికి సేవలు అందిస్తుంది. అది ప్రతిరోజూ సూర్యకాంతితో మొత్తం స్టేడియంకు ఆహారం ఇవ్వడంతో సమానం అందుకే దీనిని బిబిసి వరల్డ్ సర్వీస్ ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వంటగదిగా పేర్కొంది.(చదవండి: 17 ఏళ్లకే ఐదు గిన్నిస్ రికార్డులు..! ఎలాంటి శిక్షణ లేదు కేవలం..) -
ఇందుగలరందులేరను...భారతీయుల సంఖ్యలో టాప్ 10 దేశాలు ఇవే
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఉంది. అది టొరంటోలోని ఓ మూలగా ఉన్న కిరాణా దుకాణంలో కనిపిస్తుంది, బెర్లిన్ లోని ఒక టెక్ సంస్థకు గుండెకాయగా మారుతుంది. సందడిగా ఉండే దుబాయ్ మెట్రోలో లేదా న్యూయార్క్ టైమ్స్ బైలైన్ లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే..భారతీయ పౌరులు నివసించాలని నిర్ణయించుకునే దేశంలో సులభంగా కలిసిపోతారు.నేడు, గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు తమ జన్మస్థలం వెలుపల నివసిస్తున్నారు. ప్రపంచంలోని 281 మిలియన్ల అంతర్జాతీయ వలసదారులలో, భారతీయులు అతిపెద్ద సింగిల్ గ్రూపుగా ఏర్పడ్డారు, దాదాపు 18 మిలియన్ల మంది భారతదేశంలో జన్మించి ఇప్పుడు వేరే చోట నివసిస్తున్నారని తాజా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన వారిని కూడా చేరిస్తే ఆ సంఖ్య 35 మిలియన్లకు పైగా ఉంటుంది.అగ్రరాజ్యం...అగ్రస్థానంలో..టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విపరీతమైన అవకాశాల కారణంగా దాదాపు 5.4 మిలియన్లకు పైగా భారతీయులతో, మనవాళ్లను ఆకర్షించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇంకా, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలంగా ఉండే పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలు కూడా దీనికి దోహదం చేశాయి. ఎడిసన్ (ఎన్జె), జాక్సన్ హైట్స్ (ఎన్వై), ఆర్టీసియా (సిఎ) వంటి ప్రాంతాలను తరచుగా ‘లిటిల్ ఇండియాస్‘ అని పిలుస్తారు ఇవి వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు సాంస్కృతిక కేంద్రాలతో నిండి ఉంటాయి.70 శాతం శ్రామిక శక్తి మనదే..3.57 మిలియన్ల మంది భారతీయులతో యుఎఇ రెండో అతిపెద్ద భారతీయ నివాస దేశం. నిర్మాణం, ఆతిథ్యం,ఆర్థిక రంగాలలో పన్ను రహిత జీతాలు బ్లూ, వైట్ కాలర్ కార్మికులను ఆకర్షిస్తాయి; దుబాయ్ శ్రామిక శక్తిలో 70 శాతానికి పైగా భారతీయులే కావడం గమనార్హం.మేలు కలయిక...మలేషియానేడు, మన దేశస్థులు మలేషియా మొత్తం జనాభాలో 9% మంది భారతీయులే ఉన్నారు. దాదాపుగా 2.75మిలయన్ల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారని అంచనా. తమిళం, మళయాళం, తెలుగు, పంజాబీ భాషలు మాట్లేడేవారు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరే కాకుండా ఇండియన్ ఎక్స్పాట్స్ (అక్కడ స్థిరపడనివారు) సైతం 2.25లక్షల మంది వరకూ ఉంటారని అంచనా. ఇండియన్స్ కేరాఫ్...కెనడాకెనడాలో దాదాపు 2.88 మిలియన్ల భారతీయులు విదేశాలలో నివసిస్తున్నారు. టొరంటో (700,000 కంటే ఎక్కువ మంది భారతీయులు) వాంకోవర్ వంటి ప్రధాన కేంద్రాలు పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు బాలీవుడ్ చలనచిత్రోత్సవాలను సైతం ఇక్కడ నిర్వహిస్తు న్నారు.3వేల వ్యాపారాలు మనవే...సౌదీ అరేబియాసౌదీ అరేబియాలో దాదాపు 2.46 మిలియన్ల మంది భారతీయులు పనిచేస్తున్నారు, ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 2023–24లో ఈ సంఖ్య 200,000 పెరిగింది, ఇది నిర్మాణం, మౌలిక సదుపాయాలు సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో డిమాండ్లో పదునైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, భారతీయ వ్యాపారాల ఉనికి విస్తరించింది, ఇప్పుడు 3,000 కంటే ఎక్కువ నమోదిత భారతీయ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి, ఇది రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.స్టడీస్కి స్టార్ డమ్...యునైటెడ్ కింగ్ డమ్భారతీయ సంతతికి చెందిన 1.86 మిలియన్ల మందికి నిలయంగా ఉన్న యుకె 40 శాతం కంటే ఎక్కువ మంది లండన్ బారోగ్స్, లీసెస్టర్ బర్మింగ్హామ్లలో నివసిస్తున్నారు, చిన్నపాటి వ్యాపారాలు ఫైనాన్స్, వైద్య రంగాలలో ఉన్న నిపుణులు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆజ్యం పోస్తున్నారు. భారతీయ విద్యార్థులు (సంవత్సరానికి 30,000 కంటే ఎక్కువ మంది) టైర్ 4 వీసాలపై అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలకు హాజరవుతారు.మన వ్యాపార ఆధిపత్యం దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికాలో దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 19వ శతాబ్దపు నాటల్ చెరకు తోటలకు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికుల వారసులు. ఆధునిక వలసదారులలో ఇంగ్లీష్ మీడియం విద్య కేప్ టౌన్లోని అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ కేంద్రాల ద్వారా ఆకర్షించబడిన వైద్యులు ఐటీ నిపుణులు ఉన్నారు. డర్బన్ లోని స్థానిక రిటైల్ బిజినెస్లో భారతీయ యాజమాన్యంలోని వ్యాపారాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, అయితే తమిళ గుజరాతీ భాషా విద్య కోసం వార్షిక బడ్జెట్లు 10 మిలియన్లకు మించింది.ఉమ్మడి చరిత్రతో...శ్రీలంకశ్రీలంక లో 1.61 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు ఇది టీ, పర్యాటక ఐటీ రంగాలలో ఆధునిక కాంట్రాక్ట్ ఉద్యోగులను మిళితం చేస్తుంది. ఉమ్మడి తమిళ సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుంచి మరొక దేశానికి సజావుగా మారడానికి సహాయపడుతుంది. మరోవైపు, కొలంబోలో అభివృద్ధి చెందుతున్న ఫైనాన్స్ జోన్ భారతీయ ఫిన్టెక్ నిపుణులను ఆకర్షిస్తుంది.జనాభాలో 20శాతం.. కువైట్కువైట్లో దాదాపు 995,000 మంది భారతీయులు ఉన్నారు. అంటే దాని జనాభాలో 20 శాతానికి పైగా మనమే ఉన్నాం అన్నమాట. మనవాళ్లలో అత్యధికులు అక్కడ చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు గృహ రంగాలలో పనిచేస్తున్నారు.దీపావళికి ‘దియా’...ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలో 976,000 మంది భారతీయులు ఉన్నారు. అర్హతలు ఆంగ్ల నైపుణ్యానికి విలువనిచ్చే పాయింట్ల ఆధారిత నైపుణ్య వలస కార్యక్రమం కింద ఇక్కడ వీరు అభివృద్ధి చెందుతున్నారు. ఏటా 120,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ ఐటీలలో చేరుతున్నారు, ట్యూషన్ ఫీజుగా 5 బిలియన్లను అందిస్తున్నారు. మెల్బోర్న్ సిడ్నీ వంటి నగరాల్లో భారతీయ వాణిజ్య మండలులు, యోగా స్టూడియోలు కనిపిస్తాయి. ఇక దీవాళి స్ట్రీట్ ఫెయిర్స్ సైతం అక్కడ .చురుకుగా జరుగుతున్నాయి. -
మరో వారం రోజులే...నెట్ఫ్లిక్స్లో సూపర్ హిట్ సినిమాలు అవుట్..!
ఓటీటీలు అందుబాటులోకి వచ్చినంత వేగంగా ఏ సినిమాలు చూడాలి ఏ సినిమాలు చూడకూడదు అనే అవగాహన కూడా వచ్చి ఉంటే బాగుండేది. బాగుందని ఓ సినిమా గురించి తెలిసి చూసేలోగానే థియేటర్లలో నుంచి వెళ్లిపోవడం మనకు అనుభవమే. అదే పరిస్థితి ఓటీటీల్లోని కొన్ని సినిమాల విషయంలోనూ మనకు ఎదురవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ నెలాఖరులోగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనున్న కొన్ని మంచి సినిమాల వివరాలివి.. వీటిలో మంచి ప్రశంసలు పొందిన ఆఫ్బీట్ కామెడీల నుంచి రోమాంచితం చేసే థ్రిల్లర్ల వరకు ఉన్నాయి ఈ జూలై 31లోగా చూడాలనుకుంటే తప్పక చూసేయండి. ఆ సినిమాలివే...రెడ్ ఐ (2005)వెస్ క్రావెన్ దర్శకత్వం వహించిన రెడ్ ఐ థ్రిల్లర్లో హోటల్ మేనేజర్ అయిన రాచెల్ మెక్ఆడమ్స్ ని పూర్తిగా అపరిచితుడైన సిలియన్ మర్ఫీని అర్థరాత్రి పూట ఓ లేట్ నైట్ ఫ్లైట్ లో కలుస్తుంది. వారిద్దరి పరిచయం స్నేహపూర్వక సంభాషణగా ప్రారంభమై ఎన్ని అనూహ్య మలుపులు తీసుకుంటుంది? రెడ్ ఐలో చూడొచ్చు. అనుక్షణం ఉత్కoఠ తో నడిచే ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని బాగా ఆకట్టుకుంటుందిఅవేకెనింగ్స్ (1990)పెన్నీ మార్షల్ దర్శకత్వం వహించిన హృదయాన్ని తాకే ఈ డ్రామా జోనర్ చిత్రంలో రాబిన్ విలియమ్స్ అంకితభావంతో కూడిన వైద్యుడిగా కనిపిస్తాడు. కాటటోనిక్ రోగుల కోసం ఒక విప్లవాత్మక చికిత్సను ఆవిష్కరించిన తర్వాత జరిగింది ఏమిటి? పలు నిజమైన సంఘటనల నుండి అల్లుకున్న ఈ కధలో రాబర్ట్ డి నీరో పాత్రధారిగా లియోనార్డ్ లోవ్ కనిపిస్తాడు. జీవితంలోని సంక్షిప్త, విలువైన క్షణాలకు సంబంధించిన శక్తివంతమైన కథగా ఈ సినిమాని చెప్పొచ్చు.అమెరికన్ బ్యూటీ (1999)సామ్ మెండిస్ దర్శకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు అందుకున్న ఈ డార్క్ కామెడీలో కెవిన్ స్పేసీ లెస్టర్ బర్న్హామ్గా నటించాడు, శివారు ప్రాంతాల్లోని రొటీన్ లో చిక్కుకున్న తన జీవితానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. అన్నెట్ బెనింగ్, థోరా బిర్చ్ మేనా సువారీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కాంక్ష, గుర్తింపులతో పాటు అమెరికన్ కలల తాలూకు భ్రమలను మనకు చూపిస్తుంది.అమెరికాస్ స్వీట్హార్ట్స్ (2001)జో రోత్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో ఒకనాటి స్టార్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ తారల మధ్య చిక్కుకున్న ప్రచారకర్తగా నటించారు, ఆమెతో పాటు కేథరీన్ జీటా జోన్స్ జాన్ కుసాక్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బిల్లీ క్రిస్టల్ హాస్యాన్ని జోడిస్తూ, ఈ చిత్రం గ్లామర్ ప్రపంచంలో తెరవెనుక ప్రేమల గందరగోళాన్ని మనకు చూపిస్తుంది.పంచ్ డ్రంక్ లవ్ (2002)విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ నుంచి వచ్చిన ఈ ఆఫ్బీట్ రొమాంటిక్ డ్రామాలో ఆడమ్ సాండ్లర్ బారీ ఎగాన్ పాత్రలో నటించారు, కోపం అనే వ్యాధి తాలూకు సమస్యలతో ఉన్న ఒంటరి వ్యాపారి, అతను ఊహించని విధంగా ఎమిలీ వాట్సన్ తో ప్రేమలో పడతాడు. చమత్కారమైన, సున్నితమైన సన్నివేశాలతో ఆకట్టుకునే ఈ చిత్రం సాండ్లర్ అత్యంత ప్రసిద్ధ నటనల్లో ఒకటిగా నిలిచింది. -
నవీన్ చంద్ర...ఓటీటీ సూపర్స్టార్.. మన హైదరాబాదీయే...
అనువు గాని చోట అధికులమనరాదని నాటి తరంలో చెప్పారు. అనువైన చోట అధికులమయ్యే అవకాశాన్ని వదులుకోరాదని నేటి తరం అంటోంది. తెలుగు నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra ) నటుడిగా మారి దాదాపు 20ఏళ్లు అవుతోంది. ఎటువంటి సినీమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగానికి వచ్చి స్వయం కృషితో తన 2 దశాబ్ధాల ప్రయాణాన్ని కొనసాగించాడు. నిశ్శబ్ధంగా నిలకడగా సాగుతున్న నవీన్ చంద్ర అభినయ యానం కోవిడ్ తర్వాత అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆయన్ను ఓటీటీ సూపర్స్టార్గా గుర్తించే స్థాయికి చేర్చింది.సంభవామి యుగే యుగే అనే సినిమా ద్వారా 2006లో తెరంగేట్రం చేసిన నవీన్...ఆ తర్వాత అందాల రాక్షసితో డీసెంట్ సక్సెస్ అందుకున్నాడు. హ్యాండ్సమ్ లుక్తో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్న నటుడిగా ఆ సినిమా నవీన్ చంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత అతని కెరీర్ ఇక ఊపందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు. విభిన్న చిత్రాల్లో నటించినా..ఈ నటుడి స్థాయిని అమాంతం పెంచే చిత్రాలు మాత్రం రాలేదు. అదే సమయంలో కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫార్మ్స్కు ఆదరణ అమాంతం పెరిగింది. దాంతో అటు దృష్టి మరల్చిన నవీన్ 2021లో జియో హాట్ స్టార్ లో విడుదలైన పరంపర సిరీస్ లో అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఆ తర్వాత మంత్ ఆఫ్ మధు లాంటి నవీన్ చంద్ర సినిమాలు ధియేటర్ కన్నా మిన్నగా ఓటీటీలో చెప్పుకోదగ్గ స్థాయి విజయాలు సాధించాయి. దాంతో ఆయనకు వెబ్ సిరీస్లలో అవకాశాలు రావడం మొదలైంది.అలా వచ్చిన అవకాశాలను తెలివిగా అందిపుచ్చుకున్న నవీన్ ‘ఇన్స్పెక్టర్ రిషి‘ సిరీస్ విజయంతో తన స్థానాన్ని మరింతగా సుస్థిరపరచుకున్నాడు. వైవిధ్యాన్ని ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సిరీస్లో ఒంటికన్ను కధానాయకుడి పాత్ర పోషించి తన నటనకు నవీన్ మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత తక్కువ థియేటర్లలో విడుదలై ఎప్పుడొచ్చిందో పోయిందో తెలియని ‘ఎలెవెన్‘ ఓటీటీ మీద సూపర్ హిట్ అయింది. అత్యధిక వీక్షకులను అందుకుని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇలా వైవిధ్య భరిత పాత్రలతో నవీన్ చంద్ర ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద సక్సెస్ కు అడ్రెస్ గా మారారు. బలమైన స్క్రిప్ట్లను ఎంచుకుని, ప్రతిభావంతులైన చిత్రనిర్మాతలతో పనిచేస్తూ ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఓటీటీలో నవీన్ చంద్ర విజయ విహారం ఆయనకు తమిళ, తెలుగు సినిమా రంగాల్లోనూ అవకాశాలను పెంచుతోంది. ఓటీటీ ప్రేక్షకుల్లో నవీన్ కు ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని వెండితెర రూపకర్తలు ఆయన కోసం పాత్రలను సృష్టించే పనిలో పడ్డారు. మొత్తంగా చూస్తే అచ్చంగా డిజిటల్ రంగంలో నవీన్ స్థాయిలో రాణిస్తున్న మరో తెలుగు నటుడు లేరనేది నిస్సందేహం.కొసమెరుపు ఏమిటంటే... ప్రస్తుతం తమిళ, తెలుగు రెండు భాషల ప్రేక్షకుల్ని సమానంగా మెప్పిస్తున్న నవీన్ చంద్ర తల్లిదండ్రుల్లో తండ్రి తమిళనాడుకు, తల్లి తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. జన్మతః హైదరాబాద్ వాసి అయిన నవీన్ చంద్ర తొలి దక్షిణాది ఓటీటీ సూపర్స్టార్ గా మారడం తెలుగువారికి గర్వకారణమేనని చెప్పాలి. -
వారెన్ బఫెట్ ప్రకారం.. ఆ 5 తప్పులివే...
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...కొత్త కారు...పెద్ద వృధా..చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.క్రెడిట్ కార్డ్ ఓ వల...బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.ఇల్లు...అవసరమా? విజయమా?అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దుమనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్ని ఎప్పటికీ మరచిపోవద్దు. -
బాలీవుడ్ని వణికించిన మాఫియా డాన్ లవర్..ఎవరా హీరోయిన్?
బాలీవుడ్లో 80–90లలో హిందీ సినిమా ప్రపంచం, అండర్ వరల్డ్ గ్యాంగ్ల మధ్య సంబంధాలపై ఎన్నో రకాల వార్తలు, కధనాలు, విశ్లేషణలు, చర్చలు సాగాయి. మరీ ముఖ్యంగా ఆ సమయంలో సినీ కథానాయికలు, మాఫియా డాన్లతో సంబంధాలు పెట్టుకున్నట్టు పలు రహస్యాలు సైతం బయటికి వచ్చాయి. అందులో చాలా మందికి తెలిసిన ఒక బహిరంగ రహస్యం దావూద్–మందాకినిల ఎఫైర్ అయితే, అతి కొద్ది మందికే తెలిసిన మరో కథలో అనితా అయూబ్ అనే హీరోయిన్ ప్రధాన పాత్రధారిణి.అనితా ఎవరు?పాకిస్థాన్లో పుట్టిన కరాచీ కు చెందిన అనితా అయూబ్ ఆంగ్ల భాషలో మాస్టర్స్ చేసింది. ఆ తర్వాత మన దేశంలో అడుగుపెట్టి రోషన్ తనేజా యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంది. చిన్న చిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ మొదట మోడల్గా, ప్రకటనల్లో నటించి, 1993లో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆమె దేవ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ప్యార్ కా తరానా చిత్రంలో హీరోయిన్గా పరిచయమయ్యారు. ఆ తరువాత 1994లో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రంలో కూడా నటించింది. బహుశా అందరు హీరోయిన్లలాగే అయితే ఆమె మరిన్ని చిత్రాల్లో నటించి ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదేమో.. కానీ ఆమె ఒకటి తలిస్తే..అప్పటి బాలీవుడ్ని శాసించిన నేర సామ్రాజ్య చక్రవర్తి మరొకటి తలచాడు.మాఫియా పడగ నీడలో...అందం, అభినయం ఉన్న అనితాపై నాటి మాఫియా డాన్ దావూద్ ఇబ్రాహీమ్(Dawood Ibrahim) మనసు పడ్డాడు. దాంతో ఆమె జీవితం మారిపోయింది. తరచుగా దావూద్తో ఆయన సహచరులతో కలిసి అనితా కనిపిస్తుండడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఆమె ఎప్పుడూ ఈ వివాదాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు, కానీ సినీ పరిశ్రమ మాత్రం పూర్తిగా నమ్మింది. దానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. అందులో ఒక ప్రధాన కారణం అప్పట్లో జరిగిన ఓ బాలీవుడ్ నిర్మాత హత్య. 1995లో నిర్మాత జావేద్ సిద్ధీక్ ఓ చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. అయితే ఆ సినిమాలో అనితాను హీరోయిన్గా తీసుకోవాలని మాఫియా నుంచి ఒత్తిడి వచ్చింది. అయితే ఈ ఒత్తిడికి ఆయన తలొగ్గలేదు. దీనితో దావూద్ గ్యాంగ్ తన సత్తా చూపిందనీ, నిర్మాత సిద్ధీక్ను హత్య చేయించడం ద్వారా దావూద్ అనితా పై తనకున్న గాఢమైన ఇష్టాన్ని చూపించాడంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటన మీడియాలో దావూద్ అనితల ప్రేమాయణంపై రకరకాల చర్చలకు కారణమైంది.అయితే దావూద్తో అనుబంధంతో పాటు అనితా కష్టాలు కూడా పెరుగుతూ వచ్చాయని అంటారు. ఆ తర్వాత ఒక పాకిస్థానీ పత్రిక కధనం ప్రకారం అనితా అయూబ్ భారతదేశంలో పాక్ గూఢచారిణిగా అనుమానించడం మొదలైంది. అంతే ఇక తర్వాత బాలీవుడ్ ఆమెను పూర్తిగా పక్కన బెట్టేసింది.దాంతో అనితా నటనకు గుడ్బై చెప్పి స్వదేశానికి మూటా ముళ్లె సర్ధుకుని పీఛేముఢ్ అనక తప్పలేదు. పాకిస్తాన్లో ఉంటూనే తర్వాత కొన్నాళ్లకు భారత వ్యాపారి సంయమిల్ పటేల్ను వివాహం చేసుకొన్న అనితా..ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ బంధం ముక్కలవడంతో, విడాకులు తీసుకుంది. అనంతరం పునః వివాహం పాకిస్థాన్ వ్యాపారి సుబాక్ మజీద్ను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. -
ప్రపంచంలోనే ఎత్తయిన చోట ఆ సినిమా ప్రదర్శన.. థియేటర్ స్పెషల్ ఏంటంటే?
సందేశాత్మక సినిమాను తీయడం ఒకెత్తయితే... ఆ సినిమాను సకల జనులకు చేరువగా తీసుకువెళ్లడం మరొకెత్తు. ఇలాంటి ఎత్తులను అధిరోహించినప్పుడే ఆ చిత్రం సంపూర్ణ శిఖరాగ్రం చేరుకున్టట్టు అర్ధం. ప్రస్తుతం అతి తక్కువ సినిమాలు మాత్రమే అలా శిఖరారోహణ చేయగలుగుతున్నాయి. ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ మరోవైపు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న.... బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్వీయ ప్రొడక్షన్స్ సమర్పణలో రూపొందిన సితారె జమీన్ పర్ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చోట ఉన్న థియేటర్ లో ప్రదర్శించారు. గత 13న భారతదేశంలో ఉన్న అత్యధిక ఎతైన థియేటర్ లో ఈ చిత్ర ప్రదర్శన జరిగింది. ఆ థియేటర్ పేరు పిక్చర్టైమ్. ఈ 11,562 అడుగుల ఎత్తున ఉన్న లడఖ్లోని మొబైల్ డిజిటల్ థియేటర్లో అమీర్ ఖాన్ నటించిన కామెడీ–డ్రామా చిత్రం’ ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఆటిజం చిన్నారులు, వారి తల్లిదండ్రులు ప్రేక్షకులుగా హాజరవగా, స్థానిక డా.దాయ్చిన్స్ హోప్ఫుల్ స్టెప్స్ క్లినిక్ కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. థియేటర్ బయట, అందమైన లడఖ్ నేపధ్యంలో చిన్నారులు సినిమాలోని హాస్యానికి, ఉత్తేజానికి అనర్గళంగా నవ్వుతూ ఆనందించగా, వారి తల్లిదండ్రులు పిల్లల ముఖాల్లో కనిపించిన సంతోషం చూసి మురిసిపోతూ కనిపించారు. అమీర్ ఇటీవల ‘‘భారతీయ సినిమాలు అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి’’ అని వేవ్స్సమ్మిట్లో అభిప్రాయపడ్డారు. అచ్చంగా దీన్నే పిక్చర్ టైమ్ సంస్థ అనుసరించింది. ఈ సందర్భంగా పిక్చర్ టైమ్ నిర్వాహకులు సుశీల్ చౌదరి మాట్లాడుతూ ఈ ప్రదర్శన పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఒక అమూల్యమైన వీక్షణ అనుభవం అన్నారు. ధియేటర్ విశేషాలివే... భారతదేశంలో, బహుశా ప్రపంచంలోనే అత్యంత ఎతైన సినిమా థియేటర్, లడఖ్లోని లేహ్లో ఉన్న పిక్చర్టైమ్ డిజిప్లెక్స్ ఇన్ఫ్లేటేబుల్ థియేటర్, దీనిని లేహ్లోని ఎన్ఎస్డీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. సరసమైన ధరలోనే టిక్కెట్లు, మంచి సీటింగ్ ఏర్పాట్లతో కూడిన ఈ మొబైల్, ఇన్ప్లేటేబుల్ థియేటర్ను మారుమూల ప్రాంతాలకు కూడా సినిమా వీక్షణ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగేళ్ల క్రితం విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిల్మ్తో థియేటర్ ప్రారంభం కాగా అదే రోజున బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్బాటమ్‘ చిత్ర ప్రదర్శన కూడా జరిగింది.చలికాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి తరచుగా దూరమయ్యే ప్రాంతం లడఖ్కు ఈ మొబైల్ థియేటర్ స్థాపన చాలా ముఖ్యమైనది. వినోదానికి మూలాన్ని స్థానిక చిత్రనిర్మాతలు కళాకారులకు వేదికను ఈ థియేటర్ అందిస్తుంది ఈ మొట్టమొదటి మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ –28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో సైతం పనిచేసేలా ప్రత్యేక సాంకేతికతతో ఏర్పాటైంది. -
కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?
ఓ పెద్ద హీరో సినిమా ఫ్లాప్ని మరో పెద్ద హీరో మందుపార్టీతో సెలబ్రేట్ చేసుకున్నాడు అంటూ ఆ మధ్య టాలీవుడ్ కేంద్రంగా ఒక వార్త గుప్పుమంది. అంతేకాదు తెలుగు హీరోల్లో సఖ్యత మేడిపండు చందమేననేది అనేక సార్లు బహిరంగంగానే రుజువైంది. తెలుగు సినిమా వజ్రోత్సవాలు మాత్రమే కాదు మరికొన్ని బహిరంగ కార్యక్రమాలు ప్రకటనలు కూడా టాలీవుడ్ హీరోలు ముఖ్యంగా సీనియర్స్ మధ్య స్నేహం ప్రొఫెషనల్ జెలసీలను దాటలేకపోయిందనేది వెల్లడించాయి. ఈ నేపధ్యంలో తాజాగా దక్షిణాదిన అగ్రహీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్ల స్నేహ బంధంలోని గాఢత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేస్తున్న నేపధ్యంలో మిత్రుడు రజనీని ఇటీవలే కమల్ కలవడం శుభాకాంక్షలు స్వీకరించడం మనకు తెలిసిందే. ఇదే సమయంలో కమల్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కాపాడే బాధ్యతను రజనీ భుజాలకెత్తుకున్నాడనే మరో వార్త కూడా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని చాటుతోంది.భారతీయుడు 3ని రక్షించడమే రజనీ తలకెత్తుకున్న ఆ బాధ్యత. తొలి భారతీయుడు’ ఓ బ్లాక్ బస్టర్ కాగా, ‘భారతీయుడు 2’ పెద్ద డిజాస్టర్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ‘భారతీయుడు 2’(Bharateeyudu 3) రిలీజ్ టైంలోనే ‘భారతీయుడు 3’ షూటింగ్ కూడా 80 శాతం కంప్లీట్ అయిపోయింది అని నిర్మాతలు ప్రకటించి ఉన్నారు. అంతేకాదు అసలు కథ మొత్తం ‘3వ భాగం’ లోనే ఉంటుందని దర్శకుడు శంకర్ చెప్పడం కూబి జరిగింది. సాధారణంగా పార్ట్ 2 ప్లాప్ అయితే పార్ట్ 3 ని దక్షిణాదిలో దర్శక నిర్మాతలు అటకెక్కించేస్తారు. హాలీవుడ్, బాలీవుడ్లో మాత్రం హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సీక్వెల్స్ కొనసాగిస్తారు. కానీ సౌత్ లో ఇప్పటి వరకు .ఒక్క భారతీయుడు మాత్రమే ఆ ఘనతను స్వంతం చేసుకోనుంది. కాకపోతే ఇప్పుడు భారతీయుడు 3 చుట్టూ రకరకాల సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. ముఖ్యంగా ‘2వ భాగం’ ప్లాప్ అయ్యింది కాబట్టి.. ‘3వ భాగం’ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాక గేమ్ ఛేంజర్ తర్వాత దర్శకుడు శంకర్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలో భారతీయుడు 3’ కంప్లీట్ అవ్వాలంటే ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా’ ముందుకు వచ్చి ధైర్యం చేసి మరి కొంత బడ్జెట్ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అంతేకాక మరోపక్క ‘లైకా’ సంస్థ నిర్వాహకులకూ హీరో కమల్ హాసన్ కి కూడా మనస్పర్థలు ఉన్నాయని సమాచారం. కాబట్టి.. ఇది అంత సులభంగా తెగే వ్యవహారం కాదు. అందుకే ఈ విషయంలో రజినీకాంత్ ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు కమల్, మరోవైపు లైకా వారితో రజినీకాంత్ కి మధ్య మంచి స్నేహం ఉంది. కాబట్టి.. రజినీకాంత్ ఇద్దరితో మాట్లాడి.. ‘భారతీయుడు 3 మిగిలిన భాగం పూర్తయేలా చొరవ తీసుకోనున్నట్టు సమాచారం. అదే జరిగితే దర్శకుడు శంకర్ కన్నా సంతోషించేవారు ఎవరూ ఉండకపోవచ్చు. ఏదేమైనా... తన సమకాలీకుడైన పోటీ హీరో చిత్రం సమస్యల్లో ఇరుక్కుంటే సంతోషించడం కాకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగడం రజనీకాంత్ గొప్పతనానికి మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఈ తరహా అసూయా ద్వేషాలకు అతీతమైన మనస్తత్వాన్ని అలవరచుకోవడమే తెరబయట కూడా చూపే నిజమైన హీరోయిజం అనేది నిర్వివాదం. -
బాలీవుడ్ న్యూసెన్స్కి నో ఎంట్రీ.. వేలకోట్లున్నా సరే అక్కడికి అనుమతి ఉండదు
డబ్బుoటే కొండ మీద కోతి దిగొస్తుంది అంటారు అదేమో గానీ ఒక్కోసారి మనకు కావాల్సిన చోట, కోరుకున్నవారి మధ్య నివాసం కూడా పొందలేమని నిరూపితమవుతోంది. భారతదేశపు వాణిజ్య రాజధాని నగరమైన ముంబైలో సంపద ఉండడం అనేది వారి స్థాయిని నిర్దేశించే ఒక ప్రధాన అంశం, అయితే ఆ నగరంలోని కొన్ని ప్రాంతాలలో విస్తుపోయేలా దీనికి అతీతమైన ధోరణి కనిపిస్తుంది. అటువంటి ఒక ప్రాంతం, పెడ్డర్ రోడ్, ఈ రోడ్ సంపదకు మాత్రమే కాకుండా దానికే స్వంతమైన ఆలోచనల ద్వారా కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది, ఇక్కడ నివాసాలకు అపారమైన సంపద లేదా ప్రముఖ హోదా కూడా అనుమతి, అంగీకారం పొందుతామనే హామీ ఇవ్వదు. ఈ విచిత్రమైన ఈ వాస్తవికతను ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విశాల్ భార్గవ వెలుగులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఇళ్ళు కొనడానికి ప్రయత్నించినప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా అనధికారిక అడ్డంకులను ఎదుర్కొంటారని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు దివంగత బిలియనీర్, బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడిదారు రాకేష్ జున్ జున్ వాలా కూడా ఈ ప్రాంతంలోని ఒక ఎలైట్ క్లబ్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నారని ఆయన వెల్లడించారు.‘ముంబై, మంచ్ అండ్ మార్కెట్ విత్ చింతన్ వాసని‘ పేరిట ఇన్స్ట్రాగామ్ ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ, టాటా చైర్మన్ ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులకు నిలయంగా, ‘ధనవంతులు, అంతకు మించిన సూపర్ రిచ్ల‘ డొమైన్గా పెడ్డర్ రోడ్ను అభివర్ణించారు. కానీ, సెలబ్రిటీలను ఎదురేగి ఆహ్వానించే, స్వీకరించే బాంద్రా మాదిరిగా కాకుండా, పెడ్డర్ రోడ్ సొసైటీలు తరచుగా బాలీవుడ్ నటులను తమకు పెద్ద న్యూసెన్స్లా చూస్తాయి, అక్కడ ఆస్తిని కొనుగోలు చేసే వారికి అనధికారిక పరిమితులను విధిస్తాయి అంటూ ఆశ్చర్యపరిచే నిజాలను ఆయన వెల్లడించారు.ఈ ప్రత్యేకత నివాస సొసైటీలతో పాటు విందు వినోద కేంద్రాలకు సైతం విస్తరించింది. దీనికి ఈ రోడ్లోని ఒక ప్రముఖ సంస్థ అయిన విల్లింగ్డన్ క్లబ్ను భార్గవ దీనికి ఉదహరించారు. ‘వారు బాలీవుడ్ నటులను ఇష్టపడరు, అంతేకాదు వారు అత్యున్నత విద్యావంతులు తప్ప ఇతరత్రా తమను తాము ఉన్నతంగా భావించే ఎవరినీ ఇష్టపడరు‘ అని ఆయన వివరించారు. భారత స్టాక్ మార్కెట్లో పేరొందిన ‘బిగ్ బుల్‘ అయిన జున్ జున్ వాలా ఆ ప్రాంతంలోని విల్లింగ్డన్ క్లబ్లో సభ్యత్వం పొందడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన అభ్యర్ధనను క్లబ్ ఏకంగా మూడుసార్లు తిరస్కరించడం జరిగిందని కూడా భార్గవ వెల్లడించారు.‘మీ దగ్గర డబ్బు ఉందడం ప్రాధాన్యత కాదు, పెద్దర్ రోడ్లో నివసించాలంటే డబ్బు కు మించిన విలువ ఏదైనా ఉండాలి‘ అని భార్గవ నొక్కిచెప్పారు. ‘ధనవంతులు సూపర్ రిచ్‘ గా ఉండటం చాలా సార్లు అర్హతగా మారుతుందని అయితే, ‘ధనవంతులు. ప్రముఖులు‘ గా ఉండటం అక్కడ అనర్హత అని ఆయన వివరించారు. బదులుగా, ‘ధనవంతులు అత్యంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తులు ఈ అల్ట్రా–ఎక్స్క్లూజివ్ ఆవరణలో ప్రవేశం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారాయన.గత 2022లో ఆగస్టు 14 వ తేదీన తన 62 సంవత్సరాల వయసులో మరణించిన జున్ జున్ వాలా తన సామ్రాజ్యాన్ని రూ.5,000 పెట్టుబడి నుంచి 5.5 బిలియన్ల సంపదకు నిర్మించుకున్నారు. చురుకైన పెట్టుబడి వ్యూహాలతో ‘వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా‘ గా ప్రసిద్ధి చెందారు. అంతటి ప్రముఖ వ్యక్తి సైతం ఒక క్లబ్ సభ్యత్వం పొందలేకపోయారనే వాస్తవం వెల్లడి కావడం ముంబైలోని పెడ్డర్ రోడ్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తోంది. View this post on Instagram A post shared by Chintan Vasani️ (@chintanvasani) -
అత్యుత్తమ ‘ఫన్’ దేశం అదే..! టాప్ 40లో ఇండియా స్థానం?
ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ కావాల్సింది వినోదం. విపరీతమైన పని ఒత్తిడికి దారి తీస్తున్న ప్రస్తుత ఉరుకులు పరుగుల లోకంలో విశ్రాంతి దానితో పాటే వినోదం కూడా ఒక నిత్యావసరంగా మారిపోయింది. అందుకు అనుగుణంగానే అనేక రకాల వినోద మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. తమ ప్రజల్ని వినోదభరితంగా ఉంచడానికి అనేక దేశాల్లో ప్రభుత్వాలు సైతం తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే అత్యంత వినోదభరిత దేశంగా ప్రజలు ఏ దేశాన్ని గుర్తిస్తున్నారు? అనే ఆలోచనతో ది యుఎస్ న్యూస్ బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ ఆధ్వర్యంలో ది వరల్డ్స్ మోస్ట్ ఫన్ కంట్రీస్ పేరిట తాజాగా ఒక అధ్యయనం నిర్వహించారు. వినోదాన్ని పంచే వేడుకలు, ఈవెంట్లు, సాహసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు..వగైరాలకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. దాని ప్రకారం వినోద భరిత జీవనాన్ని అందించే 40 దేశాల జాబితాను రూపొందించారు. ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం.. స్పెయిన్ అత్యుత్తమ వినోద భరిత దేశంగా నిలిచింది. సాహసాలు, సంస్కృతీ సంప్రదాయల పరంగా 4వ స్థానంలో నిలిచిన ఈ దేశం మొత్తంగా చూస్తే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా స్పెయిన్లో నిర్వహించే టమాటినా ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది. ప్రపంచలోనే అతిపెద్ద టమాటా ఫెస్టివల్గా వందల కొద్దీ టన్నులను దీని కోసం వినియోగిస్తారు. ఇవే కాకుండా మరిన్ని వినోదాలు, అడ్వంచర్స్ కూడా స్పెయిన్ను ఈ అంశంలో అందలాలు ఎక్కించాయి.ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బ్రెజిల్, థాయ్ల్యాండ్, ఇటలీ, మెక్సికో, గ్రీస్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, అర్జెంటీనా, ఐర్లాండ్, సింగపూర్, టర్కీ, అమెరికా, కెనడా, కోస్టారికా, ఐస్ల్యాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, కొమెనిక్ రిపబ్లిక్, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, బెల్జియం, మొరాకో, ఈజిప్ట్, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, క్రొయేషియా, ఇండోనేషియా, యుఎఇ, చిలీ, ఫిన్లాండ్, సౌత్ ఆఫ్రికా, కొలంబియా, పెరు, స్వీడన్, డెన్మార్క్లు ఉన్నాయి.ఈ జాబితాలో ఎక్కడా ఇండియాకు చోటు దక్కకపోవడం విశేషం. దీనికి రకరకాల కారణాలు ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన దేశం ఇంకా కొన్ని రకాల కట్టుబాట్లను సంకెళ్లను తెంచుకోకపోవడం అలాగే మన దేశంలో వినోదం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు లేకుండా మన పండుగలు, సంప్రదాయ జాతరలు వంటి వాటిలో అది మమేకమైపోవడం వంటి పలు కారణాలు ఉండవచ్చునని అంటున్నారు. అంతేగాక ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న ప్రజలు, ప్రాంతాలను బట్టి కూడా ఇది ఆధారపడి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు.(చదవండి: చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?) -
అబ్బాయిల కన్నా పురుషులంటేనే అమ్మాయిలకి ఇష్టం... : హీరో మాధవన్
ఇటీవలి కాలంలో భారతీయ సినిమా హీరోల పాత్రలు తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయి. అదేదో వివాదాస్పదన పాత్రలు పోషించినందుకో, లేక నటనా పరమైన అంశాల గురించో కాదు... తమ పక్కన నటించే కధానాయికలను ఎంచుకుంటున్న వైనం పైనే చర్చ జరుగుతోంది. దాదాపుగా తమ కూతురు వయసున్న ఒక్కోసారి అంతకు మించి మనవరాలి వయసున్న అమ్మాయిలతో కూడా మన హీరోలు తెరమీద రోమాన్స్ చేస్తుండడం పలువురు ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తోంది. పైగా ఇది సోషల్ మీడియా యుగం కావడంతో ఆ అసహనం శరవేగంగా విస్తరిస్తూ హద్దులు దాటేస్తోంది. దాంతో మన హీరోలు తరచుగా సంజాయిషీలు చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఈ నేపధ్యంలో దక్షిణాది హీరో మాధవన్(R Madhavan) కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఆయన తాజా సినిమా ఆప్ జైసా కోయి లో మాధవన్, ఫాతిమాల మధ్య వయో బేధం.. దాదాపు 23ఏళ్లు. దాంతో ఇటీవలి కాలంలో తరచుగా చర్చనీయాంశంగా మారుతున్న వయో బేధం అంశం మరోసారి సోషల్ తెరమీదకు వచ్చింది.ఈ నేపధ్యంలో మాధవన్ ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ, ‘మీరు నిజంగా మీ మిగిలిన జీవితం కలిసి గడపాలనుకునేందుకు సరైన సహచరుడిని కనుగొనడం అనేది అరుదైన విషయం. కాబట్టి ఇద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని పరిమితం చేయకూడదు‘ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.‘నేను చాలా మంది అమ్మాయిలను కలిశాను, వార తాము కూడా తమ వయస్సు గల అబ్బాయిలతో కలిసి ఉండలేం అని చెబుతారు. అదే వయసు పెరిగిన పురుషులలో అయితే కొంత పరిణతి ఉంటుంది, బహుశా వారు ప్రపంచాన్ని ఎక్కువగా చూసినందున కావచ్చు.. అది అమ్మాయిలను ఆకట్టుకునే అంశం అవుతుంది. కొన్నిసార్లు అది శాశ్వత సంబంధానికి పునాదిగా కూడా మారవచ్చు.‘ అంటూ విశ్లేషించారాయన.దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో, సఖి వంటి చిత్రాల ద్వారా యువతకి దగ్గరైన మాధవన్.. రెహ్నా హై తెరే దిల్ మే, తను వెడ్స్ మను, అలై పాయుతే వంటి కొన్ని చిరస్మరణీయ రొమాంటిక్ చిత్రాలలో భాగమయ్యాడు. అయితే ఈ మధ్య కాలంలో అనేక రకాల చిత్రాలు ఆఖరికి సైతాన్ లాంటి క్రూరమైన పాత్రల్లోనూ ఆయన చేశాడు. అయితే తాజాగా విడుదలైన ఆప్ జైసా కోయి, అతను రొమాంటిక్ పాత్రలకి తిరిగి వచ్చేశాడా అన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఈ చిత్రం మాధవన్ పాత్ర ఫాతిమా సనా షేక్ పోషించిన హీరోయిన్ పాత్ర మధ్య 12 సంవత్సరాల వయస్సు అంతరంతో ప్రేమకథను ఆవిష్కరించింది.ప్రస్తుతం 55 ఏళ్ళ వయసులో ఉన్న మాధవన్ ఇది తన చివరి రొమాంటిక్ పాత్రలలో ఒకటి కావచ్చని సూచన ప్రాయంగా అంగీకరించాడు. ‘తెరపై ప్రేమకథలు ఇంతకు మించిన అశ్లీలంగా కనిపించడం జరగడానికి ముందు ఇది బహుశా నాకు చివరి అవకాశం‘ అని ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా ఆప్ జైసా కోయి లోని తన సహనటి ఫాతిమాను ఆయన ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ఆమె చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోల పక్కన కూడా సులభంగా సరిపోతుంది‘ అంటూ కొనియాడాడు. ఏది ఏమైనా ఇక రొమాంటిక్ పాత్రలకు దూరం అంటున్న మాధవన్ నిర్ణయం అనేక మంది అభినందిస్తున్నారు.. మరి వయసుకు తగ్గ పాత్రలు చేస్తామని మిగిలిన హీరోలు కూడా ఇకనైనా స్పష్టం చేయగలరా? -
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది.. అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..) -
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్ స్పోర్ట్స్ స్టార్స్కి ఏమైంది..?
సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్స్ట్రాగామ్ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్ స్టార్స్కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్ స్టార్ సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్ స్పోర్ట్స్ స్టార్స్ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్ అజారుద్దీన్ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. -
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
తొలి అర్ధ సంవత్సరంలో మలయాళ సినిమా రంగం ఊహించని మలుపులు తిరిగింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ సినిమాల మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీనూ భారీగా విస్తరించినా, ఈ ఏడాది మొదటి ఆరు నెలలు కొన్ని సినిమాలు జయాపజయాల అంచనాల్ని తలకిందులుగా చేసి, సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాయి.టాప్ స్టార్ల నుంచి మిశ్రమ ఫలితాలుమళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈసారి డబుల్ హిట్తో బాక్సాఫీస్లో సందడి సృష్టించాడు. విలక్షణ నటుడు, హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంపురాన్’ (ఎల్2) రాజకీయ థ్రిల్లర్గా రూ.265 కోట్లు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆయన నటించిన ‘తుదరుం’ కూడా రూ.230 కోట్ల కలెక్షన్స్తో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరోవైపు మళయాళ మెగాస్టార్గా పేర్కొనే మమ్ముట్టి మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఆయన ఈ అర్ధభాగంలో తక్కువ ప్రభావం చూపించాడు. ఆయన నటించిన ‘డొమినిక్’, ‘లేడీస్ పర్స్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్నన పొందలేకపోయాయి.చిన్న సినిమాలకు పెద్ద ఆదరణవినూత్న కధాంశాలు, వైవిధ్య భరిత చిత్రాలకు పెద్ద పీట వేసే తమ మనస్తత్వాన్ని మరోసారి మళయాళీలు చాటుకున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో వచ్చిన కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అసిఫ్ అలీ – అనస్వర రాజన్ జంటగా నటించిన ‘రేఖాచిత్రం’ విమర్శకుల ప్రశంసలు పొందింది. అలాగే, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, టోవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ వంటి థ్రిల్లర్ చిత్రాలు కూడా తమ సత్తా చాటాయి.గుర్తింపుకు నోచుకోలేకపోయిన ఐడెంటిటీ...భారీ అంచనాలతో వచ్చిన ఐడెంటిటీ మాత్రం సరైన గుర్తింపునకు నోచుకోలేక చతికిలపడింది. టోవినో థామస్, త్రిష లాంటి అగ్రతారలు ఉన్నా కథలో లోపాల వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదే వారం విడుదలైన ‘కమ్యూనిస్టుపచ్చ అదవా అప్పా’, ‘ఐడి: ది ఫేక్’ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.ఈ అర్ధ సంవత్సరం మళయాళ పరిశ్రమలో స్పష్టంగా కనిపించిన విషయం అదీ ఇదీ అని తేడా లేకుండా భిన్న రకాల కధలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని, కధలో కొత్తదనం, ప్రేక్షకుల అభిరుచులకు దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్. థ్రిల్లర్, రాజకీయ నాటకాలు ఆదరణ పొందగా, కుటుంబ భావోద్వేగాలు చిత్ర జయాపజయాల్లో తమ పాత్రను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయని కూడా వెల్లడైంది.మోహన్లాల్ సినిమాల ఘనవిజయాలు మళయాళ సినీ పరిశ్రమకు ఉన్న బాక్సాఫీస్ సత్తాను చాటగా, చిన్న సినిమాల విజయం కొత్త ఆశల్ని అందించింది. ఇక రెండో అర్ధ సంవత్సరంలో పరిశ్రమ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.. -
కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు
ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి, పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...కృష్ణ దేవాలయం..ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్ బంగారు ఇసుక అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్ లేదా పారాసెయిలింగ్ జెట్ స్కీయింగ్ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్ ప్లేస్. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్ రాతి నిర్మాణాలు మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్హౌజ్లో నుంచి చూడాలంటే ఇక్కడి కౌప్ బీచ్ కి వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్హౌజ్ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందే. దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్ నిర్మించిన కాయిన్ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి. -
పొద్దున్నేమో డైట్ ఫుడ్.., రాత్రికి డ్రగ్స్ : సినీతారలపై టాప్ డైరెక్టర్ వ్యాఖ్యలు
ఇటీవల సినీ తారల వ్యక్తిగత అలవాట్ల గురించి మీడియా కన్నా సినీ రంగంలోని వాళ్లే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంతేకాదు మీడియా నుంచి వచ్చే విమర్శల కన్నా ఇవి చాలా వాడిగా వేడిగా పదనుగా ఉంటున్నాయి. సహజంగానే సినీతారల గురించి అందరి కన్నా ఎక్కువగా తెలిసేది అదే రంగంలో ఉన్న దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు కాబట్టి..వీరి విమర్శల్లో నిజం ఉంటుందని అనేక మంది భావిస్తుండడంతో ఇవి సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు తారలపై విమర్శలు గుప్పించే సినీ ప్రముఖుల జాబితాలో మరో అగ్రదర్శక నిర్మాత కూడా జేరారు. ఆయన పేరు పహ్లాజ్ నిహలానీ.భారతీయ చలనచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ సాదా సీదా వ్యక్తి కాదు. ఆయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) మాజీ ఛైర్మన్ కూడా. ఆయన గత 2009 వరకు 29 సంవత్సరాల పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిహలానీ 1982లో హాత్కడితో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు నాటి టాప్ హీరో గోవింద (ఇల్జామ్, 1986) చంకీ పాండే (ఆగ్ హి ఆగ్, 1987) వంటి పలువురు నటులను పరిచయం చేశారు. షోలా ఔర్ షబ్నం ఆంఖేన్ తో సహా అనేక ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆయన 2012లో అవతార్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.ఆ ప్రముఖ నిర్మాత మాజీ సిబిఎఫ్సి చీఫ్ పహ్లాజ్ నిహలానీ ప్రస్తుతం బాలీవుడ్లో విపరీతంగా పెరుగుతున్న విషపూరిత సంస్కృతిని విమర్శించడం సంచలనంగా మారింది. ఇటీవల లెర్న్ ఫ్రమ్ ది లెజెండ్ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త తరం సెలబ్రిటీ జీవనశైలిని ఆకర్షణీయమైన ముఖభాగాల వెనుక దాగి ఉన్న నిరంతర మాదకద్రవ్య సేవనాన్ని తూర్పారబట్టారు.గతంలో ఒక నటుడు మాత్రమే కనిపిస్తే, నేడు నటులు పది మంది బృందాలతో కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్తవారు కూడా తమ సొంత మేకప్ ఆర్టిస్ట్, హెయిర్డ్రెస్సర్ల నుంచి తమ అద్దం పట్టుకోవడానికి కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలంటున్నారని, అలాగే వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ను కలిగి ఉండాలని పట్టుబడుతున్నారన్నాని వెల్లడించారు. చివరికి వీటన్నింటికీ ఖర్చులు నిర్మాత జేబుల నుంచే చెల్లిస్తారని ఆయన గుర్తు చేశారు. వ్యాయామం చేయడం, వంట చేయడం సమావేశాలు నిర్వహించడం వంటి వాటి కోసం ఏకంగా ఆరు వేర్వేరు వానిటీ వ్యాన్ల డిమాండ్ కూడా చేస్తున్నారని ఇది చాలా ఓవర్గా ఉందన్నారు. .చాలా మంది నటులు ద్వంద్వ జీవితాలను గడుపుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.. పగటిపూట శుభ్రమైన,ఆరోగ్యకర ఆహారం డిమాండ్ చేస్తూ, రాత్రిపూట మత్తుపదార్ధాల వినియోగంలో మునిగిపోతున్నారన్నారు. తారలు తరచుగా ప్రాథమిక సేవల కోసం పెంచిన బిల్లులను సమర్పిస్తారని, మేకప్ ఖర్చులే లక్షల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందా అని అడిగినప్పుడు స్పందిస్తూ, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందని కొన్ని సందర్భాల్లో, కొంతమంది నటుల ప్రవర్తనలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుందని స్పష్టం చేశారు.అంతేకాదు...తాను తీసిన తలాష్: ది హంట్ బిగిన్స్... చిత్రం సందర్భంగా జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ, హీరో అక్షయ్ కుమార్ తన పక్కన కరీనా కపూర్ను ప్రధాన పాత్రగా తీసుకోవాలని పట్టుబట్టారని కూడా ఆయన వెల్లడించారు. తన కెరీర్లో ఒక నటుడు ఇలాంటి డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఇది సాంప్రదాయ నిర్మాత–దర్శకుడు కాస్టింగ్ విధానాన్ని అధిగమించిందని నిహలానీ పేర్కొన్నారు. ఇప్పుడు అది సాధారణంగా మారిపోయిందన్నారు. నేడు, నటులు తరచుగా తారాగణం నుంచి దర్శకుడు సిబ్బంది వరకు ప్రధాన నిర్ణయాలను అన్నింటినీ నియంత్రిస్తున్నారని ఆయన వెల్లడించారు. హీరో, హీరోయిన్స్ మధ్య వయసు తేడా ల గురించి మాట్లాడుతూ వృద్ధ నటులు తాము యంగ్గా కనిపించడానికి యువ తారల్ని ఇష్టపడతారని ఆయన ఎద్దేవా చేశారు. -
వాకింగా? జాగింగా? ఎవరికి ఏది మంచిది?
సాధారణంగా నడక (వాకింగ్) జాగింగ్ చాలా ప్రముఖమైన సులభమైన అత్యధిక శాతం మంది అనుసరించే వ్యాయామాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఎవరి సాయం లేకుండా కూడా చేయగలిగిన ప్రయోజనకరమైన వ్యాయామాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొందరిలో సందేహాలు ఉన్నాయి. నడక మంచిదా? జాగింగ్ మంచిదా? అసలు ఏది ఎవరు చేయాలి? ఎంత సేపు చేయాలి... వంటి అనుమానాల నివృత్తి కోసం...వైద్యులు చెబుతున్న కొన్ని విషయాలు..నలతను దూరం చేసే నడక : శరీరంపై తక్కువ ఒత్తిడి, గాయాలకు అవకాశం చాలా తక్కువ. తగినంత, మితమైన వేగంతో చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేస్తే ఇది శరీరంలోని కొవ్వు కారక క్యాలరీలు తగ్గించడంలో, సహాయపడుతుంది. సాధారణ వేగంతో నడిస్తే 45 నిమిషాల నడక వల్ల సుమారు 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది అన్ని వయస్సుల వారికి, కొన్ని రకాల ఆరోగ్య పరిమితులతో ఉన్న వారికి కూడా అనుకూలం.జాగ్రత్తలతో...జాగింగ్పరుగుకీ, నడకకు మధ్యన ఉండేదే జాగింగ్. నిదానంగా చేసే జాగింగ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనీసం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ ద్వారా 100 నుంచి 150 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త వేగంగా వేయడం వల్ల శరీరం మరిన్ని ఎక్కువ క్యాలరీలు తక్కువ సమయంలో ఖర్చు చేస్తుంది. ఇది గుండె రక్తనాళ వ్యవస్థకు మేలు కలుగు జేసే వ్యాయామం, ఆక్సిజన్ వినియోగాన్ని మెటబాలిజం వేగాన్ని పెంచడంలో కూడా మనకు తోడ్పడుతుంది .ఏది ఉత్తమం?ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత లక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే వాకింగ్ సరిపోతుంది. అదే బరువు తగ్గాలి అంతేకాకుండా గుండెకు తగిన వ్యాయామంకావాలి అనుకుంటే బ్రిస్క్ వాక్, జాగింగ్ మేలు చేస్తాయి.వ్యక్తి శారీరక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాళ్ళు, గాయాలు, గుండె సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే జాగింగ్ కాకుండా నడక బెస్ట్ అని చెప్పాలి. అలాగే 60ఏళ్లు దాటిన మగవాళ్లు, 50 ఏళ్లు దాటిన మహిళలు తమ తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తొలుత నడకతో మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్రా ఏ సమస్యలూ రాకపోతే స్లో జాగింగ్కు మళ్లవచ్చు. అదే యుక్త వయసు వాళ్లు అయితే జాగింగ్ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, నిరంతరంగా కొనసాగించగల వ్యాయామం ఎంచుకోవడం ముఖ్యం. అది 45 నిమిషాలు నడక కావచ్చు, లేక 20 నిమిషాలు జాగింగ్ అయినా సరే. ఎంచుకున్న వ్యాయామాన్ని క్రమబద్ధంగా చేయడం అత్యంత ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ప్రకారం శరీర క్రియలు సజావుగా జరగాలంటే వారానికి కనీసం 150 నిమిషాల పాటు ‘మోడరేట్ యాక్టివిటీ’ లేదా 75 నిమిషాల ‘విగరస్ యాక్టివిటీ’ చేయడం అవసరం. చురుకుదనం, ఆరోగ్యం వంటివి చాలనుకుంటే నడక తక్కువ సమయంలో ఫిట్నెస్ పెంచాలనుకుంటే జాగింగ్ మంచిది. నోట్ : ఏది ఏమైనా ముందస్తుగా ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యాయామం చేయడం ఉత్తమం. -
దీపిక, ప్రియాంక కాదు.. దీవిని కొన్న అందాల నటి తెలుసా.. అక్కడ ఏం చేస్తోందో..!
ఇంపోర్టెడ్ కార్లు, ఇంద్ర భవనాలు,నుంచి కళాఖండాలను దాటి క్రికెట్ టీమ్స్ దాకా కాదేదీ అనర్హం. తారల దర్పానికి, స్టార్ డమ్ ప్రదర్శనకి అన్నట్టుగా సాగుతోంది. ఇప్పుడిప్పుడే కార్ల ట్రెండ్ పాతబడుతూ వాటి స్థానంలో ప్రైవేట్ జెట్స్ సైతం సూపర్ స్టార్లకు అలంకారంగా మారుతున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్కి చెందిన ఓ అందాల నటి ఏకంగా ఐలాండ్నే కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ వార్త వినగానే మన కళ్ల ముందు మెదిలే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా, అలియా భట్, ఐశ్వర్యా రాయ్ వంటివారు ముందుండడం సహజమే.అయితే వీరందరూ కాకుండా.. నిజం చెప్పాలంటే విజయాల్లో వీరి సరసన నిలబడే స్థాయి లేని నటి ఐలండ్ క్వీన్గా మారిందనేది తెలుసుకోదగ్గ విశేషమే. ఆమె పేరు గ్లామర్ స్టార్ జాక్వలిన్ ఫెర్నాండెజ్. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సక్సెస్ అయిన తారల్లో ఒకరు శ్రీలంకకు చెందిన జాక్వలిన్. దాదాపు పాతికేళ్ల క్రితం 2006లో మిస్ యూనివర్స్ పోటీల్లో శ్రీలంకకు సారధ్యం వహించిన ఈ బ్యూటీకి కిరీటం దక్కకపోయినా బాలీవుడ్ ఛాన్సులు దండిగానే దక్కాయి. అలా 2009 నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ అదే పనితో ఆగిపోకుండా రకరకాల వ్యాపారాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. ఇప్పటికే ముంబైలో, శ్రీలంకలో విలాసవంతమైన అపార్ట్మెంట్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు సైతం ఆమె స్వంతం. స్టార్ డమ్లో దిగువన ఉన్నా ఇన్ కమ్లో ముందున్న ఈ భామ ఆస్తులు దాదాపుగా రూ.100కోట్ల పైమాటే అని సమాచారం.ఈ నేపధ్యంలోనే ఆమె స్వదేశంలో, అంటే శ్రీలంక తీర ప్రాంతంలో ఒక ప్రైవేట్ దీవిని కూడా ఆమె కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇది బహిరంగంగా ఆమె ప్రకటించని విషయమే అయినా, తాజాగా వెలుగులోకి వచ్చింది. జాక్వలిన్ ఈ ప్రైవేట్ దీవిని కుటుంబం కోసం కొనుగోలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరిగాయో కానీ, అది పూర్తి స్థాయిలో పర్యాటకుల నుంచి దూరంగా, నిశ్శబ్దత నడుమ ఆమె తన కోసం విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమని అంటున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడం వల్ల బాలీవుడ్లో జాక్వలిన్ స్థానం, ఆమె సంపద, జీవనశైలి పై కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే బాలీవుడ్లో ఇది అరుదైన విషయమే మరి. నటుల్లో స్వంత దీవిని కలిగిన నటి అనే ఘనతను జాక్వలిన్ ఒక్కరే దక్కించుకుంది.ఎక్కడ? ఎప్పుడు?శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంగా 2012లో సుమారు 4 ఎకరాల ప్రైవేట్ దీవిని సుమారుగా రూ.3కోట్లకు జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ దీవి ఖరీదు చేసినప్పుడు, ‘విలాసవంతమైన విల్లా నిర్మాణం‘ ఉండొచ్చని అంచనా వేశారట, అయితే అక్కడ అలాంటి నిర్మాణం జరిగిందా లేదా అనేది స్పష్టంగా వెలుగు చూడలేదు. ఈ దీవి, మాజీ శ్రీలంక క్రికెట్ కెప్టెన్ కుమార్ సంగక్కరా కి చెందిన సొంత దీవి దగ్గరనే ఉందని కూడా తెలుస్తోంది.కొసమెరుపు ఏమిటంటే... ఓ నాలుగేళ్ల క్రితం ఈ జాక్వెలిన్ పై మనీ లాండరింగ్ కేసులు దాఖలయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కూడా విచారణకు హాజరైంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఘోస్ట్ సినిమాలో మన కింగ్ అక్కినేని నాగార్జున సరసన తెలుగులో నటించడానికి వచ్చిన ఛాన్స్ చేజారినట్టు సమాచారం. -
బాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్ట్.. అభినయంతో ఆకట్టుకున్న స్టార్స్ వీళ్లే!
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...అభిషేక్ బెనర్జీస్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.సన్యా మల్హోత్రామిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.ఆదర్శ్ గౌరవ్సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.వామికా గబ్బీబూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.రణదీప్ హుడామంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది. కాజోల్ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.విక్కీ కౌశల్చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.అమీర్ఖాన్...భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు. -
సాయిపల్లవి సినిమాకు రూ.1000 కోట్ల లాభం.. అదీ విడుదల కాకుండానే...
సినిమాల లాభాలు సాధారణంగా ఆ సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత గానీ లెక్కకు రావు. అరుదుగా కొన్ని సెన్సేషనల్ చిత్రాలు మాత్రం బిజినెస్ రైట్స్ అమ్మకాలు వంటి వాటి ద్వారా ముందే రికార్డ్స్ సృష్టిస్తాయి. అయితే వీటన్నింటికీ అతీతంగా హక్కుల అమ్మకాల ద్వారా కాకుండా ఎప్పుడూ ఎవరూ చవిచూడని రీతిలో ఓ సినిమా లాభాలను ఆర్జించి వార్తల్లో నిలిచింది. బహుశా భారతీయ సినీ చరిత్రలో ఈ తరహా లాభాలు అదీ ఈ స్థాయిలో అందుకున్న తొలిసినిమా ఇదే కావచ్చు. ఆ సినిమా పేరు రామాయణ(Ramayana). భారత దేశంలో హిందూ సంస్కృతీ సంప్రదాయాలను ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే పౌరాణిక గాధ... భారతీయ సినిమాను సైతం శాసించనున్నట్టు ఈ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్గా తెరకెక్కుతున్న ఈ సినిమా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.1000 కోట్ల వరకూ అంచనా వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే రూ.1000 కోట్ల లాభాలు ఎలా అర్జించిందీ అంటే...వెయ్యికోట్ల లాభం వెనుక...ఈ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ను నమిత్ మల్హోత్రా ఆధ్వర్యంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లో లిస్టింగ్ లో ఉన్న కంపెనీ ప్రైమ్ ఫోకస్. ఈ ప్రతిష్టాత్మక సినిమా ‘రామాయణ’ తొలి గ్లింప్స్ ఈ నెల3న విడుదలైంది. ఆ విడుదలతోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు, ప్రచారం పెరుగుతూ పోతుండడంతో ప్రైమ్ ఫోకస్ కంపెనీకి స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు రావడం మొదలైంది. ఈ కంపెనీ షేర్లు జూన్ 25న రూ113.47 వద్ద ఉండగా, జూలై 1 నాటికి రూ.149.69కి పెరిగాయి. అయితే, జూలై 3న ‘రామాయణం’ ఫస్ట్ లుక్ విడుదలైన రోజున ఈ షేర్ విలువ ఏకంగా రూ.176కి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 1న రూ.4638 కోట్ల నుంచి రూ5641 కోట్లకు పెరిగింది. అంటే, కేవలం రెండు రోజుల్లోనే సంస్థకు రూ.1000 కోట్ల వరకూ సంపద పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర ₹169గా ఉండగా, మొత్తం క్యాప్ దాదాపు 5200 కోట్ల వద్ద స్థిరపడింది.భారీ పారితోషికం...హీరోకి కూడా షేర్లు...ఇక ఈ సినిమా హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) కూడా నిర్మాణ సంస్థలో పెట్టుబడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీ బోర్డు మంజూరు చేసిన 462.7 మిలియన్ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యులో రణబీర్ కూడా షేర్లను పొందారని బిజినెస్ స్టాండర్డ్ వెల్లడించింది. రణబీర్ మొత్తం 12.5 లక్షల షేర్లను కలిగి ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను రణబీర్కు రూ.150కోట్ల వరకూ పారితోషికం చెల్లిస్తున్నట్టు సమాచారం. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027లో విడుదల కానుంది.సీతగా సాయిపల్లవి...ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రావణుడిగా, యష్(yash)లు నటిస్తుండగా సీత పాత్రలో దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండడం విశేషం. ఇక లక్ష్మణుడిగారవీ దూబే హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్, హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ కలిసి సంయుక్తంగా రూపొందించనున్నారు. హాన్స్ జిమ్మర్కు ఇది బాలీవుడ్ లో ఆరంగేట్రం కావడం విశేషం.రామాయణం’ ప్రాజెక్ట్తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం సాకారమవుతోందని సినీవర్గాలు భావిస్తున్నాయి. -
‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న చిరంజీవి.. ఆగస్ట్ 22 నుంచే బీ రెడీ..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), లేడీ సూపర్స్టార్ నయనతార జంటగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ సినిమా కోసం మినిమం గ్యారెంటీ కామెడీ-ఎమోషన్ మిక్స్కి ఫ్యాన్స్ ఇప్పటికే రెడీగా ఉన్నారు. ప్రస్తుతం “మెగా 157”(Mega 157) అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రo షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయింది. కానీ ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు.తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, అనిల్ రావిపూడి సినిమా ప్రచారానికి భారీ ప్లాన్ వేశారని, అంచెలంచెలుగా ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22నుంచి ఈ సినిమా ప్రచారాన్ని భారీగా ప్రారంభించాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారని తెలిసింది. అదే రోజు టైటిల్తో పాటు ఫస్ట్ గ్లింప్స్ను కూడా విడుదల చేయనున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుంది. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుంది. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానుల అంచనాలు మరీ పెరిగిపోయాయి వాళ్ళు ‘‘గ్యాంగ్ లీడర్’’, ‘‘ఘరానా మొగుడు’’, ‘‘రౌడీ అల్లుడు’’ స్టైల్ ఎంటర్టైన్మెంట్ ని వీరిద్దరి కాంబో నుంచీ ఆశిస్తూన్నారు.ఇంతకీ ఈ సినిమాకి ‘‘రఫ్ఫాడించేద్దాం’’ అనే టైటిల్ను ఖరారు చేస్తారా? ఈ పదాన్ని సినిమా టీం తరచూ ప్రచారంలో ఉపయోగిస్తున్న నేపథ్యంలో అదే టైటిల్ అయ్యే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, విక్టరీ వెంకటేశ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్లో కనిపించనున్నారట. ఇటీవల వెంకీ చేసిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమాలోని పాత్రనే ఈ సినిమాలో కొనసాగించబోతున్నట్టు టాక్. రెండు సినిమాలను కలుపుతూ కొన్ని కీలక సీన్లు ఉండబోతున్నాయని సమాచారం.ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రచారాన్ని మూడున్నర నెలల ముందే మొదలుపెట్టి, అంచనాలను మరో లెవల్కు తీసుకెళ్లాలని అనిల్ రావిపూడి బృందం భావిస్తోంది. మెగాస్టార్ మాస్ మ్యాజిక్తో, అనిల్ కామెడీ కట్తో ఈ చిత్రం ఇంకెన్ని సర్ప్రైజులు ఇవ్వబోతోందో వేచి చూడాల్సిందే! -
మందు తాగను,గుడ్డు కూడా తినను మరి ఆ పని ఎలా చేస్తా? : హీరో భార్య
మద్యపానం, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లపై వాటి ప్రచారాలపై ఇదేందయ్యా మీరు ప్రముఖులు కదా ఇలా చేయవచ్చా? అని ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరిని ప్రశ్నించినా, వ్యక్తిగతం వేరే, వృత్తిగతం వేరే వ్యాపకాలు వేరే వ్యాపారం వేరే అంటూ దేనికి దాన్ని విడదీసి చూడాలంటూ చిలకపలుకులు వల్లిస్తున్నారు. మద్యం తదితర హానికారక పదార్ధాల ప్రకటనల్లో నటించడం దగ్గర నుంచి పబ్స్, క్లబ్స్ వంటి వ్యాపారాల్లో సెలబ్రిటీలు లేదా వారి సంబంధీకుల పేర్లతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్లో ఓ టాప్ హీరో భార్య తనకు ఇష్టం లేని పనులు చేయబోనని అంతేకాక మరొకరి చేత చేయించబోనని ఖండితంగా చెప్పడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ‘‘కొన్ని వ్యాపారాలు నా నమ్మకాలకు విరుద్ధం’’ అంటున్న ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య మిరా రాజ్పుత్(Mira Rajput ) ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన ఓ ప్యానల్ చర్చలో మాట్లాడుతూ, ‘‘నేను సంపూర్ణ శాకాహారిని, కనీసం గుడ్లు కూడా తినను. అలాగే ఇంతవరకూ చేయలేదు భవిష్యత్తులో కూడా మద్యపానం చేయను. అలాంటప్పుడు మాంసాహారం మద్యం అందించే వ్యాపారంలో పెట్టుబడి ఎలా పెడతాను? అది నా నమ్మకాలకు పూర్తి విరుద్ధం కదా’’ అని చెప్పింది.ఇటీవల ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి రెస్టారెంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని వచ్చిన అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. దీనికి కారణాలను గురించి ఆమె మాట్లాడుతూ ఆ కారణాలు తన జీవనశైలితో మాత్రమే కాదని వ్యక్తిగత నైతిక విలువలతో ముడిపడి ఉన్నవని అంటోంది.‘‘నిజమే వ్యాపారంలో లాభం ముఖ్యం అయినా, అది వ్యక్తిగత విలువలకు భంగం కలిగించకూడదు. నాపై నమ్మకం ఉంచినవారికి, నా కుటుంబానికి సమాజంతో సత్సంబంధాలు ఉండాలంటే, నేను నమ్మే విషయాలలో నాకు స్పష్టత ఉండాలి’’ అంటూ ఎంతో స్వఛ్చంగా స్పష్టంగా ఆమె చెప్పిన మాటలు సినీ వర్గాలను ఆకట్టుకున్నాయి.ఒక పబ్లిక్ ఫిగర్గా తన నిర్ణయాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న అంటూ అంగీకరించిన మీరా. ‘‘బయట ఎంతో మంది ఎన్నో మంచి మాటలు ఎప్పుడూ చెబుతుంటారు, కానీ మన స్వంతమైన చైతన్యం మనకు మార్గం చూపాలి. మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, అది మన అంతరాత్మ అంగీకరించేలా దానికి నచ్చేలా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. మిరా రాజ్పుత్ ప్రస్తుతం హోలిస్టిక్ హెల్త్, నేచురల్ లివింగ్, స్కిన్ కేర్ రంగాల్లో వ్యాపారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ద్వారా కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుతం సినీరంగానికి అవతల.. రెస్టారెంట్ లతో సహా అనేకానేక వ్యాపారాల్లో సెలబ్రిటీలు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటిదాకా ఏ పెద్ద సెలబ్రిటీ కి సాధ్యం కాని విధంగా మీరా రాజ్పుత్ వ్యక్తం చేసిన నైతిక విలువలు... అభినందనీయం మాత్రమే కాదు...రూ.వందల కోట్లు ఉన్నా ఇంకా డబ్బు పిచ్చితో సమాజాన్ని భ్రష్టు పట్టించే వ్యాపారాలకు వెన్ను దన్నుగా నిలుస్తున్న సెలబ్రిటీలకు. ఇకనైనా అనుసరణీయం కూడా. -
మహేష్, రాజమౌళి సినిమా ఆ ఓటీటీలోనే...రికార్డ్స్ బద్ధలయ్యాయిగా...
దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎమ్బి29(SSMB29) సినిమా ఇప్పుడు మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ సినీ వర్గాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని విక్రయించారంటూ వస్తున్న వార్తలు కూడా సంచలనంగా మారాయి. దీనికి కారణం చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఈ సినిమా ఓటీటీ హక్కుల ధర పలకడమే.ఇప్పటి దాకా ఓటీటీలో అత్యధిక ధర పలికిన చిత్రంగా రాజమౌళి, రామ్చరణ్,ఎన్టీయార్ల సినిమా ఆర్ఆర్ఆర్ నిలుస్తోంది. ఆ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ల పుష్ప 2, లోకేష్ కనగరాజ్ హీరో విజయ్ల తమిళ చిత్రం లియో, అట్లీ, షారూఖ్ఖాన్ల హిందీ చిత్రం జవాన్, ప్రశాంత్ నీల్, ప్రభాస్ల సలార్, ఓంరౌత్, ప్రభాస్ల ఆదిపురుష్, సిద్ధార్ధ్ ఆనంద్, షారూఖ్ ల పఠాన్ చిత్రాలు నిలుస్తున్నాయి ఇవన్నీ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మధ్య చెల్లించి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లు స్వంతం చేసుకున్నట్టు సమాచారం. వీటిలో ఆదిపురుష్, పఠాన్, పుష్ప2 తప్ప మిగిలినవన్నీ నెట్ఫ్లిక్స్ ఖాతాలోనే పడ్డాయి. తద్వారా భారతీయ సినిమాలకు అత్యధిక రేట్లకు కొనుగోలు చేయడంలో ఎవరికీ అందనంత స్థాయిలో నెట్ఫ్లిక్స్ దూసుకుపోతోంది.అదే క్రమంలో మరోసారి తన సత్తా చాటిన నెట్ఫ్లిక్స్ ఎస్ఎస్ఎమ్బి 29 హక్కుల్ని కూడా దక్కించుకుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మరే చిత్రానికి పెట్టనంత ధరను చెల్లించి ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. తద్వారా ఇది భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద నాన్–థియేట్రికల్ డీల్స్గా నిలుస్తోందని సమాచారం.రాజమౌళి మునుపటి చిత్రం ఆర్ఆర్ఆర్ సైతం నెట్ఫ్లిక్స్లోనే ఆ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ఫ్లిక్స్ ప్రారంభంలోనే అద్భుతమైన వీక్షక విజయం అందుకుంది, అంతేకాక ఆ సినిమా పాట ఆస్కార్ అందుకోవడంతో నెట్ఫ్లిక్స్కు మరోసారి కాసుల పంట పండింది. ఆ అవార్డ్ ద్వారా వచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఓటీటీలో ఆ సినిమాకు వీక్షకులు వెల్లువెత్తారు. దాందో ఆర్ఆర్ఆర్కి భారీ ధర చెల్లించినప్పటికీ నెట్ఫ్లిక్స్ భారీ లాభాలను ఆర్జించడానికి ఇదో కారణం.ఈ నేపధ్యంలో రాజమౌళి చిత్రాలపై గురి కుదిరిన నెట్ఫ్లిక్స్ చాలా ముందస్తుగానే ఓటీటీ హక్కులపై కన్నేసింది. అపజయాలు అంతే తెలియని దర్శకుడు రూపొందిస్తున్న ఎస్ఎస్ఎమ్బి 29 చిత్రంలో ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ స్టార్ ఉండడం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అంశమే. అందుకే ఈ చిత్రం అత్యంత భారీ ధర పలికింది అనుకోవచ్చు. వచ్చే 2027లో విడుదల కానున్న ఈ భారీ చిత్రం ఇంకెన్నో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.


