ఈ ఏడాది హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం బంగ్లా భాషలలో బిగ్ బాస్ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించడానికి జియోస్టార్ సిద్ధమైంది. తద్వారా తొలిసారి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బిగ్ బాస్ వినోదాన్ని ఏకకాలంలో అనుభవించబోతున్నారు. ఇది భారతదేశంలో రియాలిటీ ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఒక మైలురాయిగా నిలువనుంది. ఈ ఆరు ఎడిషన్లు సెప్టెంబర్ 2026 నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్వర్క్, జియో హాట్స్టార్లో దేశ వ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. బిగ్ బాస్కు పర్యాయపదంగా మారిన దిగ్గజ హోస్ట్లు సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ ఈ సీజన్ లోనూ కొనసాగనున్నారు. ఈ సంవత్సరం బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ రాకతో ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, ’ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన డేటాతో నిండిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని జియో హాట్స్టార్ ఆవిష్కరించింది. రెండు దశాబ్దాల బిగ్ బాస్, అద్భుతమైన ప్రయాణం, సాంస్కృతి ప్రభావం శాశ్వత వారసత్వాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.
గత ఏడాది 500 మిలియన్ వీక్షకులు...
భారతదేశపు అతిపెద్ద వినోద ఫ్రాంచైజీలలో ఒకటిగా బ్రాండ్లకు ఎలా వేదికగా నిలిచిందో ’ ఇండియాస్ బిగ్ రియాలిటీ’ వెల్లడించింది. కేవలం 2025లోనే, 500 మిలియన్లకు పైగా వీక్షకులను ఈ షో చేరుకుని 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను సృష్టించింది ఆరు భాషా ఎడిషన్లనూ కలిపి చూసినప్పుడు ఈ ఎంగేజ్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ 47% వృద్ధిని సాధించింది. దాదాపు 625 కు పైగా బ్రాండ్లు ఈ షో ని ఉపయోగించుకుని, జాతీయ ప్రాంతీయ మార్కెట్లలో ఉత్పత్తులను విడుదల చేయటం, అవగాహన కల్పించడం, వినియోగదారులతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోవడం చేశాయి. జియోహాట్స్టార్లో, ప్రతి 10 మంది వీక్షకులలో ఆరుగురు బిగ్ బాస్ లైవ్ ఫీడ్ను చూస్తున్నారు.
ఇంటర్నెట్లోనూ ఫుల్ క్రేజ్...
బిగ్ బాస్ కేవలం చూసే అనుభవం కంటే ఎంతో ఎక్కువ అని ఈ కాఫీ టేబుల్ పుస్తకం వెల్లడిస్తుంది. జియోహాట్స్టార్లో 9.32 బిలియన్లకు పైగా ఓట్లు పోలవడం 43 మిలియన్ల లైవ్ చాట్లు నమోదు కావడం ద్వారా ప్రేక్షకులు చురుకుగా వ్యవహరించారు. దాదాపు ప్రతి నలుగురు వీక్షకులలో ముగ్గురు ఈ షోతో భిన్న రకాలుగా మమేకమవుతున్నారు, బిగ్ బాస్ ఇంటర్నెట్లో విపరీతమైన క్రేజ్ను సృష్టించింది. కేవలం 2025లోనే 1.7 బిలియన్లకు పైగా సోషల్ ఎంగేజ్మెంట్లను 30 మిలియన్ల యూజర్–జనరేటెడ్ మీమ్స్ను బిగ్ బాస్ సృష్టించింది. బిగ్ బాస్ ఇప్పుడు హిందీ మార్కెట్లలో 20 కోట్లకు పైగా వీక్షకులను, దక్షిణ భారతదేశంలో 3 కోట్లకు పైగా వీక్షకులను చేరుకుంది. ఇక్కడ ప్రతి 10 మంది టెలివిజన్ వీక్షకులలో 8 మంది ఈ షోతో మమేకమవుతున్నారు. ఈ ప్రాంతంలోని మిగతా అన్ని రియాలిటీ షోల కంటే దీని రీచ్ 3.5 రెట్లు ఎక్కువ.
అదే బిగ్ బలం...
గత రెండు దశాబ్దాలుగా, బిగ్ బాస్ ప్రతి సీజన్ తో తన స్థాయిని, ఆదరణను, ప్రాముఖ్యతను పెంచుకుంటూ, నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది. ప్రేక్షకులను నిరంతరం పాల్గొనేలా చేయడమే బిగ్ బాస్ బలం, ’ఈ కాఫీ టేబుల్ పుస్తకం భారత దేశ వినోద పర్యావరణ వ్యవస్థ పరిణామంలోని కీలకమైన క్షణాలను వెలుగులోకి తెచ్చింది‘ అని పుస్తకావిస్కరణ సందర్భంగా జియోస్టార్ టీవీ, ఎంటర్టైన్ మెంట్ సేల్స్ హెడ్ మహేష్ శెట్టి అన్నారు. ‘ పండుగ సీజన్ లో ప్రేక్షకుల వివిధ అంశాలపై దృష్టి మరల్చే తరుణంలో, బిగ్ బాస్ ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. 24/7 లైవ్ ఫీడ్లు, బిలియన్ల కొద్దీ ఓట్లు, లైవ్ చాట్ల ద్వారా ఏటా 47% ఎంగేజ్మెంట్ వృద్ధిని సాధిస్తూ, ఈ షో వీక్షకులను సైతం తమ చురుకైన భాగస్వాములుగా మారుస్తుంది. ‘ అని జియోస్టార్ డిజిటల్, ఎంటర్టైన్మెంట్ సేల్స్ హెడ్ భాస్కర్ రమేష్ అన్నారు.


