విద్యార్థుల ఉద్య‌మం.. త‌ర‌లివ‌చ్చిన‌ మలయాళ న‌టులు | Malayalam Actors filmmakers express solidarity to student protest | Sakshi
Sakshi News home page

విద్యార్థుల పోరాటానికి మలయాళ న‌టుల మ‌ద్ద‌తు

Jul 23 2026 7:42 PM | Updated on Jul 23 2026 7:55 PM

Malayalam Actors filmmakers express solidarity to student protest

కొచ్చి:  దేశ రాజ‌ధాని ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న‌ పోరాటానికి మలయాళ సినీ పరిశ్రమ సంఘీభావం ప్ర‌క‌టించింది. కొచ్చిలోని మహారాజాస్‌ కాలేజీలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీకి మలయాళ సినీ తార‌లు త‌ర‌లివ‌చ్చారు. ప‌లువురు నటులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేక‌పోయిన వారు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ సంఘీభావం తెలియ‌జేశారు.

నటుడు జోజు జార్జ్‌ (Joju George), నటి శాంతి బాలచంద్రన్‌, దర్శకుడు ఆశిక్‌ అబు, రచయిత ఎన్‌ఎస్‌ మాధవన్‌, ప్రముఖ రచయిత్రి కేఆర్‌ మీరా ర్యాలీలో పాల్గొని విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నటి గౌరీ కిషన్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, "శాంతియుత స్వరాలను వినండి.. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి మాట వింటుంది" అని రాసిన ప్లకార్డును ప్రదర్శించారు. నటుడు, ర్యాపర్‌ బేబీ జీన్‌ కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.

సోషల్‌ మీడియాలో వెల్లువలా మద్దతు
మంగళవారం పలువురు మలయాళ సినీ నటులు సోషల్‌ మీడియా వేదికగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, మీనాక్షి, కుంచాకో బోబన్‌, సిజు సన్నీ, రహ్మాన్‌, వినయ్‌ ఫోర్ట్‌, కాలిదాస్‌ జయరామ్‌, నస్లెన్‌, నిఖిలా విమల్‌, గ్రేస్‌ ఆంటోనీ, దీపా థామస్‌, హషీర్‌ తదితరులు విద్యార్థులకు మద్దతుగా పోస్టులు చేశారు.

అంతకుముందు రోజు టోవినో థామస్‌, పార్వతి తిరువోతు, రీమా కల్లింగల్‌, విస్మయ మోహన్‌లాల్‌ కూడా విద్యార్థుల నిరసనలకు సోష‌ల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో విద్యార్థుల‌పై పోలీసుల దౌర్జ‌న్యాన్ని టోవినో థామస్‌ ఖండించారు. పార్వతి తిరువోతు.. ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొంటూ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్నారు.

చ‌ద‌వండి: న‌టుడు మాధ‌వ‌న్ గాయబ్‌.. ఫొటో వైర‌ల్‌!

ఇంద్రజిత్‌ సుకుమారన్‌ కూడా సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. అలాంటి నిరసనకారులపై అధికారులు హింసకు పాల్పడకూడదని పేర్కొన్నారు. అణచివేత ఘటనలపై మౌనంగా ఉండకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనల సందర్భంగా గాయపడిన వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

సంఘీభావ సభలు, ర్యాలీలు
కేరళలోని పలు ప్రాంతాల్లో కూడా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా సంఘీభావ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీంతో నీట్‌ వివాదంపై విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement