న్యూఢిల్లీ: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. విద్యార్థుల పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా మద్దతు తెలిపారు. అయితే బాలీవుడ్తో పాటు దక్షిణాది సినిమా పరిశ్రమకు చెందిన అగ్ర నటులు స్పందించకపోవడాన్ని జనం ప్రశ్నిస్తున్నారు.
సీజేపీ నిరసనలపై ప్రముఖ నటుడు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ఇ న్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్ స్పందించకపోవడంపై ఎఫ్టీఐఐ విద్యార్థులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మాధవన్ మాయం అయ్యారంటూ పోస్టర్ తయారు చేశారు. “గాయబ్” (Gayab) అని రాసిన ఈ పోస్టర్ను ఏకంగా ఎఫ్టీఐఐ క్యాంపస్లోని ఆయన కార్యాలయానికే అతికించారు విద్యార్థులు. పోస్టర్పై “NEET For Sale” అనే వ్యాఖ్య కూడా రాశారు. మాధవన్ కార్యాలయానికి అతికించిన పోస్టర్ ఫొటోను నిశాంత్ కబీర్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నెటిజన్ల స్పందన
విద్యార్థుల పోరాటంపై మాధవన్ స్పందించకపోడాన్ని నెటిజనులు తప్పుబడుతున్నారు. అగ్ర నటుడిగా కొనసాగుతూ, ఎఫ్టీఐఐ చైర్మన్ పదవిలో ఉన్న ఆయన నుంచి కనీస స్పందన లేకపోవడాన్ని విమర్శిస్తున్నారు. పద్మశ్రీ అవార్డు తీసుకుని, దుబాయ్లో నివాసం ఉంటున్నారని ఆయనపై ధ్వజమెత్తున్నారు. ధురందర్ 3 స్క్రిప్ట్ చదువుకుంటూ బిజీగా ఉన్నారని, ఆయన ఇంకా అజిత్ దోవల్ క్యారక్టర్ నుంచి బయటకు రాలేదని, అవార్డు తీసుకోవడానికి వెళ్లారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఆమిర్ ఖాన్పై కూడా విమర్శలు
విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలపకపోవడంతో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదమయ్యాయి. ‘3 ఇడియట్స్’ సినిమాలో తాను పోషించిన పాత్రకు సోనమ్ వాంగ్చుక్కు ఎలాంటి సంబంధం లేదని ఆమిర్ఖాన్ అన్నారు. ‘3 ఇడియట్స్’ సినిమా రూపొందుతున్న సమయంలో సోనం వాంగ్చుక్ ఎవరో తనకు తెలియదని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై నెటిజనులు విమర్శలు ఎక్కుపెట్టారు. సోనం వాంగ్చుక్ తన తొలి భేటీ గురించి ఆమిర్ ఖాన్ ప్రస్తావించిన పాత వీడియోను వెలుగులోకి తెచ్చి వైరల్ చేశారు.
విద్యార్థుల ఉద్యమానికి మద్దతు
సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల ఉద్యమానికి పలువురు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. విలక్షణ నటులు నసిరుద్దీన్ షా, షబానా అజ్మీ, ప్రకాశ్రాజ్.. మద్దతు తెలపడంతో పాటు స్వయంగా నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. శత్రుఘ్న సిన్హా, ఆయన కుమార్తె సోనాక్షి సిన్హా, రత్నా పాఠక్ షా, జీనత్ అమన్, ఇమ్రాన్ ఖాన్, అనురాగ్ కశ్యప్, అభయ్ డియోల్, ఓమి వైద్య, అమోల్ పరాశర్, పూనమ్ పాండే, కిశోర్, షాయాజీ షిండే తదితరులు సంఘీభావం ప్రకటించారు.
చదవండి: ఆమిర్ ఖాన్కు ఆదిత్య ఠాక్రే కౌంటర్


