ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే రొమాంటిక్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘అదే నీవు అదే నేను’. కొండల్ దర్శకత్వంలో గోవిందు కాండ్రేగుల నిర్మించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు విభాగాల్లో అవార్డులు సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’లో నటించిన త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘మంచి రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో కొండల్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని నిర్మాత పేర్కొన్నారు.


