మహాతెరపై... మహేష్‌ వారణాసి, చూడగలమా? | Mahesh Babu Fans Request Varanasi Release In IMAX Screening | Sakshi
Sakshi News home page

మహాతెరపై... మహేష్‌ వారణాసి, చూడగలమా?

Feb 9 2026 11:21 AM | Updated on Feb 9 2026 11:28 AM

Mahesh Babu Fans Request Varanasi Release In IMAX Screening

సూపర్‌స్టార్‌ చొరవ తీసుకోవాలన్న ఫ్యాన్స్‌

దర్శక థీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ల కాంబోలో వస్తున్న వారణాసి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఎప్పటి నుంచో తమ హీరోని గ్లోబల్‌ స్టార్‌గా చూడాలని ఆశిస్తున్న ప్రిన్స్‌ అభిమానుల అంచనాలకైతే ఆకాశమే  హద్దు అని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో మరో ఏడాదిలో రానున్న వారణాసి గురించిన ప్రతీ వార్తా సంచలనమే అవుతోంది. అదే క్రమంలో ఇటీవల రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారణాసిని ఐమ్యాక్స్‌ తెరపై చూపాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. కథా వివరాలు గోప్యంగా ఉంచినప్పటికీ, వారణాసి చిత్రంలో హిందూ దేవుడైన శ్రీరాముని పునర్జన్మ గా రుద్ర పాత్రలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్నట్టు సమాచారం.

 ’ది వ్రాప్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ఐమాక్స్‌ కోసం చిత్రీకరించిన రెండవ భారతీయ చిత్రంగా నిలవనున్న తమ వారణాసి  గురించి రాజమౌళి మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. వచ్చే 2027లో సినిమా విడుదల నాటికి స్క్రీన్‌ సిద్ధంగా లేకపోతే లాస్‌ ఏంజిల్స్‌లోని ఐమాక్స్‌ కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతానని రాజమౌళి చమత్కరించారు. అయితే తెలుగు చలనచిత్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఇంకా నిజమైన ఐమాక్స్‌ స్క్రీన్‌ అందుబాటులోకి  రాలేదు. ఇదే అక్కడ సమస్య. అత్యంత వ్యయ ప్రయాసలతో వారణాసి చిత్రాన్ని పూర్తిగా  1.43:1 ఐమాక్స్‌ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా దానిని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకోవడం సహజమే.

మరోవైపు  ఐమాక్స్‌ విస్తరణకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాల కోసం హైదరాబాద్‌ ఇంకా వేచి చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గత 2020 నుంచి ఐమాక్స్‌ తన ఉనికిని 60% వరకూ పెంచుకుంది, అదే క్రమంలో భారతదేశంలో కూడా విస్తరించడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐమాక్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ జియోవన్నీ డోల్సీ చెబుతున్నారు. మన దేశం  కనీసం 150 ఐమాక్స్‌ స్క్రీన్స్  ఏర్పాటు చేయవచ్చునని వారు నమ్ముతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం గుజరాత్‌లోని సైన్స్ సిటీలో కేవలం ఒకే ఒక నిజమైన 1.43:1 స్క్రీన్‌ ఉంది,  అది కూడా వాణిజ్య ఉపయోగం కోసం అందుబాటులో లేదు. తెలుగు రాష్ట్రాలలో భారీ సినిమాలతో పాటు పెద్ద తెర అనుభవాలకు డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ మల్టీఫ్లెక్స్‌లను నెలకొల్పడంలో క్యూ కడుతున్న  ఏ ఎగ్జిబిటర్‌ లేదా సెలబ్రిటీ కూడా నగరంలో ఐమాక్స్‌ స్క్రీన్   ప్రణాళికలను ఇప్పటి దాకా థృవీకరించలేదు.

’వారణాసి’ చిత్రాన్ని ఐమాక్స్‌ స్క్రీన్ పై చూడాలని  అభిమానులు ఆరాటపడుతున్నారు హైదరాబాద్‌లో ఐమాక్స్‌ స్క్రీన్‌ లేకపోవడంపై  మహేష్‌ బాబు అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. దీనికోసం సోషల్‌ మీడియా వేదికగా  ఐమ్యాక్స్‌ సాకారం దిశగా చర్యలు తీసుకోవాలని మహేష్‌ బాబును ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అయితే హైదరాబాద్‌లో నిజమైన ఐమాక్స్‌ స్క్రీన్ ను ఏర్పాటు చేయడంలో ప్రధాన సమస్య అధిక వ్యయం. అటువంటి స్క్రీన్  ఏర్పాటు చేయడానికి  నిర్వహించడానికి భారీ పెట్టుబడి అవసరం. 

టిక్కెట్‌ ధరలపై పరిమితులు అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా, ప్రదర్శనదారులు ఈ రిస్క్‌ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. మరిన్ని స్క్రీన్‌లను అందించడానికి ఐమాక్స్‌ సిద్ధంగా ఉంది, కానీ స్థానిక ప్రదర్శనదారులే ఒక చొరవ తీసుకోవాలి. మహేష్‌ బాబు అభిమానులతో సహా సినీ ప్రియులు, ఐమాక్స్‌ స్క్రీన్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement