ప్రస్తుతం దేశంలో ‘బడ్డీమూన్ ‘ ట్రెండ్ గణనీయంగా ప్రాచుర్యం పొందుతోంది. కేవలం జంట మాత్రమే కాకుండా, సన్నిహిత స్నేహితులను కూడా తమ హనీమూన్ లో చేర్చుకోవడం ద్వారా, పెళ్లి తర్వాత చేసే సాంప్రదాయ విహారయాత్రకు ఇది సరికొత్త రూపాన్ని ఇస్తోంది. ఇటీవలి కాలంలో ఊపందుకున్న ఈ ట్రెండ్కి స్టార్ కపుల్ విరోష్ జంట.. రష్మిక మందన్న విజయ్ దేవరకొండలు స్టార్ డమ్ తీసుకొచ్చారు.వీరు సాంప్రదాయ హనీమూన్ కు బదులుగా, థాయ్లాండ్లోని కో సముయ్లో ‘బడ్డీమూన్ ‘ను ఎంచుకోవడం ఒక్కసారిగా ఈ సరికొత్త ట్రెండ్కి ఊపుని అందించింది.
బడ్డీమూన్ అంటే?
పెళ్లి అంటే వధూవరులకు ఓ జీవితకాల జ్ఞాపకం పెళ్లి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి పూర్తయే వరకూ అందులో బోలెడన్ని వేడుకలు, సంబరాలు ఇమిడి ఉంటాయి. అది వధూవరులకు అంతో ఇంతో అలసట కూడా అందించకమానదు. ఆ తర్వాత వారిద్దరే పూర్తి ఏకాంతంగా విశ్రాంతిగా గడపడానికి పుట్టుకొచ్చిన సంప్రదాయ యాత్రే హనీమూన్ . అయితే దీనికి బదులుగా, జంటలు తమ పెళ్లి తర్వాత ఆనందాన్ని పంచుకోవడానికి అత్యంత సన్నిహిత స్నేహితులను వెంట తీసుకువచ్చి, ‘ఎంచుకున్న కుటుంబం‘ తో కలిసి చేసే విహార యాత్రకే ఇప్పుడు బడ్డీమూన్ గా నామకరణం చేశారు.

ఎలా జరగుతుంది?
దీనికి తాజా సెలబ్రిటీ జంట బడ్డీ మూన్ ను ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. తమ బడ్డీమూన్ కు సంబంధించి రష్మిక , విజయ్లు కొన్ని విశేషాలను పంచుకున్నారు. థాయ్ల్యాండ్లోని సముయ్లో బస చేసిన విల్లా కో కూన్ వేదిక గా అద్భుతమైన సముద్ర తీర దశ్యాలు, ఇన్ఫినిటీ పూల్, ప్రశాంతమైన వాతావరణాన్ని వీరు సన్నిహితులతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ ట్రెండ్లో భాగంగా, ‘హౌస్ పార్టీ‘ వాతావరణం ఉంటుంది. , విందులు, వినోదాలు, పూల్ గేమ్స్ వంటి కార్యకలాపాల కోసం బడ్డీమూన్
బృందం ఒక పెద్ద, ప్రైవేట్ విల్లాను అద్దెకు తీసుకుంటారు.
క్రేజ్కు కారణం ఇదే...
పదులు, వందల సంఖ్యలో బంధుమిత్రులతో సందడి గా గడిపిన పెళ్లి వేడుక పూర్తయిన వెంటనే అకస్మాత్తుగా పూర్తి నిశ్శబ్దానికి మారడాన్ని నవతరం అంతగా ఇష్టపడడం లేదు. పెళ్లి తర్వాత వచ్చే ‘బ్లూస్‘ (స్తబ్ధత) ను వీరు నివారించాలనుకుంటున్నారు. స్నేహితులతో కలిసి ‘డీలాక్‘ (ఒత్తిడిని తగ్గించుకోవడం) చేయడానికి ఇది ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి హడావుడిలో బాగా దగ్గరి బంధువులు, స్నేహితులతో రిలాక్స్డ్గా గడపడం సాధ్యం కాదు. దాంతో పెళ్లి తర్వాత ఆ లోటును తీర్చుకోవాలని భావించే జంటలు ఈ ట్రెండ్ను ఎంచుకుంటున్నారు.
పర్యాటక ప్రాంతాలలో బస ఏర్పాట్లు చూసే ఎయిర్బర్బ్ అనే కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతీయ వినియోగదారులు ఇప్పుడు గ్రూప్ బుకింగ్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది సామూహిక ప్రయాణ అనుభవాల వైపు జరుగుతున్న మార్పును సూచిస్తోంది. ఈ పెరిగిన బుకింగ్స్లో పెళ్లి తర్వాత స్నేహితులతో ’బడ్డీమూన్స్ ’ కూడా ఉన్నాయి.

ఉపసంహారం...
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమ మొదటి విహారయాత్ర కోసం ఇలాంటి ట్రిప్ను ఎందుకు ఎంచుకున్నారో రష్మిక విజయ్ వెల్లడించారు. ‘‘సన్నిహితులతో ఒకే చోట ఉండడం వల్ల సరదాగా గడిపాం ఆటలు పాటలతో పాటు పూల్లో ఎంజాయ్ చేశాం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాన్ని చూశాము, మంచి రుచులను చవిచూశాం. మరియు స్థానిక సంస్కతిని మరింత వాస్తవికంగా, అనుభవించాం ఇది కేవలం సందర్శించడంలామాత్రమే కాదు ఆ ప్రదేశంలో జీవిస్తున్నట్లు అనిపించేలా చేసింది’’ అన్నారు.
ఒక బంధం గా ఉండటం వల్ల ఆ ప్రదేశంతో మరింత లోతుగా మమేకమవ్వడానికి సహాయపడిందన్నారు. ఈ తరహా ఆలోచనలు మరిన్ని జంటలకు స్ఫూర్తిని అందిస్తే.. హనీమూన్ స్థానంలో బడ్డీ మూన్ ఓ సంప్రదాయంగా స్థిరపడినా ఆశ్చర్యం లేదు.


