టాలీవుడ్కు అత్యంత ఇష్టమైన నటుడు!
భారతీయ సినిమా రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు మోహన్ లాల్. గత కొంతకాలంగా వరుస విజయాలతో ఆయన తన సత్తా నిరూపిస్తున్నారు. మళయాళంలో ఆయన టాప్లో ఉన్నప్పటికీ తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో ఆయన కనిపిస్తుంటారు. తాజాగా ఆయన పేరు ఒకటి కాదు, ఏకంగా రెండు ప్రధాన తెలుగు ప్రాజెక్టులతో ముడిపడి ఉందని బలమైన ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రాబోయే చిత్రం. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఈ మలయాళ దిగ్గజ నటుడిని సంప్రదిస్తున్నట్టు సమాచారం.

ఓ వైపు ఈ ప్రాజెక్ట్పై చర్చలు కొనసాగుతుండగానే, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రంలో కూడా మోహన్ లాల్ నటించవచ్చని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇవి నిజమైతే... అపుడప్పుడు తెలుగు సినిమాల్లో మోహన్ లాల్ కనిపించడం జరిగినప్పటికీ... ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లో కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కాబోతోంది.
ఆసక్తికరంగా, రెండు చిత్రాలు 2027 సంక్రాంతికి విడుదలయేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే, ఒకే పండుగ సీజన్లో రెండు భారీ బడ్జెట్ చిత్రాలలో తన నటనతో తానే పోటీ పడుతూ, మోహన్ లాల్ ఒక అరుదైన బాక్సాఫీస్ పోరును ఎదుర్కోనున్నారని చెప్పొచ్చు.
తెలుగు సినిమాతో బలమైన అనుబంధం..
గత కొంత కాలంగా గంభీరమైన, పాత్ర–ఆధారిత పాత్రల కోసం టాలీవుడ్ మోహన్ లాల్పై ఆధారపడటం పెరుగుతోంది. తెరపై తన సహజమైన నటనకు భావోద్వేగ ప్రదర్శనకు పేరుగాంచిన ఆయన సినిమాలో ఉంటే... ఆయన పాత్ర నిడివితో సంబంధం లేకుండా సినిమాకి మల్టీ–స్టారర్ లుక్ వస్తుందనేది నిర్వివాదం. పాత్రోచిత నటనతో క్యారెక్టర్ను మరో రేంజ్కి తీసుకెళ్లే అభినయం ఆయన స్వంతం.
తరాలకు అతీతంగా...స్టార్స్తో కాంబినేషన్...
తెలుగు సినిమాల్లో నటించారు అనేదానికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మళయాళ సూపర్స్టార్... తరాలకు అతీతంగా తెలుగు హీరోలతో జతకట్టడం..ఆయన దాదాపు 32 ఏళ్ల క్రితం 1994లో అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి గాండీవం సినిమాలో కనిపించారు. అదే సినిమాలో బాలకృష్ణ కూడా మరో హీరో.
అలా టాలీవుడ్లో తొలితరం అగ్రహీరో, రెండవ తరం అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మోహన్లాల్... ఆ తర్వాత నవతరం అగ్రహీరో జూనియర్ ఎన్టీయార్తో కలిసి 2016లో విడుదలైన జనతా గ్యారేజ్లో కనిపిస్తారు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్యల సినిమాల్లోనూ కనిపించబోతున్నారు. ఆలా తరాలకు అతీతంగా మన హీరోలతో జట్టు కడుతున్న నటుడిగా ఆయన నిలుస్తున్నారు. గత 2016లోనే ఆయన మనసంతా అనే సినిమా ద్వారా తానే ప్రధాన పాత్రలో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారాయన.


