చెన్నై: తమిళనాడులో ఓ కండక్టర్ ఇచ్చిన టికెట్ ప్రయాణికున్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. తన సమీపంలోని ఊరికి వెళ్లాలని ప్రయాణికుడు సదరు కండక్టర్ని టికెట్ అడిగారు. దానికి సరే అని తలూపిన కండక్టర్ టికెట్ ఇచ్చారు. తీరా టికెట్ చూస్తే అందులో వేరే దేశానికి టికెట్ ఉంది. అంతే కాకుండా దాని ఖరీదు రూ. 10 వేలుగా ఉంది.
అసలేం జరిగిందంటే?
దామోదరన్ అనే వ్యక్తితో పాటు అతని స్నేహితుడు కలిసి బెంగళూరు వెళ్తున్న తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. వారు తమిళనాడులోని హుసూరు ప్రాంతానికి వెళ్లడానికి టికెట్ అడిగారు. దీంతో కండక్టర్ టికెట్ ఇచ్చారు. అయితే, కండక్టర్ తన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్ ద్వారా ప్రింట్ తీసి ఇచ్చిన టికెట్లను చూసి దామోదరన్ షాక్కు గురయ్యాడు.
అందులో అతడు వెళ్లాల్సిన గమ్యస్థానం హుసూరుకు బదులు (దుబాయి, యుఏఈ) అని అని రాసి ఉంది. అంతే కాకుండా టికెట్ ధర రూ. పదివేలుగా ఉంది. దీంతో సదరు ప్రయాణికుడు షాక్కు గురయ్యాడు. దీంతో ఒక సాధారణ అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణం కాస్తా, అంతర్జాతీయ విమాన ప్రయాణంలా మారిపోయిందని ఆశ్చర్యపోయాడు. సాధారణంగా అతను వెళ్లాల్సిన గమ్యస్థానానికి రూ.150 వరకూ టికెట్ ధర ఉంటుంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
అయితే ఈ ఘటనను తాలూకా వివరాలతో పాటు ఆ టికెట్ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్తా ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాల జోకులు, మీమ్స్తో విరుచుకుపడ్డారు. తమిళనాడు రవాణా సంస్థ గల్ఫ్ దేశాలకు కూడా బడ్జెట్ బస్సు సర్వీసులను ప్రారంభించిందా ఏంటి? అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. సముద్రాలను దాటి బస్సు ప్రయాణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల వివరణ
ఈ టికెట్ వైరల్ కావడంతో తమిళనాడు రవాణా సంస్థ (TNSTC) సేలం డివిజన్ అధికారులు వెంటనే స్పందించారు... కండక్టర్ ఉపయోగించిన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మిషన్లో ఏర్పడిన ఒక సాంకేతిక లోపం వల్లే టికెట్పై దుబాయ్ అని ప్రింట్ అవ్వడం, అంత భారీ మొత్తంలో ఛార్జీ పడటం జరిగాయి. ప్రయాణికుల నుంచి కేవలం ఛార్జీ రూ. 150 మాత్రమే వసూలు చేశారని, ఈ తప్పు కేవలం టికెట్పై ప్రింట్ అయిన వివరాలకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు.


