అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించిన తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.
ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంశం. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియాన్ని దేశం వెలుపలికి తరలించాలని, లేదా పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేసింది. అయితే తాజా చర్చల్లో ఇరాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని కొనసాగించబోమని హామీ ఇవ్వడం, అలాగే అణు నిల్వల భవిష్యత్పై ప్రత్యేక చర్చలకు అంగీకరించడం వల్ల చర్చల్లో పురోగతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక, ట్రంప్ గతంలో పలుమార్లు ఇరాన్ యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని, వాటిని ఇరాన్ వద్ద ఉంచబోమని ప్రకటించారు. కానీ తాజా అవగాహన ఒప్పందంలో యురేనియం నిల్వల నిర్వహణపై మరింత సౌలభ్యవంతమైన విధానం అవలంబిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా, ఇరాన్ వర్గాల నుంచి పరస్పర విరుద్ధ ప్రకటనలు వస్తుండటంతో తుది నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐరాస ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ యురేనియం నిల్వలపై సంతకాల కార్యక్రమం జెనీవాలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి.
ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్మూజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చల కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే యురేనియం నిల్వల భవితవ్యమే ఈ ఒప్పంద విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశంగా మారింది.


