urenium agreement
-
ఇరాన్పై చరిత్రలోనే క్లిష్టమైన సైనిక ఆపరేషన్కు ట్రంప్ భారీ ప్లాన్?
వాషింగ్టన్: చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు, ఇరాన్పై యుద్ధంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్లో యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం ముగుస్తుందంటూ వ్యాఖ్యానిస్తూనే, మరోవైపు ఇరాన్పై మరిన్ని దాడులకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పశ్చిమాసియాలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది.అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నివేదికల ప్రకారం.. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను ఇస్ఫాహాన్లోని భూగర్భ స్థావరాల్లో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్ చేపట్టనున్నారని సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా పశ్చిమాసియాలో 10 వేల మంది సైనికులను పంపింది. ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న వేళ ఈ సైనిక చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ ఏప్రిల్ నెలలోనే 10 వేలకుపైగా సైనికులు ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. వీరిలో 6 వేల మంది సైనికులు ప్రస్తుతం నమీబియా తీరానికి సమీపంలో ఉన్న అమెరికా విమాన వాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ (CVN-77) ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్లో భాగమవుతారు. మరో 4,200 మంది సైనికులు బాక్సర్ అంఫిబియస్ రెడీ దళంలో చేరి, ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి చేరుకోనున్నారు. ఈ గ్రూప్లో 800కి పైగా మెరైన్లు, హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్లు ఉన్నాయి.అమెరికా రక్షణ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్లో భూసైనిక చర్యల కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో ప్రత్యేక దళాలను ఇరాన్ భద్రపరిచిన యురేనియంను వెలికితీయడం, భద్రపరచడం, అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలోని దీవులు, తీరప్రాంతాల్లో ల్యాండింగ్ ఆపరేషన్లు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.ఇదే సమయంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఇరాన్ యుద్ధం చాలా త్వరలో ముగియబోతోంది. వచ్చే రెండు రోజులు అద్భుతంగా ఉండబోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఆయన, కాల్పుల విరమణను పొడిగించాల్సిన అవసరం లేదని, యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.ఈ పరిణామాలు, ఇరాన్తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదని సూచిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ‘యుద్ధం ముగుస్తోంది’ అని చెబుతున్నా, మరోవైపు అమెరికా భారీగా సైనిక బలగాలను సమీకరిస్తోంది. ఇది కాల్పుల విరమణ గడువు ముగిసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టం కావచ్చని సంకేతాలు ఇస్తున్నాయి. -
‘నల్లమల సందర్శనకు అనుమతించండి’
సాక్షి, హైదరాబాద్: యురేనియం మైనింగ్ ప్రతిపాదిత మండలాల్లో పర్యటనకు అనుమతించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్).. డీజీపీ మహేందర్రెడ్డికి విన్నవించింది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, అధికార ప్రతినిధి వెంకట్రెడ్డిలు మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 3వ తేదీన మావోయిస్టు అమరుల వారోత్సవాల పేరిట, 14వ తేదీన అడవి జంతువుల నుంచి రక్షణ కల్పించలేమన్న సాకుతో తమను, తమపార్టీ సభ్యుల్ని అడ్డుకుని సెక్షన్ 151 సీఆర్పీసీ కింద అరెస్టు చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. యురేనియం మైనింగ్ నిక్షేపాలు గుర్తించిన అమ్రాబాద్, పడర మండలాల్లో పర్యటించి, ప్రజలను కలుసుకునేందుకు అనుమతించాలని కోరారు. -
భారత్కు కెనడా యురేనియం
3 వేల మెట్రిక్ టన్నుల సరఫరాకు అంగీకారం భారత అణు ఇంధన రంగంలో మేలిమలుపు కెనడా ప్రధాని హార్పర్తో మోదీ చర్చలు ఒటావా: కెనడా పర్యటనలో అణు ఇంధన రంగానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ కీలక విజయం సాధించారు. అణు విద్యుదుత్పత్తికి కీలకమైన యురేనియంను ఐదేళ్ల పాటు సరఫరా చేసేందుకు కెనడా అంగీకరించింది. ఈ చర్య ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో, పరస్పర విశ్వాస కల్పనలో ముఖ్యమైన ముందడుగుగా, భారత అణు ఇంధన రంగంలో మేలిమలుపుగా భావిస్తున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీల అనంతరం బుధవారం కెనడా చేరుకున్న మోదీ ఆ దేశ ప్రధాని స్టీఫెన్ హార్పర్తో అణు ఇంధనం సహా పలు కీలకాంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. అనంతరం కెనడాకు చెందిన కేమికొ కార్పొరేషన్ 3 వేల మెట్రిక్ టన్నుల యురేనియంను భారత్కు సరఫరా చేసేలా రూపొందించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ విషయాన్ని మోదీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న హార్పర్ ప్రకటించారు. ఈ సంవత్సరం నుంచి ప్రారంభించి ఐదేళ్లలో ఆ యురేనియంను భారత్కు అందిస్తారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) భద్రతాప్రమాణాలను అనుసరించి ఈ సరఫరా ఉంటుంది. ఈ ఒప్పందం వ్యయం రూ. 15.85 వేల కోట్లని అంచనా. రష్యా, కజకిస్తాన్ల తరువాత భారత్కు యురేనియం సరఫరా చేస్తున్న మూడో దేశం కెనడానే. తాము సరఫరా చేస్తున్న యురేనియంను దుర్వినియోగం చేస్తున్నారంటూ 1970లలో కెనడా భారత్కు యురేనియం సరఫరాను నిలిపేసింది.2013లో ఇరుదేశాల మధ్య కుదిరిన ‘అణుఇంధన సహకార ఒప్పందం’ భారత్కు యురేనియం సరఫరా చేసేందుకు మరోసారి దారులు వేసింది. కాగా కెనడాకు దేశ వీసా విధానాన్ని సరళతరం చేశామని, ఇకపై పదేళ్ల వీసాకు వారు అర్హులని, ఆ దేశ పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యం కల్పిస్తున్నామని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 13 ఒప్పందాలు కుదిరాయి. అంతరిక్ష సహకారానికి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. గత 42 ఏళ్లలో కెనడాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. కెనడా సహజ భాగస్వామి: మోదీ పౌర అణు ఇంధన రంగంలో ఇరుదేశాల మధ్య దశాబ్దాల అనంతరం వాణిజ్యపరమైన సహకారం పునఃప్రారంభమైందని మోదీ ప్రకటించారు. కెనడాతో సంబంధాలు ఉన్నత స్థాయికి చేరేందుకు తన పర్యటన వేదికగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని కెనడా పత్రిక ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’లో రాసిన వ్యాసంలో వ్యక్తం చేశారు.


