సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రతివాదిగా ఉన్న కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విషయమై ఈరోజు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, మీనాక్షితోపాటు మిగిలిన ప్రతివాదుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
కాగా, తార్నాకకు చెందిన మాజీ కార్పొరేటర్ శ్రీలత తనపై వేధింపుల కారణంగా నారాయణపేట కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 2022లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్తో పాటుగా 2023 బెంగళూరులో చేసిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనంతరం, ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలంటూ పీసీసీకి శ్రీలత ఫిర్యాదు చేశారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గతేడాది ఆగస్టు 20న నాంపల్లిలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు.
ఫిర్యాదులో తన పరువుకు నష్టం కలిగించడంతో పాటు, నేరపూరిత కుట్ర, బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు 16 పేజీలతో కూడిన ఫిర్యాదును కోర్టుకు అందించారు. ఆ కేసులో ప్రతివాదులుగా కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎంఎల్ఏ చిట్టెం పర్నికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిట్టెం అభిజయ్ రెడ్డితో పాటు పార్టీ తెలంగాణ మీనాక్షి నటరాజన్ పేరు కూడా చేర్చారు.
అలాగే, బాధ్యులైన వారి నుంచి తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. కాగా, శ్రీలత పిటీషన్కు కోర్టులో ఎస్ఆర్ నంబర్ కేటాయించిన కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు వాదనల అనంతరం పిటిషన్పై విచారణ చేపట్టాలా? వద్దా? అనే విషయమై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.


