వాహనదారులకు అలర్ట్‌.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు | central govt special order on Bulk Petrol And Diesel Purchases | Sakshi
Sakshi News home page

వాహనదారులకు అలర్ట్‌.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు

Jun 12 2026 8:37 AM | Updated on Jun 12 2026 8:41 AM

central govt special order on Bulk Petrol And Diesel Purchases

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్‌లెట్స్) ఆర్డర్–2026’ను జారీ చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయరాదు. వారు తమ అవసరాలను సొంత వినియోగ పంపుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్రోల్ బంకులు డీజిల్‌ను కేవలం వాహనాల ట్యాంకుల్లో లేదా PESO (Petroleum and Explosives Safety Organisation) అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్రం స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి విక్రయించడం కూడా పూర్తిగా నిషేధించింది.

ఈ ఆంక్షలు ప్రారంభ దశలో గరిష్ఠంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం–1955 (Essential Commodities Act, 1955) కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement