బన్నీని చూసి బాలీవుడ్‌ రగిలిపోతోందా? | Is Bollywood Uncomfortable With Allu Arjun Growth | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ పై వ్యతిరేక ప్రచారం... బన్నీని చూసి బాలీవుడ్‌ రగిలిపోతోందా?

Feb 14 2026 3:19 PM | Updated on Feb 14 2026 3:53 PM

Is Bollywood Uncomfortable With Allu Arjun Growth

‘పుష్ప 2’ ఘన విజయం తర్వాత, దక్షిణాది నటుల్లో ఎవరికీ రానంత దేశవ్యాప్త క్రేజ్‌ అల్లు అర్జున్‌కి రావడం, జవాన్‌ సినిమా తీసిన అట్లీ తన రెండో సినిమాకి ఎంచుకోవడం...అలాగే బాలీవుడ్‌ అగ్రనటి దీపికా పదుకొణే వంటి స్టార్స్‌తో బన్నీ కలిసి నటించనుండడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ బాలీవుడ్‌లో కొందరికి ముప్పుగా కనిపిస్తున్నారా? అనే ప్రశ్నకు కొందరు సినీ పెద్దలు అవుననే సమాధానమే చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అటు టాలీవుడ్‌ ఇటు బాలీవుడ్‌లో  సినీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్‌ సంఘటన తర్వాత అల్లు అర్జున్‌ ఎదుర్కున్న పరిణామాలు తను కొందరు ప్రముఖులకు టార్గెట్‌గా మారాడనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాయి.  తాజా పరిణామాల నేపధ్యంలో బన్నీ ని ఈ సారి వేరే రకంగా టార్గెట్‌ చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వివాదమా? బాలీవుడ్‌ వ్యూహమా?
ఇండియన్‌ ఐకాన్‌ స్టార్‌  అల్లు అర్జున్‌ గురించి పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఓ బ్రాండ్‌ స్ట్రాటజిస్ట్‌  అల్లు అర్జున్ ను కలవాలంటే ఏకంగా 42 కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, అందులో కళ్లలోకి చూడకూడదు, చేతులు కలపకూడదు వంటి ఆంక్షలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫలితంగా అల్లు అర్జున్‌ పేరు అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, నిజంగానే ఇలాంటి నిబంధనలు ఉన్నాయా? అని కొందరిలో సందేహాలు వ్యక్తమవడం సహజమే.

అయితే అదే సమయంలో కొందరు ఇది అల్లు అర్జున్‌ పెరుగుతున్న పాన్  ఇండియా క్రేజ్‌ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.ఈ క్రమంలోనే ఇలాంటి వివాదాలను కావాలనే పెద్దవిగా చేసి ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ఇలా టాలీవుడ్‌ స్టార్స్‌పై వ్యతిరేక ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాల భారీ విజయం తర్వాత ప్రభాస్‌ కూడా ఇలాంటి విమర్శలు, నెగెటివ్‌ ప్రచారం చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు.   బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ ఆదరణ పొందిన  దక్షిణాది నటులు ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందన..
తమపై పడిన వివాదంపై అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించి వైరల్‌ అవుతున్న ఆరోపణలు అసత్యమని, ఆధారంలేనివని స్పష్టం చేసింది. అల్లు అర్జున్‌ ఎప్పుడూ గౌరవంగా, వినయంగా వ్యవహరిస్తారని, ఇలాంటి ప్రచారం ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నదని కూడా తేల్చి చెప్పడం గమనార్హం. ఈ ఉదంతంపై తగినంత కూపీ లాగి కుట్రలపై ఆధారం దొరికిన తర్వాతే అల్లు టీమ్‌ ఇలా చెప్పి ఉంటుందనేది నిస్సందేహం. అంతేకాదు అల్లు అర్జున్ పై తప్పుడు  ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. తద్వారా ఇకపై కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉందని అల్లు అండ్‌ కో భావిస్తున్నట్టు అర్ధం అవుతోంది. 

ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో భారీ ప్రాజెక్టులతో బిజీగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అట్లీతో కలిసి ఓ భారీ సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో కలిసి రెండు భాగాలుగా రూపొందనున్న ఓ భారీ సినిమా కూడా త్వరలో ప్రారంభం కానుంది. , అల్లు అర్జున్‌ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కుట్రలలో ఆరితేరిన చరిత్ర ఉన్న కొన్ని బాలీవుడ్‌ మీడియా సంస్థల విషయంలో అల్లు అర్జున్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement