సత్ఫలితాలిస్తున్న నిపుణ్‌ భారత్‌ మిషన్‌... | Story On Nipun Bharat Mission | Sakshi
Sakshi News home page

సత్ఫలితాలిస్తున్న నిపుణ్‌ భారత్‌ మిషన్‌...

Jul 13 2026 8:52 PM | Updated on Jul 13 2026 8:52 PM

Story On Nipun Bharat Mission
  • తెలంగాణలో మెరుగైన విద్యా ప్రమాణాలు

జాతీయ విద్యా విధానం (ఎన్ ఈపీ) 2020, భారతదేశ విద్యా సంస్కరణల అజెండాలో మౌలిక బాష, గణిత సామర్థ్యాలకు (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కేంద్ర స్థానం కల్పించింది. దీని ప్రకారం.. మూడో తరగతి చదివే విద్యార్ధి.. అతనికి ఇచ్చిన పాఠ్యాంశాలను అర్థవంతంగా చదవడం, ప్రాథమిక గణిత లెక్కలు చేయగలగడం అనేది చాలా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. ఇది ఆ విద్యార్ధి తర్వాత తరగతుల్లో  జీవితంలో వచ్చే ప్రతి అభ్యసన దశను తీర్చిదిద్దుతుందని గుర్తించిన  విద్యా మంత్రిత్వ శాఖ జూలై 2021లో ’నిపుణ్‌ భారత్‌ మిషన్‌’ను ప్రారంభించింది. ఇది పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయుల సామర్థ్యం, మూల్యాంకనం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, డేటా ఆధారిత పాలన వంటి అంశాలను కలుపుకొని పనిచేసే ఒక సమగ్ర విధానం. ప్రతి బిడ్డ ప్రాథమిక అభ్యసన మైలురాళ్లను సాధించేలా చూడటమే దీని  లక్ష్యం.

తెలంగాణలో, ఈ జాతీయ విధానం విద్యా సంస్కరణలకు అద్భుతమైన చోదక శక్తిగా నిలిచింది. దీని ఫలితంగా 24,000 ప్రభుత్వ పాఠశాలల్లో 10.34 లక్షల మంది విద్యార్ధులకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ గ్రేడ్‌లు అందాయి. ఈ సంస్కరణలకు 60,000 మంది ప్రాథమిక తరగతి ఉపాధ్యాయులు సహకారం అందించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యా గణాంకాలలో ఈ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2024–25 , 2025–26 విద్యా సంవత్సరాల మధ్య, తెలుగు వాక్య పఠన స్కోర్లు 6 శాతం పాయింట్లు, ఆంగ్లంలో 9 పాయింట్లు, గణిత కూడిక–తీసివేత స్కోర్లు 8 పాయింట్లు పెరిగాయి.

తనిఖీ తంతుకు చెల్లుచీటీ...
గత  2022 వరకు తెలంగాణలో పాఠశాలల సందర్శనలు  కేవలం తనిఖీ తంతులా సాగేవి. బోధన–అభ్యసన సామగ్రిని గానీ, బోధనా నాణ్యతను గానీ క్రమపద్ధతిలో పర్యవేక్షించేవారు కాదు. సమీక్షా సమావేశాలు పరిపాలనాపరమైన ఆదేశాలు జారీ అయ్యేవి కానీ, అభ్యసన ఫలితాలపై అరుదుగా మాత్రమే చర్చించేవి. అంతేకాకుండా, విడివిడిగా ఉన్న డేటా వ్యవస్థల వల్ల, తరగతి గదుల్లో వాస్తవంగా ఏం జరుగుతుందో  ఎవరికీ  తెలిసే అవకాశం ఉండేది కాదు.

కొత్తగా...నిర్మాణాత్మకంగా...
కొత్తగా చేపట్టిన చర్యల్లో కీలకమైనది పాఠశాల పర్యవేక్షణలో గతంలో విడివిడిగా ఉన్న మూడు విభాగాలైన సందర్శనలు, సమీక్షలు, డేటాను ఒకే అనుసంధానిత పరిపాలనా వ్యవస్థగా మార్చడం. దీని ద్వారా పాఠశాలల సందర్శనలను  పరిపాలనా తనిఖీల నుంచి క్రమబద్ధమైన మార్గదర్శక కార్యక్రమాలుగా పునఃరూపకల్పన చేశారు. క్లస్టర్‌ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి స్థాయిలోని అధికారులు ఇప్పుడు తెలంగాణ పాఠశాల విద్యా అప్లికేషన్ లో నేరుగా నమోదు చేసిన ఒకే ఉమ్మడి పరిశీలన సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. సందర్శన జరిగిందా లేదా అనే దానితో పాటు, వాస్తవంగా ఏం గమనించారు? దానిపై తదుపరి చర్యలు ఏం తీసుకున్నారు అనే దాని ఆధారంగా సందర్శన నాణ్యతను అంచనా వేస్తున్నారు.

డిజిటల్‌ ఆధారిత పర్యవేక్షణ..
పరిపాలనా బులెటిన్ లకు బదులుగా, పర్యవేక్షణ డాష్‌బోర్డ్‌ల నుండి లభించే ప్రత్యక్ష డేటా ఆధారంగా ఎస్‌ఇఆర్‌టి రూపొందించిన, అభ్యాసంపై దృష్టి సారించి నిర్దిష్ట ఎజెండాలతో నెలవారీ సమీక్షా సమావేశాలను తప్పనిసరి చేశారు. ఈ రెండింటికీ ఆధారం ఐదు ప్లాట్‌ ఫారమ్‌లతో కూడిన డిజిటల్‌ నిర్మాణం ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్, తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అప్లికేషన్,  ట్రాకింగ్, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్,  విద్యా సమీక్షా కేంద్రం (విఎస్‌కె) పర్యవేక్షణ కేంద్రం ఇది 33 జిల్లాలన్నింటిలోనూ ఒకే, నిజ–సమయ ప్రామాణిక సమాచార వనరుగా ప్రత్యక్షంగా పనిచేస్తోంది. 

విఎస్‌కె సిబ్బంది ఈ డాష్‌బోర్డ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ, లోపాలను గుర్తించి, నేరుగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో, 2,100 మందికి పైగా అధికారులు ఇప్పుడు పర్యటనలు నిర్వహిస్తూ, బ్లాక్‌ , క్లస్టర్‌ సమీక్షలను సులభతరం చేస్తున్నారు. ఇంకా, 100 మందికి పైగా సీనియర్‌ అధికారులు ఇదే ప్రత్యక్ష డేటాను ఉపయోగించి రాష్ట్ర , జిల్లా సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు.

ఫలితాలు సుస్పష్టం...
మొత్తంగా విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల  ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 2025–26 విద్యా సంవత్సరంలో అధికారుల స్కూల్‌ విజిట్స్‌ 2.5 రెట్లు పెరిగి 1.5 లక్షలకు పైగా చేరాయి, ప్రతి త్రైమాసికంలో 98% పాఠశాలలను సందర్శిస్తున్నారు. ఇప్పుడు బోధనా–అభ్యసన సామగ్రి విద్యా సంవత్సరం మొదటి నెలలోనే 90% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరుతోంది. సమీక్షా సమావేశాలు మరింత క్రమబద్ధంగా మారాయి.

సెంట్రల్‌ స్క్వేర్‌ ఫౌండేషన్‌ సాంకేతిక సహకారంతో తెలంగాణ ఎస్‌సిఇఆర్‌టి   33 జిల్లాల వ్యాప్తంగా 2వ తరగతి పిల్లలకు వార్షిక నమూనా–ఆధారిత మూల్యాంకనాన్ని ఏర్పాటు చేసింది. గత 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ మూల్యాంకనం, ప్రస్తుతం 1,750కి పైగా పాఠశాలల్లోని సుమారు 8,500 మంది పిల్లలను కవర్‌ చేస్తోంది.  తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌  గణితంలో అక్షర మరియు పద గుర్తింపు, పేరా పఠనం, సంఖ్యల గుర్తింపు, అంకగణితంతో సహా నైపుణ్యాలను అంచనా వేస్తుంది. నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి, ఈ మూల్యాంకనాలను సాధారణ తరగతి ఉపాధ్యాయులు కాకుండా, శిక్షణ పొందిన డీఐఇటి విద్యార్థులు నిర్వహిస్తారు. దీనికి మద్దతుగా, రాష్ట్ర స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు జిల్లా స్థాయిలో ఈ విద్యార్థి–మూల్యాంకకులను సిద్ధం చేసే రెండు అంచెల శిక్షణా కార్యక్రమం ఉంటుంది.

పఠన సామర్ధ్యంలో నారాయణ పేటకు అగ్రస్థానం...
గత 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల మధ్య, తెలుగు వాక్య పఠనం 6 శాతం పాయింట్లు  ఆంగ్ల వాక్య పఠనం 9 పాయింట్లు మెరుగుపడగా, గణితంలో కూడిక , తీసివేత స్కోర్లు వరుసగా 8 . 6 పాయింట్లు పెరిగాయి. అత్యంత గణనీయమైన పురోగతి నారాయణపేట జిల్లాలో కనిపించింది. అక్కడ తెలుగు పద పఠనంలో 19 పాయింట్లు, ఆంగ్ల వాక్య పఠనంలో 29 పాయింట్లు,  సంఖ్యాశాస్త్ర వ్యవకలనంలో 28 పాయింట్లు పెరిగాయి. స్వతంత్రమైన, సూక్ష్మమైన మూల్యాంకన సమాచారం జిల్లా స్థాయిలో నిర్దిష్టమైన అభివద్ధిని ఎలా సాధించగలదో అనడానికి ఇది ఒక నిదర్శనం.

పాఠశాల సందర్శనలు, సమీక్షా సమావేశాలు,  అభ్యసన సమాచారాన్ని  మూడు వేర్వేరు ప్రక్రియలుగా పరిగణించడం మానేసి, వాటన్నింటినీ ఒకే అనుసంధానిత వ్యవస్థగా రూపొందించినప్పుడు వచ్చే సత్ఫలితాలను తెలంగాణ అనుభవం చూపిస్తుంది. విద్యార్ధులు నిజంగా ఏమి నేర్చుకుంటున్నారు? అనే దానిపై సమాంతర, స్వతంత్ర, కఠినమైన మదింపుల ఆధారంగా  తెలంగాణ ఒక నమూనాని నిర్మించింది. ఈ నమూనాలో పర్యవేక్షణ  పాఠశాలల్లో ఏమి జరుగుతుందో కేవలం నమోదు చేయడమే కాకుండా, ఆ తర్వాత ఏమి జరగాలనే దానిని కూడా నిర్దేశిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement