మగవారిపై కేన్సర్‌ పడగ.. భయపెడుతున్న గణాంకాలు.. | NIMS Said Cancer cases are expected to rise significantly At Hyderabad | Sakshi
Sakshi News home page

మగవారిపై కేన్సర్‌ పడగ.. భయపెడుతున్న గణాంకాలు..

Apr 7 2026 3:08 PM | Updated on Apr 7 2026 4:09 PM

NIMS Said Cancer cases are expected to rise significantly At Hyderabad

దేశవ్యాప్తంగా కేన్సర్‌ బాధితుల సంఖ్య రానురాను పెరుగుతూనే ఉంది. అలాంటి ముప్పును ఎదుర్కుంటున్న వాటిలో అభివృధ్ధి పధంతో ఉన్న నగరాలే ముందుండడం ఆందోళన కరం. అదే క్రమంలో తెలుగు రాష్ట్రాలకే తలమానికంగా ఉన్న  హైదరాబాద్‌ నగరం త్వరలోనే కేన్సర్‌ కేంద్రంగా మారనుందని ఓ ప్రతిష్టాత్మక ఆసుపత్రి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే...

ప్రమాద ఘంటికలు...ఆ గణాంకాలు...
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిజామ్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాదిలో కేన్సర్‌ కేసులు గణనీయంగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లోని పురుషులలో కనిపించే అన్ని రకాల కేన్సర్లలో ఒక్క ప్రోస్టేట్‌ రూన్సర్‌ వాటాయే దాదాపు 6.9 శాతంగా ఉంది.  తెలంగాణలో నమోదవుతున్న ​కేన్సర్‌ కేసుల్ని పరిశీలించి చూస్తే, ఈ 2026లో కేవలం పురుషులలోనే 21,252 కొత్త కేన్సర్‌ కేసులు నమోదవుతాయని మొత్తం  రాష్ట్రవ్యాప్తంగా నమోదు కాబోయే కేన్సర్‌ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

హైదరాబాద్‌లో 0 నుంచి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో కేన్సర్‌ వచ్చే ముప్పు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా. ఇది ముందుగా కేన్సర్‌ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.

నిర్ధారణ లేకపోతే నివారణ ఎలా?
ఇంత తీవ్రంగా వ్యాధి విస్త్రుతి ఉన్నప్పటికీ, కేన్సర్‌  స్క్రీనింగ్‌ రేట్‌ మాత్రం  4 శాతం కంటే దిగువనే ఉండడం ఆందోళనకరం. పెరుగుతున్న కేన్సర్‌ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. 

ఆ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి. చాలా మంది రోగులు కేన్సర్‌ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పొగతాగడం, ప్రాసెస్‌ తినడం...
ఈ కేన్సర్‌ కేసులు  సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం బాగా తగ్గడం వంటివి ఈ న్సర్‌ విజృంభణకు ముఖ్య కారణాలు. 

అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం,  మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్‌ అసౌకర్యం వంటి ప్రోస్టేట్‌ కేన్సర్‌ ప్రారంభ లక్షణాలను అవగాహన లోపంతో అలక్ష్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  వీటిని వయసుతో పాటు వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ అపోహ వైద్య సహాయం అందుకోవడంలో ఆలస్యానికి  దారితీస్తుంది,

ప్రారంభంలో గుర్తిస్తే మేలు...
‘ప్రోస్టేట్‌ క్యాన్సర్‌  ప్రారంభ దశలో తీవ్రంగా ఉండదు,  అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది,‘ అని జూబ్లీ హిల్స్‌లోని అపోలో హెల్త్‌ సిటీ లో మెడికల్‌ ఆంకాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ నిఖిల్‌ సురేష్‌ గడ్యాల్‌ పాటిల్‌ అంటున్నారు. అయితే చాలా మంది మగవారు  వ్యాధి  లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారనీ, రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకోవడం లేదని అన్నారాయన.  

సమస్య తీవ్రమైన తర్వాత హాస్పిటల్‌ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోవడం చికిత్సను మరింత క్లిష్టతరం చేస్తోందన్నారు. అందువల్లే ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం లేదన్నారు. ‘‘ 50 ఏళ్ల వయసు దాటిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం అనే చిన్న ఆలోచన చేస్తే చాలు..అది ఈ పరిస్థితిని గణనీయంగా మార్చగలదు...‘ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆవిష్కరణలు కాదు..అవగాహనే ముందు
శస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్‌ థెరపీ ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం కేన్సర్‌ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్‌ కేన్సర్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్న అంచనాలతో హైదరాబాద్‌ నగర  ప్రస్తుత పరిస్థితి ఒక సవాలుగా నిలుస్తోంది.  

ఈ పరిస్థితిని వ్యాధి విస్త్రుతిని నివారించడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై కన్నా, ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే వైద్య సంప్రదింపులను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

(చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement