కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్షాక్ తగిలింది. గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్పీజీ గ్యాస్ సంస్థ లిట్రో గ్యాస్ లంక ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి (ఏప్రిల్5)నుంచి అమల్లోకి రానున్నాయి.
లిట్రో గ్యాస్ తెలిపిన వివరాల మేరకు.. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.
ప్రస్తుతం కొలంబోలో కొత్త ధరలు ఇలా ఉన్నాయి
12.5 కిలోల సిలిండర్: రూ. 775 పెరిగి రూ. 4,765
5 కిలోల సిలిండర్: రూ. 308 పెరిగి రూ. 1,910
2.3 కిలోల సిలిండర్: రూ.140 పెరిగి రూ.840
వినియోగదారులపై ప్రభావం
ఈ పెంపు వల్ల శ్రీలంక ప్రజలకు జీవన వ్యయాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం (భారత్లో ఉగాది..శ్రీలంకలో పుత్తాండు) సీజన్లో గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అయితే లిట్రో గ్యాస్ లంక వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.


