నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్‌ ఆమె..! | Anand Mahindra Shares Odisha's Payal Nag Inspirational Story | Sakshi
Sakshi News home page

నిజమైన ధైర్యం, తిరుగులేని శక్తికి కేరాఫ్‌ ఆమె..! ఆనంద్‌ మహీంద్రా సైతం..

Apr 7 2026 1:36 PM | Updated on Apr 7 2026 3:10 PM

Anand Mahindra Shares Odisha's Payal Nag Inspirational Story

సకల సౌకర్యాలతో ఎటువంటి వైకల్యం లేకుండా సాధించిన విజయాలను ఎన్నో చూసి ఉంటాం. కానీ కడు పేదరికం, ఓ పక్క వైకల్యంతో సతతమతమై చిన్నారులు..ఏదో సాదించాలన్న ఆశతో బతుకుతున్న వైనం మనల్ని ఎంతగానో కదలిస్తుంది. పైగా అలాంటి వాళ్లు సాధించి విజయాలు అత్యంత స్ఫూర్తిదాయకమైనవి, ప్రశంసనీయమైనవి కూడా. అలాంటి వ్యక్తులు అసామాన్య ధైర్యానికి, తిరుగలేని శక్తికి అర్థాన్నిచ్చేలా నిలబడతారు, గెలుస్తారు అని చెబుతున్నారు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా.

ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేరణాత్మక కథలను షేర్‌ చేసే ఆనంద్‌ మహీంద్రా ఈసారి కూడా మనసుని తాకే సరికొత్త స్ఫూర్తిదాయకమైన కథతో మన ముందుకొచ్చారు. తనకు నిరాశనిస్ప్రుహలు కలిగినప్పుడల్లా అలాంటి మహోన్నత వ్యక్తుల వైపుకి చూస్తానంటూ ఒడిశాకు చెందిన పాయల్ నాగ్‌ అనే పారా ఆర్చరీ కథను సోషల్‌ మీడియా ఎక్స్‌లో షేర్‌ చేశారు. 

ఆ పోస్ట్‌లో ఆనంద్‌ మహీంద్రా ఇలా రాసుకొచ్చారు. రోజువారీ కూలీ అయిన ఒక మేస్త్రీ కుటుంబంలో జన్మించిన పాయల్ బాల్యం అంతా కష్టాలతో నిండిపోయింది. కేవలం ఎనిమిదేళ్ల వయసులో, విద్యుదాఘాతానికి గురై తన నాలుగు అవయవాలనూ కోల్పోయింది. నిజానికి ఆమె ఎదుర్కొన్న ప్రమాదం జీవితానికి ముగింపు పలికేలా చేసే దారుణమైన ఘటన. 

అయితే పాయల్‌ తన పరిస్థితిని ధిక్కరించేలా అద్భుతమైన ఆరంభానికి నాంది పలకడం విశేషం. ఆమె నేరుగా ఈ విలువిద్య శిక్షణలోకి రాలేదు. ఆమె మొదటగా తన ఐడెంటీటిని చిత్రీకరణతో తెచ్చుకుంది. అవయవాలు లేకపోయినా..పట్టుదలతో చిత్రాలు గీయాలన్న ఆమె తాపత్రయం అందర్నీ కట్టిపడేసేది. ఆ విలక్షణ ప్రతిభను శీతల్‌ దేవికి శిక్షణ ఇచ్చిన కుల్దీప్‌ వేద్వాన్‌ గుర్తించారు. ఆమె పట్టుదల, స్ఫూర్తిని గుర్తించి, పారా ఆర్చరీ శిక్షణతో ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మార్గనిర్దేశం చేశారు. 

అలా అలుపెరగని పట్టుదలతో పాయల్‌ తన పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. కాలక్రమేణ నైపుణ్యం, ఆత్మవిశ్వాసం రెండిటిని పెంపొందించుకుంటూ..ఉన్నత స్థాయికి ఎదిగింది. ఆమె సామర్థ్యాలు ప్రపంచానికే తెలిసేల చేసిన కీలక మలుపు ఏప్రిల్‌ 2026లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్‌ పారా ఆర్చరీ సిరీస్‌. ఆ పోటీల్లో ఫైనల్‌కు చేరుకుని తన ఆరాధ్య దేవత అయిన శీతల్‌ దేవిని ఎదుర్కొని,  ఓడించింది. అలా ఆ పోటీల్లో పాయల్‌ స్వర్ణం సాధించి ప్రపంచ వేదికపైకి అద్భుతంగా అడుగుపెట్టింది. 

 

అంతేగాదు ప్రపంచంలోనే అవయవాలు లేని తొలి ఆర్చర్‌గా ఘనత అందుకుంది పాయల్‌. ఇది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఇక్కడ కోచ్‌ కుల్దీప్ వేద్వాన్ ఆమె ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. ఆమె కృత్రిమ కాళ్లతో ఆపరేట్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్లును తయారుచేశారు. ఇందులో భాగంగా, విల్లును పైకి ఎత్తడంలో సహాయపడటానికి ఆమె కుడి కృత్రిమ కాలుపై ప్రత్యేకంగా రూపొందించిన ఉక్కు పరికరాన్ని, అలాగే శీతల్ మాదిరిగానే ఛాతీ నుంచి విల్లును విడుదల చేసే యంత్రాంగాన్ని కూడా అమర్చారు. 

ఆమెను ఆ పరికరాలకు అలవాటు చేయడానికి సుమారు మూడు నెలల సమయం పట్టిందని వేద్వాన్ వెల్లడించారు. పాయల్‌ కేవలం 2023లో శిక్షణ ప్రారంభించి..జస్ట్‌  మూడేళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడే స్థాయికి ఎదిగి, విజయకేతనం ఎగరవేసింది. అని పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. అంతేగాదు తనకు ఎప్పుడైనా నిరాశగా లేదా నిరుత్సాహంగా అనిపించినప్పుడు నిలదొక్కుకోవడానికి, సరైన దృక్పథాన్ని పొందడానికి పాయల్‌, శీతల్‌ సక్సెస్‌ జర్నీల వైపు చూస్తానని అన్నారు. వీళ్లు ఒక్కరోజుకే పరిమితమై స్ఫూర్తిప్రదాతలు కాదని, అసాధారణమైన అడ్డంకులను చేధించిన మహోన్నతమైన క్రీడాకారిణులని, ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని ప్రశంసించారు మహీంద్రా.

 

(చదవండి: ఆ సమయంలో కూడా కూతురిపై ప్రేమ తగ్గదు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement