ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక | Bad News Robert Kiyosaki Warns 2026 Financial Meltdown recommends save gold | Sakshi
Sakshi News home page

ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక

Apr 5 2026 12:08 PM | Updated on Apr 5 2026 1:37 PM

Bad News Robert Kiyosaki Warns 2026 Financial Meltdown recommends save gold

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు.

"బ్యాడ్‌ న్యూస్‌.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్‌ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు
1974 వరకు అమెరికా డాలర్‌కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్‌కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.

పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం
1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్‌తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అప్పుల ఊబిలో అమెరికా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.

మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..
ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్‌ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా  బంగారం (Gold), వెండి (Silver), బిట్‌కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.

యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.
ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా..

"1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్‌ను ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement