న్యూఢిల్లీ: లక్షల జీతం తెచ్చిపెట్టే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలివేసి, సన్యాసిగా మారి.. 2025 మహాకుంభ్ మేళాలో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ‘ఐఐటీ బాబా’ గుర్తున్నారా? ఇప్పుడు ఆయన తన సన్యాస జీవితానికి స్వస్తి పలికి ఓ ఇంటివాడయ్యారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న అభయ్ సింగ్.. ప్రీతిక అనే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ను వివాహం చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని అఘంజర్ మహాదేవ్ ఆలయంలో శివరాత్రి పర్వదినాన వీరు ఒక్కటవ్వగా, ఫిబ్రవరి 19న కోర్టు మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి వార్త కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.
తాజాగా అభయ్ సింగ్ తన భార్యతో కలిసి హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని తన సొంత గ్రామానికి చేరుకున్నారు. బ్యాంకులో కేవైసీ ఫార్మాలిటీస్ పూర్తి చేయడంతో పాటు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికే ఇక్కడికి వచ్చినట్లు తనదైన కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన మీడియాతో చెప్పాడు. హర్యానాకు చెందిన అభయ్ సింగ్ (అభయ్ గ్రేవాల్).. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ వైపు మళ్లి డిజైన్లో మాస్టర్స్ చేశారు. అనంతరం కెనడా వెళ్లి ఏటా రూ.36 లక్షల ప్యాకేజీతో మూడేళ్ల పాటు ఉద్యోగం చేశారు. కానీ అక్కడ తీవ్రమైన డిప్రెషన్కు గురికావడంతో.. జీవిత పరమార్థం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
కెరీర్ను వదిలేసి సన్యాసం స్వీకరించాడు. 2025 మహాకుంభ్ మేళాలో సన్యాసి దుస్తుల్లో ఉన్న అతను.. తాను ఐఐటీలో చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అప్పటినుంచి నెటిజన్లు ఆయనను ‘ఐఐటీ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. గతంలో తన తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాలు చూసి పెళ్లి వ్యవస్థపైనే తనకు నమ్మకం పోయిందని అభయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకో గర్ల్ఫ్రెండ్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోలేదని తెలిపారు. కుటుంబానికి దూరంగా సన్యాసిగా గడిపిన అతను ఇప్పుడు మనసు మార్చుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం విశేషం. అభయ్ తాజా నిర్ణయంతో అతని తండ్రితో పాటు తల్లి షీలా దేవి కూడా ఎంతో సంతోషించారు. కొడుకు, కోడలిని ఇంటిలోనికి సాదరంగా స్వాగతించారు.
ఇది కూడా చదవండి: ‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు!


