మన తరఫున క్యూలో నిలబడి సేవ చేస్తారు! | Delhi Startup CarryMen Turns Shopping Chaos into Luxury Convenience | Sakshi
Sakshi News home page

మన తరఫున క్యూలో నిలబడి సేవ చేస్తారు!

Jul 11 2026 9:29 PM | Updated on Jul 11 2026 9:29 PM

Delhi Startup CarryMen Turns Shopping Chaos into Luxury Convenience

షాపర్స్‌కు అండగా ‘క్యారీమెన్‌’ స్టార్టప్!

‘జేబు నిండా సొమ్ముంది.. నచ్చిన వస్తువులన్నీ కొనే దమ్ముంది.. కానీ, అవన్నీ మోసుకుంటూ ఆ రద్దీలో ఎవరు నడుస్తారు బాబూ? వద్దులే!’ అని షాపింగ్‌ను వాయిదా వేసుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షాపింగ్‌ చేయడం మీ వంతు అయితే ఆ బరువును మోయడం మా వంతు అంటూ సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది ‘క్యారీమెన్‌’ అనే స్టార్టప్. న్యూక్లియర్ ఫ్యామిలీల కాలంలో షాపింగ్ బ్యాగులు మోసేందుకు తోడు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో ఈ వెరైటీ ‘వెయిట్‌ లిఫ్టర్స్’ సేవలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారాయి.

స్వీయానుభవం నుంచే పుట్టిన ఆలోచన!

ఢిల్లీలోని అత్యంత రద్దీ మార్కెట్లయిన లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్, చాంద్‌నీ చౌక్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ చేయడం ఒక ఎత్తైతే.. భారీ బ్యాగులు మోస్తూ గంటల తరబడి తిరగడం మరో ఎత్తు. ఈ క్రమంలో షాపింగ్ ఆనందం కాస్తా విరక్తిగా మారుతోందని ‘క్యారీమెన్‌’ వ్యవస్థాపకులు స్వయంగా గుర్తించారు. ఆ స్వీయానుభవం నుంచే ‘యూ షాప్.. వుయ్ క్యారీ’ అనే సరికొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.

ఈ స్టార్టప్ ద్వారా బుక్ చేసుకునే ప్రత్యేక సహాయకులు కేవలం కస్టమర్ల బ్యాగులు మోయడానికే పరిమితం కావడం లేదు. షాపర్స్‌కు లగ్జరీ అనుభూతిని మిగులుస్తూ ఎక్కువ సేవలను అందిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ దగ్గర, బిల్లింగ్ కౌంటర్ల వద్ద కస్టమర్ల తరఫున ఈ సహాయకులే క్యూలో నిలబడతారు. షాపింగ్ ముగిసిన తర్వాత సరుకులతో సహా కస్టమర్లను మెట్రో స్టేషన్ లేదా వారి వాహనాల వరకు సురక్షితంగా చేరవేస్తారు. ఎండ/వాన నుంచి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, అలసిపోతే కూర్చోవడానికి మడత కుర్చీలు కూడా వీరు వెంట తెచ్చుకుంటారు.

ఎవరికి ఎక్కువ ఉపయోగం?

ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ సేవలు కొండంత అండగా నిలుస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం గంటకు రూ.149 చార్జీతో లభిస్తుండటం విశేషం.

దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికలు

ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటున్న ‘క్యారీమెన్‌’ త్వరలోనే దేశంలోని ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. రాబోయే పండుగల సీజన్ నాటికి ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.

ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement