అనిల్ అంబానీ గ్రూప్ కథ ముగిసినట్లేనా? | ed-seizes-anil-ambani-group-assets-1021cr | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీ గ్రూప్ కథ ముగిసినట్లేనా?

Jul 11 2026 7:34 PM | Updated on Jul 11 2026 7:40 PM

ed-seizes-anil-ambani-group-assets-1021cr

అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి భారీ చర్యకు దిగింది. శనివారం నాటి తాజా ఉత్తర్వుల ప్రకారం గ్రూప్‌నకు చెందిన రూ.1,021 కోట్ల విలువైన తాజా ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ తాజా జప్తుతో కలిపి ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.20,367 కోట్లకు చేరింది.

తాజా జప్తులో ఉన్న ఆస్తులు ఇవే..

ఈ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ఆర్డర్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను, సాసన్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌ల నుంచి రావలసిన కొన్ని రుణ వసూళ్ల (లోన్‌ రిలీవెబుల్స్‌) మొత్తాలను ఈడీ సీజ్ చేసింది. ఇటీవల ఈ గ్రూపునకు చెందిన ఈ-కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణాలతో పాటు దాని డైరెక్టర్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ ఆస్తులను గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది.

అసలు కేసు ఏమిటి? ప్రజాధనం ఎలా మళ్లింది?

ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న మూలాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీబీఐ ఈ కేసులను నమోదు చేసింది.

ఈడీ దర్యాప్తులో తేలిన విషయాలు

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి సేకరించిన దాదాపు రూ.15,548 కోట్ల ప్రజా ధనాన్ని అనిల్ అంబానీ గ్రూప్ పక్కదారి పట్టించింది. గ్రూప్ నియంత్రణలో ఉన్న ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న డమ్మీ (షెల్) కంపెనీల నెట్‌వర్క్ ద్వారా ఈ నిధులను క్రమబద్ధంగా మళ్లించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.

ఈ కేసులో ఇటీవలే సీబీఐ ముంబైలోని ప్రత్యేక కోర్టులో రూ.4,097 కోట్ల బ్యాంక్ మోసానికి సంబంధించి తొలి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలతో పాటు రిలయన్స్ క్యాపిటల్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా వంటి కీలక అధికారుల పేర్లను చేర్చింది. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరికొంత మంది డైరెక్టర్లు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు, జప్తులు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement