తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారుల వాహనంపై విజయన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరువనంతపురంలో ఆందోళనకారులను అదుపు చేసే సమయంలో ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. విజయన్పై ఈడీ దాడి బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలో భాగమని సీపీఎం ఆరోపణలు చేస్తోంది.
బుధవారం తెల్లవారుజాము నుంచి తిరువనంతపురం, కన్నూరులో విజయన్ ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో పినరయి విజయన్ ఇళ్లు సహా కేరళంలోని 10 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు.
వందలాది పార్టీ కార్యకర్తలు, స్థానిక నేతలు, మాజీ మంత్రులు విజయన్ ఇంటి ఎదుట గుమిగూడారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలు ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీలు చేపట్టారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు కాంగ్రెస్-బీజేపీ ఒప్పందంలో భాగమని అన్నారు. సీపీఎంను బలహీనపర్చే ప్రయత్నాలను ఆందోళనలు, న్యాయ పోరాటాలతో ఎదుర్కొంటామని చెప్పారు.


