తిరువనంతపురం: మనీలాండరింగ్ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణాకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం కొచ్చిలోని తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. వీణాతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు చెందిన అధికారులు సహా మొత్తం తొమ్మిది మందికి ఈ సమన్లు జారీ చేసినట్లు సమాచారం.
కాగా, గత నెల పినరయి విజయన్ నివాసంలో ఈడీ ఆకస్మిక తనీఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయన్ నివాసంతో పాటు ఆఫీసులు, బంధువుల ఇళ్లలోనూ భారీ సోదాలు చేసింది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈడీ దర్యాప్తు కేరళంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.
కొచిన్ మినలర్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన అనుమానాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్ను శాఖ కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో సోదాలు నిర్వహించిన తరువాత.. సంస్థ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు, చెల్లింపుల వివరాలు బయటపడ్డాయి. అందులో అవకతవకలు బయటపడ్డాయి. కొన్ని లావాదేవీలు నిజమైన వ్యాపార సేవలకు సంబంధం లేకుండానే జరిగాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సీపీఎం, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. నిరసనల సమయంలో ఈడీ సిబ్బంది, పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులు జరిగాయని ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే పోలీసుల చర్యను కేరళ ప్రభుత్వం సమర్థించగా, దర్యాప్తును అడ్డుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.


