‘ఫార్చ్యూన్ ఇండియా’ పవర్‌ఫుల్‌ మహిళగా నీతా అంబానీ టాప్ | Nita Ambani Tops Fortune India Most Powerful Women 2026 | Sakshi
Sakshi News home page

‘ఫార్చ్యూన్ ఇండియా’ పవర్‌ఫుల్‌ మహిళగా నీతా అంబానీ టాప్

Jul 11 2026 6:52 PM | Updated on Jul 11 2026 6:58 PM

Nita Ambani Tops Fortune India Most Powerful Women 2026

భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలను శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా లీడర్ల జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతిష్టాత్మక సంస్థ ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026’ జాబితాలో ఆమె మొదటిస్థానం కైవసం చేసుకున్నారు. ఇటీవల ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఈషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్‌ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.

అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే!

అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం సదస్సులో నీతా అంబానీ చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది. ప్రస్తుత సమాజానికి హార్డ్‌ పవర్ కంటే మానవీయ విలువలతో కూడిన ‘సాఫ్ట్ పవర్’ అవసరమని ఆమె నొక్కిచెప్పారు. ‘నా దృష్టిలో నిజమైన అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే. నేడు ప్రపంచానికి కఠినమైన ఆధిపత్యం వద్దు.. కరుణ, సానుభూతి, ప్రకృతి, జీవకోటి పట్ల అపారమైన గౌరవంతో కూడిన సాఫ్ట్ పవర్ కావాలి. పిల్లలను మనం నమ్మినప్పుడు వారు సాధించలేనిదంటూ లేదు’ అని నీతా అంబానీ అన్నారు.

దేశవ్యాప్తంగా విద్యా, ఆరోగ్య, క్రీడా, గ్రామీణాభివృద్ధి రంగాల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 10 కోట్ల (100 మిలియన్లు) మందికి పైగా జీవితాలను ప్రభావితం చేసిందని, అందులో 2.9 కోట్ల మంది పిల్లలు ఉన్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.

సదస్సులోని ముఖ్య చర్చలు

  • భారత ఆర్థిక వృద్ధికి దిక్సూచిగా మారిన 100 మంది మహిళా శక్తిమూర్తులతో కూడిన ఈ 2026 జాబితా ఆవిష్కరణలో దేశంలోని బిజినెస్, ఫైనాన్స్, టెక్నాలజీ, పబ్లిక్ పాలసీ రంగాల లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్లలో పలు కీలక అంశాలు వ్యక్తమయ్యాయి.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేగవంతమైన సాంకేతిక మార్పులు పరిశ్రమలను మారుస్తున్నప్పటికీ పట్టుదల, కస్టమర్ ఫోకస్, మానవ నిర్ణయాధికారమే శాశ్వత విజయానికి మూలమని బిజినెస్ లీడర్లు స్పష్టం చేశారు.

  • మహిళా సాధికారత అంటే కేవలం బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం కాదు. సంపద సృష్టి, కుటుంబ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు చురుకైన భాగస్వాములు కావాలని ఫైనాన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

  • ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో సురక్షితమైన పని వాతావరణం, బలమైన కన్స్యూమర్ బ్రాండ్లు, మహిళలు-పిల్లల్లో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సదసులో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement