నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. 130 ఎకరాల్లో కోస్టల్ రోడ్ గార్డెన్స్ | Nita Ambani announces Mumbai Coastal Road Gardens 130-Acre project 60000 trees | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. 130 ఎకరాల్లో కోస్టల్ రోడ్ గార్డెన్స్

Jun 23 2026 12:44 PM | Updated on Jun 23 2026 1:04 PM

Nita Ambani announces Mumbai Coastal Road Gardens 130-Acre project 60000 trees

ముంబై నగరాన్ని పచ్చదనంతో నింపే బృహత్తర ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ‘ముంబై కోస్టల్ రోడ్ గార్డెన్స్’ ప్రాజెక్ట్ పురోగతిని వెల్లడించారు. నగర తీరప్రాంతంలో 130 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ముంబై భవిష్యత్తుకు అంకితమైన దీర్ఘకాలిక పర్యావరణ పెట్టుబడిగా ఆమె అభివర్ణించారు.

ఈ గార్డెన్స్‌లో 60,000కు పైగా చెట్లు, లక్షలాది పొదలను నాటే ప్రణాళిక ఉంది. ఇప్పటికే సుమారు 15,000 చెట్ల నాటే పనులు ప్రారంభమైనట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై కోస్టల్ రోడ్ వెంట విస్తరించే ఈ హరిత ప్రదేశం నగరానికి కొత్త ‘గ్రీన్ లంగ్’గా మారనుంది.

ప్రాజెక్ట్‌లో నీడనిచ్చే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, ఓపెన్ పార్కులు, పబ్లిక్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, పికిల్‌బాల్ వంటి క్రీడలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై వాసులు పిల్లాపాపలతో గడిపేలా ‘ట్రీ మ్యూజియం’ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉండనున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు కూడా ఇటీవల తొలగిపోయాయి. ముంబై కోస్టల్ రోడ్‌కు ఆనుకుని అభివృద్ధి చేయనున్న 130 ఎకరాల ప్రజా ప్రదేశాల రూపకల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. ఈ విస్తీర్ణంలో అధిక భాగం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండే పార్కులు, ఉద్యానవనాలు, సైకిల్ ట్రాక్‌లు, ప్రొమెనేడ్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పు..

ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు సెంట్రల్ పార్క్, హైడ్ పార్క్, బొటానిక్ గార్డెన్స్ ఎలా గుర్తింపుగా నిలిచాయో, అదే తరహాలో కోస్టల్ రోడ్ గార్డెన్స్ ముంబైకు కొత్త చిహ్నంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, నగర జీవన నాణ్యతను మెరుగుపరచే ఈ ప్రాజెక్ట్ ముంబై అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement