దేశీయ బ్యాంకింగ్ రంగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలనా వివాదంపై బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ కేకీ మిస్త్రీ ఎట్టకేలకు మౌనం వీడారు. మాజీ నాన్-ఎగ్జ్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన ఆరోపణలను నిరూపించడానికి నిర్వహించిన స్వతంత్ర చట్టపరమైన సమీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎదుర్కొన్న అతిపెద్ద పాలనా వివాదంపై, బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో భాగంగా కేకీ మిస్త్రీ వాటాదారులకు వివరణ ఇచ్చారు.
మార్చి 18, 2026న చక్రవర్తి రాజీనామా చేసిన తర్వాత, ఆయన లేవనెత్తిన సమస్యలను పరిశీలించడానికి ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థలను బోర్డు రంగంలోకి దించింది. ఈ స్వతంత్ర సమీక్ష జూన్ 26, 2026న పూర్తయింది.
బాహ్య సమీక్షలో లభించని ఆధారాలు
వార్షిక నివేదిక ప్రకారం, చక్రవర్తి లేఖలోని చిక్కులను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం బోర్డు కొన్ని చర్యలు చేపట్టింది. ప్రయోజనాల వైరుధ్యం లేకుండా ఉండేందుకు కేవలం స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలోనే ఈ సమీక్ష సాగింది. చక్రవర్తి రాజీనామాకు ముందు నాటి రెండేళ్ల కాలానికి సంబంధించిన బోర్డు పత్రాలు, అంతర్గత కమ్యూనికేషన్లను న్యాయ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు, బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ, సీనియర్ మేనేజ్మెంట్ బృందాన్ని విచారించారు.
కార్పొరేట్ పాలనకే మొగ్గు
కార్పొరేట్ పాలన, పారదర్శకతకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంటుందని మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు బ్యాంకుకు సవాలుతో కూడిన దశను సూచించినప్పటికీ సంస్థ తన అంతర్గత పాలనా చట్రాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. తన రాజీనామాకు ముందు జరిగిన ఏ బోర్డు చర్చల్లోనూ చక్రవర్తి నైతికతకు విరుద్ధమైన పద్ధతులను ఎత్తి చూపలేదని బోర్డు మునుపటి వైఖరిని పునరుద్ఘాటించింది.
ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు


