హైదరాబాద్‌లో పెరిగిన పాముల సంచారం | Snake Menace on the Rise in Hyderabad Following Intermittent Rains | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెరిగిన పాముల సంచారం

Jul 8 2026 10:15 PM | Updated on Jul 8 2026 10:15 PM

Snake Menace on the Rise in Hyderabad Following Intermittent Rains

నలువైపులా కమ్ముకొస్తున్న కాంక్రీట్‌ ధాటికి  నాగులు బుసలు కొడుతూ బయటకు వస్తున్నాయి. సాధారణంగా వానల సీజన్‌ తొలిదశలో సర్ప సంచారం కనిపించడం సహజమే అయినప్పటికీ ఈ ఏడు మరింతగా పెరగడం గమనార్హం. నగరానికి చెందిన ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్‌ సొసైటీ (ఎఫ్‌ ఓఎస్‌) గణాంకాలు ఈ పెరుగుదలను థృవీకరిస్తున్నాయి.

వాతావరణ మార్పుల ప్రభావం...
సాధారణంగా పాముల కదలికలో వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయి. ఆ మార్పుల ఆధారంగానే నివాస ప్రాంతాలలో పాముల సంచారంలోనూ సీజనల్‌ పెరుగుదల కనిపిస్తుంది. వానలు ప్రారంభం అయే జూన్‌ నెలలో భిన్న జాతుల పాముల పిల్లలను పొదుగుతాయి. ముఖ్యంగా తొలి రుతుపవనాల తేమ పాముల కార్యకలాపాలను, గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడాన్ని ప్రోత్సహిస్తుంది.  ఆ తర్వాత వరుస  వర్షాలు సాధారణంగా పాముల జాడలను తగ్గిస్తాయి. ‘నిరంతరాయంగా వర్షాలు కురిసినప్పుడు, ఉష్ణోగ్రతలు పడిపోతాయి  పాములు బొరియలలో లేదా పగుళ్లలో దాక్కోవడానికి ఇష్టపడతాయి. వర్షం కారణంగా, బయట కనిపించడం తగ్గిపోతుంది, కాబట్టి  పాముల్ని గుర్తించే అవకాశం తక్కువగా ఉంటుంది,

జూన్‌లో జూమ్‌...
ఈ ఏడాది జూన్‌ మొదటి 25 రోజుల్లో హైదరాబాద్‌లో పాముల సంచారం బాగా పెరిగింది.  గత ఏడాది ఇదే నెల మొత్తంతో పోలిస్తే ఈసారి  ‘సొసైటీ’కి ఎక్కువ కాల్స్‌ అందాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా, బలహీనంగా ప్రారంభం కావడం, వరుస వర్షాలు పడకపోవడంతో  పాములు  చురుకుగా మారే అవకాశం పెరిగింది.  గత ఏడాది 30 రోజుల్లో 1,200 పాముల్ని పట్టుకున్నట్టు ’ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ’ గణాంకాలు చెబుతున్నాయి. అదే ఈ ఏడాది  25 రోజుల్లోనే 1,300 పాములను రెస్క్యూ చేశారు. 

వీటిలో  500కు పైగా నాగుపాములు, దాదాపు 300 ఎలుక పాములు ఉన్నాయి.‘రుతుపవనాల ప్రారంభంతో పాము పిల్లలు బయటకు రావడం మొదలవుతాయి కాబట్టి, జూన్‌ నెలలో మాకు పని పెరుగుతుంది,‘ అని  సొసైటీ జనరల్‌ సెక్రటరీ అవినాష్‌ అంటున్నారు. స్వాధీనం చేసుకున్న పాములను అటవీ శాఖ సహాయంతో సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నామని వెల్లడించారు..ఒకవేళ రుతుపవనాలు బలపడి, జూలై నెల లో విస్తారంగా వర్షాలు కురిస్తే, ఈ కాలంలోనే పిల్ల పాములు పొదుగుతున్నప్పటికీ, భూమిపై పాముల సంచారం తగ్గవచ్చునన్నారు.

పదేళ్లలో 16శాతంపైగా పెరుగుదల
నగర విస్తరణ పెరగడంతో పాటుగానే గత పదేళ్లలో పాముల రెస్క్యూ సంఘటనలు 16.90% పెరిగాయి. గత 2013 నుంచి 2022 వరకు నగరంలో  అన్నిరకాలు కలిపి 55,467 పాములను రెస్క్యూ చేశారు. మొత్తంగా చూస్తే గత పదేళ్లలో సగటున  ఏటా 16.90% పెరుగుతూ వస్తోంది.  లభ్యమవుతున్న వాటిలో  నాజా నాజా (భారతీయ నాగుపాము)  ప్టయాస్‌ మ్యూకోసా (ఇండియన్‌ ర్యాట్‌ స్నేక్‌ / ఎలుకల పాము)  76% వాటాను ఆక్రమించాయి. 
వర్షాకాలంలో, ముఖ్యంగా జూలై నుంచి నవంబర్‌ మధ్య పాములు కనిపించడం ఎక్కువ కాగా, వానలు తగ్గుముఖం పట్టే అక్టోబర్‌ నెలలో అత్యధికంగా రెస్క్యూలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రత, వర్షపాతం రెండూ కలిసి పాముల సంచారంపై ప్రభావం చూపుతున్నాయని గత ఏప్రిల్‌లో విడుదలైన అర్బన్‌ స్నేక్‌ ఎకాలజీ  అధ్యయనం వెల్లడించింది. అలాగే ప్రతి జాతికి దాని జీవనశైలి, అలాగే మానవ కార్యకలాపాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పగలు–రాత్రి చురుకుదన నమూనాలు ఉన్నట్లు తేల్చింది. నగరం చుట్టుపక్కల మొత్తం 3,379 గ్రిడ్‌లలో 232 (6.90%) ప్రాంతాలు పాముల సంచారానికి ముఖ్యమైన హాట్‌స్పాట్‌లుగా గుర్తించబడ్డాయి. ఇవి ప్రధానంగా హైదరాబాద్‌ శివార్లలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్న అవుటర్‌ రింగ్‌రోడ్‌ పరిసరాల్లో నెలకొని ఉన్నాయి.

అలవాటు పడుతూన్నాయా?
ఈ పరిశోధన చెబుతున్న ప్రకారం, నగరంలో కొన్ని జాతుల సర్పాలు  పట్టణ వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతున్నట్లు  తెలుస్తోంది. ఇది పాముల సంరక్షణతో పాటు ప్రజారోగ్య పరంగా కూడా కొత్త సవాళ్లను సృష్టించనుంది.  ఈ నేపధ్యంలో పాముల రక్షణ, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, దీర్ఘకాలిక పర్యవేక్షణ, వన్యప్రాణి అనుకూల పట్టణ ప్రణాళిక వంటి చర్యలు అత్యవసరమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.  

గత ఏడాదిలో 15వేలు..
గత ఏడాది మేం నగరం చుట్టుపక్కల 15వేలకు పైగా పాముల్ని రెస్కూ చేయడం మా చరిత్రలోనే ఒక రికార్డ్‌గా చెప్పాలి. ఈ ఏడాది అంతకు మించేలా పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రజల్లో పాములు కనపడగానే చంపాలనే ఆలోచన పోవడం,  రెస్క్యూ కార్యకలాపాల పట్ల అవగాహన పెరగడం హర్షణీయం. పాముల్లో అత్యధిక శాతం మనుషులకు ఎటువంటి హానీ చేయనివే. కాబట్టి వాటి సంచారం గురించిన భయాందోళనలకు బదులు అప్రమత్తత అవగాహన పెంచుకోవడం ఉత్తమం.
–అవినాష్, సొసైటీ కార్యదర్శి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement