న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్ డాలర్ల ఎగుమతులకు రిస్క్లు నెలకొన్నాయని పేర్కొంది.
భౌగోళికంగా భారత్కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్గా నిలుస్తోందని జీటీఆర్ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్ దాదాపు 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.
పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్ 4.43 బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.
నివేదికలోని మరిన్ని వివరాలు..
గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్పై భారత్ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి.
2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు 396.5 మిలియన్ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి.
యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్ డాలర్లు), టీ (410.1 మిలియన్ డాలర్లు), ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ తదితరాలు (1.35 బిలియన్ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్–ప్రాసెస్డ్ ఉత్పత్తులు (1.81 బిలియన్ డాలర్లు) మొదలైనవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి.
281.1 మిలియన్ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం.
197.5 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్–ఆల్కహాలిక్ పానీయాలను పశ్చిమాసియాకి భారత్ ఎగుమతి చేసింది.


