ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ధరలు
వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
70 డాలర్ల నుంచి ఏకంగా 92.69 డాలర్లకు..
100ను తాకవచ్చంటున్న నిపుణులు
దేశీయంగా తీవ్రత తగ్గించేందుకు పలు చర్యలు
(సాక్షి, బిజినెస్ ప్రతినిధి) : పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం.. ఇరాన్ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్లోని అమెరికా రక్షణ స్థావరాలన్నిటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరింది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థలాంటి హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించటంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది.
ఇంధన అవసరాలపై భయాందోళనలతో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల దాడి ఆరంభించే నాటికి బ్యారెల్ ముడిచమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా 92.69 డాలర్లకు చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 13 శాతం పెరగటం గమనార్హం. ఈ ధోరణి కొనసాగితే ధర మరింత పెరిగి తక్షణం 100 డాలర్లు దాటేయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దిగుమతులపై భారం...
భారత్కు అవసరమైన చమురులో 85–88 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. కాబట్టి అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది.
ఈ ఏడాది తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగటంతో పాటు ఇతర వస్తువుల ధరలూ పెరుగుతాయి. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం ధరలు పెరిగి ఆయా రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకూ వ్యాపిస్తుంది.
దేశీయంగా పలు చర్యలు...
ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి భారత్ ఇప్పటికేపలు చర్యలు తీసుకుంటోంది. వ్యూహాత్మకంగా చమురు నిల్వలను పెంచుకోవటంతో పాటు పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని విస్తరించటం.... ప్రత్యామ్నాయ దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవటం వంటివి ఇప్పటికే చేస్తోంది.
ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) కింద ఆదేశాలు జారీ చేస్తూ... ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టంచేసింది.
మన దగ్గర 6-8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలున్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికితోడు దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్ నిల్వలూ ఉన్నాయని, సంక్షోభం ఎక్కువకాలం కొనసాగితే సరిపడేంత ఆయిల్ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది.
ధరలు పెరిగిందిలా...
ఫిబ్రవరి 28 71 డాలర్లు
మార్చి 7 92.69 డాలర్లు


