సాక్షి, ఖమ్మం: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతే కాకుండా సొంత ఊరిలో స్థలాలు ఉన్న 101 మందికి ఇళ్లను మంజూరు చేసింది. నేడు
ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరగనుంది.
ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధి వినోబాభావే నగర్లోని భూదాన్ భూమిలో మొత్తం 742 కుటుంబాలకు చెందిన ఇళ్లను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. దీంతో ఇళ్లు కోల్పోయిన 134కు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
అనంతరం, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు చేసింది. 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కలెక్టరేట్లో టోకెన్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ మేరకు నేడు ఖమ్మం కలెక్టరేట్లో పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.


