హైదరాబాద్: తనకు నచ్చిన ఉద్యోగం ఇప్పించలేదనే అక్కసుతో కన్సల్టెన్సీ యజమానిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విజయవాడ (ఏలూరు) ప్రాంతానికి చెందిన శశికిరణ్రెడ్డి (35) కొంత కాలంగా నగరంలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శశికిరణ్ యూసుఫ్గూడలో బీజీఎస్ వారాహి సాయిరాం కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. గత నెలలో ప్రభు కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం వచ్చాడు. శశికిరణ్రెడ్డి కంపెనీ నిబంధనల ప్రకారం అతని వద్ద రూ.2,500 తీసుకుని బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు.
ఉద్యోగం నచ్చలేదని.. డబ్బులు తిరిగివ్వాలని..
కొన్ని రోజుల తర్వాత తనకు ఉద్యోగం నచ్చలేదని, డబ్బులను తిరిగి ఇవ్వాలని యువకుడు అడిగాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఒకసారి ఇచి్చన నగదు తిరిగి ఇవ్వలేమని శశికిరణ్ తేల్చి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన యువకుడు గది తలుపులు వేసి శశికిరణ్ను బెదిరించాడు. చేసేదేమీలేక శశికిరణ్ రూ.1,500 ఇచ్చాడు. మిగతా వెయ్యి రూపాయలు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో శశికరణ్ మెడపై పొడిచాడు. గదిలో గొడవ జరుగుతోందని తెలుసుకున్న రిసెప్షనిస్ట్ లయ యజమాని గది తలుపు తెరిచింది. ఈ క్రమంలో యువకుడు పారిపోతూ లయపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె పట్టుకునే ప్రయత్నం చేయగా.. పక్క బిల్డింగ్లోకి దూకి పారిపోయాడు.
క్షతగాత్రుడిని పోలీసులు భుజాలపై ఎత్తుకుని..
విషయాన్ని సిబ్బంది మధురానగర్ పీఎస్కు సమాచారం అందించగా.. ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్తో కలిసి శశికిరణ్ను భుజాలపై ఎత్తుకుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు గాయపడిన లయను కూడా ఆసుపత్రిలో చేర్చారు. శశికిరణ్రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. లయ చికిత్స పొందుతోంది. కాగా శశికిరణ్రెడ్డి భార్య నాగ భారతికి 20 రోజుల క్రితమే సీమంతం చేశారు. ఆ ఆనందంలో ఉండగానే.. భర్త హత్యకు గురి కావడంతో భోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


