సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యవసర సమయంలో యువతను తొలి స్పందనకారులుగా తీర్చిదిద్దేందుకు “సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక బలగాలు సంఘటన స్థలానికి చేరుకునేలోగా ఎటువంటి నష్టం తలెత్తకుండా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇవనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అరుణ బహుగుణ ప్రారంభించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. మార్చి 10 నేటి నుంచి మార్చి 16 వరకు మొత్తం 7 రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతకు రెస్క్యూ ఆపరేషన్స్ (రక్షణ చర్యలు), అగ్నిమాపక చర్యలు ,ఫస్ట్ ఎయిడ్ చికిత్స, గుంపుల నియంత్రణ, సహాయ సామగ్రి పంపిణీ తదితర రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా యుద్ధ పరిస్థితులు, ఎయిర్ రైడ్స్, రసాయన దాడులు, అణు దాడులు వంటి విపత్తుల సమయంలో ఈ వాలంటీర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు సహాయపడతారని తెలిపారు. ఈ వాలంటీర్లు పోలీసులు, ఫైర్ సర్వీసులు, NDRFమరియు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాలంటీర్ల సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్ఎఫ్ఓ బి. సుధాకర్ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియప్పన్ అకాడమిక్స్ డీన్ డా. కళ్యాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ రహీమ్ డీఎఫ్ఓ దాస్ తో పాటు ఫైర్ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు


