టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం | VEM and TKMS sign Teaming Agreement for joint torpedo production | Sakshi
Sakshi News home page

టార్పిడోల తయారీ కోసం వీఈఎం, టీకేఎంఎస్ ఒప్పందం

Mar 10 2026 6:32 PM | Updated on Mar 10 2026 7:13 PM

VEM and TKMS sign Teaming Agreement for joint torpedo production

హైదరాబాద్‌: భారత్‌లో సంయుక్తంగా టార్పిడోలను ఉత్పత్తి చేయడానికి వీఈఎం టెక్నాలజీస్‌, టీకేఎంఎస్ సహకార ఒప్పందం (టీమింగ్ అగ్రిమెంట్‌)పై సంతకాలు చేశాయి. టార్పిడో అంటే జలాంతర్గాములు, యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే సముద్ర యుద్ధ ఆయుధం.  

టార్పిడోకు సంబంధించిన సాంకేతికత బదిలీ, “మేక్ ఇన్ ఇండియా”కు ఊతం ఇచ్చేలా హెవీవెయిట్ టార్పిడోను సంయుక్తంగా అభివృద్ధి చేయడం కోసం ఈ సహకార ఒప్పందం చేసుకున్నారు. భారత మార్కెట్‌కు ఆధునిక హెవీవెయిట్ టార్పిడోలు సరఫరా కావడానికి ఈ ఒప్పందం బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక స్వావలంబనకు ఊతం ఇవ్వడం, స్థానిక రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో టీకేఎంఎస్ సంస్థ సహకార ఒప్పందం (టీమింగ్ ఒప్పందం)పై సంతకం చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ ప్రముఖ రక్షణ సంస్థ ఆయుధ వ్యవస్థలు, గగనతల వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, తయారీ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది.  

అట్లాస్ ఎలక్ట్రానిక్ విభాగం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మైఖేల్ ఓజెగోవ్స్కీ  ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తమ టార్పిడో సాంకేతికత బదిలీ ద్వారా భారత నౌకాదళం మరింత శక్తిమంతం అవుతుందని తెలిపారు. వీఈఎం టెక్నాలజీస్‌ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పారు.

మొదటి దశలో ఈ సహకార ఒప్పందం ద‍్వారా.. హెవీవెయిట్ టార్పిడో తయారవుతుంది. భవిష్యత్‌లో అభివృద్ధి చేసే టార్పిడో ప్రోగ్రామ్స్‌లో టీకేఎంఎస్, వీఈఎం మధ్య మరింత సహకారం కూడా సాధ్యమని భావిస్తున్నారు.

వీఈఎం, టీకేఎంఎస్ మధ్య సంయుక్త సంస్థను కూడా స్థాపిస్తారు. ఈ సంస్థ ద్వారా భారత మార్కెట్‌కు దీర్ఘకాలంగా ఉన్నత ప్రమాణాల హెవీవెయిట్ టార్పిడోల సరఫరా జరుగుతుంది. అదే సమయంలో ఎగుమతి అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. టీకేఎంఎస్ విభాగమైన అట్లాస్ ఎలక్ట్రానిక్ వీఈఎంకు అవసరమైన సాంకేతికత బదిలీ చేస్తుంది. సాఫ్ట్‌వేర్ అనుమతి పత్రాలు కూడా అందిస్తుంది. దీనివల్ల భారత తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి సాధ్యం అవుతుంది.

టీకేఎంఎస్ ప్రపంచంలోని ప్రముఖ నౌకాదళ సంస్థల్లో ఒకటి. కీల్, విస్మార్, ఇటజాయి వంటి ప్రాంతాల్లో మూడు నౌకాశ్రయ కర్మాగారాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తం 9,100 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. జలాంతర్గామి నౌకలు, సముద్ర ఉపరితల యుద్ధ నౌకలు, సముద్ర ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, భద్రతా సాంకేతికత రంగాల్లో వ్యవస్థ సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కీల్ కేంద్రంలో సుమారు 3,300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement