సాక్షి, హైదరాబాద్: ఓ సైబర్ నేరంలో బాధితుడైన వ్యక్తి సాంకేతికంగా నిందితుడిగా మారాడు...ఇతడి బ్యాంక్ ఖాతాను వినియోగించుకున్న సైబర్ నేరగాళ్లు మరొకరిని మోసం చేశారు...రూ.2 లక్షలు కోల్పోయిన బాధితుడి ఫిర్యాదుతో ఈ బాధితుడు కమ్ నిందితుడిపై మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో అరెçస్టు చేయకుండా నోటీసులు జారీ చేయడానికి దర్యాప్తు అధికారి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ దందాలో మరో ఎస్సై మధ్యవర్తిత్వం చేశాడు. రూ.లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు ఎస్సైలూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు.
ఢిల్లీకి పిలిచి మనీమ్యూల్గా మార్చి...
కాంబోడియాలో తిష్టవేసి, వ్యవస్థీకృతంగా సైబర్ నేరాలు చేసే ముఠాలు తాము టార్గెట్ చేసిన వ్యక్తుల నుంచి డబ్బు డిపాజిట్/బదిలీ చేయించుకోవడానికి సొంత ఖాతాలు వాడరు. వివిధ మెట్రో నగరాల్లో ఉన్న దళారుల సాయంతో అమాయకులకు ఎర వేసి వారి ఖాతాల వివరాలు తీసుకుంటారు. సాంకేతిక పరిభాషలో వీరిని మనీమ్యూల్స్గా పిలుస్తారు. కొందరు కమీషన్లకు ఆశపడి మనీమ్యూల్స్గా మారితే మరికొందరు వాస్తవాలు తెలియక దళారుల వల్లో చిక్కుతున్నారు. సైదాబాద్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం సోషల్మీడియాలో వచి్చన ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన (పీఎంఆర్వై) పథకం నకిలీ ప్రకటన చూశాడు. దళారులు ఇచి్చన ఆ ప్రకటన నిజమైనది భావించి అందులో పేర్కొన్న నెంబరులో సంప్రదించాడు. ఇతడిని ఢిల్లీ పిలిపించుకున్న దళారులు ఓ బ్యాంకు ఖాతా తెరిపించి, రుణం మొత్తం అందులో డిపాజిట్ చేస్తామంటూ వివరాలు తీసుకుని పంపారు.
రుణానికి బదులు పిలుపు వచ్చింది...
ఆ బ్యాంకు ఖాతా వివరాలను దళారులు కాంబోడియాలో ఉన్న సూత్రధారులకు పంపారు. వీటి ఆధారంగా సైబర్ కేటుగాళ్లు మల్కాజ్గిరి పరిధిలో నివసించే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కాజేశారు. ఈ బాధితుడి ఫిర్యాదుతో ఎల్బీనగర్లోని మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని ఏఆర్ఎస్సై ప్రమోద్ గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు డబ్బు డిపాజిట్ చేసిన ఖాతా సైదాబాద్ వాసి పేరుతో ఉన్నట్లు ప్రమోద్ గుర్తించాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి ఠాణాకు పిలిపించాడు. రుణం వస్తుందని ఎదురు చూసిన సైదాబాద్ వాసికి పోలీసుల నుంచి పిలుపు రావడంతో కంగుతిన్నాడు. ఠాణాకు వచ్చి అన్ని వివరంగా చెప్పాడు. ఈ విషయం ప్రమోద్ ద్వారా సైబర్ ల్యాబ్లో పని చేసే మరో ఏఆర్ఎస్సై జటావత్ బాబు నాయక్కు తెలిసింది. సైదాబాద్ వాసి పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని పథకం వేసిన బాబు నాయక్ తాను చెప్పినట్లు చేయాలంటూ ప్రమోద్కు చెప్పాడు.
రూ.3 లక్షలు డిమాండ్ చేసి రూ.లక్ష...
దర్యాప్తు అధికారి ప్రమోద్ సూచనల మేరకు సైదాబాద్ వాసితో సంప్రదింపులు జరిపిన బాబు నాయక్ ఆ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించాడు. అలా కాకుండా నోటీసులు జారీ చేయాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత కనీసం రూ.లక్ష అయినా ఇవ్వాలని లేదంటే జైలుకు పంపిస్తామని స్పష్టం చేశాడు. దీంతో సైదాబాద్ వాసి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ సిటీ రేంజ్–2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని బృందం వలపన్నింది. సోమవారం లంచం సొమ్ము ఇస్తానంటూ సైదాబాద్ వాసి చెప్పడంతో అతడిని ఠాణాకు కాకుండా ఎల్బీనగర్ చౌరస్తాలోని ఓ ప్రాంతానికి రమ్మని ఇద్దరు ఎస్సైలు సూచించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ డబ్బు తీసుకుంటున్న ప్రమోద్, బాబు నాయక్లను అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఇద్దరినీ మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. అవినీతి అధికారులపై 1064కు కాల్ చేసి, 9440446106కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది.


