పది ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనున్న ఉన్నత విద్యామండలి
యూజీ, పీజీలో గుణాత్మక మార్పులు
గ్రామీణ విద్యార్థులు సైతం తేలిగ్గా పూర్తి చేయగలిగేలా..
మార్కెట్లో మెండుగా ఉపాధి అవకాశాలు... వెబ్సైట్లో కోర్సుల వివరాలు
సరికొత్త డిజైన్కు ప్రతిపాదన.. అన్ని యూనివర్సిటీల్లో కార్యాచరణకు ప్రణాళిక
23 వరకు సలహాలు, సూచనల స్వీకరణ.. వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతోంది. సంప్రదాయ కోర్సులను పునర్నిర్మించడం, మూడు, నాలుగేళ్ల మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ), వికసిత్ భారత్, నేషనల్ క్రెడిట్ పాలసీకి అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే అవసరమైన ముసాయిదాను మండలి పంపింది. యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది.
ఇవీ కొత్త కోర్సులు
యూజీ, పీజీలో ఉన్నత విద్యా మండలి ప్రధానంగా పది కొత్త కోర్సులు ప్రతిపాదిస్తోంది. ఇవన్నీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా తేలికగా పూర్తి చేసే కోర్సులు. మార్కెట్ లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మండలి అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వీటిని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కోర్సులపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి సలహాలు సూచనలను ఈ నెల 23 వరకూ తీసుకుంటున్నట్టు మండలి తెలిపింది. కోర్సుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
⇒ బీఏలో సెక్యూరిటీ, డిఫెన్స్ స్టడీస్, ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ ఉంటాయి.
⇒ హాస్పిటల్ నిర్వహణ, హెల్త్ మేనేజ్మెంట్ బీబీఏలో ఉంటాయి. ఎయిర్పోర్టు ఎయిర్లైన్, ఎయిర్ ట్రాఫిక్స్ కోర్సులతో బీబీఏ ప్రవేశ పెడుతున్నారు.
⇒ మారిటైం టెక్నాలజీ(నౌక నిర్మాణం, నావిగేషన్, సముద్రవాణిజ్యంలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక) కామర్స్, మేనేజ్మెంట్తో బీబీఏను తీసుకొస్తున్నారు.
⇒ బీకాంలో ఫైనాన్స్ టెక్నాలజీ, బిఎస్సీలో డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, క్లైమేట్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటివి ఉంటాయి. – కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, రోబోటిక్స్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటాసైన్స్ బీఎస్సీలో ఉంటాయి. ఇవే కోర్సులు దాదాపు పీజీలో కూడా ఉంటాయి.
ఉపాధి పెంచేందుకే..
యూజీ, పీజీ కోర్సులను క్షేత్రస్థాయి విద్యార్థులకు చేరువ చేయాలన్నదే సంకల్పం. సంప్రదాయ డిగ్రీలు, సాంకేతిక విద్యా కోర్సులే కాదు... కొత్త కోర్సుల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన తర్వాతే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనూ ఉన్నత విద్యలో సరికొత్త మార్పు కన్పిస్తుందని ఆశిస్తున్నాం.
– ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్


