సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు.
ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు.
సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు.
అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.


