మనమేం చేస్తే పిల్లలు చూస్తారు.. అదే చేస్తారు.. కుటుంబ సభ్యులు ఏం చేస్తే ఇంట్లోని పెట్స్ కూడా అలాగే చేయడం చూస్తూనే ఉంటాం. కుటుంబ సభ్యుల్లా కలిసిపోయిన పెట్స్ చేసే కొన్ని పనులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఓ పిల్లి రంజాన్ ఉపవాస దీక్షను అనుసరిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మోతీనగర్ డివిజన్లో నివాసం ఉండే ఓ ముస్లిం కుటుంబం కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో ఓ పిల్లిని కొనుగోలు చేసింది. దానికి జీజీ అని పేరుపెట్టి ప్రేమతో పెంచుకుంటున్నారు.
రంజాన్ మాసం కావడంతో కుటుంబ సభ్యులంతా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో నిత్యం వారిని అనుసరిస్తున్న ఆ పిల్లి ఉపవాస దీక్షలను పాటిస్తూ వారితో పాటు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటుంది. ఇఫ్తార్ సమయంలో కుటుంబ సభ్యుల వద్దకు వచ్చి కూర్చుంటుంది. ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించదు. వారంతా ఇఫ్తార్ పూర్తి చేసుకున్న తర్వాత దానికి ఆహారం పెడితే మాత్రమే తింటుంది. పిల్లి క్రమశిక్షణతో మెలగడంపై ఇంటి యజమాని షేక్ రియాజ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– మోతీనగర్



