30 నెలల్లో ‘పాలమూరు’ పూర్తి | Minister Uttam Kumar Reddy About Palamuru Irrigation Projects | Sakshi
Sakshi News home page

30 నెలల్లో ‘పాలమూరు’ పూర్తి

Mar 9 2026 5:55 AM | Updated on Mar 9 2026 6:04 AM

Minister Uttam Kumar Reddy About Palamuru Irrigation Projects

మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ అందుబాటులోకి..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 30 నెలల్లో పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మార్చి 2027 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో సహా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, వనరులను కల్పించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, బీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కలిపి మొత్తం రూ.1546 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.

రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగిరం చేయడంలో భాగంగా భూసేకరణ కోసం రూ.5వేల కోట్లను కేటాయిస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆదివారం ఆయన జలసౌధలో సమీక్షించారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ఈ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి ఉత్తమ్‌ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల అంచనాలతో పరిపాలనపర అనుమతులు జారీ చేసిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.27,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పుకుంటోందని తప్పుబట్టారు. అంత ఖర్చుచేసినా ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు.

తాజాగా అంచనాలు రూ.55 వేల కోట్లకు పెరిగాయని, డిస్ట్రిబ్యూటరీల వ్యయం కలిపితే రూ.80వేల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.7,161 కోట్లను ఖర్చు చేసిందన్నారు. జూరాల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా, పూడికతో 9 టీఎంసీలకు తగ్గిపోయిందని ఉత్తమ్‌ తెలిపారు. నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు తక్షణమే పూడిక తొలగింపు పనులను చేపడతామని ప్రకటించారు. జూరాల నుంచి తొలగించే ఇసుకను గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కృష్ణాజలాల్లో చుక్క నీళ్లను వదులుకోమన్నారు. సమీక్షలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement