Special courses
-
కొంగొత్తగా.. ఉన్నతంగా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతోంది. సంప్రదాయ కోర్సులను పునర్నిర్మించడం, మూడు, నాలుగేళ్ల మల్టీ డిసిప్లినరీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ), వికసిత్ భారత్, నేషనల్ క్రెడిట్ పాలసీకి అనుగుణంగా వీటికి రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే అవసరమైన ముసాయిదాను మండలి పంపింది. యూనివర్సిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ఇవీ కొత్త కోర్సులు యూజీ, పీజీలో ఉన్నత విద్యా మండలి ప్రధానంగా పది కొత్త కోర్సులు ప్రతిపాదిస్తోంది. ఇవన్నీ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా తేలికగా పూర్తి చేసే కోర్సులు. మార్కెట్ లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని మండలి అధ్యయనంలో వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వీటిని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కోర్సులపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి సలహాలు సూచనలను ఈ నెల 23 వరకూ తీసుకుంటున్నట్టు మండలి తెలిపింది. కోర్సుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ⇒ బీఏలో సెక్యూరిటీ, డిఫెన్స్ స్టడీస్, ల్యాండ్, అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ ఉంటాయి. ⇒ హాస్పిటల్ నిర్వహణ, హెల్త్ మేనేజ్మెంట్ బీబీఏలో ఉంటాయి. ఎయిర్పోర్టు ఎయిర్లైన్, ఎయిర్ ట్రాఫిక్స్ కోర్సులతో బీబీఏ ప్రవేశ పెడుతున్నారు. ⇒ మారిటైం టెక్నాలజీ(నౌక నిర్మాణం, నావిగేషన్, సముద్రవాణిజ్యంలో ఉపయోగించే ఆధునిక సాంకేతిక) కామర్స్, మేనేజ్మెంట్తో బీబీఏను తీసుకొస్తున్నారు. ⇒ బీకాంలో ఫైనాన్స్ టెక్నాలజీ, బిఎస్సీలో డేటాసైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, క్లైమేట్ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్ వంటివి ఉంటాయి. – కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, రోబోటిక్స్, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటాసైన్స్ బీఎస్సీలో ఉంటాయి. ఇవే కోర్సులు దాదాపు పీజీలో కూడా ఉంటాయి. ఉపాధి పెంచేందుకే.. యూజీ, పీజీ కోర్సులను క్షేత్రస్థాయి విద్యార్థులకు చేరువ చేయాలన్నదే సంకల్పం. సంప్రదాయ డిగ్రీలు, సాంకేతిక విద్యా కోర్సులే కాదు... కొత్త కోర్సుల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన తర్వాతే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనూ ఉన్నత విద్యలో సరికొత్త మార్పు కన్పిస్తుందని ఆశిస్తున్నాం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ -
విదేశీ భాషల్లో ప్రత్యేక కోర్సులు
న్యూఢిల్లీ: ఫ్రెంచ్, జర్మన్, పోర్చుగీస్, జపనీస్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నారా? వైద్య పర్యాటకంలో దూసుకుపోతున్న పాష్తో, క జకి, టర్క్మెనిన్, ఉజ్బెక్ వంటి వాటిల్లో పట్టు సాధించాలనుకుంటున్నారా? అయితే మీకు జామియా మిలియా ఇస్లామియా(జేఎమ్ఐ) విశ్వవిద్యాలయం ఆ అవకాశం కల్పిస్తోం ది. మధ్య ఆసియా భాషల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను అందిస్తోంది ఈ యూనివర్సిటీ. ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్, పోర్చుగీస్, స్పానిష్ వంటి పలు యూరోపియన్ భాషల్లో కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను జేఎమ్ఐ యూనివర్సిటీ అందిస్తోంది. పాష్టోకి కూడా ఇక్కడ డిమాండ్ బాగానే ఉంది. ఆ భాషలో 20 సీట్లు ఉంటే అందులో అన్నీ భర్తీ అయ్యాయని యూనివర్సిటీ పర్షియన్ విభాగంఅధినేత ఇరాక్ రజా జైదీ చెప్పారు. పాష్తో, ఇతర పర్షియన్ భాషల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులను కూడా అందజేస్తున్నామని తెలిపారు. అఫ్గానిస్తాన్తోపాటు ఇతర పొరుగు దేశాలనుంచి వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడ పాష్తో, పర్షియన్ నేర్చుకున్న విద్యార్థులకు ఆస్పత్రుల్లో దుబాసీలుగా ఉద్యోగాలు దొరుకుతున్నాయని జైదీ చెప్పారు. అయితే కజకి, టర్కమెనిన్ భాషల పట్ల ఉత్సుకత ఉన్నా.. అధిక సంఖ్యలో లేద ని, ఉజ్బెక్కి మాత్రం ఎల్లప్పుడూ ఆదరణ ఉంటోందని అంటున్నారాయన. వ్యాపారం, పర్యాటక రంగాల్లో ఉపయోగపడుతుందనే ఉజ్బెక్ను నేర్చుకోవడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఉజ్బెక్ సర్టిఫికెట్ కోర్సులో 25 సీట్లు ఉంటే.. అందుకు సరిపడా దరఖాస్తులొస్తున్నాయని జేఎమ్ఐ డెరైక్టర్ టీసీఏ రంగాచారి తెలిపారు. అయితే చైనీస్కు ఎప్పుడూ ఎక్కువ డిమాండ్ ఉంటోందని ఆయన చెబుతున్నారు. భారత్తో చైనా వ్యాపారాలు పెరుగుతుండటమే ఇందుకు కారణమన్నారు. 25 సీట్లకు గాను 100కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, అందుకోసం ఈసారి సీట్ల సంఖ్యను 30కి పెంచామని ఆయన చెప్పారు. ఇతర భాషల్లో లాగా కాకుండా వారానికి నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే బోధన ఉంటుందని, చైనీస్ నేర్చుకోవాలనుకుంటున్నవారు అధికంగా ఉండటం వల్ల విద్యార్థులు ప్రతి రోజూ నాలుగు గంటలపాటు తరగతులకు హాజరవుతున్నారని రంగాచారి తెలిపారు. తైవాన్లో కూడా ఉపయోగపడే స్వచ్ఛమైన చైనీస్ భాషను నేర్పిస్తున్నామని, అందుకోసం తైవాన్కు చెందిన నేషనల్సింగ్ హువా యూనివర్సిటీనుంచి అధ్యాపకులను రప్పించామని చెబుతున్నారు. ప్రధాన చైనాలో ఉపయోగించే భాషకంటే స్వచ్ఛమైన చైనీస్ భాష లిపి కొంచెం భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపారు. స్వచ్ఛమైన చైనీస్ను నేర్చుకున్నవారు ప్రధాన చైనాలో మాట్లాడే భాషలో మాట్లాడటం చాలా సులభమని ఆయన తెలిపారు. ఆయా భాషల్లో అడ్వాన్స్డ్ డిప్లొమా చేసిన విద్యార్థులను అదే భాషలో ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటున్నామని, దానివల్ల విద్యాసంస్థల్లో వారు బోధించడానికి అవకాశముంటుందని, కొందరు విద్యార్థులు అలా నేర్చుకుంటున్నారని జైదీ తెలిపారు.


