సాక్షి హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని పాస్పోర్టు ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు.. సుప్రీంకోర్టులో ఇది వరకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజుూరు చేసింది. పాస్పోర్టు సరెండర్ చేయాలని ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది.
కేసు నేపథ్యం
ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ ఫిర్యాదుతో 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, ఇతరులపై ఐపీసీ, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. అందులో ఐపీసీలోని 120 బీ (కుట్ర) సెక్షన్ను తొలగించినప్పటికీ నిందితులపై ఫోన్ ట్యాపింగ్ అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్లోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు అదనపు కస్టడీ, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న కస్టడీ పిటిషన్లతోపాటు ఈ చట్టాన్ని జోడిస్తూ అదే నెల ఆఖరి వారంలో మెమోను కోర్టులో దాఖలు చేయడంతో ఇది ట్యాపింగ్ కేసుగా మారింది.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు
ట్యాపింగ్ వ్యవహారంలో తాను పాత్రధారినేనని.. నాటి డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్రావు పేర్కొన్నారు. ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతోపాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ సమీక్షిస్తుందని.. వారి అనుమతితోనే అది జరిగిందని స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.


