హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం దయ కాదు.. తెలంగాణ హక్కు. అని తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లకు బహిరంగ లేఖ రాశారు.
‘పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాకి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్ట్ లపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డిలు చర్చించాలి. ఎన్నికలు, రాజకీయాలు వేరు. రాష్ట్ర అభివృద్ధి పై వివక్ష వద్దు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలి. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను ఇంకా విస్మరించడం తగదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైంది’ అని విమర్శించారు.


