పది లక్షల మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలతోపాటు సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ
ఓటు హక్కు వినియోగించుకోనున్న 12.77 కోట్ల మంది ఓటర్లు
ఢాకా: కల్లోల బంగ్లాదేశ్లో అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు పది లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో హిందువులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. పలువురు హత్యకు గురయ్యారు.
అందుకే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత 18 నెలలుగా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతోంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కావాలని బంగ్లాదేశ్ ప్రజలతోపాటు ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. గురువారం 13వ పార్లమెంటరీ ఎన్నికలతోపాటు 84 సూత్రాల సంస్కరణ ప్యాకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం) కూడా జరుగబోతోంది.
విదేశీ పరిశీలకులు, మీడియా ప్రతినిధులు
ఈ ఎన్నికల్లో ప్రధానంగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ), ఒకప్పటి దాని మిత్రపక్షం జమాత్–ఇ–ఇస్లామీ మధ్య పోటీ నెలకొంది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మొహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం గత ఏడాది నిషేధం విధించింది. దాంతో ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీలో లేకుండాపోయింది. మొత్తం 300 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 299 నియోజకవర్గాల్లో ఉదయం 7.30 గంటలకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4.30 గంటల దాకా కొనసాగుతుంది.
ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మృతిచెందడంలో అక్కడ ఎన్నికలు రద్దుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 రాజకీయ పారీ్టల నుంచి 1,755 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే 273 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ చేస్తున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ 291 మందిని బరిలోకి దించింది. వీరిలో 83 మంది మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 42,659 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 12.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3.58 శాతం మంది తొలిసారి ఓటర్లుగా నమోదైనవారే కావడం విశేషం. విదేశాల్లో ఉన్న 8 లక్షల మంది ప్రవాస బంగ్లాదేశీయులు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతోన్నారు. వారికోసం ఐటీ ఆధారిత పోస్టల్ బ్యాలెట్ విధానం తీసుకొచ్చారు.
బీఎన్పీకి విజయావకాశాలు!
బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 350 స్థానాలున్నాయి. ఇందులో 300 స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 50 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. పార్లమెంట్ పదవీ కాలం ఐదేళ్లు. ఈ ఎన్నికలను రాజకీయ సంస్కరణలకు రిఫరెండంగా భావిస్తున్నారు. అవామీ లీగ్ పోటీలో లేకపోవడం బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టకి అనుకూలంగా మారింది. పోటీలో ఉన్న అతిపెద్ద పార్టీ అదొక్కటే కావడం గమనార్హం. దివంగత ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహా్మన్ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిస్తే ఆయన ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. బీఎన్పీకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


