ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2028 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించినట్లు తెలిపింది.
అదే విధంగా.. బంగ్లాదేశ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటుందని ఐసీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్కప్ 2026 ఎడిషన్ మొదలైన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇరవై జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.
సూపర్-8 చేరిన జట్లు ఇవే
గ్రూప్-ఎ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే... గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8లో అడుగుపెట్టాయి. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో అర్హత సాధించింది.
ఈ నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్లో సూపర్-8 చేరిన జట్లన్నీ ఆటోమేటిక్గా 2028 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఈసారి విఫలమైనా.. 2028 టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నందున ఆ జట్టు కూడా క్వాలిఫై అయింది.
బంగ్లాదేశ్, అఫ్గన్, ఐర్లాండ్ కూడా నేరుగా
తద్వారా మొత్తంగా ఇప్పటికే తొమ్మిది జట్లు 2028 టోర్నీకి అర్హత సాధించగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన జట్లను చేర్చే క్రమంలో టాప్-12లో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ కూడా తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి.
తదుపరి పెద్దగా టీ20 సిరీస్లు లేనందున ఈ ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి.. ఈ మూడు జట్లు అర్హత సాధించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇక ఈ పన్నెండు పోను మిగిలిన ఎనిమిది బెర్తులను రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, యూఎస్ఏ, యూఏఈ, నేపాల్, కెనడా, ఒమన్ టాప్-20లో కొనసాగుతున్నాయి.
ఈసారి వేటు పడిందిలా!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ పోటీపడాల్సింది. అయితే, టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్లో తమకు భద్రత లేదని.. తమకు కూడా పాక్ మాదిరి శ్రీలంకనే తటస్థ వేదికగా ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసింది. టోర్నీలో కొనసాగాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం భారత్లో ఆడాలని సూచించింది.
అయితే, తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా సిద్ధమే కానీ.. భారత్లో ఆడమని బంగ్లా బోర్డు ఐసీసీకి తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలవగా.. బంగ్లాదేశ్పై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టమని ఐసీసీ హామీ ఇచ్చింది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తప్పించగా.. బంగ్లా వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు భారత్ రాకూడదని నిర్ణయించుకుంది.
చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు


