కాన్బెర్రా: ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై తొలి టి20లో నెగ్గిన భారత జట్టు... మరో విజయం లక్ష్యంగా నేడు జరిగే రెండో టి20లో బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1:45 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సిడ్నీలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 133 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం భారత జట్టు 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఫలితం రావడానికి అవసరమైన కనీస ఐదు ఓవర్లు పూర్తి కావడంతో... ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్లో కనబరిచిన జోరును పునరావృతం చేసి సిరీస్లో 2–0తో ముందంజ వేయాలని హర్మన్ బృందం భావిస్తోంది.


