ఢాకా: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వీసా సేవలు త్వరలోనే పునరుద్దరించే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం.
భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు గత రెండేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2024 జూలై–ఆగస్టు ఉద్యమాల తర్వాత షేక్ హసీనా పదవి నుంచి తప్పుకోవడం, ఆమె భారత్కు వెళ్లిపోవడం, ఆ తర్వాత మధ్యంతర ప్రభుత్వంలో భారత్ వ్యతిరేక శక్తులు బలపడటం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 2024 బంగ్లాదేశ్లో అశాంతి కారణంగా భారత్ తొలిసారి అన్ని వీసా సేవలను నిలిపివేసింది. అలాగే, డిసెంబర్ 2025లో ఉస్మాన్ హాది మరణం తర్వాత జరిగిన భారత్ వ్యతిరేక నిరసనల కారణంగా ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, రాజ్షాహి వీసా కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ కూడా తన కాన్సులేట్లలో వీసా సేవలను నిలిపివేసింది.
అయితే, ప్రస్తుతం యూనస్ ప్రభుత్వం దిగిపోవడం.. తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం కొలువుదీరడంతో వీసాల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సిల్హెట్లోని భారత సీనియర్ కాన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ స్పందిస్తూ.. ‘భారత్ త్వరలోనే అన్ని వీసా సేవలను పునరుద్ధరించనుంది. ప్రస్తుతం మెడికల్, డబుల్-ఎంట్రీ వీసాలు ఇస్తున్నారు. త్వరలో ట్రావెల్ వీసాలు సహా అన్నింటిని తిరిగి ప్రారంభించనున్నారు. భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు పరస్పర గౌరవం, సాంస్కృతిక బంధంతో నడుస్తాయి. రెండు దేశాల ప్రజలే ఈ స్థిరమైన, సానుకూల సంబంధాల ప్రధాన భాగస్వాములు’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ పరిణామం వీసా విధానాలకే పరిమితం కాదు. ఇది రెండు దేశాల మధ్య నమ్మకాన్ని తిరిగి నిర్మించే ప్రయత్నం. సాధారణ ప్రజలకు వైద్య, వ్యాపార, సాంస్కృతిక ప్రయాణాలు సులభం అవుతాయి. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా (2009–2024) కాలంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగైన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.


