భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.
జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.
ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.
ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్నగర్లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.
ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన


